భాగవత మహా పురాణము
4- యోగమాయ కంసునినుండి తప్పించుకొనుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- నగరమునకు లోపల, బయట కూడ ద్వారములన్నీ ముందులో వలెనే మూయబడి యుండెను. ఇంతలో (కుక్కల వంటి) కారాగార రక్షకులు శిశువు ఏడ్చిన ధ్వని విని నిద్ర లేచిరి.
ఆ రక్షకభటులైతే వెంటనే భోజప్రభువగు కంసుని వద్దకు వెళ్లి ఆ (ఎనిమిదవ పర్యాయము) గర్భవతియగు దేవకి ప్రసవించిన విషయమును విన్నవించిరి. ఆతడు ఆ క్షణము కొరకే ఆదుర్దాతో వేచి చూచుచుండెను.
ఈ శిశువు నాకు మృత్యువు (ఈ శిశువును మట్టు పెట్టే సమయమిదియే) అని కంగారు పడుతూ ఆ కంసుడు ప్రక్కమీదనుండి పైకి లేచి తూలుతూ (అపశకునము) వేంటనే పురిటి గదికి వెళ్లాను. ఆతని జుట్టు రేగిపోయి ఉండెను.
పతివ్రతయగు దేవకీదేవి దీనురాలై యుండెను. ఆమె అన్నగారగు కంసునితో జాలి కలిగే విధముగా ఇట్లు పలికెను -- ఓయీ మంగళకరుడా! ఈ అమ్మాయి నీ (మేనకోడలు. ఆడపిల్లను చంపుట నీకు తగదు.
అన్నా! (మా) ప్రారబ్ధము ప్రేరేపించగా నీవు నిప్పులాంటి పిల్లలను
ఓ రాజా! నా పుత్రులు చంపబడిరి. దీనురాలనగు నేను నీకు చెల్లెలిని గదా! అన్నా! అభాగ్యురాలగు నాకు ఈ ఆఖరి సంతానమైన అమ్మాయిని విడిచి పెట్టుట నీకు యోగ్యముగా నుండును.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆమె ఈ విధముగా ఏడుస్తూ పిల్లను దగ్గరగా పమిటలో దాచుకొని దీనాతిదీనముగా కోరెను. ఆ దుష్టుడు బలముగా త్రోసి చేతినుండీ ఆ శిశువును లాగివేసెను.
స్వార్థముచే కంసుని హృదయములోని ప్రేమ నిర్మూలితమయ్యెను. ఆతడు చెల్లెలికి అప్పుడే పుట్టిన ఆ అమ్మాయిని రెండు కాళ్లను పట్టుకొని రాతి పైభాగముపై వేసి కొట్టెను.
శ్రీహరి తరువాత జన్మించిన ఆ అమ్మాయి వెంటనే దేవియే. వాని చేతినుండి బాగా పైకి యెగిరి ఆకసమును చేరెను. ఆమె ఎనిమిది గొప్ప భుజములు, ఆయుధములు గలదియే కానవచ్చెను.
ఆ దేవి దివ్యమైన వస్త్రములను దాల్చి, మాలలను, రత్నములు పొదిగిన ఆభరణములను అలంకరించుకొనెను. ఆమె చందనము మొదలైన ఆలేపములను వినియోగించెను. ధనుస్సు, బాణములు, శూలము, కవచము, కత్తి, శంఖము, చక్రము, గదలను ఆమె (ఎనిమిది చేతులలో) ధరించెను.
సిద్ధులు, చారణులు, గంధర్వులు, అప్సరసలు, కిన్నరులు, నాగులు గొప్ప ఉపహారములను తీసుకువచ్చి ఆమెను స్తుతించుచుండిరి. ఆమే (కంసునితో) ఇట్లు పలికెను.
ఓరీ మూర్ఖా! నన్ను చంపి యేమి లాభము? నిన్ను మట్టుబెట్టే నీ పూర్వశత్రువు ఎక్కడో ఒకచోట జన్మించియే యున్నాడు. నీవు వ్యర్థముగా దీనులను హింసించకుము.
భగవానుని యోగమాయయగు ఆ దేవి కంసునితో ఈ విధముగా గంభీరముగా పలికెను. ఆమె భూలోకములో (కాశీ మొదలైన) వేర్వేరు స్థానములయందు (విశాలాక్షి మొదలైన) వేర్వేరు పేర్లతో ప్రసిద్ధి గాంచెను.
ఆ దేవి చెప్పిన మాటను విన్న కంసుడు మిక్కుటమగు అచ్చెరువును పొందెను. ఆతడు దేవకీవసుదేవులను విడిచి పెట్టి వినయముతో నిట్లనెను.
అయ్యో! అయ్యో! కష్టము! ఓ చెల్లీ! బావా! పాపినగు నేను మీ ఇద్దరి సంతానమైన చాలమంది కొడుకులను నరమాసంభక్షకుని వలే చంపితిని.
దయను త్రోసిపుచ్చి బంధువులను మిత్రులను విడిచి పెట్టిన దుష్టుడను నేను. అట్టి నేను ఏ నరకలోకములను పొందేదనో! బ్రహ్మహత్య చేసినవాడు వలె నేను గాలిని పీల్చుచున్ననూ చచ్చినవానితో సమానమే.
కేవలము మనుష్యులే కాదు, దైవము కూడ అసత్యమును చెప్పును. ఆ దైవము యొక్క మాటను నమ్మి, పాపినగు నేను పిల్లలను చంపితిని.
ఓ మహాత్ములారా! పుత్రులు తమ ప్రారబ్దముననుభవించెదరు. వారిని గురించి శోకించకుడు. దైవవశవర్తులై ఉండే ప్రాణులు అన్ని వేళలా ఒక్కచోట యుండరు; ఉన్నచోటనైననూ కలిసి ఉండరు (విడిపోయెదరు).
ఈ లోకములో మట్టితో కుండ మొదలైనవి తయారై, మరల అవి శిథిలమగును. కానీ మట్టి స్థిరముగా నుండును. అదే విధముగా, దేహములు పుట్టి గిట్టుచున్ననూ, ఈ ఆత్మ వికారములను పొందదు.
ఆత్మ అవికారి అనే ఈ సత్యమునీ విధముగా ఎవడైతే తెలుసుకోడో, వానికి అనాత్మలగు దేహాదులయందు ఆత్మబుద్ధి కలుగును. దాని వలన తాను సర్వమునుండి విడివడి ఉన్నాననే భేదబుద్ది కలుగును. దాని వలన ఆతడు దేహముతో సంయోగవియోగములను (పుట్టుక-చావులను) పొందుచుండును. అట్టి అజ్ఞానికి ఈ సంసారము తొలగిపోదు.
ఓ కల్యాణీ! నేను నీ పుత్రులను చంపిన మాట యథార్థమే. ఐననూ, నీవు వారిని గురించి శోకించకుము. ఎందుకంటే, ఏ ప్రాణికైననూ సుఖదుఃఖముల విషయములో స్వాతంత్యము లేదు. ప్రతి ప్రాణి తన కర్మఫలమును మాత్రమే పొందుచుండును.
ఆత్మస్వరూపమునెరుంగని వ్యక్తి ఇతరులు తనను పీడించినారనియు, తాను ఇతరులను పీడించినాననియు తలపోయును. ఎంతవరకైతే, అజ్ఞాని ఆ విధముగా దేహమే తాననే అభిమానమును కలిగియుండునో, అంతవరకు ఇతరులచే పీడించబడును, తాను ఇతరులను పీడించును.
నేను దుర్బుద్ధిని, నన్ను క్షమించుడు, సత్పురుషులు దీనులపై ప్రేమను చూపించెదరు, అంటూ వసుదేవుని బావమరది యగు కంసుడు కళ్ల వెంబడి నీళ్లు పెట్టుకొనెను. తరువాత ఆతడు చెల్లి-బావల రెండు కాళ్లను పట్టుకోనెను.
యోగమాయ చెప్పిన మాటను బట్టి దేవకీవసుదేవులయందు తప్ప లేదని కంసుడు నమ్మెను. ఆతడు తన ప్రేమను చూపుతూ వారిద్దరిని సంకెళ్లనుండి విడిపింప జేసెను.
అన్నయగు కంసుని అధికమగు పశ్చాత్తాపమును చూచి దేవకి వానిని క్షమించి, కోపమును విడిచి పెట్టెను. వసుదేవుడు కూడ నవ్వి కంసునితో నిట్లనెను.
ఓ మహాత్మా! నీవు చెప్పినది యథార్థమే. ప్రాణులయందు అజ్ఞానము వలన నేను అనే భేదబుద్ది ఉండును. దాని వలననే, వ్యక్తి తనవాడు, పరాయి వాడు అనే భేదమును చూపును.
భేదదృష్టి గల జనులు శోకము, హర్షము, ద్వేషము, లోభము, వ్యామోహము, గర్వములతో కూడియుందురు. కాలరూపుడగు ఈశ్వరుడు ఒక ప్రాణిని నిమిత్తముగా చేసి మరియొక ప్రాణిని మట్టుబెట్టును. ఈ సత్యమును ఆ జనులు తెలియ లేరు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- దేవకీవసుదేవులీ విధముగా ప్రసన్నమనస్కులై కంసునకు నిష్కపటమగు ఉత్తరమునిచ్చిరి. అపుడాతడు వారి వద్ద సెలవు తీసుకొని తన ప్రాసాదమునకు వెళ్లాను.
ఆ రాత్రి గడచెను. ఆ మరునాడు కంసుడు మంత్రులను పిలిచి, తనతో యోగమాయ ఏ మాటలను పలికెనో, వాటినన్నింటినీ వారికి వివరించెను.
దేవతలపై శత్రుత్వమును నెర పే ఆ దితిపుత్రులకు తెలివితేటలు (ధర్మాధర్మవిచారము) తక్కువ. కంసప్రభువు మాటను విని వారికి దేవతలపై కోపము వచ్చెను. వారు ఆతనితో నిట్లనిరి.
ఓ భోజరాజా! పరిస్థితి. ఇట్లున్న పక్షములో మనము నగరములలో, గ్రామములలో, గొల్లపల్లెలలో, ఇంకనూ ఇతరస్థానములలో పిల్లలను, వారికి పది రోజుల వయస్సు దాటినా దాటకున్నా, చంపి వేసెదము.
దేవతలకు యుద్దమంటే భయము. నీ నారి త్రాటి శబ్దములకు వారి మనస్సు ఎల్లవేళలా ఆందోళనతో నిండిపోవును. వారు యుద్ధోద్యమముల ద్వారా ఏమి సాధించెదరు?
(ఒకప్పుడు) నీవు బాణములను గుంపులుగా ప్రయోగించి అన్ని వైపులనుండియు కొట్టుచుండగా, దేవతలు బ్రదుకు దీపీతో యుద్దమును విడిచి పెట్టిరి. వారు పలాయనమే బ్రదికే ఉపాయమని తలచి పరుగెత్తిరి.
(ఆ యుద్ధములో) స్వర్గవాసులగు కొందరు దేవతలు ఆయుధములను విడిచి పెట్టి దీనముగా చేతులు జోడించిరి. మరికొందరి పంచకట్టులు, జుట్టుముడులు విడిపోతూంటే, మాకు భయం వేస్తోంది, అని పలికిరి.
ఆయుధప్రయోగమును అస్త్రమంత్రమును మరిచిపోయినవారిని, రథము లేనివారిని, భయముతో నిండియున్నవారిని, మరియొకనితో యుద్దము చేయుచున్నవారిని, యుద్ధమునుండి వెనుదిరుగుచున్నవారిని, ధనుస్సు విరిగిపోయినవారిని, యుద్ధము మానివేసినవారిని నీవు చంపవు.
భయము లేని చోట దేవతలు శూరులు. యుద్దము లేనప్పుడు యుద్దము లేని చోట వారు బీరాలు పలికెదరు. విష్ణువు పాల సముద్రమువంటి రహస్యస్థానములో నివసించును. శివుడు అడవిలో నివసించును. ఇంద్రుని పరాక్రమము అల్పము. బ్రహ్మదేవుడు తపస్సు చేసుకొనుచుండును. వీరి వలన మనకు కలిగే ముప్పు ఏమి ఉండును?
దేహములోని అవయవమునందలి వ్యాధిని ఉపేక్షి స్తే అది ఆ అవయవమునందు గట్టిగా నాటుకొనును. అప్పుడు మానవులు దానికి చికిత్సను చేయజాలరు. ఇంద్రియముల సమూహమును ముందుగా ఉపేక్షించినచో, తరువాత వాటిని నియమించుట సంభవము కాదు. అదే విధముగా శత్రువును ఉపేక్షించినచో, ఆతడు నాటుకున్న బలము గలవాడై పెద్దవాడగును. అప్పుడా శత్రువును చలింప జేయుట శక్యము కాదు.
దేవతలకు మూలము విష్ణువే గదా! ఎక్కడనైతే కాలాతీతమగు ధర్మము ఉండునో, విష్ణువు అక్కడ ఉండును. వేదము, గోవులు, వేదవేత్తలు, తపస్సు, దక్షిణలతో కూడిన యజ్ఞములు కూడ ఆ ధర్మమునకు మూలములు.
ఓ రాజా! కాబట్టి, వేదములనుపదేశించే వేదవేత్తలను, యజ్ఞములననుష్ఠించే స్వభావము గల తపశ్శాలురను, హోమధనములైన పాలను ఇచ్చే ఆవులను కూడా పూర్తి ప్రయత్నము చేసి అన్ని ప్రకారములుగా మట్టు బెట్టెదము.
వేదవేత్తలు, గోవులు, వేదములు, తపస్సు, సత్యము, బా హ్యేంద్రీయ నిగ్రహము, మనోనిగ్రహము, శ్రద్ధ, దయ, సహనము, మరియు యజ్ఞములు శ్రీహరికి శరీరమువంటివి.
ఎందుకంటే, ఆ విష్ణువు సకలదేవతలకు ప్రభువు. బుద్ధిగుహ యందుండే రాక్షసద్వేషి ఆతడే గదా! శివునితో సహా, బ్రహ్మ దేవునితో సహా సకల దేవతలకు ఆశ్రయమాతడే. ఆ విష్ణువును నిశ్చయముగా వధించే ఉపాయమేదనగా, మహర్షులను అధికముగా హింసించుటయే.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- దుర్బుద్ధియగు కంసాసురుడు మృత్యువుయొక్క పాశముచే కప్పివేయబడి యుండెను. ఆతడీ విధముగా దుష్టులగు మంత్రులతో సలహా చేసి, వేదవేత్తలను హింసించుట తనకు హితకారి యని తలచేను.
దిక్కులన్నింటియందలి సత్పురుషుల సమాజములకు దుఃఖమును కలిగించే పనియందు ఆతడు రాక్షసులను నియోగించి, తన ప్రాసాదమునందు ప్రవేశించెను. కోరిన రూపములను దాల్చగలిగే ఆ రాక్షసులకు పరపీడనమన్నచో ప్రీతి మెండు.
రజోగుణ (కామక్రోధాది) స్వభావము గల ఆ రాక్షసుల బుద్ధి అజ్ఞానముచే వ్యామోహితమై యుండెను. నిశ్చయముగా చావు దగ్గర పడిన ఆ రాక్షసులు సత్పురుషులకు హానిని కలిగించ జొచ్చిరి.
మానవుడు మహాత్ములను అనాదరము చేయుట వలన ఆయుష్టును, సంపదను, కీర్తిని, పుణ్యలోకములను, పుత్రాది కామ్యములను, సకలశ్రేయస్సులను కూడ కోల్పోవును.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్దములో యోగమాయ కంసునినుండి తప్పించుకొనుటను వర్ణించే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).
Summary of chapter 4 of the Bhāgavata Mahā Purana is as follows:
Vasudeva returned to the Mathurā prison cell with the newborn female infant. When the prison guards alerted Kaṁsa that Devakī had given birth, the tyrant rushed into the cell and seized the child by her feet, attempting to dash her against a stone slab. However, the infant slipped from his grasp, rose into the sky, and manifested her divine eight-armed form as the goddess Durgā (Yoga-māyā). Holding weapons in her hands, she announced to Kaṁsa that his deliverer and slayer had already been born elsewhere in the world. Stunned and terrified, Kaṁsa released Vasudeva and Devakī, apologizing for his cruelty. However, the next morning, advised by his wicked asuric ministers, Kaṁsa initiated a ruthless campaign ordering his demonic agents to search every village and execute all newborn infants throughout the kingdom.