భాగవత మహా పురాణము
79 - బల్వలుని ఉద్ధారము - బలరాముని తీర్థయాత్ర
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! తరువాత పర్వదినము రాగానే ప్రచండమైన వాయువు వీచి భయమును గోల్పెను. అంతటా దుమ్ము వర్షిస్తూ, దుర్గంధము కూడ నిండెను.
తరువాత బల్వలుడు యజ్ఞశాలలో మలముతో నిండిన వర్షమును కురిపీంచెను. వెంటనే శూలమును దాల్చి ఆతడు కూడ కానవచ్చెను.
ఆ బల్వలుడు దట్టని కాటుక ప్రోగును పోలిన పెద్ద దేహమును కలిగియుండెను. అతని జుట్టు, గెడ్డము, మీసములు పుటము పెట్టిన రాగి వలె నుండెను. ఆతని , ముఖము కోరలతో, కనుబొమలతో భయమును గొల్పెను. బలరాముడాతనిని చూచెను.
బలరాముడు శత్రు సైన్యమును ఛిన్నాభిన్నము చేసే ముసలమును, రాక్షసులను అదుపులో పెట్టే నాగలిని కూడ స్మరించగానే, అవి రెండు శీఘ్రముగా వచ్చి చేరినవి.
బలరాముడు కోపించి, ఆకసములో సంచరిస్తూ బ్రాహ్మణులకు ద్రోహమును చేసే ఆ బల్వలుని నాగేటి చాలుతో లాగి, రోకలితో తలపై మోదేను.
ఆ బల్వలుని నుదురు పగిలి రక్తము అధికముగా స్రవించి దేహమంతా ఎర్రనయ్యెను. ఆతడు ఆర్తనాదమును చేస్తూ, వజ్రముచే కొట్టబడిన పర్వతము వలె, నేల పై పడిపోయెను.
మహాత్ములగు మహర్షులు బలరాముని బాగా కొనియాడి సఫలములయ్యే ఆశీస్సులనిచ్చి, దేవతలు వృత్రాసురుని సంహరించిన ఇంద్రుని వలే, అభిషేకించిరి.
వారు బలరామునకు శోభకు నిలయమై వాడని పలు రంగుల పద్మములతో చేసిన విజయకరమగు మాలను, ప్రకాశించే జంట వస్త్రములను, ఉజ్జ్వలమైన ఆభరణములను కూడ యిచ్చిరి.
తరువాత బలరాముడు ఆ బ్రాహ్మణుల అనుజ్ఞను పొంది కౌశికీ నదికి వచ్చి స్నానము చేసి, సరయూనది ఉద్భవించిన సరస్సునకు వెళ్లెను.
ఆయన సరయూనదీతీరము వెంట ప్రవాహదిశలో పయనించి ప్రయాగ ను చేరెను. అచట ఆయన స్నానము చేసి, దేవతలు, పితృదేవతలు మొదలగువారికి తర్పణములనిచ్చి పులహమహర్షి ఆశ్రమమునకు వెళ్లెను.
బలరాముడు గోమతీ గండకీ విపాశానదులలో మరియు శోణనదమునందు స్నానము చేసెను. తరువాత ఆయన గయ వెళ్లి పితృదేవతలనారాధించేను. తరువాత ఆయన గంగాసాగరసంగమమునకు వెళ్లి స్నానము చేసి, పరశురాముని దర్శించి ప్రణమిల్లెను.
తరువాత ఆయన క్రమముగా సప్తగోదావరి, వేణ, పంప, భీమరథీ నదులలో స్నానమును చేసెను.
సర్వసమర్థుడగు బలరాముడు కుమారస్వామిని దర్శించెను. ద్రవిడదేశములో కైలాసవాసియగు శివుని ధామమైన శ్రీశైలము మిక్కిలి పావనమైనది. ఆయన దానిని, వేంకటాద్రిని దర్శించెను.
ఆయన కామాక్షిని, కాంచీపురమును, నదులలో గొప్పదియగు కావేరిని, శ్రీరంగమనే మహాపుణ్య క్షేత్రమును దర్శించెను. శ్రీరంగములో శ్రీహరి నిత్యసన్నిధియై యుండును.
ఆయన శ్రీహరి క్షేత్రమగు ఋషభ పర్వతము, దక్షిణ మథుర, మహా పాపములను నశింపజేసే సముద్రమునందలి రామ సేతువులకు వెళ్లెను.
అచట నాగలి ఆయుధముగా గల బలరాముడు బ్రాహ్మణులకు పది వేల పాడియావులను దానము చేసెను. ఆయన కృతమాల, తామ్రపర్ణి అనే నదులలో స్నానము చేసి మలయమనే కులపర్వతమునకు వెళ్లాను.
బలరాముడు ఆ మలయపర్వతముపై నివసించుచున్న అగస్త్యమహర్షికి నమస్కారమును వాచా అభివాదమును కూడ చేసెను. అపుడా మహర్షి ఆయనను ఆశీర్వదించి అనుమతినిచ్చెను. అపుడాయన దక్షిణసముద్రమునకు వెళ్లి, అచట తీరమునందు కన్యాకుమారి అనే పేరు గల దుర్గాదేవిని దర్శించెను.
తరువాత ఆయన ఫాల్గున (అనంతశయన) క్షేత్రమును చేరి,పంచాప్సరసతీర్థములో స్నానము చేసి, పది వేల గోవులను దానము చేసెను. అచట శ్రీహరి సర్వదా సన్నిహితుడై యుండును.
తరువాత బలరామ భగవానుడు కేరళ త్రిగర్త ప్రాంతములను చూచి, గోకర్ణమనే శివ క్షేత్రమును దర్శించెను. అచట శివుడు సర్వదా సన్నిహితుడై యుండును.
బలరాముడు ద్వీపవాసినియగు దుర్గాదేవిని దర్శించి శూర్వారక క్షేత్రమునకు వెళ్లాను. ఆయన తరువాత తాపీ, పయోషీ, నిర్వింధ్యా నదులలో స్నానము చేసి పిదప దండకారణ్యమును ప్రవేశించెను. అప్పుడాయన నర్మదానదికి వెళ్లి దాని తీరమునందలి మాహిష్మతీ నగరమును చేరెను.
ఆయన మనుతీర్థములో స్నానము చేసి మరల ప్రభాస క్షేత్రమునకు వచ్చేను.
కౌరవపాండవయుద్దములో చాలమంది రాజులు మరణించినారని బ్రాహ్మణులు చెప్పగా విని, ఆయన భూభూరము తగ్గినదని తలచెను.
యుద్ధములో భీముడు, దుర్యోధనుడు గదలతో యుద్ధము చేయుచుండగా యదువంశనందనుడగు బలరాముడు వారిని ఆపబోవువాడై కురుక్షేత్రమునకు వెళ్లెను.
ధర్మరాజు, నకులసహదేవులు, శ్రీకృష్ణార్జునులు ఆయనను చూచి నమస్కరించి మిన్నకుండిరి. ఈయన ఇచటకు ఏమి చెప్పగోరి వచ్చియుండును? (ఈ విషయము వారికి అర్థము కాలేదు).
విజయమును కోరే భీమార్జునులిద్దరు కోపముతో గదలను చేతులతో పట్టుకొని పలు రకముల విన్యాసములను చేయుచుండిరి. వారిని చూచి బలరాముడిట్లు పలికెను.
ఓ దుర్యోధన మహారాజా! ఓ భీమ సేనా! మీరిద్దరు సమానమైన బలము గల వీరులు. మీలో ఒకరు (భీముడు) ప్రాణశక్తిచే, రెండవవాడు శిక్షణచే అధికుడని నా అభిప్రాయము.
కాబట్టి సమ ఉజ్జీలైన మీ యిద్దరిలో ఒకనికి జయము గాని, పరాజయము గాని కలిగే సూచనలు కానరావు. ఫలితము లేని ఈ యుద్ధమును ఆపివేయుడు.
ఓ పరీక్షిన్మహారాజా! వారిద్దరు పరస్పరము చేసుకున్న దూషణలను, అపకారములను గుర్తు చేసుకుంటూ దృఢమైన వైరము కలవారగుటచే, బలరాముడు చెప్పిన మాట అర్థవంతమే అయినా, వారు స్వీకరించలేదు.
ఆ యుద్ధము ప్రారబ్దఫలమని తలపోస్తూ బలరాముడు ద్వారకకు వెళ్లే ను. ఉగ్రసేనుడు సాంబుడు మొదలగువారాయనను ప్రీతితో స్వాగతించిరి.
యజ్ఞమూర్తియగు బలరాముడు సకలకలహములనుండి నివృత్తుడై మరల నైమిషమును చేరెను. మహర్షులాయనచే ఆనందముగా సకలక్రతువులను చేయించిరి.
సర్వసమర్థుడగు బలరామ భగవానుడు వారికి పరిశుద్దమగు ఆత్మజ్ఞాన మునుపదేశించెను. ఆత్మజ్ఞానముచే మాత్రమే వారీ జగత్తంతా తమయం దున్నదని, తాము సకలజగత్తు వ్యాపించి ఉన్నామనియు తెలుసుకొనిరి.
జ్ఞాతులు, బంధువులు, మిత్రులు చుట్టువారియుండ బలరాముడు తన ధర్మపత్ని (రేవతి) తో గూడి, తన వెన్నెలతో గూడియున్న చంద్రుడు వలె ప్రకాశిస్తూ, అవభృథస్నానమును చేసెను. అపుడాయన మంచి వస్త్రములను దాల్చి చక్కగా అలంకరించుకొనెను.
అనంతము, ఇంద్రియగోచరము కానిది అగు పరబ్రహ్మయే మాయాశక్తిచే మానవరూపమును దాల్చి బలశాలియగు బలరాముడైనది. ఆయనయొక్క ఇటువంటి చరితములు లెక్కలేనన్ని గలవు.
బలరాముడై అచ్చెరువును గొలిపే అనంతుని లీలలను ఎవడైతే ఉదయము, సాయంకాలము స్మరించునో, అట్టివాడు శ్రీహరికి ప్రీతిపాత్రుడగును.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో బల్వలుని ఉద్ధారమును, బలరాముని తీర్థయాత్రను వర్ణించే డెబ్బది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (79).
Summary of chapter 79 of the Bhāgavata Mahā Purana is as follows:
Lord Balarāma traveled across India, visiting sacred sites including Gangāsāgara, Kānchī, Śrī Raṅgam, Rāmeśwaram, Madurai, Prabhāsa, and the banks of the Sarasvatī River. Returning to Kurukshetra on the final day of the great war, Balarāma witnessed the decisive mace duel between His two disciples, Bhīma and Duryodhana. When Bhīma struck Duryodhana's thighs down in violation of formal wrestling rules, Balarāma became enraged and raised His plow weapon to punish Bhīma; however, Śrī Kṛshṇa intervened, explaining the subtle workings of destiny and Duryodhana's past sins. Pacified, Balarāma returned to Dvārakā, where He was welcomed by His relatives and lived in peaceful absorption.