2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
14 - వేదవతీ ప్రస్తావనం
నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-
హంసధ్వజుని పుత్రులైన ధర్మధ్వజ కుశధ్వజులు లక్ష్మీదేవిని గూర్చి గొప్ప తపస్సుచే ఇష్టమైన వరమును పొందిరి. మహాలక్ష్మియొక్క వరమువలన వారు రాజులైరి. వీరిలో కుశధ్వజుని భార్యయగు మాలావతి లక్ష్మీదేవి అంశవలన జన్మించిన కూతురును ప్రసవించెను. ఆ కన్య భూతల సంబంధమున్నప్పటికిని జ్ఞాని యయ్యెను. ఆమె పుట్టగానే సూతికా గృహములోనే వేదములను చదివెను. వేదజ్ఞానమున్నందువలన విద్వాంసులామెను వేదవతి యని పిలిచిరి. ఆమె పుట్టగానే చక్కగా స్నానముచేసి తన బంధువులందరు వద్దన్నను నారాయణునిపై భక్తితో తపస్సు చేయుటకై అడవికి పోయినది. పుష్కర తీర్థములో ఆమె మన్వంతరకాలము ఉగ్రమైన తపస్సు చేసినది. ఐనను ఆమె కృశించలేదు. ఆ సమయమున అశరీరవాణి ఆమెతో ఇంకొక జన్మలో శ్రీహరి నీకు భర్తయగునని చెప్పినది. ఆమాటలకు వేదవతి కోపగించి గంధమాదన పర్వతమున నిర్జన ప్రాంతమున మరల తపస్సు చేయమొదలిడెను.
ఆ గంధమాదన పర్వతమున చాలాకాలము తపస్సు చేసి కళ్ళు తెరచినప్పుడు ఎదురుగా రావణాసురుడు కన్పించెను. అతనిని చూచి అతిథియను భావముతో అతనికి పాద్యమును, రుచిగల ఫలమూలమును, చల్లని నీటినిచ్చెను. వాటి నన్నిటిని తీసికొని ఆమె సమీపమున కూర్చుండి రావణుడు ఆమెను నీవెవరివని అడిగెను. ఆమె అందమును చూచి మూర్చితుడై వేదవతినతడు బలాత్కరింపబోయెను. అప్పుడా వేదవతి కోపముతో చూడగా అతని కాళ్ళు చేతులాడక జడపదార్థమువలె నుండెను. అప్పుడామె లక్ష్మీ దేవిని స్తుతించి రావణునితో నీవు బంధువులందరితో కలిసి నా కారణమున నశింపగలవని శాపమిచ్చి నీవు ముట్టుకొనిన ఈ శరీరమును వదులుచున్నానని యోగబలముతో శరీరమును వదిలిపెట్టినది. రావణుడు గంగానదిలో ఆమె శరీరమును వదలి తన ఇంటికి వెళ్ళెను.
ఎట్టి అద్భుత కార్యమును చూచితిని; నేను ఎటువంటి పనిచేసితిని అని మాటి మాటికి తాను చేసిన అకృత్యమును స్మరించుకొని రావణుడు దుఃఖించెను.
వేదవతి తరువాతి కాలమున సీతగా జన్మనెత్తినది. ఆమె కొరకై రావణుడు బంధువులతో నాశనముగావలసి వచ్చెను. మహాతపస్విని యగు జానకి తన పూర్వ జన్మ తపస్సు వలన శ్రీహరి రూపమైన రాముని భర్తగా పొందినది. జగత్సతియైన రాముని భర్తగా పొంది సీత చిరకాలము సుఖముగానుండినది. తండ్రి మాటలను విని సత్యసంధుడైన రాముడు అడవికి వెళ్లెను. అచ్చట సముద్రతీరమున సీతా లక్ష్మణులతోనున్న రాముని వద్దకు బ్రాహ్మణ రూపధారియైన అగ్ని వచ్చెను. రాముని దుఃఖమును చూచి అతడు దుఃఖించి రామునితో ఇట్లనెను.
వహ్నిరువాచ- అగ్ని దేవుడిట్లనెను-
భగవన్ ఇది సీతాపహరణకాలము. దీనిని దాటలేవు. దైవం అన్నిటికంటె గొప్పది. కావున సీతను నాయందుంచి ఛాయా సీతను నీ దగ్గర ఉంచుకొనుము. నీ సీతను పరీక్షా సమయమున నీకు తిరిగి ఇత్తును. నేను దేవతలు పంపగా ఇచ్చటికి వచ్చితిని. నేను నిజముగా బ్రాహ్మణుడను కాదు ఆగ్నిదేవతను అనెను.
రాముడు అగ్నిదేవత మాటలు విని లక్ష్మణునకు తెలియకుండా అగ్నిదేవుడిచ్చిన మాయసీతను స్వీకరించెను. ఆ మాయా సీత అచ్చముగా సీతాదేవివలె నుండినది. ఈ విషయమును రాముడు చాలా రహస్యముగా నుంచెను. ఇది తమ్ముడు, తనవెంటనున్న లక్ష్మణునకే తెలియదన్నచో ఇతరులకేమి తెలియును.
ఆ సమయమున రాముడు బంగారు మృగమును చూచెను. సీతాదేవి దానిని కావలయునని రాముని ప్రేరేపించినది. రాముడప్పుడు సీతాదేవిని లక్ష్మణుని వద్దనుంచి ఆ మృగమును చంపుటకు స్వయముగా వెళ్ళెను. దానిని బాణముతో కొట్టగా ఆ మాయామృగము హరిని స్మరించుచు లక్ష్మణా యని పిలుచుచు చనిపోయెను. మృగ రూపము పోయి ఆ రాక్షసుడు దివ్యరూపమును ధరించి రత్న విమానమున వైకుంఠమునకు వెళ్ళెను.
అతడు వైకుంఠమున నున్న శ్రీహరి ద్వారపాలకులగు జయవిజయులకు కింకరుడు. అందువలన తిరిగి వైకుంఠమును చేరెను.
లక్ష్మణా యను దీన స్వరమును విని సీతాదేవి లక్ష్మణుని రాముని దగ్గరకు పంపెను. లక్ష్మణుడు, రాముడు లేని సమయమున రావణుడు సీతనెత్తుకొని లంకకు పోయెను. రాముడు తన దగ్గరకు వచ్చుచున్న లక్ష్మణుని చూచి విషాదముతో తన ఆశ్రమమునకు వెళ్ళగా సీతాదేవి అచ్చట కనపడలేదు. అందువలన రాముడు మూర్ఛపోయి చాలాకాలము విలపించి ఆమెను వెదకుచు అడవిలో తిరిగెను. తరువాత కొంతకాలమునకు సీతాదేవిని రావణుడు ఎత్తుకొని పోయెనన్న వార్తను జటాయువను గద్దవలన విని వానరులను సహాయము చేసికొని సముద్రమున వంతెన నిర్మించెను. తరువాత తన బాణములతో రావణుని బాంధవసహితముగా వధించి దుఃఖించుచున్న సీతాదేవిని పొందెను. వెంటనే వహ్నిపరీక్ష చేయగా అగ్ని దేవుడు రామునకు నిజమైన సీతాదేవినిచ్చెను. అప్పుడు మాయాసీత రామునితో అగ్నితో నేనిప్పుడేమి చేయవలెనని అడిగినది.
వహ్నిరువాచ- అగ్నిదేవుడిట్లు పలికెను-
ఓమాయ సీతా! నీవు పుష్కరక్షేత్రమునకు వెళ్ళి తపస్సు చేసి స్వర్గలక్ష్మివి కమ్ము. అను అగ్నిదేవుని మాటలననుసరించి ఆమె పుష్కర క్షేత్రమున తపస్సుచేసి స్వర్గలక్ష్మియైనది. ఆమెయే తరువాత ద్రుపదపుత్రికగా యజ్ఞకుండమున జన్మించి పాండవులకు భార్యయైనది.
కృతయుగమున వెదవతిగా, త్రేతాయుగమున జనకాత్మజ రాముని భార్యయగు సీతగా, ద్వాపర యుగమున ద్రుపదాత్మజయగు ద్రౌపదిగా అవతరించినది. ఈవిధముగా మూడు యుగములందున్నందువలన ఆమె త్రిహాయణి యను పేరు పొందినది.
నారద ఉవాచ- నారద మహర్షి ఇట్లనెను-
ద్రౌపదీదేవికి ఐదుగురు భర్తలెట్లైరి అను నా సందేహమును తీర్పుడని నారాయణుని అడిగెను.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు బదులు పలికెను-
అగ్ని పరీక్ష సమయమున నిజమైన సీత రాముని చేరినది. కాని మాయాసీతకు రూపము యౌవనము ఉండుటవలన ఆగ్నేయొక్క ఆజ్ఞననుసరించి శంకరుని గురించి తపమాచరించి భర్తను పొందగోరెను. శంకరుడామెకు ప్రత్యక్షమైనప్పుడు భర్తను నాకిమ్మని ఐదుమార్లు శివుని కోరినది. రసికేశ్వరుడైన పరమశివుడు ఆమె కోరికను విని చిరునవ్వుతో నీకు ఐదుగురు భర్తలుందురని చెప్పెను. అందువలననే ద్రౌపదీ దేవి పంచపాండవులకు భార్యయైనది. అని నారాయణుడు నారదుని సందేహము తీర్చెను.
రాముడు లంకలో తన నిజ సీతను పొంది లంకా రాజ్యమును విభీషణున కోసగి అయోధ్యకు వెళ్ళెను. అచ్చట పదకొండు వేల సంవత్సరములు రాజ్యము చేసి అందరితో కలసి వైకుంఠమునకు వెళ్ళెను. నాల్గువేదములు ఎల్లప్పుడు నాలుకపైననే ఉన్నందువలన ఆమె వేదవతి యైనది. వేదవతీ కథ మిక్కిలి పుణ్యమునిచ్చును.
ఇక ధర్మధ్వజుని కూతురు వృత్తాంతమును వినిపింతును.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతిఖండములో నారద నారాయణ సంవాదమున చెప్పబడిన తులస్యుపాఖ్యానములోని వేదవతీ ప్రస్తావనమను పదునాలుగవ అధ్యాయము సమాప్తము.
