2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

37 - కర్మల ఫలితములు

నారద ఉవాచ- నారదుడిట్లనెను-

పురందరుడు దుర్వాసమహర్షి వలన శ్రీహరీ గుణకీర్తనము విని జ్ఞానమును పొంది ఏమి చేసెనో నాకు వివరించమని నారాయణుని అడిగెను.

నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-

శ్రీకృష్ణుని గుణగణములు విని మహేంద్రుడు సైరాగ్యమువ పడి దానిని అనుదినము పెంచుకొనసాగెను. దుర్వాసమహర్షితో తాను మాట్లాడిన స్థలమును వదలి ఇంటికిపోవుచు తన అమరావతి పట్టణమును చూచెను. ఆ పట్టణమును అప్పటికే దైత్యులు, అసురులు ఆక్రమించుకొనిరి. ఇంద్రుని బంధువులందరు విషాదములోనుండిరి. ఒకచోట అసలు ఆతని బంధువే కన్పడలేదు. అట్లే అతని తల్లి, తండ్రి, భార్య మొదలగువారు ఆతనికి కన్పించలేదు. తన పట్టణమును శత్రువులాక్రమించుకొనీరని సంపూర్ణముగా తెలిసికొని తన గురువుగు బృహస్పతిని వెదకుచు పోయెను. ఆ సమయమున బృహస్పతి దేవగంగయొక్క తీరములో ఉండెను.

బృహస్పతి గంగా తీరమున తూర్పుముఖముగా కూర్చుండి పరబ్రహ్మను ధ్యానించుకొనుచుండెను. అతని శరీరము పులకాంకురితమైయుండెను. అతని కన్నులలో ఆనందాశ్రువులు జాలువారుచుండెను. అతడు పరమానందముతో తన ఇష్టదేవతను ఆరాధించుచు జపము చేయుచుండెను. రాక్షసులకు శత్రువైన తన గురువు ఒక జామువరకు జపముచేయుచుండి ధ్యానపరిసమాప్తి తరువాత లేచి నిలబడెను. అప్పుడు దేవేంద్రుడు తన గురువు పాదములపైబడి ఏడ్చుచు తనకు తగిలిన- బ్రహ్మశాపాదీ వృత్తాంతమునంతయు వివరింపసాగెను.

నాకు ఎవరికిని దొరకని వరము కూడ దొరికినది. ఆది యేమనగా త్రుపులాక్రమించుకొనిన నా పట్టణమును కాలక్రమమున పొందగలనట. అని దేవేంద్రుడు బృహస్పతితో అనగా శిష్యుని మాటలు విని కోపముతో కన్నులు ఎఱ్ఱబడగా ఆతడు ఇట్లు పలికెను.


 

బృహస్పతి రువాచ- బృహస్పతి ఈవిధముగా అనెను-

దేవేంద్రా! నీ మాటలన్నీ విన్నాను. నీవు ప్రస్తుతము దుఃఖింపవలసిన పనిలేదు. నామాట వినుము.

బుద్ధిమంతుడు ఆపదలు వచ్చినప్పుడు దుఃఖమునకు గురికాడు. సంపదయైనను, ఆపదయైనను ఎప్పుడు స్థిరమైనవి కావు. ఆవి స్వప్నమువలె మాయమగుచుండును. అవి పూర్వజన్మలో చేసిన కర్మలపై ఈ జన్మలో చేసిన కర్మలపై ఆధారపడియుండును. ఇవి చక్రమందలి ఆరెలవలె వచ్చుచు పోవుచుండును.

ఈ భారతక్షేత్రమున ప్రతిజీవి ఛాము చేసిన శుభాశుభకర్మఫలమును తప్పక అనుభవించి తీరును. ప్రాణి తాను: చేసిన కర్మను అనుభవింపక ఎన్ని సంవత్సరములైనను అది తీరదు.

ఈ విషయమును సామవేదమునందలి కౌధుమ శాఖయందు శ్రీకృష్ణుడు తెల్పెను.

జీవులు చేసిన కర్మఫలములనన్నిటిని అనుభవించి ఇంకను కర్మభోగము మిగిలినచో తదనురూపమైన జన్మను భారతభూమియందు ఇతరత్ర పొందుచున్నారు.

మానవుడు తాను చేసిన కర్మలవలన బ్రహ్మశాపమును, దైన్యమును, శుభాశీస్సులను, అంతులేని సంపదను పొందుచున్నాడు.  

కోటి జన్మలక్రితం చేసిన కర్మయైనా ఛాయవలె జీవిని అనుసరించును. ఆ కర్మఫలమును అనుభవించనిదే" అదీ అతనిని వదలదు. ఈ కర్మలు దేశకాలపాత్రభేదముననుసరించి న్యూనముగానో అధికముగానో ఫలితములను ఇచ్చును.

వస్తువులను సామాన్యదినమున దానము చేసిన సామాన్య ఫలము లభించును. విశేష దినములందు చేయు దానము కోటిరెట్లు అధికముగానో, అసంఖ్యముగానో లేక దానికంటే అధికముగానో పుణ్యమును కలిగించును.

అట్లే సామాన్య ప్రదేశమున చేసిన దానము సామాన్య ఫలితము నీయగా విశిష్టమైన స్థలములలో చేసిన దానము - కోటిరెట్లు గాని అంతకంటే ఆధికమైన ఫలితమునుగాని ఇచ్చును.

అదేవిధముగా సామాన్య వ్యక్తికిచ్చిన దానము సామాన్య ఫలితము నివ్వగా విశిష్ట వ్యక్తుల కిచ్చిన దానము విశిష్టమైన ఫలితమునిచ్చును. రైతులు పంటలు పండించునపుడు క్షేత్రభేదమువలన వస్తుభేదమువలన పంటలెట్లు అధికముగా తక్కువగా పండుచున్నవో అట్లే దాన సమయమున దిన, దేశ, పాత్ర భేదమున ఫలితములలో మార్పులు కన్పించుచున్నవి.

బ్రాహ్మణునకు సామాన్య దినమున దానము చేసినచో సామాన్య ఫలితము లభించును. అదే అమావాస్యనాడు, సూర్య సంక్రాంతి సమయమున చేసిన దానము నూరురెట్లెక్కువ ఫలితమునిచ్చును. అదే చంద్రగ్రహణ సమయమున చేసినచో కోటిరెట్లెక్కువ ఫలము లభించును. సూర్యగ్రహణ కాలమున చేసిన దానము దానికంటే పదిరెట్లెక్కువ ఫలితమునిచ్చును అక్షయతృతీయనాడు చేసిన దానము అక్షయ ఫలితమునిచ్చును. ఇట్లే ఇతర విశేష దినములలో దానము చేసిన విశేష ఫలితము లభించును.

దానము ఏవిధముగ దేశపాత్ర, కాలభేదమున విశేష ఫలితము నిచ్చుచున్నదో అట్లే స్నానము, జపము, దేశ, కాల, పాత్ర భేదముననుసరించి విశేష ఫలితములనిచ్చుచున్నవి.

సాధారణ ప్రదేశమున విప్రునకు చేసిన దానము సాధారణ ఫలమునిచ్చును. తీర్థ ప్రదేశమున దేవతామందిరమున దానము చేసినచో నూరు రెట్లెక్కువ ఫలము లభించును. గంగా తటమున, నారాయణ క్షేత్రమున దానము చేసినచో అవ్యయ ఫలము లభించును. కురుక్షేత్రమున, బదరీక్షేత్రమున, కాశియందు చేసిన దానము కోటి రెట్లెక్కువ ఫలితమునిచ్చుమ. అట్లే విష్ణుమందిరమున దానము చేసినచో కోటిరెట్లెక్కువ ఫలితమునిచ్చును. కేదార క్షేత్రమున, హరిద్వారమున లక్షరేట్లు, పుష్కరక్షేత్రమున, భాస్కర క్షేత్రమున చేసిన దానము పదిలక్షల రెట్లు ఎక్కువ ఫలితమునిచ్చును,

ఈవిధముగ అన్నీ స్థలములందు క్రమముగా ఫలితము అధికముగా దొరకును.

సామాన్య బ్రాహ్మణునకు దానము చేసిన సామాన్య ఫలితము లభించును. త్రికాల సంధ్యావందనము చేసిన బ్రాహ్మణునకు, జితేంద్రియుడైన పండితునకు చేసిన దానము లక్ష రెట్లెక్కువ ఫలమునిచ్చును. విష్ణుమంత్రమును ఉపాసన చేయు పండితునకు దానము చేసినచో కోటి రెట్లెక్కువ ఫలితము లభించును.

ఈవిధముగా గుణాధికులకు చేసిన దానము అధిక ఫలితమునిచ్చును.

కుమ్మరివాడు దండము, ఆవము, నీరు, చక్రము, మట్టి, సూత్రములచే కుండలను నిర్మించునట్లు బ్రహ్మదేవుడు కర్మసూత్రముననుసరించి ఫలితము నొసగుచున్నాడు. అందువలన నీవు ఎవరి ఆజ్ఞవలన ఈసృష్టి జరుగుచున్నదో ఆ నారాయణుని సేవింపుము. ఆ నారాయణుడు అందరిని సృష్టించువాడు, రక్షించువాడు, సంహరించువాడు, కాలునకే కాలుడు.

మహా విపత్తి సమయమున మధుసూదనుని స్మరించినచో సంపదలు కలుగునని శంకరుడు చెప్పెను.

బృహస్పతి తన శిష్యుడగు దేవేంద్రునకు ఈ విధముగా బోధించి అతనిని కౌగిలించుకొని శుభాశీస్సులొసగి చేయవలసిన పనిని బోధించెను.

శ్రీబ్రహ్మవైవర్తమహారాణమున రెండవదైన ప్రకృతిఖండమున నారదనారాయణుల సంవాదమున కన్పించు బృహస్పతి మహేశ్వరుల సంవాదమున మహాలక్ష్మి ఉపాఖ్యానమున కర్మఫలనిరూపణమను ముఫై ఏడవ అధ్యాయము సమాప్తము.