2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

55 –  రాధా దేవి యొక్క పూజ, స్తోత్రాదులు

శ్రీపార్వత్యువాచ- పార్వతీదేవి ఇట్లనెను-

ఓ మహాదేవా! నీకు, ఇతరులకు కూడ ఈశ్వరుడగు శ్రీకృష్ణమంత్రముండగా దానిని కాదని విష్ణుభక్తుడైన రాజు రాధికామంత్రము నేల గ్రహించెను.

ఆ రాధికా పూజను ఎట్లు చేయవలెను? ఆమెను ఎట్లు ధ్యానింపవలెను. ఆదేవియొక్క స్తోత్రము, కవచము ఏ తీరున ఉన్నవి? ఆ దేవిని ఉపాసించు మంత్రమేది ఈ విషయములనన్నిటినీ నాకు వివరింపుము.

శ్రీమహేశ్వర ఉవాచ- మహాదేవుడిట్లనెను-

సుయజ్ఞ మహారాజు బ్రాహ్మణునితో ఆర్యా నేనెవరిని సేవింపవలెను? ఏదేవతను ఆరాధించినచో త్వరగా నేను గోలోకమును పొందగలనో ఆ దేవతామంత్రము నాకు ఉపదేశింపుడని బ్రాహ్మణుని ఆడుగగా సుతపుడను ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని ఆరాధించినచో అనేక జన్మలకు ఆతడుండు గోలోకమును చేరుకొందువు. కాని శ్రీకృష్ణునకు ప్రాణవల్లభయగు రాధికాదేవిని సేవించిన, కృపామూర్తియగు ఆ తల్లియొక్క అనుగ్రహమువలన నీవు గోలోకమును త్వరగా పొందుదువని చెప్పెను.

తరువాత ఆ మహారాజునకు షడక్షరమైన రాధికాదేవి మంత్రమునుపదేశించెను. ఆమంత్రము ఓంకారపూర్వమై చతుర్థి విభక్తి చివర కలిగియున్న రాధాశబ్దమునకు వహ్నిజాయయగు స్వాహాకారాంతమై (ఓం రాధికాయై స్వాహా) ఉండును.

ఆ మంత్రమును ప్రాణాయామము, భూతశుద్ధి, మంత్రన్యాసము, అంగన్యాసము, కరన్యాసము మొదలగు వాటితో ధ్యానించవలయునని ఆ దేవియొక్క స్తోత్రమును, కవచమును బోధించెను. సుయజ్ఞుడు తన మంత్రగురువగు సుతపుడు చెప్పినట్లు రాధీకామంత్రమును జపించెను. అట్లే శ్రీకృష్ణుడు రాధికాదేవిని ఏరీతిగా ధ్యానము చేసెనో సామవేదమున రాదాదేవి ధ్యానమేరీతిగా కలదో ఆ పద్ధతిలో రాధాదేవిని ధ్యానించెను.

 రాధాదేవి ధ్యానశ్లోకములలో ఈవిధముగా వర్ణింపబడినది. ఆ దేవి తెల్లని చంపకపుష్పములవలె తెల్లగానుండును. శరత్కాలమందలి పూర్ణిమాచంద్రుని వలె నిండైన ముఖముగలది. ఆమె నేత్రములు సైతము శరత్కాలమందలి పద్మములవలె శోభించుచుండును. చక్కని నడుము, నితంబములు కలది. ఆ దేవి పెదవులు పండిన దొండపండువలె ఎజ్జగా నుండును. ఆ దేవి దంతములు ముత్యాల వరుస వలెనుండును. ఆమె ఎల్లప్పుడు చిరునవ్వుతో ప్రసన్నముగానుండును. భక్తులననుగ్రహించును. పరిశుద్ధమైన వస్త్రమును, రత్నమాలలను, రత్నకేయూరములను, రత్నమంజీరములను, రత్నకుండలములను ఆమె ఎల్లప్పుడు ధరించును. సూర్యకాంతివంటి కాంతిగల చెక్కీళ్ళతో ఆ దేవి అమూల్యములైన రత్నములున్న కంఠాభరణమును, మంచి రత్నములుగల కిరీటమును, రత్నముల యుంగరమును, రత్నపాశమును మాలతీ మాలచే అలంకరింపబడిన కొప్పును ధరించుచున్నది. ఆదేవి సురూపమునకు ఆధిష్టాన దేవత. మదించిన ఏనుగువంటి నడకగలది. ఆ దేవిని గోపికలు చెలికత్తెలు, తెల్లని చామరములు వీయుచు సేవింతురు. ఆమె పాపిటలో కస్తూరి బిందువులు దానికింద ఆర్ధచందనపు చుక్క దానికింద సింధూరపు చుక్కలున్నవి. ఆ తల్లిని పరమాత్మయగు శ్రీకృష్ణుడే ప్రతిదినము ఆరాధించుచుండును. శ్రీకృష్ణునకు ప్రాణములకంటే మిన్నయైనది. ఆమె నిరుణ, పరాత్పర, సమస్తసంపదల నొసగునదీ. మహావిష్ణువునకు మాత, శ్రీకృష్ణునియందు భక్తిని కలిగించునది. మూలప్రకృతి రూపిణి, ఈశ్వరి, వైష్ణవి, విష్ణుమాయ, శ్రీకృష్ణ ప్రేమరూపిణి. ఆ మహాదేవి రాసమండలమున రత్నసింహాసనమున రాసేశ్వరుడగు శ్రీకృష్ణునితో కలిసియున్నట్లు ధ్యానించుచు ఆమెను సేవింపవలెను.

రాధాదేవిని పై విధముగా ధ్యానించి ఆదేవి శిరస్సుపై పుష్పమునుంచి జగత్ర్పభువగు శ్రీకృష్ణుని కూడ ధ్యానింపవలెను. ఆ తరువాత మరల ఆ దేవి శిరస్సుపై పుష్పమునుంచి ఆమెను ధ్యానము చేయవలెను. అటుపిమ్మట షోడశోపచారములతో ఆమెను పూజింపవలెను.

షోడశోపచారములేవనగా ఆసనము, వస్త్రము, పాద్యము, అర్యము, గంధానులేపనము, ధూపము, దీపము, పుష్పము, స్నానము, రత్నభూషణములు, అనేక విధములైన నైవేద్యములు, తాంబూలము, సువాసనలగల జలము, మధుపర్కము, రత్నశయ్య అనునవి. వీటిని ప్రత్యేక ప్రత్యేకముగా వేదమంత్రములతో సుయజ్ఞుడు చేసెను.

ఓ పార్వతి ఈ షోడశోపచారములు చేయునపుడు ఉచ్చరిపంవలసిన మంత్రములు వేదమున చెప్పబడినవి. అవి అందరికి ఆన్ని సమయములందు సమ్మతమైనవి. ఆ మంత్రములివి.

సింహాసన మంత్రము-

ఓరాధాదేవీ! నేను సమర్పించుచున్న ఈ ఆసనమును విశ్వకర్మ మంచి రత్నములను కూర్చి ఆందముగా నిర్మించెను. దీనిని పూజయందు నీవు స్వీకరింపుము.

వస్త్రమంత్రము-

ఓ దేవి! ఈ వస్త్రము అమూల్యములైన రత్నములు కలది. చాలా పలుచనిది. మిక్కిలి పరిశుద్ధమైనది. ఇట్టి వస్త్రమును నీవు అంగీకరింపుము.

పాద్య మంత్రము-

ఓ తల్లీ! నీయొక్క పాదములను కడుగవలయునని మంచి రత్నములచే ఖచితమైన పాత్రలో సమస్త పుణ్యతీర్థములనుండి ఉదకమును తెచ్చితిని, నీవు ఈ పాద్యమును తీసికొమ్ము.

అర్ఘ్యమంత్రము-

ఓదేవి! నీకై దక్షిణావర్త శంఖమున గజుక, పుష్పములు, చందనములతో సువాసీతమై, పుణ్యతీర్థముల నీరుకావున పవిత్రమైన ఈ అర్ఘ్యమును స్వీకరింపుము. గంధమంత్రము-

భూమీయందు దొరుకుచున్న సువాసన ద్రవములతో మిక్కలి వాసనగలదీ, పవిత్రమైనది, మంగళకార్యములందు అర్హమైన గంధమును ఓ రాధాదేవి! నీవు గైకొనుము.

ఆమలేపనమంత్రము-

కస్తూరి కుంకుమలు కలదీ, చిక్కనిది అగు ఈ చందన చూర్ణము మంచి సువాసన కలిగియున్నది. దీనితో చేయు అనులేపనమును ఓ దేవేశి! నీవు గ్రహింపుము. ధూపమంత్రము-

ఓదేవి! ఈధూపము చెట్లనుండి వచ్చు జీగురు, భూమి పై దోరుకు సువాసన ద్రవ్యములు కలిసి నిప్పువలన వెలువడుచున్నది. దీనిని నీవు దయతో స్వీకరింపుము.

దీపమంత్రము-

ఓ పరమేశ్వరి! చీకటియందు కలుగు భయమును పోగొట్టునది. అమూల్యమణులచే శోభిల్లు ఈ రత్న దీపమును దయతో నీవు స్వీకరింపుము.

పుష్పమంత్రము-

ఓ పరమేశ్వరి! గంధము చందనములు కలది చాలా అందమైన ఈ పారిజాతపుష్పమును సమర్పించుచున్నాను. దీనిని నీవు ప్రతిగ్రహింపుము.

స్నానీయమంత్రము-

ఓదేవి! విష్ణుతైలము గలది, సుమనోహరమైనది అగు సువాసనగల ఉసిరిక పప్పుయొక్క పిండిని తెచ్చితిని. ఈ నలుగుపిండిని నీవు స్వీకరింపుము.

భూషణమంత్రము-

ఓదేవి! నేనొసగు ఈ కేయూరములు హస్తవలయములు (గాజులు) మొదలగు భూషణములు అమూల్యమైన రత్నములచే నిర్మితమైనవి. ఎల్లప్పుడు శోభను కలిగించు వీటిని నీవు స్వీకరింపుము.

నైవేద్యముంత్రము-

ఆయా కాలములందు ఆయా ప్రదేశములలో పండు ఫలమును, లడ్డులు మొదలైనవాటిని, పరమాన్నమును, మృష్టాన్నమును నైవేద్యముగా నీవు స్వీకరింపుము.

తాంబూల మంత్రము-

ఓదేవి! ఈ తాంబూలము కర్పూరాది సుగంధ ద్రవ్యములతో వాసన కలిగియున్నది. రుచిగల ఈ తాంబూలమును నీవు గ్రహింపుము.

అన్నమంత్రము-

ఓదేవి! రత్నపాత్రలో మనోహరము రుచియైన అన్నమును నీకు నివేదన చేయుచున్నాను. దీనిని దయతో స్వీకరింపుము.

శయ్యామంత్రము-

ఓ తల్లీ! నీకు రత్నములచే నిర్మింపబడిన మంచమును సమర్పించుచున్నాను. దీనిపై పరిశుద్దమైన వస్త్రముకలదు. ఆందు పుష్పములు చందనము చల్లితినీ. ఇట్టి పర్యంకికాయుక్తమైన శయ్యను నీవు పరిగ్రహింపుము.

పై విధముగా రాధాదేవిని షోడశోపచారములచే పూజించి ఆ దేవికి మూడుమార్లు పుష్పాంజలిని సమర్పింపవలెను. ఇట్లు రాధాదేవిని పూజించి అటుపిమ్మట దేవికి మిక్కిలి సన్నిహితులైన పరిచారికలను తూర్పుదిశనుండి కుడివైపు అన్ని దిక్కులలోనుంచి పంచోపచారపూజ సల్పవలయును.

తూర్పుదిక్కున మాలావతిని, ఆగ్నేయ దోశయందు మాధవీనీ, దక్షిణదిశయందు రత్నమాలను, నైఋతిదిక్కున సుశీలను, పడమర దిక్కున శశికళను వాయవ్యమున పారిజాతను ఉత్తరమున పద్మావతిని, ఈశాన్య దిశయందు సుందరిని నిలిపి మల్లెలు, మాలతీపుష్పములు, పద్మముల మాలలను వారికి సమర్పించుకొని సామవేదమున కనిపించు పరిహారమును ఈ విధముగా కోరుకొనవలెను,

ఓ తల్లీ! నీవు జగన్మాతవు. విష్ణుమాయవు. సనాతనివి. శ్రీకృష్ణునకు ప్రాణాధికురాలవు, కృష్ణప్రేమ స్వరూపిణివి, శక్తివి, కృష్ణసౌభాగ్య రూపిణివి. మంగళప్రదురాలవు. శ్రీకృష్ణభక్తిని కలిగించు నీకు నమస్కారము.

శ్రీకృష్ణపరమాత్మ పూజించిన నిన్ను నేను పూజించుట నా అదృష్టమువలన జరిగినది. దీనివలన నా జన్మకు పార్థక్యమేర్పడినది, నాజన్మ సఫలమైనది.

సమస్త సౌభాగ్యములు కల నీవు శ్రీకృష్ణుని సమీపమున రాధగాను, రాసమండలమున రాసేశ్వరిగాను, బృందావనమున బృందాదేవిగాను, గోలోకమున కృష్ణప్రియగాను, తులసీవనమున తులసిగాను, శ్రీకృష్ణుని సమీపమున చంపావతిగాను, చంపకావనమున క్రీడగాను, చంద్రవనమున చంద్రావళిగాను. శతశృంగపర్వతమున సతిగాను, విరజానదియొక్క, తీరముననున్న వనమున విరజాదేవిగాను, పద్మవనమున పద్మావతిగాను, కృష్ణ సరోవరమున కృష్ణగా, కుంజకుటీరమున భద్రగా, కామ్యకవనమున కామ్యగా, సైకుంఠమున మహాలక్ష్మిగా, నారాయణుని సమీపమున సరస్వతీగా, గంగగా పాలసముద్రమున, సింధుకన్యగా, భూలోకమున శ్రీహరి. ప్రియురాలగు లక్ష్మీదేవిగా, స్వర్గమున దేవతల దుఃఖములను బాపు స్వర్గలక్ష్మిగా, శంకరుని సమీపమున సనాతని విష్ణుమాయయగు దుర్గగా, బ్రహ్మదేవుని సమీపమున నీ ఆంశరూపము వేదమాతయగు సావిత్రిగా, ఆట్లే ధర్ముని సమీపమున ఆంశరూపిణివైన ధర్మపత్నిగా, నరనారాయణులకు మాతగా, నీ కళయైన తులసిగా, గంగగా, పరమాత్మయొక్క రోమకూపములనుండి జన్మించిన గోపికలుగా, నీ ఆంశాంశాలైన శతరూప, దితి, శని, ఆదితి, మొదలగు రూపములలో నున్నావు, దేవతాస్త్రీలు, మునిపత్నులు నీ ఆంశాంశ స్వరూపాలే.

అట్టి నీవు నాకు కృష్ణభక్తిని శ్రీకృష్ణునకు సేవచేయు పరమ సౌభాగ్యమును కలిగింపుము.

ఈ విధముగా పరిహారమును చేసికొని రాధాదేవిని స్తుతించి ఆమె కవచమును చదువవలెను.

పూర్వమున చేయబడిన ఈ రాధాస్తోత్రము శ్రీకృష్ణభక్తిని, శ్రీకృష్ణ దాస్యమును, కలిగించును.

ఈ విధముగా ప్రతీదినము రాధాదేవిని పూజించువాడు విష్ణుమూర్తితో సమానుడగును. ఆతడు జీవన్ముక్తుడై పవిత్రుడై మరణించిన తరువాత గోలోకమునకు పోవును.

కార్తీక మాసమున పూర్ణిమనాడు రాధాదేవిని పూజింపవలెను. ఈ విధముగా ప్రతిసంవత్సరము ఆ దేవిని పూజించినచో రాజసూయయాగ ఫలము కలుగును. ఈ లోకమున అంతులేని సంపదను పొంది పుణ్యవంతుడై పాపములు పోగా విష్ణుమూర్తి సమీపమునకు పోవును.

ఆ రాధాదేవిని ఈ విధముగా కార్తీక పూర్ణిమనాడు బృందావనమున శ్రీకృష్ణుడు పూజించెను. అటుపిమ్మట బ్రహ్మదేవుడు ఈ దేవిని శ్రీకృష్ణదేవుడు పూజించినట్లే పూజించి ఆ దేవియొక్క అనుగ్రహమువలన వేదములకు తల్లియైన సావిత్రీదేవిని భార్యగా పొందెను. అటుపిమ్మట నారాయణుడా మాతను పూజించి ఆమెయొక్క అనుగ్రహమువలన మహాలక్ష్మిని, సరస్వతీదేవిని, గంగాదేవిని. తులసీదేవిని భార్యలుగా పొందగలిగెను.

క్షీరసముద్రమున పవళించియున్న శ్రీమహావిష్ణువు సింధుసుతను భార్యగా పొందగా నేను శ్రీకృష్ణునియొక్క ఆబ్జవలన ఆ మహాదేవిని పూజించి దక్షయజ్ఞమున దక్షుని కూతురైన సతీదేవి మృతిచెందిన తరువాత నిన్ను భార్యగా పొందితిని. అట్లే కశ్యపమునీ అదితిని. చంద్రుడు రోహిణిని, మన్మథుడు రతిని, ధర్ముడు మూర్తీదేవిని, దేవతలు మునులు కూడ ఆ దేవిని పూజించి ధర్మార్థకామమోక్షములను పొందగలిగిరి.

 ఓ భవానీ! రాధాదేవి పూజావిధానమీట్లుండును.

శ్రీకృష్ణుడు తులసీవనములో తులసియను గోపికతో తిరుగుచుండగా రాధాదేవి చూచి అభిమానవతిగావున, తాను తనయొక్క అంశలు అంశాంశలగు దేవతా స్త్రీలందరితో కలిసి మాయమయ్యెను. అందువలన బ్రహ్మవిష్ణు శివాది దేవతలు తమతమ ఐశ్వర్యములను, కోల్పోయి భార్యావిహీనులైరి. అందువలన వారందరు కలిసి .. ఆలోచించి శ్రీకృష్ణ పరమాత్మను శరణవేడుకొనిరి. దేవతలందరు తన్ను స్తోత్రము చేయగా సంతోషపడిన శ్రీకృష్ణపరమాత్మ వారి బాధలు పోగొట్టుటకై తాను స్నానముచేసి శుచియై రాధాదేవిని పూజించి ఆమెతో ఇట్లనెను.

శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణపరమాత్మ ఇట్లనెను-

నేను నీకు చాలా ఇష్టమైనవాడను. నీకు నాపై చాలా ప్రేమకలదు. అని నీవెప్పుడు నాతో అనుచుంటివి. ప్రస్తుతము నీవు చేసిన పనివలన నీ మాటలు కల్లలని నాకు తోచుచున్నవి. అట్లే 'ఓ కృష్ణుడా! నీవు నా ప్రాణములవంటివాడవు. జీవాత్మవు” అని ఎల్లప్పుడు చెప్పుచుంటివి. అవన్ని అబద్ధములుగా కన్పించుచున్నవి. ఓ రాధాదేవి! స్త్రీల మనస్సు కత్తి అంచువలె ఇతరులను బాధ పెట్టునను నా మాట ఎల్లప్పుడు సత్యమైనదే.

నీవు నాకు ప్రాణములకన్నను మిన్నయైన దానవు. నా పంచప్రాణములకు అధిదేవతవు. నీవు లేక నా ప్రాణము లెగిరిపోవుచున్నవి. ప్రాణములకు అధిష్టాన దేవత లేక ప్రపంచమున ఎవ్వరుకూడ జీవించరు. అట్లే నా ప్రాణాధిష్టాన దేవతవగు నీవు లేక నేను బ్రతుకుట దుర్లభము.

నీవు మూలప్రకృతి స్వరూపిణివి, ఈశ్వరివి, శ్రీమహావిష్ణువునకు తల్లివి. నీవు స్వయముగా నిర్గుణురాలవైనను నీ అంశస్వరూపముచే సగుణవుగా కన్పించుచున్నావు. నీవు. జ్యోతిస్వరూపముననున్నావు. నిరాకారవైనను భక్తులనెల్లప్పుడు అనుగ్రహించుటకు ఆకారమును ధరించితివి. నీవు భక్తుల అభిరుచులనుబట్టి అనేక రూపములను ధరించితివి.

నీవు వైకుంఠమున మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా కన్పించుచున్నావు. పుణ్యభూమీయగు భారతక్షేత్రమున నీవు సతీదేవిగా పార్వతీదేవిగా పుణ్యమూర్తియైన తులసీగా, సమస్తలోకములను పవిత్రముచేయు గంగగా మారీతివి. నీవు బ్రహ్మలోకమున సావిత్రిగాను, నీ అంశరూపముతో భూమిగాను, గోలోకమున సమస్త గోపాలురకు ఈశ్వరివగు రాధగానున్నావు.

నీవు లేనిచో నేను ప్రాణములు లేనివాడను. ఏపనిచేయుటకైనను అసమర్థుడను. అట్లే శివుడు శక్తిస్వరూపిణివగు నీవలననే శక్తిమంతుడగుచున్నాడు. నీవు లేనిచో అతడు శవమువలె సర్వశక్తులను కోల్పోవును. నీవలననే బ్రహ్మదేవుడు వేదములను దర్శింపగలిగెను.

నీవలననే సారాయణుడు మహాలక్ష్మీ సమేతుడై సమస్తలోకములను రక్షించుచు జగత్పతియైనాడు. ఆదిశేషుడు నీవలన సమస్తలోకములను తన శిరస్సుపై ధరించగలుగుచున్నాడు. అట్లే శివుడు గంగను ధరించి గంగాధరుడాయెను, నీవుండినచో ప్రపంచమంతయు శక్తి కలిగియుండును. నీవు లేనిచో ఇది శవమువలె సర్వశక్తులను కోల్పోగలదు. అట్లే నీవలననే అందరు వక్తలగుచున్నారు. నీవులేనిచో అందరు మూగవారగుదురు.

కుమ్మరివాడు మట్టితో కుండలు చేయునట్లే ప్రకృతిరూపిణివగు నీ వలన నేను సమస్త సృష్టిని చేయగలుగుచున్నాను. నీవు లేనిచో నేను జడునివలె శక్తినంతయు కోల్పోవుదును. అందువలన సర్వశక్తి స్వరూపిణివగు నీవు నా దగ్గరకు రమ్ము, దాహిళాశక్తి లేక అగ్నిదేవుడు కాల్చలేడు. ఆ దాకాశక్తివి నీవే. అట్లే శోభాస్వరూపిణివి ఆగు నీవులేనిచో చంద్రుడు సుందరుడుగా కన్పీంచడు. కాంతిరూపిణివైన నీవులేనిచో సూర్యుడు కిరణములను కోల్పోవును. అదేవిధముగా రతి స్వరూపిణివగు నీవు లేక మన్మధుడు కామీనీ బంధువు కాజాలడు.

ఈవిధముగా శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవిని స్తుతించి ఆమెను తీరిగి పొందెను. రాధాదేవి కన్పించగానే అంతవరకు అదృశ్యముగా నున్న దేవతాస్త్రీలందరు కన్పించిరి. అందువలన దేవతలందరు శోభతో శక్తితో భార్యలతో కలిసియుండిరి. ప్రపంచమున స్త్రీలందరు దర్శనమొసగిరి. ఇట్లు గోలోకము గోపికాసీలచే నిండిపోయినది.

రాజైన సుయజ్ఞుడు రాధాదేవిని ఈ విధముగా స్తుతించి గోలోకమునకు పోయెను.

శ్రీకృష్ణుడు స్తుతించిన ఈ రాధాస్తోత్రమును ఎవరు పఠింతురో అతనికి తప్పక శ్రీకృష్ణభక్తి, శ్రీకృష్ణ దాస్యము లభింపగలదు. భార్య వియోగ సమయమున ఈ స్తోత్రమును ఒక నెలవరకు వినినచో (చదివినచో) అట్లే భార్యా రహితుడు, భాగ్యములేనివాడు దీనిని సంవత్సరమువరకు విన్నచో (చదివినచో) త్వరగా భార్యను పొందును. నేనుకూడ దక్షయజ్ఞమున సతీస్వరూపిణివగు నీవు చనిపోయినపుడు శ్రీకృష్ణపరమాత్మయొక్క ఆజ్ఞవలన ఈ స్తోత్రము పఠించి నీన్ను పొందితిని. అదే విధముగా దుర్వాస మహర్షి శాపము వలన దేవతలు లక్ష్మిని కోల్పోవగా ఈ స్తోత్రమువలన తిరిగి శ్రీని పొందిరి. పుత్రులు కావలెనని అనుకొనువాడు, మహారోగముతో బాధపడువాడు ఈ స్తోత్రమును సంవత్సరము వరకు నియమముతో విన్నచో సంతానమును పొందును. మహావ్యాధి నిర్ముక్తుడు కూడ ఆగును.

. కార్తీకమాసమున పూర్లిమనాడు రాధాదేవిని పూజించి ఈ స్తోత్రమును చదివినచో ఆంతులేని సంపదను, రాజసూయ యాగమువలన లభించు ఫలితము లభించును.

స్త్రీలు ఈ స్తోత్రమును విన్నచో భర్తవలన సకల సౌఖ్యములు పొందుదురు. సంసారబంధమునుండి విముక్తులగుదురు. ఈ స్తోత్రమును ప్రతిదినము రాధాదేవిని పూజించి చదువువారు భవబంధనమును ఛేదించుకొని గోలోకమును చేరుకొనెను.

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణుల సంవాదమున కనిపించు గౌరీశంకరుల సంవాదమున చెప్పబడిన రాధాదేవి పూజ స్తోత్రాదులుగల యాభైయైదవ అధ్యాయము సమాప్తము.