భాగవత మహా పురాణము
37 - శ్రీకృష్ణుడు కేశిని, వ్యోమాసురుని ఉద్ధరించుట - నారద స్తుతి
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కంసుడు పంపిన కేశి (జూలు గలవాడు) పెద్ద గుర్రమై మనోవేగముతో బృందావనమునకు వచ్చెను. ఆతడు డెక్కలతో నేలను చీల్చివేయుచుండెను. ఆతడు జూలును విదల్చగా ఆకాశములోని మేఘములు, దేవతలు విమానములు చెల్లాచెదరగుచుండెను. ఆతని సకిలింపునకు అందరు భయపడిరి.
నిడివి కన్నులు, చెట్టు తొర్రవంటి వంకర మూతి, పెద్ద కంఠము కలిగిన ఆ కేశి నల్లని పెద్ద మేఘమును పోలియుండెను. ఆ దుర్బుద్ధి కంసుని హీతమును చేయగోరి నందుని గోకులమునకు రాగా భూమి కంపించెను.
అట్టి (కర్కశమైన) సకిలింపులతో కేశి శ్రీకృష్ణ భగవానుని గోకులమును భయ పెట్టుచుండెను. ఆతడు తోకతో మేఘములను త్రిప్పుచుండెను. ఆతడు యుద్ధము చేయుటకు శ్రీకృష్ణుని కొరకై వెదుకుచుండెను. అపుడు గోకులనాయకుడగు శ్రీకృష్ణుడు వానిని రమ్మని సవాలు చేసి, సింహము వలె నాదము చేసెను.
ఆ కేశి సమీపించుట కానీ, అతిక్రమించుట కాని శక్యము కాని భయంకరమగు వేగము గలవాడు. ఆతడు పద్మములవంటి కన్నులు గల శ్రీకృష్ణుని చూచి పెద్ద కోపముతో ఆయనకు ఎదురుగా వచ్చెను. నోటితో ఆకాశమును త్రాగుచున్నాడా యన్నట్లు ఆతడు యన్నట్లు ఆతడు ఆయనకు ఎదురుగా పరు గెత్తి వెనుక కాళ్లతో తన్నెను.
ఇంద్రియగోచరము కాని స్వరూపము గల శ్రీకృష్ణుడు ఆ దెబ్బను తప్పించుకొనెను, ఆయన కోపముతో వానిని, కశ్యప ప్రజాపతి పుత్రుడగు గరుడుడు పామును వలె, రెండు చేతులతో రెండు వెనుక కాళ్లను పట్టుకొని గిర గిర త్రిప్పి, తిరస్కార పూర్వకముగా వంద ధనుస్సుల దూరమునకు విసిరి వైచి నిలబడెను.
ఆ కేశి స్పృహ వచ్చి మరల లేచి నిలబడి కోపముతో నోరు తెరిచి వేగముగా శ్రీకృష్ణుని మీదకు వచ్చెను. ఆయన కూడ నవ్వుతూ వాని నోటిలో ఎడమ చేతిని, కలుగులో పామును వలె, ప్రవేశ పెట్టెను.
శ్రీకృష్ణ భగవానుని చేతిని కేశి దంతములతో కొరకబోగా, అవి లోహపు ముద్దను కొరికినవా యన్నట్లు రాలినవి. సర్వమునకు ఆత్మయగు భగవానుని చేయి కూడ వాని దేహము లోపల, ఉపేక్ష చేయబడిన జలోదర రోగము వలె, బాగా పెరిగి పెద్దదాయెను.
శ్రీకృష్ణుని చేయి బాగా పెద్దది కాగా, ఆ కేశికి ఊపిరి అడ్డుకొనబడెను. వాని దేహము చెమటతో తడిసి ముద్దయై కళ్లు బయటకు పొడుచుకు పచ్చెను. వాడు కాళ్లను కొట్టుకుంటూ పేడను వేస్తూ ప్రాణములు పోయి నేల గూలను.
శ్రీకృష్ణుడు గొప్ప భుజశక్తి గలవాడు. ఆయన ప్రయత్నము లేకుండగనే శత్రువులను సంహరించును. కేశి మరణించినందులకు ఆయనకు గర్వము గాని, ఆశ్చర్యము గాని లేవు. కాని, దేవతలు చాల ఆశ్చర్యపడిరి. ఆయన తన చేతిని వాని దేహమునుండి బయటకు తీసుకోగానే, వారు పూల వానలను కురిపిస్తూ స్తుతించిరి.
ఓ పరీక్షిన్మహారాజా! దేవర్షియగు నారదుడు భగవానుని భక్తులలో అగ్రగణ్యుడు. ఆయన సునాయాసముగా గొప్ప పనులను చేసే శ్రీకృష్ణుడు ఏకాంతముగానున్నప్పుడు దగ్గరకు వచ్చి ఇట్లు పలికెను.
ఓ శ్రీకృష్ణా! ఓ శ్రీకృష్ణా! నీ స్వరూపము ఊహకు గాని, ఇంద్రియములకు గాని అందేది కాదు. వసుదేవుని పుత్రుడవగు నీవు యోగులకు ప్రభుడవు, జగత్తును శాసించువాడవు. సకలజగత్తునకు అధిష్ఠానము నీవే. యాదవులలో శ్రేష్ఠుడవగు ఓ ప్రభూ!
కట్టెలు వేరైనా వాటియందలి అగ్ని ఒక్కటే. అదే విధముగా, సకల ప్రాణుల హృదయగుహయందు సకలబుద్ధివృత్తులకు సాక్షియగు నిగూఢ - ఆత్మ చైతన్యము నీవే. సర్వాంతర్యామివగు పురుషోత్తముడవీవే.
స్వతంత్రుడవగు నీ సంకల్పము అమోఘము. సర్వనియామకుడవగు నీవు నీవే ఉన్న మాయాశక్తిచే మున్ముందుగా సత్త్వరజస్తమోగుణములను సృష్టించితివి. వాటితో ఈ జగత్తును నీవు సృష్టించి పాలించి ఉపసంహరించుచున్నావు.
దితిపుత్రులు, బాణుడు మొదలగు ప్రమథులు, రాక్షసులు రాజుల రూపములోనున్నారు. వారిని నశింపజేసి ధర్మమర్యాదలను నిలబెట్టుటకై నీవు అవతరించితివి.
ఈ గుర్రము రూపములోనున్న రాక్షసుని నీవు అవలీలగా సంహరించితివి. మంగళము. వీడు స్వర్గము వద్దకు వచ్చి సకిలించినచో, దేవతలు స్వర్గమును వీడి పరుగెత్తెదరు.
ఓ ప్రభూ! ఎల్లుండి పగలు నీవు చాణూరుని, ముష్టికుని, శలుడు మొదలైన ఇతరమల్లులను, కువలయాపీడమనే ఏనుగును, కంసుని కూడ సంహరించగలవు. నేను చూచెదను.
ఆ కంసుని తరువాత నీవు శంఖుని, కాలయవనుని, మురుని, నరకుని కూడ సంహరించెదవు. తరువాత నీవు ఇంద్రుని పరాభవించి కల్పవృక్షమును లాగుకొని వచ్చెదవు.
ఓ జగన్నాథా! నీవు నీ పరాక్రమము, సౌందర్యము మొదలగు గుణములే కట్నము కాగా క్షత్రియకన్యలను వివాహమాడెదవు. నీవు ద్వారకలో నృగుని పాపమునుండి విముక్తుని చేసెదవు.
నీవు భార్యతో బాటుగా స్యమంతకమణిని కూడ పొందెదవు. నీవు మరణించిన బ్రాహ్మణపుత్రులను వారి స్థానమునుండి తెచ్చి యిచ్చెదవు.
నీవు పౌండ్రకుని సంహరించి తరువాత కాశీనగరమును తగులబెట్టెదవు. దంతవక్తుని, గొప్ప యజ్ఞమునందు చేది రాజగు శిశుపాలుని కూడ సంహరించెదవు.
ద్వారకానగరమునధిష్ఠించి నీవు ఇంకా ఏ పరాక్రమములను చేసెదవో, వాటిని కూడ నేను చూడగలను. భూలోకమునందు కవులు వర్ణించదగ్గవి ఈ లీలలే.
తరువాత మృత్యురూపుడవగు నీవు ఈ భూమియొక్క భారమును తగ్గించగోరి అర్జునునకు సారథివి కాగలవు. అపుడు సైన్యముల అకౌహిణులు నాశమును పొందును. దానిని నేను చూడగలను.
నీవు ధర్మాధర్మములకు అతీతమైన జ్ఞానఘనుడవు. ఆనందఘసమగు నీ సన్నిధి మాత్రముచే సకలకామనలు పూర్ణముగా సిద్ధించును. సంకల్పములు అమోఘములు. మాయాశక్తి యొక్క సత్త్వరజస్తమో గుణముల ప్రవాహము (సంసారము) చైతన్యఘనుడవగు నీయందే కాలమునందైనా లేదు. షడ్గుణ సంపన్నుడవగు నిన్ను శరణు జొచ్చెదము.
నీవు స్వతంత్రుడవై జగత్తును నియమించెదవు. నీవు నీ మాయాశక్తిచే సకలవిశేషముల (నామరూపముల) సమాహారమగు జగత్తును కల్పించినావు. ఈ కాలములో నీవు లీల కొరకై మానవ దేహమును స్వీకరించి యున్నావు. యాదవ వృష్టి సాత్వత వంశీయులలో అగ్రేసరుడవగు నీకు నేను నమస్కరించుచున్నాను.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భగవద్భక్తులలో అగ్రేసరుడగు నారదమహర్షికి ఆ శ్రీకృష్ణుని దర్శనమే పండుగ. ఆయనీ విధముగా ఆ యాదవప్రభుని ప్రణమిల్లి ఆయన సెలవు తీసుకొని వెళ్లెను.
గోకులమునకు సుఖమును కలిగించే గోవింద భగవానుడు యుద్ధములో కేశిని కూడ సంహరించగా గోపాలకులు సంతోషించిరి. ఆయన వారితో కలిసి పశువులను పాలించెను.
ఒకనాడు గోపాలకులు గోవర్ధన పర్వతము యొక్క సమతలప్రదేశములయందు పశువులను మేపుచుండిరి. వారిలో కొందరు చోరులని, ఇంకొందరు రక్షకులని కల్పించుకొని వారు దాగుడు మూతల ఆటలను ఆడిరి.
ఓ పరీక్షిన్మహారాజా! వారిలో కొందరు మేకలు వలె నటించగా, కొందరు చోరులుగను, కొందరు రక్షకులుగను అయి, భయమంటే ఏమిటో తెలియకుండా విహరిస్తూ ఆడుకొనుచుండిరి.
ముయుని పుత్రుడగు వ్యోముడు పెద్ద మాయావి. వాడు గోపాలకుని వేషముతో వారిలో చేరి ఆటలో పలుమార్లు చోరుడుగా ఉండెను. ఈ తీరున వాడు మేకలవలె ఆచరించే చాలమంది గోపబాలకుల నెత్తుకుపోయెను.
ఆ బలశాలియగు రాక్షసుడు ఎత్తుకుపోయిన ప్రతి గోపబాలకుని ఒక పర్వతగుహలో దాచి దాని ద్వారమును రాతితో మూసివేసెను. గోపబాలకులు నలుగురైదుగురు మాత్రమే బయట మిగిలియుండిరి.
శ్రీకృష్ణుడు సత్పురుషులకు రక్షకుడు. ఆ వ్యోమాసురుడు చేస్తున్న పని తెలిసిపోయెను. గోపబాలకులను ఎత్తుకుపోవుచున్న ఆ రాక్షసుని ఆయన, సింహము తోడేలును వలె, బలముగా పట్టుకొనెను.
ఆ రాక్షసుడు బలశాలియే అయినా, శ్రీకృష్ణుడు పట్టుకొనుటచే పీడను పొందెను. వాడు తనను విడిపించుకొనగోరి పెద్ద పర్వతమును పోలిన తన యథార్థరూపమును పొందెను. ఐననూ వాడు విడిపించుకొనలేకపోయెను.
శ్రీకృష్ణ భగవానుడు వానిని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని నేలపై పడవైచెను. అపుడాయన వానికి పశువును చంపునట్లుగా గాలి ఆడకుండా చేసి సంహరించెను.
ఆయన గుహను మూసీ ఉంచిన రాతిని పగులగొట్టి గోపబాలకులను ఆపదనుండి బయటకు తెచ్చెను. దేవతలు, గోపాలకులు స్తుతించుచుండగా, ఆయన తన గోకులమును ప్రవేశించెను.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్ధములో
శ్రీకృష్ణుడు కేశిని, వ్యోమాసురుని ఉద్ధరించుటను, నారద స్తుతిని వర్ణించే
ముప్పది ఏడవ అధ్యాయము ముగిసినది (37).
Summary of chapter 37 of the Bhāgavata Mahā Purana is as follows:
Kaṁsa dispatched the fierce horse demon Keśī to Vṛndāvana. Keśī roared like a lion, galloping through pastures and kicking his hooves into the sky. Śrī Kṛshṇa stepped forward and challenged the demon. When Keśī opened his cavernous mouth to bite Him, Kṛshṇa thrust His left arm deep into the horse's throat. Kṛshṇa's arm expanded within Keśī's mouth, becoming red-hot like molten iron, suffocating and tearing the demon apart from within. Devarshi Nārada appeared in the sky, offering exalted prayers glorifying Kṛshṇa's upcoming victories over Kaṁsa, Jarāsandha, and the Kurukshetra war. Later, while playing a game of "cops and robbers" with the cowherd boys, Kṛshṇa killed the demon Vyomāsura (son of Maya Dānava), who was disguised as a boy and hiding the cowherd children in mountain caves.