భాగవత మహా పురాణము
67- ద్వివిదుని ఉద్ధరించుట
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- అవినాశియగు బలరాముడు ఇంద్రియగోచరము కాని స్వరూపము గలవాడు. సర్వసమర్థుడగు ఆయన ఆశ్చర్యకరములగు చేష్టలను చేయును. ఆయన ఇంకా ఏమి చేసినాడో, వాటిని వినగోరుచున్నాను. .
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ద్వివిదుడని ప్రసిద్ధి గాంచిన వానరుడొకడు గలడు. పరాక్రమశాలియగు ఆతడు: నరకుని మిత్రుడు, సుగ్రీవుని మంత్రి, మైందుని సోదరుడు.
ఆ వానరుడు మిత్రుడగు నరకుని ఋణమును తీర్చుకొనుటకై దేశమునకు ఉపద్రవమును కలిగించెను. ఆతడు నగరములకు, గ్రామములకు, గనులకు, గొల్లపల్లెలకు నిప్పు పెట్టి తగులబెట్టేను.
ఒకప్పుడు 'ఆతడు పర్వతశిఖరములను పెల్లగించి వాటితో జనావాసములను నుగ్గు నుగ్గు చే సెను. ఆతడు తన మిత్రుడగు నరకుని సంహరించిన శ్రీకృష్ణ భగవానుడు ఉన్న కారణంగా ఆనర్త దేశమునకు మరింత ఉపద్రవమును చేసెను.
పది వేల ఏనుగుల బలము గల ఆ ద్వివిదుడు ఒకప్పుడు సముద్రము మధ్యలో నిలబడి రెండు చేతులతో నీటిని పైకి లేపి, సముద్రతీరమునందలి జనావాసములను ముంచెడివాడు.
దుష్టుడగు ద్వివిదుడు మహర్షుల ఆశ్రమములలోని చెట్లను విరుగకొట్టి, యజ్ఞమునకు చెందిన అగ్నులను మలమూత్రాలతో కలుషితము చేసెను. .
పొగ రెక్కిన ఆ ద్వివిదుడు స్త్రీపురుషులను పర్వతముల లోయలలోని గుహలలో బంధించి వాటి ముఖములను బండరాళ్లతో మూసివేసి, భ్రమరము పురుగును గూడులో వలె, బంధించెడివాడు.
ఈ విధముగా ఆతడు జనావాసములకు ఉపద్రవమును చేస్తూ, కులస్త్రీలను కూడ చెడగొట్టుచుండెను. ఆతడు మిక్కిలి శ్రావ్యమగు పాటను విని రైవతకపర్వతము పైకి వెళ్లాను.
అచట ఆతనికి యాదవప్రభుడగు బలరాముడు కనబడెను. మిక్కిలి అందమైన అన్ని అవయవములు గల బలరాముడు పద్మముల మాలను దాల్చి యువతుల సమూహము మధ్యలోనుండెను.
మదిరను త్రాగి పాడుచున్న ఆయన కన్నులు మత్తుచే స్వాధీనత తప్పెను. ఆయన దేహముచే మదించిన ఏనుగు వలె ప్రకాశించుచుండెను.
ద్వివిదుడు దుష్టవానరుడు. ఆతడు చెట్టెక్కి చెట్లను ఊపుతూ తాను అందరికీ కనబడునట్లు కిలకిలధ్వనిని చే సెను.
బలరాముని భార్యలు చపలస్వభావము, పరిహాసము నందు ప్రీతి గల యువతులు. వారా వానరముయొక్క పొగరు చూచి ఎక్కువగా నవ్విరి.
బలరాముడు చూస్తున్నా లెక్క చేయకుండా ఆ వానరుడు ఆ స్త్రీలకు యెదురుగా వచ్చి కనుబొమలను విరుచుట, పళ్లను ఇకిలించుట మొదలగు చేష్టలను చేసెను. వారికి తన గుదమును చూపి అవ హేళనము చేసెను.
యుద్ధవీరులలో శ్రేష్ఠుడగు బలరాముడు కోపించి ఆ ద్వివిదుని రాతితో కొట్టగా, ధూర్తుడైన ఆ వానరుడు నవ్వుతూ రాతిని తప్పించుకొని మద్యపాత్రను తీసుకొని పగులగొట్టెను. బలరామునకు కోపము వచ్చెను. ద్వివిదుడు బలవంతుడైన దుష్టుడు. బలముచే గర్వించియున్న ఆతడు వస్త్రములను లాగి చింపివేసెను. ఈ విధముగా ఆతడు బలరాముని తిరస్కరించి అపకారము చేసెను.
ద్వివిదుని ఆ పొగరును, వాడు జనావాసములకు కలిగించిన ఉపద్రవమును చూచి బలరాముడు మండిపడెను. ఆ శత్రువును చంపగోరి ఆయన రోకలిని, నాగలిని కూడ తీసుకొనెను.
గొప్ప పరాక్రమము గల ద్వివిదుడు కూడ చేతితో చెట్టును పెకిలించి వేగముతో ఎదురుగా వచ్చి, దానితో బలరాముని తలపై కొట్టెను.
బలశాలియగు బలరాముడు పర్వతము వలె అవిచలితుడై, తలపై పడుచున్న ఆ చెట్టును పట్టుకొని, సునందమనే రోకలితో వానిని కొట్టెను.
రోకలితో తలపై కొట్టబడిన ద్వివిదుడు జేగురుతో కూడిన పర్వతము వలే విరాజిల్లేను. ఆతడా దెబ్బను సరుకు చేయకుండా, బలముగా మరల ఇంకో చెట్టును ఊడబెరికి దాని ఆకులను దూసివేసి దానితో బలరాముని కొట్టెను. మిక్కిలి కోపించిన బలరాముడు ఆ చెట్టును వంద ముక్కలు చేసెను. ద్వివిదుడు తరువాత కోపముతో ఇంకో చెట్టుతో కొట్టెను. బలరాముడు దానిని కూడ వంద ముక్కలు చేసెను.
ఈ విధముగా ద్వివిదుడు బలరామ భగవానునితో యుద్ధము చేయుచుండెను. ఆతడు చెట్టుతో కొట్టుట, బలరాముడు దానిని ముక్కలు చేయుట, ఈ తీరున మరల మరల యుద్ధము జరిగెను. ఆతడు అడవిలో అన్ని వైపులనుండీ చెట్లను ఊడలాగి ఆ అడవిలో చెట్లు లేకుండా చేసెను.
తరువాత ద్వివిదుడు కోపించి బలరామునిపై రాళ్లవానను కురిపిం చెను. ఆయన రోకలి అనే ఆయుధముతో రాళ్లనన్నింటినీ పిండిగా చేసెను.
వానరశ్రేష్ఠుడగు ఆ ద్వివిదుడు రెండు చేతులను పిడికిలిగా చేసి, రోహిణి పుత్రుడగు బలరాముని సమీపించి, ఆ రెండు చేతుల పిడికిలితో వక్షఃస్థలము పై కొట్టెను.
యాదవశ్రేష్ఠుడగు బలరాముడు కూడ రోకలిని, నాగలిని విడిచి పెట్టెను. ఆయన కోపముగా వానిని రెండు చేతులతో కొంకులయందు కొట్టగా, వాడు రక్తమును గ్రక్కుతూ నేల గూలెను.
కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆతడు నేల గూలుచుండగా, రాళ్ల పలకలతో చెట్లతో సహా ఆ పర్వతము, గాలికి సరస్సులోని పడవవలె, కంపించెను.
ఆకాశమునందు దేవతలు, సిద్దులు, మహర్షులు పూల వానను కురిపిస్తూ జయము, నమస్కారము, బాగు బాగు అనే శబ్దములను చేసిరి.
లోకమునకు ఉపద్రవమును కలిగించే ద్వివిదుని బలరామ భగవానుడీ విధముగా సంహరించెను. జనులు కొనియాడుచుండగా ఆయన ద్వారకా నగరమునకు తిరిగి వచ్చెను.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో ద్వివిదుని ఉద్దారమును వర్ణించే అరువది ఏడవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 67 of the Bhāgavata Mahā Purana is as follows:
A powerful ape named Dvivida, who was a former minister of Sugrīva and a friend of Narakāsura, went mad with grief over Narakāsura's death and began terrorizing coastal towns, destroying Vaidika hermitages, and flooding agricultural fields. Dvivida arrived at Mount Raivataka near Dvārakā, where Lord Balarāma was enjoying forest pastimes with celestial maidens. The arrogant gorilla insulted Balarāma, tore up trees, and threw stones at the assembly. Lord Balarāma stepped forward unarmed. When Dvivida struck Balarāma's chest with his heavy fists, Balarāma struck the ape on his collarbone with His mighty fist, shattering his bones and killing the monster instantly, earning the gratitude of the rishis and devatās.