2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
22 - తులసీ మాహాత్మ్యము
నారద ఉవాచ - నారదుడు నారాయణునితో ఇట్లనెను.
తులసీదేవి నారాయణునకు ప్రియురాలు, పవిత్రమైనది. అందరిచే పూజింపదగినది. ఐతే ఆమె యొక్క పూజావిధానము, స్త్రోత్రము నాకు తెలియవు. అట్లే ఆమెను తొలుత ఎవరు పూజించిరి. ఎవరామెను తొలుత స్తుతించిరి. ఓ శ్రీహరీ! ఆమె నీకెందులకు పూజనీయురాలైనది. ఈవిషయములనన్నిటిని నాకు వివరించి చెప్పుము.
సూత ఉవాచ- సూతుడీవిధముగా శానకునితో అనెను.
నారదుని మాటలు విని శ్రీహరి సనాతనము, పుణ్యరూపమైన తులసి విషయమునిట్లు
చెప్పదొడగెను..
శ్రీహరి తులసీదేవిని పొంది లక్ష్మీదేవితో సమానముగా ఆమెతో రమింపసాగెను. ఆమెకు లక్ష్మీదేవితో సమానమైన గౌరవమును మర్యాదను ఇచ్చెను. శ్రీహరి భార్యలగు లక్ష్మి, గంగలు తులసీ శ్రీహరుల నూతన సమాగమమును సహించుకొనిరి. కాని సరస్వతి దేవి మాత్రము కోపముతో దానిని సహింపలేదు. పైగా శ్రీహరి సన్నిధిలోనే సరస్వతీదేవి తులసితో వాదులాడి తులసిని కొట్టెను. అందువలన తులసీదేవి సిగ్గుపడి తనకు జరిగిన అవమానమును సహించలేక అగిదర్ధానమైనది. అందువలన శ్రీహరి సరస్వతిని ఓదార్చి ఆమె అనుజ్ఞను తీసికొని తులసీవనమునకు వెళ్ళెను.
శ్రీహరీ తులసీవనమునకు వెళ్ళి అచ్చట స్నానము చేసి తులసిని ధ్యానించి పూజించెను. అట్లే ఆతడు తులసీ స్తోత్రమునీట్లు చేసెను.
లక్షి, మాయ, కాముడు, సరస్వతి వీరి బీజాక్షరములు పూర్వమున నుండగా చతుర్థి విభక్యంతమైన బృందావనీ శబ్దమునకు ఆగ్ని భార్యయగు స్వాహా శబ్దాంతమైనది తులసీ దేవి మంత్రము. అది పది యక్షరములు గలది. శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహా యమనది. కల్ప వృక్షమువంటి ఈ మంత్రముచే శాస్తోక విధానమున సరస్వతీ దేవిని పూజించినచో సమస్త సిద్ధులు లభించును.
తులసీ దేవిని నేతి దీపముతో, ధూపములో, సిందూర చందనానులేపనములతో పూజించి నైవేద్యమును పెట్టి పుష్పములచే ఆర్చన చేసి ఉపహారమును నైవేద్యముగా పెట్టవలెను.
ఇట్లు శ్రీహరీ చేసిన తులసీ స్తోత్రమున తులసీదేవి సంతోషపడి తులసీ వృక్షము నుండి మరల ఆవిర్భవించినది. వెంటనే ఆ తులసీదేవి విష్ణుమూర్తి పాదములపై బడి శరణువేడుకొన్నది. అందువలన నారాయణుడు తులసీ దేవితో నిన్నందరు పూజింతురని వరమిచ్చెను. అట్లే తులసీదళమును తన శిరస్సుపైవ ధరింతునని, తులసీదేవిని తన వక్షస్థలముపై ధరింతునవి ఆట్లే దేవతలందరు ఆ దేవిని తమ శిరస్సులపై ధరింతురని చెప్పి తనలోకమునకు వెళ్ళిపోయెను.
నారద ఉవాచ- నారదుడిట్లడిగెను
సరస్వతీ దేవి ధ్యానమెట్లుండును? ఆమె స్తోత్రము పూజా పద్ధతి ఎట్లుండునో వివరించమని నారాయణుని ఆడిగెను.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు నారదునితో అనెను.
సరస్వతీ దేవి చేష్టలవలన తులసీదేవి కోపించి అంతర్ధానము చెందినప్పుడు శ్రీహరి తులసీవనమునకు వెళ్ళి ఆమెను పూజించి స్తోత్రము చేసెను.
శ్రీభగవానువాచ- శ్రీమన్నారాయణుడిట్లు ప్రార్థించెను.
బృందా (తులసి) వృక్షములు ఎచ్చటనుండునో ఆ ప్రదేశమును బృందావనమందురు. వృక్షరూపమున నున్న నా ప్రేయసిని తులసిని సేవింతును. బృందావనమున మొదలున్నందువలన ఆమెను బృందావని యని పిలుతురు. సకల సౌభాగ్యవతి యగు. తులసీని సేవింతును, సమస్త లోకములలో పూజలనందుకొనుటవలన తులసి విశ్వపూజిత అను పేర ప్రసిద్ది చెందినది. సమస్త ప్రపంచములను పవిత్రము చేసినందువలన ఆమె విశ్వపానియైనదీ. అట్టి తులసిని సేవింతుమ. దేవతలకు ఎన్ని విధములైన పుష్పములు సమర్పించినను తులసీ లేనిచో వారు సంతోషపడరు. ఆ విధముగ పుష్పములలో సారభూతమైనది, పరిశుద్ధమైనదీ యగు తులసిని చూడవలెననీ యున్నది. ప్రపంచమున భగవత్సేవ చేయు సమయములో తులసి లభించినంత మాత్రమున ప్రజలు సంతోషింతురు. . కావున ఆమె నందిని యైనది. అట్టి తులసిని చూచినచో నాకు చాల సంతోషము కలుగును. ఈ ప్రపంచములందన్నీటిలోను తులసితో తుల తూగేవారెవరు లేనందువలన ఆమెను తులసి యందురు. ఆట్టి తులసిని నేను శరణువేడెదను. ఆమె కృష్ణుడనగు నాకు జీవనము (ప్రాణము) వంటిది. అందువలన " కృష్ణజీవనియైనది. నాకు ఎల్లప్పుడు ప్రేయసియగు తులసి నా ప్రాణములను రక్షించుగాక.
శ్రీమన్నారాయణుడు ఈవిధముగా స్తోత్రము చేయగా తులసీదేవి దర్శనమొసగి ఆతని పాదపద్మముల పై పడెను. ఆభిమానవతి కావుననే ఏడ్చుచున్న ఆ ప్రియురాలైన తులసిని చూచి శ్రీహరి ఆమెను తన రొమ్మున చేర్చుకొనెను.
సరస్వతీ దేవి ఆజ్ఞను తీసికొని శ్రీహరి తులసీదేవితో కలిసి వైకుంఠమును చేరెను. తరువాత అతడు సరస్వతితో కలిసి తులసికి సంతోషమును కలిగించుచుండెను.
శ్రీమహావిష్ణువు తులసికి నీవు ప్రపంచమందు అందరిచే పూజింపబడుదువనీ, శిరోధార్యగా కాగలవవి, నాకు కూడ పూజనీయురాలవగుదువని వరమొసగెను. తులసి విష్ణుమూర్తి ఇచ్చిన వరమునకు సంతోషపడెను. సరస్వతీదేవి తులసిని కౌగిలించుకొని శ్రీహరి సన్నీధిలో ఉంచెను. అట్లే లక్ష్మీ, గంగలు ఆమెను అక్కున చేర్చుకొని ఇంటికి తీసికొని వెళ్ళిరి.
బృంద, బృందావని, విశ్వపావని, విశ్వపూజిత, పుష్పసార, నందిని, తులసి, కృష్ణజీవని అనే తులసి మొక్క ఎనిమిది పేర్లను ఆర్థసహితముగా చదువుచు ఆమెను పూజించినవారికి అశ్వమేధయాగముచేసిన ఫలితము లభించును.
కార్తీక పౌర్ణిమనాడు తులసి జన్మించినది. అందువలన ఆ నాడు శ్రీహరి తులసీపూజను తొలుత చేసినాడు. అట్లే ఆదినమున తులసీదేవి పూజను భక్తితో చేసిన మానవుడు సమస్త పాపములనుండి వినిర్ముక్తుడై విష్ణులోకమునకు చేరుకొనును.
కార్తీకమాసమున విష్ణువును తులసితో పూజచేసిన వాడు పదివేల ఆవులను దానము చేసిన ఫలమును పొందును. తులసీదేవి యొక్క అష్టనామ స్తోత్రమును స్మరించినంతనే పుత్రులు లేనివానికి పుత్రులు కలుగుదురు. భార్యలేనివానికి భార్య బంధువులు లేనివానికి బంధువులు లభింతురు. అట్లే రోగి రోగమునుండి ముక్తుడగును, కారాగారబద్దుడు కారాగారబంధనమునుండి దూరమగును. భయపడినవాని భయములు, పాపాత్ముని పాపములు అన్నియు తొలగి పోవును.
తులసీదేవి స్తోత్రము పై విధముగా నున్నది. ధ్యానము పూజావిధిని నీకు తెల్పెదను. కాణ్వశాఖయందు పేర్కొనబడిన తులసీదేవి పూజావిధి నీకు కూడా తెలియును. ఐనను నీకు దానిని పేర్కొందును. తులసీదేవిని ఆవాహనము చేయకుండనే భక్తిలో షోడశోపచారములలో ఆమెను పూజించవలెను, ఆమె తులసి, పుష్పసార, సతీ, పూజ్యురాలు, మానవులు చేసిన పాపములనన్నిటిని నశింపచేయునది.. పుష్పములలో, దేవతలలో తులసికి (తులన) సమానము ఎవ్వరు లేనందువలన ఆమె తులసియైనది. ఆమె అందరికీ శిరోధార్య. ఆందరికోరికలు తీర్చునది, విశ్వపావనీ, జీవన్ముక్త, ఆమెను సేవించువారికి హరిభక్తిని ముక్తిని ఇచ్చు స్వభావము కలది. కావున తులసిని ధ్యానించి తరువాత షోడశోపచారములతో పూజించి స్తోత్రము చేసి ఆమెకు నమస్కారము చేయవలెను.
నారదా! నీకింతవరకు తులస్యుపాఖ్యానమును తెలిపితిని. ఐనను వినవలసినదేమైన ఉన్నచో ఆడుగుము. నీకు నేను చెప్పిదను అని నారాయణుడనెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములోని రెండవదగు ప్రకృతి ఖండమున, నారద నారాయణ సంవాదములోని తులస్యుపాఖ్యానమను
ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.
