71 - శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థమునకు విచ్చేయుట

శ్రీశుక ఉవాచ

శ్రీశుక  మహర్షి  ఇట్లు పలికెను --- గొప్ప  బుద్ధిశాలియగు  ఉద్ధవుడు దేవర్షియగు  నారదుని  ఈ  వచనములను  విని,  సభ్యుల  అభిప్రాయమును,  శ్రీకృష్ణుని అభిప్రాయమును  కూడ  తెలుసుకొని  ఇట్లు  పలికెను.

ఉద్ధవ ఉవాచ

ఉద్ధవుడిట్లు  పలికెను -- దేవా!  మీ  తండ్రిగారి  సోదరి  కొడుకు  ధర్మరాజు చేయబోయే  యాగమునకు  సాహాయ్యము  చేయవలెనని  నారద  మహర్షి

చెప్పిన మాటను తమరు  పాటించి,  శరణు  కోరువారిని  రక్షించదగును.

ఓ ప్రభూ!  దిక్కుల  మండలమును  జయించి  రాజసూయయాగమును చేయవలెను.  కావున,  జరాసంధుని  జయించుట  వలన  రెండు  ప్రయోజనములు (రాజసూయమును  చేయుట,  బందీలను  రక్షించుట) సిద్ధించునని  నా  అభిప్రాయము.

ఇట్లు  చేయుటచే  మనకు  కూడ  గొప్ప  ప్రయోజనము  కలుగగలదు.  ఓ గోవిందా!  బందీలైన  రాజులను  విడిపించిన  కీర్తి  కూడ  నీకు కలుగును.

ఆ  జరాసంధ  మహారాజు  బలములో  పది వేల ఏనుగులతో సమానుడు. ఆతనితో  సమానమగు  బలము  గల  భీముని  మినహాయించి,  మిగిలిన  బలశాలురు కూడ  ఆతనిని  ఎదుర్కొని  నిలబడలేరు.  ఇది నిశ్చయము.

ఆ  జరాసంధుని  ద్వంద్వయుద్ధములో  జయించవలెనే  గాని,  ఆతడు  వంద అక్షౌహిణీలతో  కూడియుండ  జయించ  శక్యము  కాదు.  ఆతడు  బ్రాహ్మణభక్తుడు.  ఏ కాలమునందైనా  వేదవేత్తల  కోరికను  తిరస్కరించడు.

భీముడు  బ్రాహ్మణవేషమును  దాల్చి  వెళ్లి  కోరవలేను.  నీ  సన్నిధిలో ద్వంద్వయుద్ధములో  భీముడాతనిని  నిస్సందేహముగా  సంహరించగలడు.

జగత్తుయొక్క  సృష్టికి  బ్రహ్మదేవుడు,  ప్రళయమునకు  రుద్రుడు  కేవలము నిమిత్తము  మాత్రమే.  వాస్తవములో  రూపము  లేని  నీవే  కాలరూపుడవై  సర్వమును శాసించుచున్నావు.

జరాసంధునిచే  బంధించబడిన  రాజుల  గృహములలో  రాణులు  నీవు  తమ శత్రువును  వధించి  తమ  ప్రియులను  విముక్తులను  చేసెదవని  నీ  స్వచ్ఛమగు  కీర్తిని గానము  చేయుచున్నారు.  గోపికలు  తమను  నీవు  శంఖచూడునినుండి  విముక్తులను చేయుటను,  నిన్ను  శరణు  వేడిన  మేము  నీవు  నీ  తల్లిదండ్రులగు  దేవకీవసుదేవులను చెరనుండి  విడిపించుటను,  మహర్షులు  గజేంద్రమోక్షమును,  జానకిని  చెరనుండి విడిపించుటను  గురించి  గానము  చేయుచున్నారు.

ఓ శ్రీకృష్ణా!  జరాసంధుని  వధించుట  వలన  చాల  గొప్ప  ప్రయోజనములు సిద్ధించును.  బహుశః  జరాసంధుని  పాపకర్మ  పండుటచే,  రాజుల  పుణ్యకర్మ పరిపక్వమగుటచే  నీవు  కూడ  యజ్ఞమునిష్టపడుచున్నావు.

శ్రీశుక ఉవాచ

శ్రీశుక  మహర్షి  ఇట్లు  పలికెను ---  ఓ  పరీక్షిన్మహారాజా!  ఉద్ధవుని  ఈ వచనము  అన్ని  విధములుగా  కల్యాణమును  చేయును.  ఆ  వచనమును  పాటించినచో  ఫలము  చేజారిపోదు.  ఆతని  సలహాను  నారద మహర్షి, యాదవవృద్ధులు  మాత్రమే  గాక,  శ్రీకృష్ణుడు  కూడ  కొనియాడిరి.

తరువాత  దేవకీనందనుడు,  సర్వసమర్థుడు  అగు  శ్రీకృష్ణ  భగవానుడు  పెద్దల అనుమతి  తీసుకొనెను.  అపుడాయన   దారుకుడు,  జైత్రుడు,  ప్రబలుడు  మొదలగు సైనికులను  ప్రయాణమునకు  ఆదేశించెను.

శత్రువులను  జయించిన  ఓ  పరీక్షిన్మహారాజా!  శ్రీకృష్ణుడు  బలరాముని  వద్ద, యాదవప్రభుడగు  ఉగ్రసేనుని  వద్ద  అనుమతి  తీసుకొనెను.  పుత్రులను, అంతఃపురస్త్రీలను  సామగ్రితో  సహా  ముందు  పంపించెను.  తరువాత  ఆయన  సారథి తీసుకువచ్చిన  తన  రథమునెక్కెను.  ఆ  రథముపై  గరుడధ్వజము  రాజిల్లెను.

తరువాత  శ్రీకృష్ణుడు  తన  సేన  చుట్టువారి  రాగా  బయల్దేరెను.  రథములు, ఏనుగులు,  గుర్రములు,  పదాతులతో  కూడిన  ఆ  సేనను నాయకులు నడిపించగా మిక్కిలి  భయమును  గొల్పెను.  మద్దెళ్లు,  భేరీలు, తప్పెటలు, శంఖములు, కొమ్ము బూరాల  ధ్వనులతో  దిక్కులు  దద్దరిల్లెను.

రుక్మిణి  మొదలగు  పతివ్రతలు  తమ  సంతానముతో  బాటుగా  బంగరు శిబికలపై  భర్తయగు  శ్రీకృష్ణ  భగవానుని  వెంట  వెళ్లిరి.  ఆ  శిబికలను  వేగముగా నడిచే జనులు  మోసిరి.  శ్రేష్ఠమైన  వస్త్రములు, ఆభరణములు, అంగరాగములు, మాలలు అనువాటిని  ధరించిన  ఆ యువతులను కత్తి, డాలు చేతులయందు పట్టుకున్న భటులు సమర్థముగా  రక్షించుచుండిరి.

పరిచారికలు,  వేశ్యాంగనలు  చక్కగా  అలంకరించుకొని  అన్ని  రకముల ప్రయాణసాధనములపై  వెళ్లిరి.  వారు  మనుష్యులు  మోసే  పల్లకీలపై, ఎద్దులు దున్నలు గాడిదలు  కంచరగాడిదలు  లాగే  బళ్లపై,  ఏనుగుల  అంబారీలపై  వెళ్లిరి.  వారు చాప డేరాలను, కంబళ్లను, వస్త్రములు, పాత్రలు  మొదలైన  సామగ్రిని  గట్టిగా  కట్టుకొని  వెళ్లిరి.

సంకీర్ణమైన  ధ్వనులు  గల  శ్రీకృష్ణ  సైన్యములో  పెద్ద  జెండాల  వస్త్రములు, గొడుగులు,  వింజామరలు,  శ్రేష్ఠమైన  ఆయుధములు, ఆభరణములు,  కిరీటములు, కవచములు  అనునవి  సూర్యకిరణములు  పడి  ప్రకాశించినవి.  అప్పుడా సైన్యము తిమింగిలములతో,  కెరటములతో  కల్లోలముగానుండే  సముద్రమును  పోలెను.

యాదవప్రభుడు,  మోక్ష ప్రదాతయగు  శ్రీకృష్ణ  భగవానుని  దర్శనముచే నారద మహర్షియొక్క  ఇంద్రియములు  సంతుష్టములాయెను.  ఆయన  శ్రీకృష్ణునిచే సమర్పించబడిన  పూజాద్రవ్యములను  స్వీకరించి  ఆయన  చేసిన  సత్కారమును పొందెను. రాజసూయమునకు  వెళ్లవలెననే  ఆయన  నిశ్చయమును  విని,  తరువాత  ఆ మహర్షి  ఆయనకు  నమస్కరించి  ఆయననే  హృదయములో ధ్యానిస్తూ ఆకాశమార్గమున వెళ్లెను.

శ్రీకృష్ణ  భగవానుడు  రాజుల  దూతకు  ప్రీతిని  కలిగిస్తూ  ఇట్లు  పలికెను -- ఓ దూతా! భయపడకుడు.  మీకు  మంగళమగు  గాక!  నేను  మగధరాజగు  జరాసంధుని వధింప జేయగలను.

ఇట్లు  చెప్పబడిన  దూత  వెనుకకు  వెళ్లి  రాజులకు  ఉన్నది  ఉన్నట్లుగా చేప్పెను. వారు  తమను  కారాగారమునుండి  విడిపించుననే  ఆశతో  శ్రీకృష్ణుని  దర్శనమునకు ఎదురు చూచిరి.

శ్రీకృష్ణ  భగవానుడు  కొండలను,  నదులను,  నగరములను,  గ్రామములను, గొల్లపల్లెలను,  గనులను  దాటుకుంటూ  ఆనర్త  సౌవీర  మరు  దేశములను, కురుక్షేత్రమును  అతిక్రమించెను.

మోక్ష  ప్రదాతయగు  శ్రీకృష్ణుడు  క్రమముగా  దృషద్వతీనదిని,  సరస్వతీ నదిని, పంచాల  మత్స్యదేశములను  దాటి  ఇంద్రప్రస్థమును  చేరెను.

మానవులకు  శ్రీకృష్ణుని  దర్శనము  దుర్లభము.  ఆయన  వచ్చినాడని  విని శత్రువులు  లేని  ధర్మరాజు  ఆనందముతో  ఆచార్యులను,  బంధువులను  వెంట బెట్టుకొని నగరము బయటకు ఎదురేగెను.

ఆదరము  గల  ఆ  ధర్మరాజు,  ఇంద్రియములు  ముఖ్యప్రాణమునకు  వలె, ఇంద్రియాధిపతియగు  శ్రీకృష్ణ  భగవానునకు  ఎదురేగెను.  అధికమగు  గానవాద్యముల ఘోష, వేదధ్వని  ఆయన  వెంట ఉండెను.

మిక్కిలి  ప్రియుడగు  శ్రీకృష్ణుడు  ధర్మరాజునకు  చాల  కాలమునకు  కనబడెను. ఆయనను  చూచి  ధర్మరాజు  హృదయము  ప్రేమతో  ఆర్ద్రమాయెను.  ఆయనను ధర్మరాజు  మరల  మరల  కౌగిలించుకొనెను.

శ్రీకృష్ణ  భగవానుని  స్వచ్ఛమగు  దేహము  లక్ష్మీదేవికి  నిలయము.  ఆయనను కౌగిలించుటచే  ధర్మరాజుయొక్క  అశుభములు  తొలగిపోయెను.  ఆయన కన్నులు నీటితో  నిండి  శరీరము  గగుర్పాటును  చెందెను.  ఆయన  లోకవ్యవహారమును విస్మరించి  నిరతిశయమగు  ఆనందమును  పొందెను.    

భీముని  ఇంద్రియములు  ప్రేమయొక్క  వేగముచే  తొట్రుపాటు  జెందెను.  ఆయన నవ్వుతూ  మేనమామ  కొడుకగు  శ్రీకృష్ణుని  కౌగిలించి  ఆనందించెను.  కవలలగు నకుల సహదేవులకు,  అర్జునునకు  కూడ  ప్రేమతో  కన్నీళ్లు  ముంచుకు వచ్చెను.  వారు మిక్కిలి ప్రియమగు  బంధువైన  శ్రీకృష్ణభగవానుని  ఆనందముతో  కౌగిలించిరి.

శ్రీకృష్ణుని  అర్జునుడు  కౌగిలించగా,  నకుల  సహదేవులు  నమస్కరించిరి.  ఆయన బ్రాహ్మణులకు,  పెద్దలకు  వారి  యోగ్యతకు  తగ్గట్లుగా  నమస్కరించెను.

శ్రీకృష్ణుడు  కురు-సృంజయ- కేకయదేశముల   రాజులను  సమ్మానించగా, వారాయనను  సమ్మానించిరి.  సూతులు,  మాగధులు,  వందులు,  బ్రాహ్మణులు పద్మములవంటి  కన్నులు  గల  శ్రీకృష్ణుని  స్తుతించిరి. గంధర్వులు, విదూషకులు మద్దెళ్లను,  శంఖములను,  తప్పెటలను,  వీణలను,  ఉడుక్కములను,  కొమ్ము  బూరాలను వాయిస్తూ  పాడి నాట్యమాడిరి.

పావనము  చేసే  కీర్తి  గలవారిలో  శ్రీకృష్ణుడు  ప్రప్రథముడు.  బంధువులీ విధముగా  చుట్టువారి  స్తుతించుచుండగా  ఆయన  అలంకరించబడిన  నగరమును ప్రవేశించెను.

ఆ  నగరములో  ఏనుగుల  మదగంధముచే  వ్యాప్తమైన  వీథులలో  నీళ్లు చల్లబడెను. రంగు  రంగుల  జెండాలు,  బంగరు  తోరణములు,  పూర్ణకుంభములతో  ఆ నగరము  అధికముగా  రాజిల్లెను.  పరిపుష్టములైన  దేహములు  గల  అచటి స్త్రీపురుషులు  కొత్త  వస్త్రములను,  అలంకారములను,  మాలలను,  పరిమళద్రవ్యములను ధరించియుండిరి.

శ్రీకృష్ణుడు  కురురాజగు  ధర్మరాజుయొక్క  అంతఃపురమును  చూచెను. జెండాలతో  ప్రకాశించే  ఆ  అంతఃపురమునందు  ప్రతి  గృహము  దీపములతో, పుష్పాదులతో  అధికముగా  ప్రకాశించెను.  ఆ అంతఃపురమునందలి  భవనముల పైభాగమునందు  వెండితో  చేసిన  పెద్ద  పీఠములపై  బంగరు  కలశములు  ఉండెను. కిటికీల  గుండా  బయల్వెడలే  ధూపములతో  ఆ  భవనములు  ప్రకాశించెను.

శ్రీకృష్ణుని  ఆనాటి  మానవులు  ప్రేమతో  నిండిన  కళ్లతో  చూచెడివారు.  ఆయన రాజమార్గములో  వెళ్లుచున్నాడని  విని  యువతులు  ఇంటి  పనిని,  మరికొందరు శయ్యలపై  భర్తలను  కూడ వెంటనే  విడిచి  చూచుటకు  వెళ్లిరి.  ఉత్కంఠచే  వారి  జుట్టు కొప్పులు, కోక ముడులు జారిపోవుచుండెను.

ఏనుగులు, గుర్రములు, రథములు, పదాతులతో రాజమార్గము చాల రద్దీగానుండెను. యువతులు ఇళ్ల పై భాగములమీద యెక్కి భార్యలతో కూడియున్న శ్రీకృష్ణుని చూచిరి. వారాయన పై పూలను చల్లి మనస్సులో కౌగలించుకొని ఆదరముతో నిండిన చూపులతో సుస్వాగతము పలికిరి.

స్త్రీలు మార్గములో చంద్రునితో కూడిన తారలను పోలిన శ్రీకృష్ణ భగవానుని భార్యలను చూచి ఇట్లు పలికిరి -- వీరు ఏమి పుణ్యమును చేసిరో? పురుషోత్తముడు ఔదార్యయుక్తమైన చిరునవ్వుతో, విలాసపు చూపుయొక్క లేశముతో వీరి కళ్లకు సుఖమును విస్తరింపజేయును.

అక్కడక్కడ పౌరులు, శిల్పజీవులు' చేతులలో మంగళద్రవ్యములతో దగ్గరకు వచ్చి శ్రీకృష్ణుని పూజించిరి. దానిచే వారి పాపములు నశించెను.

అంతఃపురస్త్రీలు కంగారు పడుతూ ప్రేమచే విప్పారిన కన్నులు గలవారై శ్రీకృష్ణ భగవానుని ఎదురు వచ్చి సత్కరించిరి. అప్పుడాయన రాజమందిరమును ప్రవేశించెను.

కోడలు ద్రౌపదితో కూడియున్న కుంతి సోదరుని పుత్రుని చూచి మనస్సులో ఆనందించెను. ఆమె శయ్యపైనుండి లేచి ముల్లోకములకు ప్రభువగు శ్రీకృష్ణుని కౌగిలించుకొనెను.

దేవతలకు ప్రభువులగు బ్రహ్మాదులకు కూడ ప్రభుడగు శ్రీకృష్ణ భగవానుని ధర్మరాజు ఇంటికి దోడ్కొని వచ్చెను. కాని, ఆయన అతిశయిం చిన ఆనందముచే పరవశుడై పూజాక్రమమునైననూ తెలియకుండెను.

ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు తన తండ్రి సోదరియగు కుంతికి, పెద్దల భార్యలకు నమస్కారము చేసెను. సోదరి సుభద్ర, ద్రౌపది కూడ ఆయనకు నమస్కరించిరి.

రుక్మిణి, సత్యభామ, భద్ర, జాంబవతి, కాలింది, మిత్రవింద, లక్ష్మణ, పతివ్రత మరియు నగ్నజిత్తు కుమార్తె అగు సత్య అనే శ్రీకృష్ణుని భార్యలనందరిని, మరియు అచటకు విచ్చేసిన ఇతరస్త్రీలను కూడ, అత్తగారగు కుంతి ప్రేరేపించగా ద్రౌపది వస్త్రములు, పుష్పమాలలు, అలంకారములు, తాంబూలము మొదలగువాటితో సత్కరించెను.

దుష్ట జనశిక్షకుడగు శ్రీకృష్ణ భగవానునకు, ఆయన సైన్యమునకు, అనుచరులకు, మంత్రులకు, భార్యలకు కూడ ధర్మరాజు ప్రతిదినము కొత్త కొత్త ఏర్పాట్లతో సుఖమగు నివాసమును కల్పించెను.

శ్రీకృష్ణుడు అర్జునునితో కూడి ఖాండవవనమును సమర్పించి అగ్నిదేవునకు తృప్తి కలిగించెను. మయుని అగ్నినుండి విడిపించగా, ఆయన ప్రకాశించే సభను నిర్మించి ధర్మరాజునకు సమర్పించెను.

  శ్రీకృష్ణుడు ధర్మరాజునకు ప్రీతిని కలిగించగోరి అక్కడనే కొన్ని నెలలు నిరంతరముగా నివసించెను. ఆయన సేవకులు వెంట రాగా అర్జునునితో కలిసి రథమునెక్కి విహరిస్తూ కాలమును గడిపెను,

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో

శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థమునకు విచ్చేయుటను వర్ణించే

డెబ్బది ఒకటవ అధ్యాయము ముగిసినది (71).

* * * * *