2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

32 - వైష్ణవుల ప్రాశస్త్యము

సావిత్ర్యువాచ- సావిత్రి ఇట్లనెను

వేద వేదాంగములు, అనేక పురాణములు, ఇతిహాసములు శాస్త్రములు తెలిసిన యమధర్మరాజా! ఆన్నీ కర్మలకు సారమైనది అందరకు ఇష్టమైనది, కీర్తిని ఇచ్చునది, ధర్మమును కలిగించునది, సమస్త పుణ్యకర్మలకు కూడా పుణ్యమైనది ఆగు కర్మను గూర్చి నాకు వివరింపుము. దీనిని ఆచరించుటవలన ప్రాణులు భయంకరమైన నీదిక్కునకు రావో, సంసార దుఃఖమును కలిగించు యాతనలను పొందరో, నరకకుండములను చూడరో, వాటిలో పడరో, జన్మ మరణములను పొందరో అట్టి కర్మ విశేషమును నాకు తెలుపుము.

నరక కుండలములెట్లుండును? పాపము చేయువారు వీరూపమున నరకమున ఉందురు? తాము మరణించిన తరువాత తమ పాంచ భౌతికదేహము భస్మము కాగా జీవులు ఎటువంటి దేహమును ధరించి తాము పూర్వజన్మమున చేసికొన్న పాపపుణ్యములననుభవింతురు? ఎంత కష్టముననుభవించినను నరకలోకమున ఆ దేహమెందువలన నశింపదు? ఆ దేహము ఎటువంటిది? అను విషయములనన్నిటినీ నాకు వివరింపుడు.

నారాయణ ఉవాచ- నారాయణమూర్తి నారదునితో ఇట్లనెను –

సావిత్రి యొక్క ప్రశ్నలు విని యమధర్మరాజు శ్రీహరిని స్మరించి గురువునకు నమస్కారము చేసి ఇట్లు సమాధానము చెప్పసాగెను.

యమ ఉవాచ- యమధర్మరాజా ఇట్లు పలికెను –

అమ్మా! శ్రీకృష్ణపరమాత్మసేవ సమస్త వేదములందు, సమస్త సంహితలందు, సమస్త పురాణేతిహాస, పాంచరాత్రాది శాస్త్రములందు, వేదాంగములందు చెప్పబడినది. ఇది సమస్త వేద వేదాంగాదులకు సమ్మతమైనది. మంగళకరమైనది.

శ్రీకృష్ణుని సేవించుటవలన జన్మ, మృత్యువు, ముసలితనము, రోగములు, శోకము, బాధలు కలుగవు. ఇది పరమానందమునకు కారణమైనది. ఇది సమస్త సిద్దులను కలిగించును. నరకమనే సముద్రమును దాటించును. భక్తి యను వృక్షము యొక్క అంకురమును కలిగించును. అట్లే కర్మయను వృక్షమును ఛేదించును. గోలోకమార్గమునకు సోపానము వంటిదీ. నాశనము లేని మోక్షపదమును కలిగించును. సాలోక్య సార్ష్టి సారూప్య, సామీప్యము లను ముక్తులను కలిగించును.

శ్రీకృష్ణ పరమాత్మను సేవించు భక్తులు నరకకుండములను, యమదూతలను, యమకింకరులను, యముని కలలోనైన చూడరు.

కర్మఫలముననుభవించు గృహస్థులు శ్రీహరి వ్రతమును అనుష్ఠించినచో, శ్రీహరి తీర్థములైన పుణ్యతీర్థములలో స్నానము చేసినచో, శ్రీహరి వాసరమైన ఏకాదశినాడు నిరాహారులై యున్నచో, ప్రతిదినము శ్రీహరిని నమస్కరించుచున్నచో, శ్రీహరి అర్చావిగ్రహమును పూజించినచో మిక్కిలి భయంకరమైన నో పట్టణమునకు రారు.

అట్లే పరిశుద్దమైన ఆచారములు కలవారు. త్రిసంధ్యలందు సంధ్యావందన మాచరించి పరమ పవిత్రులైనవారు, తమ ధర్మమును లేశమైన తప్పనివారు, పరమ శాంతులు అగు బ్రాహ్మణులు యముని వాసమున కెన్నడును వెళ్ళరు.

ఇతర దేవతల భక్తులు, పరిశుద్దులైన ఇతరులు కూడా స్వర్గలోక ఫలముననుభవింతురు. వారు తమ తమ పుణ్యకర్మలవలన స్వర్గలోకమునకు పోయెదరు. తిరిగి వారు భూలోకమునకు వత్తురు. ఈవిధముగా వారు భూలోక స్వర్గలోకములకు పోవుచుందురు. తిరిగివత్తురు. మోక్షమును మాత్రము పొందజాలరు.

స్వధర్మనిరతులు స్వధర్మవిరతులైన మానవులందరు శ్రీకృష్ణుని సేవను తప్ప మోక్షమును కాంక్షింపరు.

భయంకరులగు నా కింకరులు శ్రీకృష్ణ మంత్రోపాసకుని చూచి గరుత్మంతుని చూచిన సర్పములవలె భయపడిపోవుదురు. పాశమును ధరించి భూలోకమునకువెళ్ళుచున్న నా దూతలతో మీరు శ్రీవారి భక్తుల ఆశ్రమములవైపు వెళ్ళవలదని హెచ్చరింతును. శ్రీకృష్ణమంత్రోపాసన చేయు భక్తుల పేర్లు సహితము మీమ్ము బాధలు పెట్టునని చెప్పుదును. చిత్రగుప్తుడు కూడ వారికి భయపడి వారిపేర్లను కొట్టివేయును.

బ్రహ్మలోకమును దాటి గోలోకమునకు పోవుచున్న శ్రీకృష్ణభక్తులకు బ్రహ్మదేవుడు మధుపర్కాదికములనిచ్చి గౌరవించును. వారియొక్క స్పర్శవలననే పాపములన్నీ బాగుగా ప్రజ్వలించుచున్న అగ్నిలో చిన్న చిన్న కట్టెలు. గడ్డిపోచలు పడి భస్మమైపోయినట్లు నశించుచున్నవి.

శ్రీకృష్ణభక్తులను చూచి మోహము ఎక్కువ భయపడీ మూర్చపడిపోవును. మన్మథుడు, లోభము, కోపము తొలగిపోవును. మృత్యువు, రోగము, ముసలితనము, శోకము, భయము, కాలుడు శుభాశుభకర్మలు, సంతోషము, అనుభవములన్నియు పరిగెత్తి పోవును.

ఓసావిత్రీ! నీకు యమపురికి ఎవరెవరు వెళ్ళరో వారిని గూర్చి విపులముగా తెల్పితిని.

ఇక శరీరమును గురించి విపులముగా నీకు వివరింతును. భూమి, వాయువు, ఆకాశము, అగ్ని, నీరు అను పంచభూతములు బ్రహ్మదేవుడు జీవులను సృష్టించునపుడు, వారి శరీరమునకు కారణములగుచున్నవి. ఈదేహము పృథివ్యాది పంచభూతముల వలన నిర్మించబడినది. అందువలననే ఇది కృత్రిమమైనది ఆశాశ్వతమైనది. బూడిదయగునది.

పురుషాకారమున నున్న జీవుడు బొటనవ్రేలు ప్రమాణమున (అంగుష్ఠమాత్రుడై) నుండి సుఖదుఃఖముల ననుభవించుటకై సూక్ష్మదేహమును కలిగియుండును.

జీవుని సూక్ష్మదేహము నా పట్టణమున (నరకములో) బాగుగా మండుచున్న అగ్నిలో వేసినను భస్మము కాదు. నీటిలో ముంచినను, చాలాకాలము దెబ్బలు కొట్టుచున్నను, శస్త్రాస్త్రములచే కొట్టినను నశింపదు. ఆట్లే వాడియైన ముండ్లతో కొట్టినను, మండుచున్న ద్రవములో ముంచినను, మండుచున్న లోహమున, మండుచున్న రాతీపై వేసినను, బాగుగా మండుచున్న ప్రతిమను కౌగిలించుకొన్నను, చాలా ఎత్తుపైనుండి కిందికి తోసినను దగ్ధము కాదు. భగ్నము కాదు. కాని బాధలను మాత్రమనుభవించును.

ఓ సావిత్రి! దేహ వృత్తాంతమును, పార్థివ దేహము, నశించిన తరువాత శుభాఽశుభఫలములననుభవించుటకు గల కారణమును వివరించితిని.

ఇక నరకములోని కుండముల లక్షణమును చెప్పెదను. జాగ్రత్తగా వినుమని యమధర్మరాజు పలికెను.

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున తెలుపబడిన సావిత్ర్యుపాఖ్యానములో ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.