2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

16 - తులసీ శంఖచూడుల వృత్తాంతము

నారాయణ ఉవాచ - నారాయణుడిట్లు నారదునితో అనెను-

తులసీదేవి బ్రహ్మదేవుడిచ్చిన వరమువలన సంతసించి సంతోషముతో నిద్రపోయెను. ఆ సమయమున మన్మథుడు తవ పంచబాణముల నామెపై వేసెను. అందువలన తులసి అనేక విధములైన మన్మథవికారములను పొంది విపరీతముగా ప్రవర్తించినది. ఆమెకు పుషచందన తల్పము కంటకమయముగా తోచినది. మంచి ఆహారము ఫలములు, జలము విషతుల్యమైనవి. ఆమె ఉన్న ఆశ్రమము ఆకారము లేనియట్లు తాను కట్టుకొన్న వస్త్రములు మండుచున్నట్లుగా మన్మథ వికారములను పొందినది.

ఆసమయమున ఆమె మగత నిద్రలో నుండగా రసికేశ్వరుడు, యువకుడు, చక్కగా అలంకరించుకొన్న ఒక పురుషుని చూచెను. అతడు చందనాది సువాసన ద్రవ్యశోభితుడై, రత్నాలంకారములు ధరించి మాటిమాటికి తనను చూచుచున్నట్లు, ఆమెకు రతి కథలు చెప్పుచు చుంబించుచు, ఆలింగనము చేసుకొనుచున్నట్లు కనిపించెను. అతడు వెళ్ళిపోవుచున్నట్లు కనిపించగానే ప్రియా - ఎచ్చటకి పోవుచున్నావు నిలు నిలుమని అనుచు మేల్కాంచెను. ఆమె తన స్వప్పములో జరిగిన వృత్తాంతములు తలచుకొని మాటిమాటికి విలపించెను. ఇట్లు బాధపడుచు ఆమె ఆశ్రమములోనే ఉండినది.

శంఖచూడుడను మహాయోగి శ్రీకృష్ణమంత్రోపదేశము పొంది పుష్కర క్షేత్రమున మంత్ర సిద్ధిని కూడా పొంది సమస్తమంగళకరమైన శ్రీకృష్ణకవచమును పఠించుచు తులసి ఉన్న ఆశ్రమమునకు వచ్చెను.అతడు కూడ బ్రహ్మదేవుని వలన పరమేశ్వరుని వలన తనకు ఇష్టమైన వరమును పొంది బ్రహ్మదేవుని ఆదేశముపై బదరికాశ్రమమునకు వచ్చెను.

నవయౌవన సంపన్నుడు మన్మథుని వలె అందమైనవాడు, శ్వేత చంపకము వంటి శరీర కాంతి కలవాడు, శరత్కాల చంద్రునివంటి ముఖము కలవాడు శరత్కాల పద్మముల వంటి నేత్రములు కలవాడు, పారిజాత కుసుమముల మాల ధరించినవాడు, కస్తూరీ కుంకుమ ధరించిన శంఖచూడుడు ఆమె ఆశ్రమమునకు వచ్చుచుండగా తులసి ఆతనిని చూచినది.

శంఖచూడుడు తన దగ్గరికి రాగా అతని అందమునకు ఆశ్చర్యపడి తులసి తసముఖమును బట్టతో కప్పుకొని కటాక్షదృష్టితోచూడసాగినది. అతనిని చూడగనే మన్మథ బాణ పీడితయై నవ సంగమము వలన సిగ్గుపడ్డట్లు సిగ్గుపడినది. అతని ముఖ కమలమును తన కళ్ళతో తాగుచున్నట్లు తదేక దృష్టితో చూడసాగినది.

శంఖచూడుడు కూడ పుష్పచందన శయ్యపై పడుకొని తనముఖమును తదేక దీక్షతో చూచుచున్న కన్యయగు తులసిని ఆ తపోవనమున చూచెను. తులసి చాలా అందమైనది. అనేక రత్నహారములను కేయూరములను రత్నాంగుళీయకములను ధరించి మనోహరముగా కన్పించినది. అందువలన అతడు ఆమె సమీపమున కూర్చుండి మధురముగా తులసితో ఇట్లు మాట్లాడసాగెను.

శంఖచూడ ఉవాచ-శంఖచూడుడిట్లు పలికెను-

ఓ కన్యా! నీవెవరవు? ఎవరి పుత్రికవు? నీవుచాల అందమైనదానవు.స్వర్గాది భోగములను సరస్సులో విహరించుచున్నదానవు. ప్రపంచమున నీ అందము చాలా విలక్షణమైనది. నీవు మహర్షులకు కూడ మోహమును కలిగించునంత అందకత్తెవు. నీవు మౌనమును వదలి పెట్టి నీ సేవకుడనగు నాతో సంభాషింపుము అని శంఖచూడుడనగా తులసి తలవంచుకొని చిరునవ్వు ఏర్పడగా ఇట్లు మాట్లాడెను.

తులస్యువాచ- తులసీదేవి ఇట్లనెను-

ఓ యువకుడా! నేను ధర్మధ్వజ మహారాజుగారి పుత్రికను. ఉన్నత వంశమున పుట్టినవాడెవ్వడు రహస్య ప్రదేశమున ఒంటరిగా ఉన్నకన్యతోమాట్లాడడు. ఉన్నత కులమున జన్మించక ధర్మశాస్త్రములు క్షుణ్ణముగా చదువక లంపటుడై తిరుగు కాముకుడు మాత్రమే కామిని కావలెనని కోరును.

కాని స్త్రీయన్నచో ఆపాతమధురముగానుండును. తరువాతి కాలమున పురుషుని చాలా ఇక్కట్లపాలు చేయును. హృదయము ఆసిధారవలె ఉన్నను మాటలు మాత్రము అమృతము వలె నుండును. తన కార్యము పూర్తియైన తరువాత ముఖము చూపదు. వేదములలో పురాణములలో ఇట్టి స్త్రీల స్వభావము చెప్పబడలేదు. ఆందువలన తెలివికలవాడు స్త్రీని ఎన్నడు విశ్వసింపడు.

అట్లే మోహరూపిణియైన స్త్రీ బ్రహ్మాదులకు సైతము మోహమును పుట్టించును. ఈమె తపోమార్గమునకు ఆడ్డంకుగానుండును. ముక్తిద్వారమునకు ద్వారమువంటిది. సంసారమనే కారాగారమున నున్న ఇనుపగొలుసు వంటిది. మోసము చేయువారినే మోపము చేయు స్వభావము కలది. మోక్షము కోరువారికి విషరూపిణి. ఆట్టి స్త్రీతో ఉన్నత వంశ భవుడెవ్వడు రహస్య ప్రదేశమున మాట్లాడడు.

తులసి ఈ విధముగా శంఖచూడునితో చెప్పగా అతడు చిరునవ్వుతో ఇట్లనెను.

శంఖ చూడ ఉవాచ - శంఖచూడు డిట్లనెను-

ఓ తులసీదేవి! నీవు చెప్పినదంతయు అసత్యము కాదు. మీ మాటలలో కొంతసత్యము, కొంత అసత్యము కూడ ఉన్నది. అందువలన నామాటలను వినుము.

బ్రహ్మదేవుడు స్త్రీ రూపమును అందరకు మోహమును కల్గించునట్లు చేసెను. అట్టి స్త్రీరూపము ప్రశంసించతగిన వాస్తవరూపము, నిందించతగిన కృత్యోరూపముఅని రెండువిధములుగానున్నది.

లక్ష్మీ, సరస్వతి, దుర్గా, సావిత్రి, రాధ వారి అంశలవలన జన్మించిన స్త్రీలందరు ఉత్తములు. వారి రూపము అన్నీ యుగములలో అంతట కూడ ప్రశంసింపతగినది. ఇది సత్వగుణ ప్రధానమైనది. స్వభావతః శుద్దమైన సాధ్వీరూపము ప్రశంసించతగినది. దీనిని పండితులు వాస్తవరూపమందురు.

ఇక రెండవదైన కృత్యారూపము, దేవవేశ్యల రూపము. ఈ భూమీపైనున్న సైరచారిణులైన స్త్రీల రూపము నిందింపదగినది. కృత్యారూపము రజోరూపము తమోరూపమనీ రెండు విధములుగా ఉన్నది.

స్థలము దొరకకనో, సమయము చిక్కకనో, మధ్యవ్యక్తులు లేకనో శరీరము బాగుగా లేనందువలననో, శత్రువులు, రాజులయొక్క భయమువలననో ఇంకను కొన్ని ఇతర కారణములవలన రజోరూపలైన స్త్రీలు పతివ్రతలుగా నున్నారు. ఇది మధ్యమరూపమని పండితులు పేర్కొనుచున్నారు. తమోగుణరూపము చాలా ఆధమమైనదని అందురు.

ఉన్నత వంశమున పుట్టిన పాడెవడు నిర్జన ప్రదేశముననున్నను దుర్జనులున్న ప్రదేశముననున్నను పరస్త్రీతో రహస్యముగా సంభాషణ చేయడు.

నేను బ్రహ్మదేవుని ఆజ్ఞవలన నీ దగ్గరికి వచ్చినాము. నిన్ను గాంధర్వ వివాహము చేసికొనుటకు. ఇష్టపడుచున్నాను.

నేను దనుజవంశములో పుట్టి దేవతలనందరను భయ పెట్టుచున్న శంఖచూడుడను వాడను. నేను వైకుంఠమున శ్రీహరిదగ్గర సుదాముడను పేరుతో నుంటిని. అచ్చట గోపకులకు, గోపికలకు అనుచరులుగా నున్న ఎనమండుగురు. గొల్లలలో నేనొకడను. కాని రాధాదేవి శాపమువలన దానవేంద్రుడిగా జన్మనెత్తీతిని. శ్రీకృష్ణుని మంత్ర ప్రభావమువలన పూర్వ జన్మ జ్ఞానము నాకు కలదు. ఆట్లే నీపేరు తులసి. నీకు కూడా నీ పూర్వజన్మజ్ఞానము కలదు. పూర్వము నీవు శ్రీహరితో సంగమించినందువలన దానిని చూచిన రాధికా దేవి కోపముతో పెట్టిన శాపమువలన ఈ భారతభూమిలో జన్మనెత్తితివి. వైకుంఠమున నున్న నీ సంభోగము నాశించినను రాధాదేవి భయమువలన నేను సాహసము చేయలేదు.

ఇట్లుశంఖచూడుడు చెప్పి ఊరకుండగా తులసి మిక్కిలి సంతోషంతో ఇట్లుచెప్పనారంభించినది.

తులస్యువాచ: తులసి ఇట్లు చెప్పినది-

నీవంటి విద్వాంసుని అందరు ప్రశంసింతురు. నీవలె దాపరికములేకుండ మాట్లాడు యువకుని ప్రతిష్తి ఎప్పటికి కోరుకొనును. నీ ఆలోచనా రీతీ చాలా గొప్పది. నీ ఆలోచనా రీతి వల్ల నేను, పరాజయమును పొందితిని.

స్త్రీకి లోబడిన పురుషుని పితరులు, దేవతలు, బంధువులు, తండ్రి అన్నదమ్ములు ఆందరు నిందింతురు. జాతకర్మలోనైనా, మృతుడైనప్పుడు కూడ బ్రాహ్మణుడు పది దినములలో పరిశుద్ధుడగును, శూద్రుడు నెలలోపల పరిశుద్ధుడగును. స్త్రీజితుడైనవాడు చితిలో కాలిన తరువాతనే పరిశుద్దుడగును. అతడు పెట్టు పిండతర్పణములను పితృదేవతలు సంతోషముగా తీసికొనరు. అట్లే దేవతలు స్త్రీకి లోబడినవాడిచ్చు పుష్పజాలాదికమును స్వీకరింపరు. అట్టివాడు జ్ఞానమును సంపాదించుకొనివను, తపస్సు, చేసినను, జపహోమాది కార్యక్రమములు చేసినను అన్నియు వ్యర్థమగును.

నీ విద్యాప్రభావమును తెలిసికొనుటకై నీన్ను పరీక్షించితిని. స్త్రీ తనకు నచ్చిన యువకుని శక్తియుక్తులను పరీక్షించి ఆతనిని వరించును.

గుణహీనునకు, వృద్ధునకు, అజ్ఞానికి, దరిద్రునకు, సదారోగికి, మూరునకు, దుష్టునకు, అతికోపము కలవానికి, అంగహీనునకు, జడుసకు, నపుంసకునకు తన పుత్రికనిచ్చి వివాహము చేసినచో ఆతడు బ్రహ్మహత్యాపాపమును పొందును.

సుగుణాలరాశి, విద్వాంసుడు, శాంతుడగు యువకుడైన వైష్ణవునకు పిల్లనిచ్చినవాడు పది ఆశ్వమేధయాగములు చేసిన ఫలితము పొందును.

చిన్నప్పటినుండి పిల్లను పెంచి పెద్దచేసి ఆపదవల్లనో ధనమునకాశపడో కన్యావిక్రమయము చేసినవాడు కుంభీపాక నరకముననుభవించును. పదునలుగురింద్రులు గడచునంతవరకు. నరకమున చిత్ర విచిత్ర శీక్షల ననుభవించును. ఆతరువాత ఆటవికుల ఇంట జన్మించును.

ఈవిధముగా తులసి శంఖచూడునీతో మాట్లాడుచున్నప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చెను.

తులసీ శంఖచూడులు బ్రహ్మదేవునికి నమస్కరించిరి. బ్రహ్మదేవుడచ్చట కూర్చొని శంఖచూడుడా! తులసితో ఏమి మాట్లాడుచున్నావు. నీవామెను గాంధర్వవిధితో వివాహమును చేసికొనుము. నీవు పురుషులలో శ్రేష్టుడవు, తులసి స్త్రీలలో రత్నము వంటిది. మీ ఇద్దరి కలయిక మిక్కిలి మేలును కలిగించును. విరుద్దము కానీ సుఖమును ఎవరు వదులుదురు? వదలినచో అతడు పశుతుల్యుడు.

ఓ తులసి! నీవు ఇటువంటి సుద్దుణములు కలవానీని, అందమైన వానిని పతిగా పొందుటకు ఎందులకు ఉపేక్ష చేయుచున్నాడు. ఇతడు దేవతలను. ఆసురులను, దానవులను కూడ జయించిన వీరుడు.  

లక్ష్మీదేవి విష్ణువునకు, కృష్ణునకు రాధిక, నాకు సావిత్రి, శ్రీవునకు పార్వతి, ఆదివరాహునకు భూమి, హిమాలయమునకు మేన, అత్రిమహర్షికి ఆనసూయ, నలుసకు దమయంతి, చంద్రునకు రోహిణి, మన్మథునకు రతీదేవి, కశ్యపునకు దితి, వశిష్ఠునకు ఆరుంధతి, గౌతమునకు ఆహల్య, కర్దమ మహర్షికి దేవహూతీ, బృహస్పతికి తార, మనువునకు శతరూప, యజ్ఞమునకు దక్షిణ, అగ్నికి స్వాహాదేవి, దేవేంద్రునకు శచీదేవి, గణపతికి పుష్టి. సుబ్రహ్మణ్యస్వామికి దేవసేన, ధర్మునకు మూర్తీదేవి ఏవిధముగా ప్రియమైనవారో అట్లే శంఖచూడునికి నీపై అమితమైన ప్రేమ కలదు. అందువలన సుందరుడైన ఈ శంఖచూడునితో యథేచ్ఛగా విహరింపుము.

ఈ శంఖచూడుడు చనిపోయిన పిదప గోలోకమున నున్న శ్రీకృష్ణుని, వైకుంఠమున నున్న చతుర్భుజుడైన శ్రీమహావిష్ణువును పొందుదువు, అని బ్రహ్మదేవుడు వారిద్దరకు శుభాశీస్సులొసగి బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయెను.

            అప్పుడు శంఖచూడుడు గాంధర్వవిధితో తులసిని పరిణయమాడెను.

తులసీ శంఖచూడుల వివాహసమయమున స్వర్గమున దుందుభివాద్యములు చెలరేగినవి. దేవతలు పుష్పవృష్టిని కురిపించిరీ, శంఖచూడుడు తన భార్యతో కామశాస్త్రమున చెప్పబడిన చతుషష్టి కళలను, చతుషష్టివీధములుగా అనుభవించెను. చాల అందమైన ప్రదేశమున నదీతీరమున పుష్పోద్యానమున పుష్పచందన శయ్యపై పుష్పముల, చందనముల వాయువు వీయుచుండగా సుఖసంభోగమున మునిగెను. వారి రతికి ఆంతులేకుండ పోయెను.

తులసి తన భర్త మనుస్సును హరింపగా, శంఖచూడుడు రసికయగు తన భార్య మనస్సును హరించెను. రత్యనంతరము వారు కోరుకున్నట్లు ఆలంకరించుకొనిరి.

తులసి శంఖచూడునకు కుంకుమ అద్దిన చందనముతో తిలకము దిద్దెను. అట్లే అతని శరీరమున కంతట చందనానులేపనము చేసినది. ఆతరువాత సువాసన గల తాంబూలమును పరిశుద్ధమైన వస్త్రములను, పారిజాత పుష్పమును, అమూల్య రత్నములచే నిర్మింపబడిన ఉంగరము నిచ్చి నేను నీ దాసురాలను అని చెప్పి అనేక నమస్కారములు చేసెను. అతని ముఖమును రెప్పవాల్చక చూడసాగిమ.

ఆట్లే శంఖచూడుడు తన ప్రియురాలిని రొమ్ముపై నుంచుకోని ముసుగుతో కప్పబడిన ఆమె ముఖమును చూచుచు మాటిమాటికి ముద్దు పెట్టుకొనెను. తరువాత తులసికి వరుణుని గెలిచి తెచ్చిన వస్త్రములను, రత్నమాలను, ఆగ్నిదేవుని జయించి తెచ్చిన ప్వాహాదేవి యొక్క నూపురములను, చంద్రుని జయించి తెచ్చిన రోహిణీదేవి కుండలములను, ఉంగరములను, విశ్వకర్మ ఒపగిన వస్తువులను, విచిత్రమైన పీటలను, గొప్పనైన శయ్యను ఇచ్చెను. ఆట్టే ఆమె వెంట్రుకలు దువ్వుచు కొప్పు పెట్టి దానికి మాలలు చుట్టెను. తులసీదేవి చెక్కిళ్ళపై చిత్రవిచిత్రములైన మకరికా పత్రములనమర్చెను. చందనముతో తులసీదేవి నొసట మూడు చంద్రరేఖలు దిద్ది దాని చుట్టు కుంకుమబిందువులు పెట్టి దీపజ్వాలవలె నున్న తిలకమును తీర్చిదిద్దెను. గోళ్లకు చిత్రవిచిత్రమైన లత్తుకనద్దెను. ఆమె పాదములను తన రొమ్ముపైనుంచుకొని ఓదేవి నేను నీ దాసుడనని మాటిమాటికి ఉచ్చరించి రత్న విమానమున ఇంకొక స్థానమునకు తీసికొని వెళ్ళెను.

దేవతలకు నిలయమైన మలయపర్వతమున ఆతి రమ్యమైన పుష్పోద్యానమున, సింధునదీ తీరమున నున్న సుందర వనములో, పుష్ప భద్రానదీ తీరముననున్న ఇసుకల పైన, తుమ్మెదల వాదముతో మనోహరమైన గంధమాదన పర్వతమందలి ఉద్యానవనమున, నందనోద్యానవనమున మల్లెలు, మౌలతులు, కలువలు, తామరలు కల ఉవనమున, మేరు పర్వతముపై నున్న ఉపవనములో పుష్పశయ్యపై పుష్పముల చందనముల గాలి వీచుచుండ వారిద్దరు రతి కేళి చేసిరి. ఐనను వారిద్దరి కోరిక తీరలేదు. నేయిబోపినచో మండు మంటవలె వారి కోరిక చల్లారలేదు, పైగా అభివృద్ధి కాసాగినది.

చివరకు తులసీ శంఖచూడులు తమ ఆశ్రమమునకు తిరిగి వచ్చి ఆందమైన క్రీడాలయమును నిర్మించుకొని సుఖముగా విహరించసాగిరి.

బలవంతుడు, చక్రవర్తియగు శంఖచూడుడు ఒక మన్వంతర కాలము దేవదానవ, గంధర్వ కిన్నరాదులకు, రాక్షసులకు దానవులకు ఆజ్ఞలిచ్చుచు పరిపాలనము చేసెను.

అప్పుడు దేవతలు అధికారమును కోల్పోయి బిచ్చగాండ్రవలె ఇటునటు తిరుగసాగిరి. వారి పూజాహోమాదికములను, ఆధికారమును, శస్త్రాస్తభూషణాదికములను శంఖచూడుడు బలవంతముగా తీసికొనెను. అందువలన దేవతలందరు పనిపాటలు లేక చిత్రమునందలి బొమ్మలవలెనైరి.

అందువలన దేవతలందరు తమ కష్టములను చెప్పుకొనుటకు బ్రహ్మలోకమునకు వెళ్ళిరి.

దేవతలు తమ బాధలన్నిటిని బ్రహ్మదేవునికి చెప్పుకొనగా ఆతడు వారిని తీసికొని కైలాసమునకు వెళ్ళెను.

బ్రహ్మదేవుడు దేవతలు పడుతున్న బాధలన్నిటిని చంద్రశేఖరునకు వెల్లడించెను. అప్పుడు శంకరుడు కూడ వారి వెంట రాగా దేవతలందరు వైకుంఠమునకు పోయిరి.

అచ్చట సుదుర్లభమైనది, ఉన్నతమైనది, జరామృత్యువులను పోగొట్టునది అగు శ్రీహరీ నివాసస్థానముయొక్క ప్రథమ ద్వారము చేరిరి. అచ్చట పట్టువస్త్రములు ధరించి మంచి ఆభరణములు కలిగి రత్నసింహాసనమున నున్న నాలు భుజములు కల ద్వారపాలకులను దేవతలు చూచిరి. ఆ ద్వారపాలకులు నారాయణునివలె శ్యామసుందర విగ్రహులు, వనమాల ధరించినవారు శంఖ చక్రాద్యాయుధముల ధరించినవారు. పద్మముఖులు తామరస నేత్రులు.

బ్రహ్మదేవుడు వారికి తాము వచ్చిన విషయమును తెల్పి వారి అనుజ్ఞతో లోపలికి ప్రవేశించెను. ఇటువంటి పదహారు ద్వారములను దాటి శ్రీహరి యొక్క సభలోనికి దేవతలందరు ప్రవేశించిరి.

ఆ శ్రీహరి సభలో దేవర్షులు నాలుభుజములు కల శ్రీహరి సేవకులున్నారు. వారందరు నారాయణ స్వరూపులు అందరు కౌస్తుభ రత్నభూషితులు. ఆ సభ గొప్పదైన రత్నమాణిక్యములచే శోభిల్లునది. మాణిక్యముల మాలలు ముత్యాలమాలలు ఆ సభను అలంకరించినవి. గుండ్రని అద్దములతో చిత్రరేఖలతో అనేక విధములైన చిత్రములతో ఆ సభనిండిపోయినది. ఆ సభా భవనము యొక్క మెట్లు పద్మరాగమణులతో స్యమంతకమణులతో నిర్మించబడినవి. ఇంద్రనీలమణుల స్థంభములతో మంచి రత్నములచే చేయబడిన పూర్ణకుంభములతో ఆ సభ ఆలంకరింపబడినది. అచ్చట పారిజాత పుష్పముల మాలలు కనిపించును. చందనద్రవముతో ఆలికి కస్తూరీ కుంకుమలతో ఆ సభాప్రాంగణము ముగ్గులు పెట్టబడినది. సహస్రయోజన పరిమితమై విద్యాధర స్త్రీల సంగీతములతో ఆ సభ మనోహరముగా నుండినది. అట్టి సభలో బ్రహ్మ శంకరాది దేవతలు శ్రీహరిని సందర్శించుకొనిరి.

ఆ సభామధ్యమున చుక్కల మధ్య చంద్రునిపలె ఉన్నవాడును, రత్నసింహాసనమున నున్నవాడు, వాలు భుజములు కలవాడు కిరీటి, గది, చక్రహస్తి, కుండలి, వనమాలాధరుడు, ఆమూల్య రత్నాభరణములు కలవాడు శరీరమునందంతటా చందనము పూసుకొన్నవాడు, ముందు జరుగుచున్న నృత్యమును, గీతమును ఆలకించుచున్నవాడు, పరస్వతికి ప్రియుడు, లక్ష్మిదేవి చరణసేవ సేయుచుండగా గంగ చామరములు వీయుచుండగా భక్తులందరు సేవించుచున్న శ్రీవారిని దేవతలందరు చూచిరి.

దేవతలందరు పులకాంకితులై కన్నీరు కారగా గద్గద స్వరముతో శిరసు వంచుకొని యుండిరి. జగములనన్నిటిని సృష్టించు బ్రహ్మదేవుడు చేతులు కట్టుకొని శ్రీహరి ముందు దేవతల విషయమును విన్నవించెమ. శ్రీవారి బ్రహ్మదేవుని మాటలు విని నవ్వుచు రహస్యభూతమైన ఈ విషయమునట్లు తెలిపెను.

శ్రీభగవానువాచ- భగవంతుడగు శ్రీహరి ఇట్లనెను-

బ్రహ్మదేవుడా! శంఖ చూడుని వృత్తాంతమంతయు నాకు తెలియును. అతడు పూర్వజన్మలో నా భక్తుడు. గోపులలో నొకడు. దేవతలారా! అనీ చరిత్ర ఇది.

ఆతడు పూర్వజన్మలో మదాముడనే గోపాలుడు. నా అనుచరులలో శ్రేష్ఠుడు. రాధాదేవి యొక్క శాపమువలన దానవుడై పుట్టినాడు.

ఒకప్పుడు నేను నాకు ప్రాణముకంటె మిన్నయైన రాధాదేవి లేకుండ ఒంటరిగా నా గృహమునుండి రాపమండలమునకు వెళ్ళి విరజ యనే గోపికలో విహరించుచుంటిని. ఈ విషయమును చెలికత్తెలు రాధాదేవికి చెప్పిరి. ఆమె అతికోపములో రాసమండల స్థలమునకు రాగానే విరజ నదీరూపమై పోయినది. నేను కూడ మాయమైతివి. ఆ కోపముతోనే రాధాదేవి ఆంతఃపురమునకు వెళ్ళినది. అచ్చట వేను సుదాముడు కలిసి మాట్లాడుకొనుచున్నాము. నమ్ను చూడగానే రాధాదేవి కోమువాపుకొవలేక పన్ను మాటలలో పీడించసాగినది. వేనప్పుడు ఏమి అనక మౌనముగా నుంటివి. కాని సుదాముడామె మాటలను వివి సహించలేక నాముందరనే ఆమెను నిందింపసాగెను. సుదాముని మాటలు వినగానే 'రాధాదేవి కోపములో ఆతని వచటమండి. వెళ్ళగొట్టుటకనుమతి వచ్చినది. రాధాదేవి ఆజ్ఞను ఏవగానే ఆమె చెలికత్తెలు అతనిని అక్కడినుండి బలవంతముగా గెంటివేసిరి. అప్పుడు కూడ సుదాముడు తనధోరణి మార్చుకొనలేదు.

సుదాముడు తన ధోరణి మార్చుకోవక ఇంకా ఏవో మాటలు మాట్లాడుతూ ఉంటే అతని మాటలు విని రాధాదేవి ఆతవీవీ దానవుడవై పుట్టుమనీ శపించెను.

అప్పుడా సుదాముడు నాకు. నమస్కరించి ఏడ్చుచూ పోవుచుండగా రాధాదేవియే అతనీని నివారించినది. అక్కడి గోపికలు గోపాలకులు సుదామునకు ఇచ్చిన శాపమునకు మిక్కిలి చింతించిరి.

అప్పుడు నేను రాధికను, గోపగోపికలందరిని ఓదార్చి సుదాముడు క్షణార్గములో గోలోకమునకు తిరిగి వచ్చునంటివి. గోలోక మందలి ఆరక్షణము భూమిపై ఒక మన్వంతరము. అందువలన శంఖచూడుడు భూమిపై ఒక మన్వంతరము గడిపి తిరిగి గోలోకమునకు వచ్చును.

శివుడు నాశూలముతో శంఖచూడుని సంహరించును. అట్లే శంఖచూడుడు సర్వమంగళములకు మంగళప్రదమైన నా కవచమును మెడలో పర్వదా ధరించును. ఆ కవచమాతని కంఠమున ఉండగా ఆతనినెవ్వరు హింసించసైనలేరు. అందువలన నేను బ్రాహ్మణవేషమున దానిని యాచించెదను. ఆట్లే ఆతని భార్య సతిత్వము సైతమాతని నెల్లప్పుడు కొపాడుచుండును. ఆతని భార్య సతీశ్వభంగము జరిగినప్పుడే అతనికి మృత్యువగునని నీవే వరమిచ్చితివి. అందువలన నేనే తులసీయొక్క పతిత్వమును సైతము భంగము చేయుదుమ. ఆమె తన దేహత్యాగము చేసి తిరిగి నాకు ప్రియురాలు కాగలదు అని శ్రీహరి దేవతలలో పలికి తన శూలమును . వారికి ఇచ్చెను. దేవతలందరు సంతోషముతో భారతదేశమునకు వెళ్ళిరి.

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున తులస్యుపాఖ్యానమను పదునారవ అధ్యాయము సమాప్తము.