భాగవత మహా పురాణము
74 - శ్రీకృష్ణ భగవానుని అగ్రపూజ - శిశుపాలుని ఉద్దారము
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా ధర్మరాజు జరాసంధుని వధను గురించి, సర్వసమర్థుడగు శ్రీకృష్ణుని మహిమను గురించి కూడ విని సంతోషించి ఆయనతో నిట్లనెను.
యుధిష్ఠిర ఉవాచ ।
ధర్మరాజిట్లు పలికెను -- నీనుండి ఆదేశమును పొందుటయే దుర్లభము. ముల్లోకములకు పూజనీయులగు బ్రహ్మాదులు, లోకపాలకులగు ఇంద్రాదులు అందరు నీ ఆదేశమును నిశ్చయముగా శిరసా వహించెదరు.
ఓ పరబ్రహ్మా! మేము దీనులము, పాలకులమని విర్రవీగువారము. కాని, పద్మములవంటి కన్నులు గల అట్టి నీవు మా ఆదేశమును పాలిస్తున్నావు. ఇది సుతరాము మానవుల చేష్టకు అనుకరణము మాత్రమే.
ఏలయన, పరబ్రహ్మ ఒక్కడు, రెండవది లేనివాడు, వ్యక్తియొక్క అంతరతమమగు ఆత్మస్వరూపుడు. ఆ పరబ్రహ్మకు సూర్యునకు వలె కర్మలచే తేజస్సులో వృద్ధి గాని, తగ్గుదల గాని లేవు.
పరాజయము లేని ఓ లక్ష్మీపతీ! నేను, నాది, నీవు, నీది అనే బుద్ది వికారమును చెందే దేహముతోడి తాదాత్మ్యము వలన కలుగును. పశువులకుండే అట్టి భేదబుద్ధి నీ భక్తులకు నిశ్చయముగా లేదు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి పలి కెను -- ఇట్లు పలికి కుంతీపుత్రుడగు ఆ ధర్మరాజు యజ్ఞమునకు యోగ్యమగు సమయమునందు యోగ్యులైన వేద వేత్తలగు బ్రాహ్మణులను శ్రీకృష్ణుని అనుజ్ఞతో ఋత్విక్కులనుగా వరణము చేసెను.
వేదవ్యాసుడు, భరద్వాజుడు, సుమంతుడు, గౌతముడు, అసితుడు, వసిష్ఠుడు, చ్యవనుడు, కణ్వుడు, మైత్రేయుడు, కవషుడు, త్రితుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, సుమతి, జైమిని, క్రతువు, పైలుడు, పరాశరుడు, గర్గుడు, వైశంపాయనుడు, అథర్వణుడు, కశ్యపుడు, ధౌమ్యుడు, పరశురాముడు, శుక్రాచార్యుడు, ఆసురీ, వీతిహోత్రుడు, మధు చ్ఛందసుడు, వీరసేనుడు, అకృతవ్రణుడు అనువారలు ఋత్విక్కులు.
ఇంతేగాక, ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు, బాహ్లికుడు మొదలగు ఇతరులను, ధృతరాష్ట్రుని, ఆతని పుత్రులను, గొప్ప బుద్ధిశాలియగు విదురుని కూడ ధర్మరాజు యజ్ఞమునకు ఆహ్వానించెను.
తరువాత ఆ ఋత్విక్కులు బంగరు నాగళ్లతో యజ్ఞభూమిని దున్నీ, అచట ధర్మరాజునకు యథావిధిగా యజ్ఞదీక్షను ఇచ్చిరి. పూర్వము వరుణుని యజ్ఞములో వలె ఆ యజ్ఞములో సామగ్రులు బంగారముతో చేసినవి.
ఇంద్రవరుణాదిలోకపాలకులు, బ్రహ్మదేవుడు, శివుడు, మహర్షులు, యక్షులు, రాక్షసులు, గరుడాది పక్షులు, కిన్నరులు, చారణులు పాండుమహారాజుయొక్క పుత్రుడగు ధర్మరాజుయొక్క రాజసూయమునకు విచ్చేసిరి. ఆయన ఆహ్వానమునందుకొని రాజులు, రాజపత్నులు కూడ అందరు విచ్చేసిరి. శ్రీకృష్ణ భక్తుడగు. ధర్మరాజునకు రాజసూయము సుసంపన్నమగుటలో ఆశ్చర్యము లేదని వారు తలపోసిరి.
దేవతలు వరుణుని వలె, దేవతల తేజస్సు గల ఋత్విక్కులు యథావిధిగా ధర్మరాజుచే రాజసూయయాగమును చేయించిరి.
సోమరసమును దంచే దినమునందు ధర్మరాజు మిక్కిలి ఏకాగ్రమగు చిత్తము గలవాడైఋత్విక్కులను, యజ్ఞమును పర్యవేక్షించే మహాత్ములను యథావిధిగా పూజించేను.
సభాసదులలో అగ్రపూజకు అర్హుడెవరు? అని సభాసదులు చర్చించి కూడ, చాల అభిప్రాయములుండుటచే ఒక నిర్ణయమునకు రాలేకపోయిరి. అప్పుడు సహదేవుడిట్లు పలికెను.
యాదవప్రభుడగు శ్రీకృష్ణ భగవానుడు సత్త్వగుణప్రధానులగు భక్తులకు పాలకుడు, స్వరూపచ్యుత లేనివాడు. అగ్రపూజకు ఆయనే అర్హుడు. సకల దేవతలు, దేశకాలములు, ధనధాన్యములు ఇత్యాది సర్వము ఈయన రూపములే.
ఈ జగత్తుక్క మరియు యజ్ఞముల యొక్క సారతత్త్వము ఈయనయే. అగ్నులలో మంత్రపూర్వకముగా ఆహుతులనిచ్చేది (కర్మమార్గము), యోగమార్గము, జ్ఞానమార్గము కూడ ఈయనను చేరుటకే ఉద్దేశించబడినవి.
రెండవది లేని ఒకే పరబ్రహ్మ, ఈ జగత్తుయొక్క సార తత్త్వము ఈయనయే. ఓ సభ్యులారా! పుట్టుక లేని ఈయన తానే ఆశ్రయముగా గల వాడై తనచే ఈ జగత్తును సృష్టించి పాలించి ఉపసంహరించుచున్నాడు.
ఈ లోకములో సకలమానవులు ఈ భగవానుని ప్రేరణచే వివిధకర్మ లను చేస్తూ, ఈయననుండియే ధర్మార్థకామములనే పురుషార్థములను పొందగోరుచున్నారు.
అందువలన, మహాత్ముడగు శ్రీకృష్ణునకు అగ్రపూజను చేయుడు. అట్లు చేసినచో, సకలప్రాణులకు తనకు కూడ పూజ చేసినట్లే యగును.
తాను చేసిన దానము అనంతఫలమునీయవలెనని కోరువాడు ఆ దానమును పూర్ణుడగు శ్రీకృష్ణునకీయవలెను. సకలప్రాణుల ఆత్మయగు ఆయనయందు భేదభావము, రాగద్వేషములు లేవు.
సహదేవుడు శ్రీకృష్ణుని మహిమ తెలిసినవాడు. ఆతడిట్లు పలికి మిన్నకుండెను. అచటి సత్పురుషులందరు ఆ వచనమును విని, బాగు బాగు అని ప్రశంసించిరి.
ధర్మరాజు మహర్షుల ఆ అనుమోదనమును విని ప్రీతుడాయెను. ఆయన సభౌసదుల అభిప్రాయమునెరింగి, ప్రేమతో విహ్వలుడై ఇంద్రియాంతర్యామియగు శ్రీకృష్ణ భగవానుని బాగుగా పూజించెను.
ధర్మరాజు భార్య, తమ్ములు, అమాత్యులతో గూడి ఆయన పాదము లను కడిగి, లోకములను పావనము చేసే ఆ నీటిని తలపై దాల్చెను.
ధర్మరాజు శ్రీకృష్ణునకు పట్టుతో చేసిన పచ్చని వస్త్రములను, మిక్కిలి విలువైన ఆభరణములను కూడ యిచ్చి సమ్మానము చేసెను. కన్నులు ఆనందాశ్రువులతో నిండుటచే ఆయన సరిగ్గా చూడలేకపోయెను.
ఈ విధముగా సత్కరించబడిన ఆ శ్రీకృష్ణుని చూచి జనులందరు దోసిలి యొగ్గి, నమస్కారము, సర్వోత్కర్షగా నుండుము, అని నమస్కరించిరి. పూల వర్షము కురి సెను.
దమ ఘోషసుతుడగు శిశుపాలునకు సహనము లేదు. జనుల వచనము లను, శ్రీకృష్ణుని గుణముల వర్ణనను విని ఆతనికి కోపము పుట్టెను. ఆతడు సభలో భయము లేకుండా తన ఆసనమునుండి పైకి లేచి చేతిని విసు రుతూ, శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి పరుషవచనములనిట్లు పలికెను.
సర్వమును శాసించే కాలమును ఎవ్వరూ అతిక్రమించలేరనే శ్రుతివచనము యథార్థము. ఎందుకంటే, పెద్దల బుద్ధి కూడ కుర్రవాని మాటలను విని పెడదోవ పట్టినది.
ఓ యజ్ఞపర్యవేక్షకులారా! మీరందరు పాత్ర (దానమునకు యోగ్యుడు) తెలిసినవారిలో శ్రేష్ఠులు. కృష్ణుడు అగ్రపూజకు యోగ్యుడని కుర్రవాడు చెప్పిన మాటను స్వీకరించవద్దు.
యజ్ఞమును పర్యవేక్షిస్తున్న మహర్షులు తపస్సు, విద్య, నియమనిష్టలు గలవారు. వారు ఉపాసనచే మనోమాలిన్యములను నశింపజేసి పరబ్రహ్మయందు నిలిచియుందురు. వారిని ఇంద్రాది లోకపాలకులు కూడ పూజింతురు. వారిని కాదని క్షత్రియవంశమునకు కళంకము తెచ్చిన ఈ పశుల కాపరి, కాకి పురోడాశమునకు వలే, అగ్రపూజకు ఎట్లు అర్హుడగును?
ఈతనికి వర్ణము కాని, ఆశ్రమము కాని, కులము గాని, సద్గుణములు గాని లేవు. సకలధర్మములకు బయట స్వైరముగా తిరిగే ఈతడు అగ్రపూజకు ఎట్లు అర్హుడగును?
ఎందుకంటే, వీరి కులమును యయాతి శపించినాడు. వీరి కులమువారు సర్వదా మద్యపానమునందు రమించెదరు గనుక ఆ కులమును సత్పురుషులు బహిష్కరించినారు. ఆ కులము వాడు అగ్రపూజకు అర్హుడెట్లగును?
వీరు బందిపోట్లు. బ్రహ్మర్షులు సేవించే మథురదేశమును విడిచి పెట్టి వీరు బ్రహ్మవర్చస్సును నశింపజేసే (వేదసంబంధం లేని) సముద్రములో దుర్గము కట్టుకొని దానిని ఆశ్రయించి ప్రజలను పీడించుచున్నారు.
శిశుపాలుని కల్యాణములు నశించెను. ఆతడీ విధమైన అమంగళములను పలికెను. కాని, నక్క కూతను సింహము లక్ష్య పెట్టనట్లుగా, శ్రీకృష్ణ భగవానుడేమీ మాటలాడలేదు.
చేదిరాజగు శిశుపాలుడు చేసిన ఆ భగవానుని నిందను విన్న సభాస దులు చెవులను మూసుకొని, కోపముతో వానిని తిడుతూ నిషమించిరి.
భగవంతుని గాని, భగవంతుని నమ్ముకున్న భక్తజనుని గాని తిడుతూ ఉంటే ఎవడేని అక్కడనుండి దూరంగా పోకుండా నిలబడి వినుచుండునో, ఆ వినేవాడు కూడ పుణ్యమునుండి భ్రష్టుడై నరకమును పొందును.
పొండవులు, మత్స్యకేకయసృంజయవంశీయులు ఆ నిందలకు కోపించి శిశుపాలుని వధించగోరి ఆయుధములను పైకెత్తి లేచి నిలబడిరి.
భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! అప్పుడు చేదిరాజగు శిశుపాలుడైతే భయము లేకుండా శ్రీకృష్ణుని పక్షమునకు చెందిన రాజులను తిరస్కరించి, కత్తిని డాలును చేతిలోనికి తీసుకొనెను.
అంతలో శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా లేచి తన వారిని ఆపి, కోపముతో మీదకు వస్తున్న శత్రువు తలను చురకత్తి పదును గల చక్రముతో నరికేను.
శిశుపాలుడు సంహరించబడగానే పెద్ద కోలాహలశబ్దము కలిగెను. ఆతని అనుచరులగు రాజులు బ్రదుకునందు తీపి గలవారై పారిపోయిరి.
చేదిరాజగు శిశుపాలుని దేహమునుండి పైకి లేచిన జ్యోతి ఒకటి ఆకాశమునుండి రాలిపడిన ఉల్కను పోలియుండెను. సకలప్రాణులు చూచుచుండగా ఆ జ్యోతి శ్రీకృష్ణ భగవానునియందు ప్రవేశించెను.
ఆతడు మూడు జన్మలలో వైరము చేసి దానిచే ద్వేషముతో నిండిన బుద్దితో ఆ భగవానుని గురించి మాత్రమే ధ్యానిస్తూ ఆయనయందు విలీన మయ్యెను. ఏలయన, జీవునకు భావన వలననే ఉత్తరగతి లభించును.
చక్రవర్తియగు ధర్మరాజు ఋత్విక్కులకు, సదస్యులకు అధికమగు దక్షిణలనిచ్చెను. ఆయన అందరిని చక్కగా సమ్మానించి యథావిధిగా అవభృథ స్నానమును చేసెను.
యోగేశ్వరులగు సనకాదులకు కూడ ప్రభుడగు శ్రీకృష్ణ భగవానుడీ విధముగా ధర్మరాజునకు రాజసూయయాగమును సంపన్నము చేసెను. బంధువుల కోరికపై ఆయన కొన్ని మాసములు అచటనే నివసించెను.
తరువాత దేవకీపుత్రుడగు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు ఒప్పుకోకపోయినా ఒప్పించి, భార్యలతో అమాత్యులతో గూడి తన ద్వారకానగరమునకు వెళ్లాను.
వైకుంఠవాసులగు జయవిజయులకు సనకాది మహర్షులు మరల మరల జన్మించుడని శాపమునిచ్చిరి. ఆ వృత్తాంతమును నేను నీకు చాల విస్తారముగా వర్ణించి యుంటిని.
ధర్మరాజు రాజసూయయాగమునకు చెందిన అవభృథస్నానమును చేసి బ్రాహ్మణుల, రాజుల సభ మధ్యలో దేవేంద్రుడు వలె శోభిల్లెను.
ధర్మరాజు దేవతలను, మానవులను, ఆకాశసంచారులగు గంధర్వాదులను సమ్మానించెను. దుర్యోధనుడు తప్ప వారందరు శ్రీకృష్ణుని, యాగమును కూడ కొనియాడుతూ ఆనందముగా తమ నివాసములకు వెళ్లిరి. దుర్యోధనుడు పాపి, కలహస్వభావుడు, కురువంశమునకు వ్యాధి వంటివాడు.
॥
ఆ దుర్యోధనుడు పాండుపుత్రుడగు ధర్మరాజుయొక్క ఆ ఉజ్జ్వలమగు సంపదను చూచి సహించలేకపోయేను.
ఎవడైతే రాజుల బంధవిముక్తి, రాజసూయమును చేయించుట, చేదిరాజగు శిశుపాలుని వధ, అగ్రపూజ మొదలగు శ్రీకృష్ణ భగవానుని ఈ లీలలను కీర్తించునో, అట్టివాడు సకలపాపములనుండి విముక్తుడగును.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్దములో శ్రీకృష్ణ భగవానుని అగ్రపూజ, శిశుపాలుని ఉద్ధారములను వర్ణించే డెబ్బది నాల్గవ అధ్యాయము ముగిసినది (74).
Summary of chapter 74 of the Bhāgavata Mahā Purana is as follows:
King Yudhishṭhira initiated the grand Rājasūya Yajna in Indraprastha in the presence of great rishis, kings, and devatās. When the time arrived to select the most worshipful person (*Agra-pūjā*) to receive the supreme ceremonial honors, Sahadeva proposed the name of Svayam Bhagavān Śrī Kṛshṇa, declaring Him the soul of the cosmos and the source of all Vaidika sacrifices. The entire assembly joyfully approved, and Yudhishṭhira washed Kṛshṇa's lotus feet. However, King Śiśupāla of Cedi stood up in fury, hurling hundred insulting abuses against Kṛshṇa, mocking His birth in a cowherd community and His lack of royal lineage. Śrī Kṛshṇa remained patient until Śiśupāla completed his hundredth insult, fulfilling a promise made to Śiśupāla's mother. Kṛshṇa then released His Sudarśana Chakra, severing Śiśupāla's head. Before the astonished eyes of the assembly, a radiant spark of light emerged from Śiśupāla's body and merged directly into Śrī Kṛshṇa's lotus feet, granting him liberation (*Sāyujya-mukti*).