75 – రాజసూయము సమాప్తమగుట - దుర్యోధనునకు అవమానము

రాజోవాచ

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ శుక మహర్షి! శత్రువులే లేని ధర్మరాజుయొక్క రాజసూయయాగము గొప్ప ఉత్సవమాయెను. దానికి విచ్చేసిన బ్రాహ్మణులు, మహర్షులు, దేవతలు అందరు సంతోషించిరి. దుర్యోధనుడు మాత్రమే సంతోషించలేదు, అని మేము వింటిమి. దానికి కారణమేమియే చెప్పుడు.

ఋషిరువాచ

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- నీ తాతగారు మహాత్ముడు ధర్మరాజు రాజసూయయాగమును చేసినప్పుడు ప్రేమబంధము గల బంధువులు ఆయనకు సేవలనందించిరి.

భీముడు వంటశాలకు, దుర్యోధనుడు కోశాగారమునకు అధ్యక్షులు. సహదేవునకు అతిథిపూజ, నకులునకు సామగ్రిని సమకూర్చుట విధులు.

పెద్దల సేవలో అర్జునుడు, అతిథుల పాదములను కడుగుట అనే పనియందు శ్రీకృష్ణుడు, వడ్డనలో ద్రౌపది, దానమునందు పెద్ద మనస్సు గల కర్ణుడు నియుక్తులైరి.

ఓ పరీక్షిన్మహారాజా! యుయుధానుడు, వికర్ణుడు, హార్దిక్యుడు, విదురుడు, బాహ్లికుని సంతానమైన భూరిశ్రవసుడు మొదలగువారు, సంతర్ధనుడు, కృపాచార్యుడు మొదలైనవారు అప్పుడా గొప్ప యజ్ఞమునందు వివిధకార్యములలో నియోగించబడిరి. వారు ధర్మరాజునకు ప్రియమును చేయగోరి పనులను చేసిరి.

ఋత్విక్కులు, సభాసదులు, పండితులు, మిక్కిలి ప్రియులగు స్నేహితులు, బంధువులు మధురమగు వచనములచే, సత్కారములచే, దక్షిణలచే బాగుగా ఆరాధించబడిరి. చేదిరాజగు శిశుపాలుడు కూడ భక్తపాలకుడగు శ్రీకృష్ణ భగవానునీలో విలీనమాయెను. తరువాత వారు గంగానదిలో అవభృథస్నానమును చేసిరి.

అవభృథస్నానమహోత్సవమునందు మధేళ్లు, శంఖములు, డోళ్లు, నౌబత్తులు, తప్పెటలు, కొమ్ము బూరాలు మొదలైన పలు రకములు వాద్యములు మ్రోగినవి.

నాట్యకత్తెలు నాట్యమాడిరి. గాయకులు ఆనందముతో గుంపులుగా చేరి పాడిరి. వారి ఆ వీణల, వేణువుల, చప్పట్ల బిగ్గరయైన శబ్దము ఆకసమునంటేను.

రాజులు బంగరు మాలలను ధరించి బయలు దేరిరి. వారితో పాటుగా రంగు రంగుల జెండాల, టెక్కెముల కొనలు గల గొప్ప ఏనుగులు, రథములు, గుర్రములు, బాగా అలంకరించుకున్న భటులు వెంట నడిచిరి.

యదుసృంజయకాంబోజకురు కేకయకోసలదేశముల రాజులు యజ్ఞకర్త ధర్మరాజు వెనుక సైన్యములతో వెళ్లుచుండగా భూమి దడదడలాడెను.

సభాసదులు, ఋత్విక్కులు, బ్రాహ్మణశ్రేష్ఠులు అధికమగు వేధ ఘోషతో వెంట నడచిరి. దేవతలు, మహర్షులు, పితృదేవతలు, గంధర్వులు పూల వానను కురిపిస్తూ ప్రశంసించిరి.

గంధము, మాలలు, భూషణములు, వస్త్రములతో చక్కగా అలంకరించుకున్న స్త్రీపురుషులు పలు రకముల రసములను చల్లుతూ, ఇతరుల పై పోస్తూ విహరించిరి.

పురుషులు వేశ్యాస్త్రీలకు నూనె, పాలు, పెరుగు, గంధోదకము, పసుపు, కుంకుమ ముద్దలనలదగా, వారు కూడ వాటినీ పురుషులకు అలదుచున్నవారై విహరించిరి.

ఆ ఉత్సవమును చూచుటకు అంతరిక్షమునందు గొప్ప విమానములపై దేవతాస్త్రీలు వచ్చినట్లుగానే, భటులు రక్షించుచుండగా పల్లకీల పై ద్రౌపది మొదలగు మహారాణులు కూడ వచ్చిరి. పాండవుల మేనమామ (వసుదేవుడు) పుత్రుడగు శ్రీకృష్ణుడు, ఆయనయొక్క మిత్రులు మొదలగువారు వారిపై రంగులను చల్లిరి. అప్పుడు వారి మోములు సిగ్గుతో కూడిన చిరునవ్వుతో వికసించి ప్రకాశించినవి.

ఆ యువతుల దేహములు తడిసి అవయవములు, స్తనములు, ఊరువులు స్పష్టముగా కానవచ్చుచుండెను. ఉత్సాహముచే వారి జుట్టు ముడులు ఊడి పూలు జారుచుండెను. వారు పిచికారీలతో భర్తల సోదరులపై, మిత్రులపై రంగు నీళ్లను చల్లుతూ అందముగా విహరిస్తూ ఉంటే, మలినమైన అంతఃకరణము గలవారి చిత్తములు క్షోభిల్లేను.

చక్రవర్తియగు ఆ ధర్మరాజు మంచి గుర్రములను పూన్చి బంగరు మాలలు కట్టిన రథమును తన భార్యలతో గూడి అధిష్ఠించెను. ఆయన, వివిధ ప్రయాజాది అంగములతో కూడిన యజ్ఞరాజమగు రాజసూయము రూపు దాల్చినదా యన్నట్లు విశేషముగా భాసించెను.

ధర్మరాజు పత్నీసంయాజమనే కర్మను, అవభృథమునకు చెందిన కర్మలను అనుష్టించెను. అప్పుడు ఆ ఋత్విక్కులు ఆయనను ఆచమ నము చేయించి, ద్రౌపదితో సహా గంగానదిలో స్నానము చేయించిరి.

మానవుల దుందుభులతో సమానముగా దేవదుందుభులు కూడ మ్రోగినవి. దేవతలు, మహర్షులు, పితృదేవతలు, మానవులు పూల వానలను కురిపించిరి.

తరువాత వర్ణాశ్రమవంతులగు జనులందరు ఆ గంగలో స్నానము చేసిరి. అట్టి (అవభృథమునకు చెందిన) స్నానము వలన మహాపాపి కూడ వెంటనే పాపవిముక్తుడగును.

తరువాత ధర్మరాజు కొత్త పట్టు వస్త్రముల జతను దాల్చి చక్కగా అలంకరించుకొనెను. ఋత్విక్కులు, సభాసదులు, వేదవేత్తలు, కళాకారులు మొదలగువారిని ఆయన వస్త్రాభరణములతో సత్కరించెను.

శ్రీహరియొక్క అనన్యభక్తు డగు ధర్మరాజు బంధువులు జ్ఞాతులు అగు రాజులను, ఇష్టులను, ప్రియమిత్రులను, ఇతరులను కూడ పలుమార్లు పూజించెను.

పురుషులందరు  మణికుండలములను, మాలలను, తలపాగలను, చొక్కాలను, నాజూకు వస్త్రములను, మిక్కిలి విలువైన హారములను దాల్చి దేవతల వలె ప్రకాశించిరి. స్త్రీలు కూడ కుండలముల జంటతో, ముంగురుల గుంపులతో కూడి శోభిల్లే ముఖములు గలవారై బంగరు మొలనూలుతో విశేషముగా ప్రకాశించిరి.

ఓ పరీక్షిన్మహారాజా! తరువాత గొప్ప శీలము గల ఋత్విక్కులు, సభాసదులు, వేదవేత్తలు, బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులు, విచ్చేసిన రాజులు, దేవతలు, మహర్షులు, పితృదేవతలు, ఇతరప్రాణులు, అనుచరులతో కూడిన లోకపాలకులు పూజలనందుకొని ఆయన సెలవు పొంది తమ నివాసములకు వెళ్లిరి.

ధర్మరాజు రాజు మాత్రమే గాక శ్రీహరి భక్తుడు, ఋషి. జనులకు ఆయన చేసిన రాజసూయము యొక్క గొప్ప ఉత్సవమును ఎంత ప్రశంసీ స్తున్నా, అమృతమును త్రాగే మానవునకు వలె, తృప్తి కలుగనే లేదు.

తరువాత ధర్మరాజు మిత్రులను, సంబంధీకులను, బంధువులను, శ్రీకృష్ణుని కూడ వెళ్లిపోకుండా నిలిపివేసెను. ఎందుకంటే, వారి వియోగమంటేనే ఆయనకు దుఃఖము కలిగెను.

ఓ పరీక్షిన్మహారాజా! సాంబుడు, గదుడు మొదలైన యాదవవీరులను శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు పంపివే సెను. కాని, ఆ ధర్మరాజునకు ప్రీతిని కలిగించుటకై ఆయన తాను అచటనే నివసించెను.

రాజసూయమును చేయాలనే కోరిక సముద్రము వలె మిక్కిలి దాట శక్యము కానిది. ఈ విధముగా ధర్మరాజునకు శ్రీకృష్ణుని అనుగ్రహము వలన ఆ మనోరథము - పూర్ణమయ్యెను. ఆయన మనోవ్యథ దూరమాయెను.

శ్రీకృష్ణ భగవానునియందు లగ్న మైన మనస్సు గల ఆ ధర్మరాజుయొక్క అంతఃపురములోని సంపదను దుర్యోధనుడోకనాడు చూచెను. పైగా, ఆయనకు రాజసూయము వలన కలిగిన గొప్పదనమును కూడ చూచి ఆతడు పరితాపమును చెందెను.

ఆ అంతఃపురమునందు మయుడు మహారాజులకు, రాక్షసప్రభువులకు, దేవేంద్రునకు యోగ్యమైన పలు రకముల సంపదలను రచించెను. ద్రౌపది వాటితో భర్తలను సేవించెడిది. ద్రౌపదియందు లగ్న మైన మనస్సు గల కౌరవరాజగు దుర్యోధనుడు ఆ అంతఃపురమును చూచి పరితపించెను.

ఆ సమయములో ఆ అంతఃపురమునందు శ్రీకృష్ణునియొక్క భార్యలు వేయి మంది ఉండిరి. వారు శ్రేణీభారముచే మెల్లగా నడచుచుండగా గణగణలాడే అందేలు పాదములకు శోభనిచ్చెను. మిక్కిలి అందమైన (సన్నని) నడుము గల ఆ యువతుల హారములు స్తనములయందలి కుంకుమచే, ఎర్రనయ్యెను. కదలాడే కుండలములతో, ముంగురులతో సంపన్నమైన వారి మోములు గొప్పగా శోభిల్లెను.

ఒకనాడు మయుడు రచించిన సభయందు ధర్మరాజ చక్రవర్తి చుట్టూ ఆయన సోదరులు, బంధువులు, ఆయనకు చూపైన శ్రీకృష్ణుడు ఉండిరి.

ఆయన సాక్షాత్తు ఇంద్రుడు వలె బంగరు ఆసనములో చక్రవర్తియొక్క శోభతో కూర్చునియుండగా, స్తోత్రపాఠకులు స్తుతించుచుండిరి.

ఓ పరీక్షిన్మహారాజా! అదే సమయములో గర్విష్టియగు దుర్యోధనుడు సోదరులతో గూడి అచటకు వచ్చేను. కిరీటము, మాల, చేతిలో కత్తి గల ఆతడు కోపముతో (సేవకులను) తిట్టుచుండెను.

ఆతడు మయుని మాయచే వ్యామోహితుడై నేలను నీరని భ్రమపడి పంచే కొంగును పైకి పట్టుకొనెను; నేలయని భ్రమపడి నీటిలో పడెను.

ఓ పరీక్షిన్మహారాజా! భీముడు, స్త్రీలు, ఇతరరాజులు ఆ దుర్యోధనుని చూచి నవ్విరి. వారిని ధర్మరాజు వారించినా, శ్రీకృష్ణుడు అనుమోదించెను.

దుర్యోధనుడు సిగ్గుతో తల దించుకొని కోపముతో మండి పడుతూ మౌనముగా బయటకు వచ్చి.. హస్తినాపురమునకు వెళ్లిపోయెను. సత్పురుషులు అయ్యో! అయ్యో! అంటూ బిగ్గరగా హాహాకారమును చేసిరి. అజాతశత్రువగు ధర్మరాజు మనస్సు చెడినట్లాయెను. భూభారమును తగ్గించగోరే శ్రీకృష్ణ భగవానుడు మిన్నకుండెను. ఆయన చూపు కారణముగానే దుర్యోధనుడు భ్రాంతి పడెను.

ఓ పరీక్షిన్మహారాజా! ఈ రాజసూయ మహాయజ్ఞమునందు దుర్యోధనుని దుర్బుద్ధిని గురించి నీవు నన్ను ప్రశ్నించితివి. నేను నీ ప్రశ్నకు సమాధానమును చెప్పితిని.

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో రాజసూయము సమాప్తమగుటను, దుర్యోధనుని అవమానమును వర్ణించే డెబ్బది ఐదవ అధ్యాయము ముగిసినది (75).