భాగవత మహా పురాణము
55 - ప్రద్యుమ్నుని జన్మ - శంబరాసురుని వధ
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- వాసుదేవుని అంశయగు కాముడు పూర్వము రుద్రుని కోపముచే తగుల పెట్టబడినాడు. ఆతడు మరల
దేహమును పొందుటకై వాసుదేవునే ఆశ్రయించెను.
ఆ కాముడే శ్రీకృష్ణుని వీర్యము వలన విదర్భరాజపుత్రికయగు రుక్మిణియందు జన్మించి ప్రద్యుమ్నుడని ప్రసిద్ధి గాంచేను. ఆతడు సకలగుణములచే తండ్రికి తీసిపోనివాడు.
కోరిన రూపు దాల్చే శంబరునకు తన శత్రువైన కాముడు ప్రద్యుమ్నుడుగా పుట్టినాడని తెలి సెను. ఇంకనూ ప్రద్యుమ్నుడు పది రోజులు నిండని పసివాడు. శంబరుడా పసివానిని అపహరించి సముద్రములో పారవైచి ఇంటికి వెళ్లాను.
బలవంతమైన చేప ఆ శిశువును మ్రింగెను. మత్స్యకారులు పెద్ద వల వేయగా, ఆ చేపతో బాటుగా మరికొన్ని చేపలు దానిలో చిక్కి పట్టబడినవి.
మత్స్యకారులు ఆ వింత చేపను శంబరునికి ఉపహారముగా సమర్పించిరి. వంటవాళ్లు దానిని వంటశాలకు తీసుకువెళ్లి కత్తితో కోసిరి.
ఆ చేప పొట్టలో పిల్లవానిని చూచి ఆ వంటవారు శంబరుని దాసియగు మాయావతికి విన్నవించిరి. ఆమెకు మనస్సులో శంక కలిగెను. అపుడు నారదుడామెకు ఆ బాలుడు కాముని అవతారమని, రుక్మిణికి జన్మించిన విషయమును, చేప పొట్టను చేరిన వైనమును సర్వమును చెప్పెను.
ఆమె రతి అని ప్రసిద్ది చెందిన కాముని పత్ని, పతివ్రత. వాని దేహము దహించబడగా, మరియొక దేహము కలుగుటకై ఆమె వేచి చూచు చుండెను.
ఆమె శంబరునిచే పప్పు-అన్నమును తయారు చేసే పనియందు నియోగించబడినది. ఆ పిల్లవాడు కామదేవుడేనని తెలిసి ఆమె అప్పుడా పిల్లవానియందు ప్రేమను కలిగియుండెను.
కృష్ణుని పుత్రుడగు ఆ ప్రద్యుమ్నుడు కొంత కాలమునకే యువకుడాయెను. ఆతనిని చూచే యువతులకు సమ్మోహము కలిగెడిది.
ఓ పరీక్షిన్మహారాజా! పొడవాటి చేతులు గల ఆ ప్రద్యుమ్నుడు పద్మపు రేకుల వలె విశాలమైన కన్నులతో మానవలోకమునందే అందగాడుగ నుండెను. ఆ మాయావతి అట్టి భర్తను సిగ్గుతో కూడిన చిరునవ్వుతో కనుబొమలు నాట్యమాడుచుండగా ప్రేమతో చూస్తూ, ప్రేమను ప్రకటించే హావభావములతో సేవించెను.
కృష్ణుని పుత్రుడగు ప్రద్యుమ్న భగవానుడామెతో నిట్లనెను -- అమ్మా! నీ బుద్ది విపరీతముగా నున్నది. నీవు తల్లి ప్రేమను అతిక్రమించి కాముకురాలు వలె ప్రవర్తిల్లుచున్నావు.
రతిరువాచ ।
రతి ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! శ్రీకృష్ణభగవానుని పుత్రుడవగు నిన్ను శంబరుడు ఇంటి నుండి అపహరించి తెచ్చినాడు. నేను పూర్వజన్మయందు నీ ధర్మపత్నినగు రతీదేవిని. నీవు కాముడవు.
ఓ ప్రభూ! పది దినముల వయస్సు కూడ లేని నిన్ను శంబరాసురుడు సముద్రములో పారవేయగా చేప మ్రింగెను. ఆ చేపపొట్టలోనున్న నీవు ఇచటకు చేరుకుంటివి.
నీ శత్రువగు అట్టి ఈ శంబరుని వశము చేసుకొనుట గాని, జయించుట గాని కష్టమే. ఈతడు వందల మాయలు తెలిసినవాడు. నీవు కూడ మోహనము (శత్రువునకు మూర్చ వచ్చునట్లు చేయుట), శోషణము (శత్రువునకు తీరని దప్పిక కలుగుట) మొదలైన మాయలచే వధించుము.
తన కొడుకు దూరము కాగా కొడుకునందలి ప్రేమచే వ్యాకులపడు చున్న నీ దీనురాలగు తల్లి లకుముకి పిట్ట వలె, దూడను పోగొట్టుకున్న ఆవు వలే, దుఃఖించుచున్నది.
మాయావతి ఇట్లు పలికి మహాత్ముడగు ప్రద్యుమ్నునకు మహామాయ అనే విద్యను ఉపదేశించెను. ఆ విద్య సకలమాయలను నశింప జేయును.
ఆ ప్రద్యుమ్నుడు కూడ శంబరుని వద్దకు వెళ్లి, ఆతనిని సహించ శక్యము కాని కటువైన మాటలతో నిందిస్తూ, కలహమును సృష్టించి, యుద్ధమునకు సవాలు విసిరెను.
చేడు మాటలతో నిందించబడిన ఆ శంబరుడు కాలితో తొక్కబడిన పాము వలే నుండెను. కోపముతో ఎర్రనైన కన్నులు గల ఆతడు గద చేతితో పట్టుకొని బయటకు వచ్చెను.
శంబరుడు గదను త్రిప్పి మహాత్ముడగు ప్రద్యుమ్నునిపై వేగముగా విసిరి, పిడుగుపాటు వలె మిక్కిలి కఠోరమైన నాదమును చేసెను.
ఓ రాజా! మీదకు వచ్చి పడుచున్న ఆ గదను ప్రద్యుమ్న భగవానుడు గదతో త్రోసివేసి కోపముతో తన గదను శత్రువగు శంబరునిపై విసి రెను.
ఆ శంబరాసురుడున్నూ రాక్షసమాయనాశ్రయించి ఆకసమునందున్న వాడై శ్రీకృష్ణుని పుత్రుడగు ప్రద్యుమ్నునిపై ఆయుధముల వర్షమును కురిపించెను. ఆ మాయను మయుడు కనుగొనెను.
రుక్మిణి పుత్రుడగు ప్రద్యుమ్నుడు గొప్ప రథికుడు. ఆయన ఆయుధముల వర్షముచే పీడించబడినవాడై మహావిద్యను ప్రయోగించెను. సత్త్వగుణప్రధానమగు ఆ విద్య సకలమాయలను మట్టుబెట్టును.
తరువాత శంబరాసురుడు యక్ష-గంధర్వ-పిశాచ-నాగ-రాక్షసులకు చెందిన వందలాది మాయలను ప్రయోగించగా, శ్రీకృష్ణ పుత్రుడగు ఆ ప్రద్యుమ్నుడు వాటిని చెల్లాచెదరు చేసెను.
ప్రద్యుమ్నుడు వాడి కత్తితో శంబరుని తలను బలముగా మొండెమునుండి వేరు చేసెను. ఆ తలకు కిరీటము, కుండలములు, ఎర్రని గెడ్డము మీసములు ఉండెను.
దేవతలు ప్రద్యుమ్నుని స్తుతిస్తూ దోసిళ్లతో పూలను కురిపించిరి. ఇంతలో మాయావతి ఆకాశమునందు సంచరిస్తూ ఆయనను ఆకాశమార్గము గుండా ద్వారకానగరమునకు తీసుకువెళ్లాను.
ఓ పరీక్షిన్మహారాజా! ప్రద్యుమ్నుడు భార్యతో గూడి వందలాది యువతులతో హడావుడిగానుండే గొప్ప (రుక్మిణి) అంతఃపురమును ఆకాశమునుండి, మెరుపుతో కూడిన మేఘము వలె, ప్రవేశించేను.
మేఘము వలే నల్లని ఆ ప్రద్యుమ్నుడు పచ్చని పట్టు వస్త్రమును దాల్చెను. పొడవాటి చేతులు గల ఆయన కన్నులు తేనె రంగు కలిగియుండెను. ఆయన మోము చక్కని చిరునవ్వుతో అందముగా నుండెను. నల్లని గిరజాల ముంగురులనే తుమ్మెదలే పద్మమును పోలిన ఆయన ముఖమునకు చక్కని అలంకారములాయెను. ఆయనను చూచి అంతఃపురస్త్రీలు శ్రీకృష్ణుడని తలచి లోపల అక్కడక్కడ నక్కిరట.
ఆ స్త్రీలు మెల్లగా ప్రద్యుమ్నునికి శ్రీకృష్ణునికి కొద్ది తేడాను నిశ్చయముగా గుర్తించి దగ్గరగా వచ్చిరి. గొప్ప యువతితో కూడియున్న ఆతనిని చూచి వారు గొప్ప ఆశ్చర్యమును, ఆనందమును కూడ పొందిరి.
నల్లని కనుకొనలతో మధురముగా మాటలాడే విదర్భరాజకుమారి రుక్మిణి అపుడచటకు వచ్చెను. ఆమె పాలిండ్లు ప్రేమతో పాలను స్రవించెను. ఆమెకు తప్పిపోయిన తన పుత్రుడు గుర్తుకు వచ్చెను.
మానవులలో శ్రేష్ఠుడగు ఈతడు ఎవడు? ఈ కలువ కన్నులవాడు ఎవరివాడు? ఈతనిని నవమాసాలు మోసి కన్న తల్లి యెవరో? ఈతడు భార్యగా పొందిన ఈ యువతి ఎవరై యుండును?
నా పుత్రుడు కూడ తప్పిపోయినాడు. పురిటి యింటినుండియే అపహరించబడిన ఆ బాలుడు ఎక్కడో అక్కడ జీవించియున్నచో, వయస్సు, రూపు ఈతనిని పోలియుండును.
ఆకారము, అవయవములు, నడక, మాట, నవ్వు, చూపులు అనువాటిలో ఈతడు శార్ఙమనే ధనుస్సు గల శ్రీకృష్ణ భగవానునితో సమానముగా ఉన్నాడు. ఇది ఎట్లు ఘటిల్లినది? -
నాకు వీనియందు అధికమగు ప్రీతి కలుగుచున్నది. నా ఎడమ చేయి అదురుచున్నది. నేను గర్భములో ధరించిన పిల్లవాడు నిశ్చయముగా ఈతడే అయి ఉండును.
విదర్భరాజకుమారియగు రుక్మిణి ఈ విధముగా తర్కించుచుండెను. ఇంతలో దేవకి పుత్రుడు, పవిత్రకీర్తి అగు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులతో గూడి విచ్చే సెను.
దుష్టజనశిక్షకుడగు శ్రీకృష్ణ భగవానుడు విషయమంతా తెలిసినా మిన్నకుండెను. శంబరుడు పిల్లవానిని అపహరించుట, మాయావతిని కలుసుకొనుట మొదలగు వివరములనన్నింటినీ నారదుడు వివరించెను.
ఆ గొప్ప అద్బుతమును శ్రీకృష్ణుని అంతఃపురములోని స్త్రీలు విని ప్రద్యుమ్నుని అభినందించిరి. ఆతడు చాల సంవత్సరములు తప్పిపోయి, మరణించినవాడే తిరిగి వచ్చినాడా యన్నట్లుండెను.
దేవకీ, వసుదేవుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, రుక్మిణి, అంతఃపురస్త్రీలు కూడ ఆ దంపతులను కౌగిలించి ఆనందించిరి.
తప్పిపోయిన ప్రద్యుమ్నుడు తిరిగి వచ్చినాడని విని ద్వారకానగరవాసులు ఇట్లు పలికిరట -- ఆహా! మంగళము. మరణించిన పిల్లవాడు తిరిగి వచ్చినాడా అన్నట్లున్నది.
ప్రద్యుమ్నుడు పూర్తిగా తండ్రియగు శ్రీకృష్ణుని పోలియుండెను. ఆతనిని చూచి కృష్ణపత్నులు పలు మార్లు తమ భర్త అని తలపోసి ఏకాంతమునందు ప్రేమను భావన చేసెడివారు. కాని, వెంటనే తెలుసుకొని ఆతనితో - యథోచితముగా వ్యవహరించెడివారు. లక్ష్మీదేవికి పెనిమిటియగు శ్రీహరియొక్క అవతారమైన శ్రీకృష్ణునకు పుత్రుడగు కాముని విషయములో ఇట్టి భ్రాంతి కలుగుట విచిత్రము కానే కాదు. సాక్షాత్తు కాముడు ఎదురుగా నుండగా, ఇతరస్త్రీలు ప్రేమను పొందిరని వేరుగా చెప్పవలయునా?
శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో
ప్రద్యుమ్నుని జన్మను, శంబరాసురుని వధను వర్ణించే
ఏబది యైదవ అధ్యాయము ముగిసినది .
Summary of chapter 55 of the Bhāgavata Mahā Purana is as follows:
To Rukmiṇī-devī and Śrī Kṛshṇa was born a son named Pradyumna, an expansion of Kāmadeva (the god of love). When Pradyumna was ten days old, the demon Śambara, knowing that this child was destined to kill him, kidnapped the infant from the maternity room and threw him into the ocean. The baby was swallowed by a massive fish, which was subsequently caught by fishermen and brought to the kitchen of Śambara. When the fish was sliced open, the child was found unharmed. Māyāvatī (Rati), who was working in Śambara's household, raised the child under the guidance of Devarshi Nārada. When Pradyumna grew into a radiant youth, Māyāvatī revealed his true identity as Kṛshṇa's son. Pradyumna challenged Śambara to single combat, decapitated the demon with his sword, and returned to Dvārakā alongside Māyāvatī, where Rukmiṇī and Kṛshṇa received their long-lost son with boundless joy.