భాగవత మహా పురాణము
15 - ధేనుకాసురుని ఉద్ధరించుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- తరువాత బలరామకృష్ణులిద్దరి వయస్సు ఆరు సంవత్సరములు దాటెను. అప్పుడు నందాదులు వారికి (దూడలు మాత్రమే కాకుండా) పశువులను కాసే పనిని అప్పజెప్ప వచ్చునని స్వీకరించిరి. వారిద్దరు మిత్రులతో కలిసి గోవులను మేపుతూ తమ కాలి అడుగులతో బృందావనమును మిక్కిలి పవిత్రముగా చేసిరి,
లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుడు పశువులు ముందు నడువగా బలరామునితో గూడి పిల్లన గ్రోవిని ఊదుకుంటూ పుష్పముల గనియగు ఆ బృందావనమును ప్రవేశించెను. ఆ వనము పశువులకు హితకరమైనది. గోపబాలకులు, విహరించగోరే ఆ బాలకృష్ణుని చుట్టూ చేరి ఆయన కీర్తిని గానము చేయుచుండిరి.
మధురమగు ధ్వనులను చేసే తుమ్మెదలు, లేళ్లు, పక్షులతో హడావుడిగానున్న ఆ బృందావనమును చూచి శ్రీకృష్ణ భగవానుడు విహరించుటకు నిశ్చయించెను. అచటి సరస్సులలోని నీరు మహాత్ముల మనస్సును పోలి (స్వచ్చముగా) యుండెను. గాలి ఆ నీళ్ల పైనుండి వస్తూ పద్మముల సుగంధమును మోసుకువచ్చి ఆ వనమును సేవించుచుండెను.
సర్వజగత్కారణుడు, పూర్ణుడు అగు ఆ శ్రీకృష్ణుడు అక్కడక్కడ చెట్ల ఎర్రని చిగుళ్ల శోభకు ఆనందించేను. అధికమగు పళ్ల మరియు పువ్వుల బరువుతో వంగి కొమ్మల కొనలతో తన పాదములను స్పృశించే చెట్లను చూచి విస్మితుడాయెనా యన్నట్లు ఆయన అన్నగారితో నిట్లనెను.
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ దేవశ్రేష్టా! ఆహా! ఈ చెట్లు తమకు ఏ పాపమైతే చెట్టు జన్మనిచ్చినదో ఆ పాపమును పోగొట్టుకొనుటకై పువ్వులు, పళ్లు అనే పూజాసామగ్రిని సమర్పించి, దేవతలు పూజించే నీ పద్మమువంటి పాదమునకు కొమ్మలతో నమస్కరించుచున్నవి. ఇవి ఈ భాగ్యము కొరకే చేట్టు జన్మనెత్తినవి.
అన్నా! దోషములు లేని నీవు జగత్కారణమగు పూర్ణ బ్రహ్మవే. సకలలోకములను పావనము చేసే నీ కీర్తిని గానము చేస్తూ ఈ తుమ్మెదలు నిన్ను అడుగడుగునా సేవించుచున్నవి. ఇవి బహుశః నీ భక్తులలో అగ్రగణ్యులగు మహర్షుల గణములు కాబోలు. వారు అడవిలో రహస్యముగా ఉన్నా తమ దైవమగు నిన్ను విడిచి పెట్టుట లేదు.
కొనియాడదగిన ఓ రామా! ఈ నెమళ్లు ఆనందముతో నాట్యమాడుచున్నవి. లేళ్లు గోపికలు వలె చూపుతో, మరియు కోకిలల గుంపులు మధురమగు కూతలతో ఇంటికి విచ్చేసిన నీకు ప్రీతిని కలిగించుచున్నవి. అడవిలో నివసించే ప్రాణులు కృతార్థులు. ఎందుకంటే, సత్పురుషుల స్వభావము ఇట్టిది (అతిథిని సత్కరించుట).
ఈనాడు నీ పాదస్పర్శచే ఈ భూమి, గడ్డి, మొక్కలు, నీ చేతి వ్రేళ్ల స్పర్శచే చెట్లు, తీగలు, దయతో కూడిన నీ చూపులచే నదులు, పర్వతములు, పక్షులు, పశువులు, నీ వక్షఃస్థలమును స్పృశించుటచే గోపికలు కూడ ధన్యులైరి. నీ వక్షఃస్థలమును స్పృశించవలెనని లక్ష్మీదేవి కూడ కోరుచుండును.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా శ్రీకృష్ణుని మనస్సు శోభాయుక్తమగు బృందావనమును చూచి చాల ప్రీతి జెందెను. ఆయన అనుచరులతో గూడి గోవర్ధన పర్వతమునకు సమీపములో యమునానదీతీరములయందు పశువులను బాగుగా మేపుతూ విహరించెను.
శ్రీకృష్ణుని వెంట ఉండే గోపబాలకులు ఆయన చరితమును గానము చేయుచుండిరి. తేనెతో మత్తెక్కి తుమ్మెదలు ధ్వనిని చేయుచుండగా, బలరామునితో గూడి వనమాలను దాల్చియున్న ఆ శ్రీకృష్ణుడు ఒకప్పుడు తాసు కూడ వాటితో స్వరము కలిపి పాడును.
నురియొకప్పుడు శ్రీకృష్ణుడు రాజహంసల కూతను అనుకరిస్తూ కూయును. ఒకప్పుడు నాట్యమాడుచున్న నెమలి ఎదురుగా నాట్యమాడి గోపబాలకులను నవ్వించును.
ఒకప్పుడు ఆయన మేఘగర్జన వలే గంభీరమైన వాక్కుతో దూరమునకు వెళ్లిన పశువులను వాటి పేర్లతో పిలుచును. ఆయన వాక్కు గోవులకు, గోపబాలకులకు మనోహరముగా నుండును.
ఆయన వెన్నెల పక్షి, కొంగ, చక్రవాక (జక్కవ) పక్షి, ఏట్రింత పక్షి, నెమళ్లను అనుకరిస్తూ కూయును. జంతువులలో పెద్దపులి, సింహముల గాండ్రింపులను విని భయపడినవాడు వలే పరుగెత్తును.
ఒకప్పుడు అన్నగారగు బలరాముడు ఆటలతో అలసిపోయి గోపబాలకుని ఒడినే దిండుగా చేసుకొని పరుండగా, శ్రీకృష్ణుడు స్వయముగా ఆయన కాళ్లను పట్టుట, గాలి విసురుట మొదలగు సేవలతో విశ్రమింప జేయును.
గోపబాలకులు ఒకప్పుడు నాట్యమాడగా, మరియొకప్పుడు పాట పాడెదరు. ఒకప్పుడు గెంతి, మరియొకప్పుడు ఒకరితోనొకరు కుస్తీ పట్టెదరు. ఆయా సందర్భములలో బలరామ కృష్ణులు ఒకరి చేతులు మరియొకరు పట్టుకొని నవ్వుతూ వారిని కొనియాడెడివారు.
ఒకప్పుడు శ్రీకృష్ణుడు బాహుయుద్ధములో బాగా అలసి, చెట్టు నీడలో గోపబాలకుని ఒడిని దిండుగా చేసుకొని చిగురుటాకుల శయ్యయందు పరుండును.
కొందరా మహాత్మునకు కాళ్లను పట్టగా, మరికొందరు విసిరే కర్రలతో బాగా నీచిరి. వారి పాపములు నశించెను.
ఓ పరీక్షిన్మహారాజా! ప్రేమచే ఆర్ద్రములైన హృదయములు గల మరికొందరు ఆ మహాత్మునకు ఆయనకు తగ్గ మనోహరములైన పాటలను పాడి వినిపించిరి.
లక్ష్మీదేవిచే లాలించబడే చిగుళ్లవంటి పాదములు గల - శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా తన చేష్టలతో గోపాలకుని పుత్రుడు వలె నటిస్తూ గోపబాలకులతో బాటు తాను కూడ ఒక గోపబాలకుడై విహరించెను. ఆయన తన స్వరూపమును మాయచే దాచియుంచిననూ, అప్పుడప్పుడు లీలలలో ఆయన అనంతశక్తి ప్రకటమయ్యెడిది.
శ్రీరాముడని ప్రసిద్ధి గాంచిన గోపబాలకుడు బలరామకృష్ణుల నేస్తము. ఆతడు, సుబలుడు, స్తోక (చిన్ని కృష్ణుడు, దేవభద్రుడు మొదలగు - గోపబాలకులు ప్రేమతో ఇట్లు పలికిరి.
గొప్ప బాహువులతో మమ్ములను రమింపజేసే ఓ బలరామా! దుష్టులను సంహరించే శ్రీకృష్ణా! ఇక్కడకి దగ్గరలో తాటి చెట్ల వరుసలు దట్టముగా ఉండే అడవి గలదు.
అక్కడ చాల పళ్లు ఇదివరకే పడినవి, కొత్తగా పడుతున్నవి ఉంటాయి. కానైతే దుర్బుద్ధియగు ధేనుకాసురుడు అడ్డు పడును.
ఓ బలరామా! ఓ శ్రీకృష్ణా! అధికమగు పరాక్రమము గల ఆ అసురుడు గాడిద రూపములో నుండును. వాని చుట్టూ వాని జ్ఞాతులనేకులు గలరు. వారికి కూడ వానితో సమానమగు బలము గలదు.
శత్రువులను సంహరించే ఓ శ్రీకృష్ణా! నరమాంసమును భక్షించే ఆ రాక్షసునకు భయపడి మానవులు గాని, పశువుల గుంపులు గాని, పక్షుల గుంపులైననూ అటువైపు పోవుట లేదు.
పరిమళముతో కూడి ఉండే ఆ పళ్లను ఇదివరలో మనమెన్నడూ తినలేదు. ఈ పళ్ల సువాసన నిశ్చయముగా అంతటా వ్యాపించుచున్నది. ఈ సుగంధము ఇచట స్పష్టముగా తెలియుచున్నది.
ఓ శ్రీకృష్ణా! ఆ పళ్లను మాకిమ్ము. వాటి సుగంధము మా మనస్సుల నాకర్షించుచున్నది. ఓ బలరామా! మాకు వాటి పై కోరిక మెండుగా గలదు. నీకభిమతమైనచో, అచటకు వెళ్లుము.
మిత్రులీ విధముగా పలుకగా సర్వసమర్థులగు బలరామకృష్ణులిద్దరు నవ్విరి. వారు గోపబాలకులు చుట్టువారి రాగా, వారికి ప్రీతిని కలిగించ గోరి, ఆ తాటి చెట్ల అడవికి వెళ్లిరి.
బలరాముడు మదించిన ఏనుగు గున్నవలె ఆ అడవిలో ప్రవేశించి రెండు చేతులతో బలముగా తాటి చెట్లను గట్టిగా గుండ్రముగా ఊపి, పళ్లు పడునట్లు చేసెను.
పడుచున్న ఆ పళ్ల చప్పుడు విని గాడిద రూపములోనున్న రాక్షసుడు వారి ఎదురుగా పరుగెత్తి రాగా, చెట్లతో సహా భూతలము కంపించేను.
బలశాలియగు ఆ దుష్టుడు వేగముగా వచ్చి రెండు వెనుక కాళ్లతో రాముని రొమ్ముపై తన్ని కఠోరముగా ఓండ్ర పెడుతూ చుట్టూ పరుగెత్తాను.
ఓ పరీక్షిన్మహారాజా! గాడిద రూపములోనున్న ఆ రాక్షసుడు కోపముతో మరల దగ్గరకు వచ్చి వెనుదిరిగి నిలబడెను. వాడు బలరాముని తన్నుటకై కోపముతో రెండు వెనుక కాళ్లను విసిరెను.
ఆ బలరాముడు ఒకే చేతితో వానిని రెండు కాళ్ల కొనలయందు పట్టుకొని గిర గిర త్రిప్పి తాటి చెట్టు పైకి విసిరేసు. ఆ త్రిప్పుటలోనే వాని ప్రాణము పోయెను.
ఆ రాక్షసుని దేహముతో కొట్టబడిన మిక్కిలి యెత్తైన ( పెద్ద తల గల) ఆ పెద్ద తాటి చెట్టు ఊగిపోతూ విరిగి ప్రక్కనున్న చెట్టు పై పడగా, అది కుదిపివేయబడి విరిగెను. అది పడి ఇంకో చెట్టు, ఆ చెట్టు పడి మరో చెట్టు కూడ విరిగెను.
బలరాముడు అవలీలగా విసిరివేసిన గాడిద దేహము ఒక చెట్టును, అది విరిగి ఇంకో చెట్టును కొట్టెను. ఆ విధముగా తాటి చెట్లన్నీ పెద్దగాలిచే కుదిపివేయబడినవా యన్నట్లు ఊగినవి.
ఓ రాజా! జగత్తునకు ప్రభువగు అనంత భగవానుడట్లు చేయుటలో విడ్డూరమేమీ లేనే లేదు. ఎందుకంటే ఈ జగత్తు, వస్త్రము దారములయందు వలె, ఆయనయందే పడుగు పేకవలె నున్నది.
తరువాత, తమ బంధువగు ధేనుకాసురుడు సంహరించబడినందులకు వాని బంధువులగు గాడిదలకు చాల కోపము వచ్చినది. అవి అన్నీ బిగ్గరగా ఓండ్ర పెడుతూ బలరామకృష్ణుల పైకి పరుగెత్తి వచ్చినవి.
ఓ పరీక్షిన్మహారాజా! మీదకు వచ్చుచున్న ఆ గాడిదలను బలరామకృష్ణులు వచ్చినవాటీని వచ్చినట్లుగా అవలీలగా వెనుక కాళ్లను పట్టుకొని తాటి చెట్ల పైకి విసిరి వేసిరి.
నేల పై పళ్లు గుట్టలుగా పడి చెల్లాచెదరుగా నుండెను. ప్రాణములు పోయిన రాక్షసుల దేహములకు తాటి చెట్ల తలలు తోడు కాగా, నేల మేఘములతో కూడిన ఆకాశతలము వలె ప్రకాశించెను.
వారిద్దరి ఆ చాల గొప్ప లీలను చూచి దేవతలు పూల వానలను కురిపించిరి. గంధర్వులు వాద్యములను వ్రాయించగా, మహర్షులు స్తుతించిరి.
ధేనుకాసురుని సంహరించిన తరువాత ఆ అడవిలో మానవులు భయము తొలగిపోయి తాటి పళ్లను తినిరి. పశువులు కూడ గడ్డి మేసినవి.
పద్మపు రేకులవంటి కన్నులు గల శ్రీకృష్ణుని లీలలను విన్నా కీర్తించినా మానవుడు పవిత్రుడగును. ఆయన అన్నయగు బలరామునితో కలిసి, సహచరులగు గోపబాలకులు కొనియాడుచుండగా, గోకులమును చేరెను.
శ్రీకృష్ణుని ముంగురులు గోధూళితో నిండియుండెను. ఆయన వాటియందు నెమలి పింఛములను, అడవి పువ్వులను పెట్టుకొనెను. ప్రకాశించే చూపులు, అందమైన చిరునవ్వు గల ఆయన వేణువును వాయించుచుండగా, వెంట నడిచే గోపబాలకులు ఆయన కీర్తిని గానము చేసిరి. ఆయనను చూడగోరే కన్నులు గల గోపికలు గుంపుగా ఆయనకు ఎదురేగిరి.
గోకులమునందలి యువతులు మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని ముఖపద్మమునందలి తేనెను కన్నులనే తుమ్మెదలతో పానము చేసిరి. వారికి పగలు ఆయన విరహము వలన పుట్టిన మనస్తాపము తొలగిపోయేను. వారాయనను వాలు చూపులను విసిరి సత్కరించగా, ఆయనా సత్కారమును సిగ్గుతో, చిరునవ్వుతో, వినయముతో చక్కగా స్వీకరించి, గోకులమును ప్రవేశించెను.
యశోదారోహిణులిద్దరికి పుత్రవాత్సల్యము మెండు. వారు బలరామకృష్ణులకు వారి ఇచ్చకు తగ్గట్లుగా కాలము మించకుండా ఉత్కృష్టమైన ఆహారము మొదలగు సౌకర్యములను వ్యవస్థ చేసిరి.
ఆ గోకులములో వారిద్దరు తైలమును మర్దనా చేసుకొని స్నానము చేసి మార్గములో కలిగిన శ్రమను పోగొట్టుకొనిరి. మార్గములో శ్రమ తక్కువ యేమీ కాదు. వారు అందమైన ఉదికిన వస్త్రమును ధరించి ప్రకాశించే మాలతో, గంధముతో అలంకరించుకొనిరి.
వారు గోకులములో తల్లులిద్దరు లాలిస్తూ ఇచ్చిన రుచ్యమైన ఆహారమును భుజించిరి. అపుడు వారు శ్రేష్ఠమైన (మెత్తని) శయ్య పై వాలి సుఖముగా నిద్రించిరి.
ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగా ఆ శ్రీకృష్ణ భగవానుడు బృందావనములో సంచరించుచుండెను. ఆయన ఒకడు మిత్రులైన గోపబాలకులు చుట్టువారి రాగా, బలరాముడు లేకుండా, యమునానదికి వెళ్లాను.
అప్పుడు గోవులు, గోపాలకులు కూడ వేసవి కాలపు ఎండచే తాపమును పొంది దప్పికతో పీడను పొందిరి. వారు ఆ కాలిందిలోని చెడు నీటిని త్రాగిరి. ఆ నీరు విషముచే కలుషితమైనది.
కురువంశశ్రేష్ఠుడవగు ఓ రాజా! ప్రారబ్దముచే మోహితమైన బుద్ధి గల వారందరు ఆ విషపు నీటిని త్రాగి, ప్రాణములు పోగా నీటికి దగ్గరగా ఒడ్డుపై పడిపోయిరి.
శ్రీకృష్ణుడు గొప్ప యోగమహిమ గలవారలకు కూడ ప్రభుడు. ఆయన ఆ విధముగా పడియున్న గోపబాలకులను చూచెను. వారికి తానే రక్షకుడు. ఆయన వారిని అమృతమును వర్షించే చూపుతో బ్రదికించెను.
ఆ గోపబాలకులందరికీ వెంటనే స్మృతి కలిగెను. వారు నీటి వద్దనుండి లేచి నిలబడి మిక్కిలి ఆశ్చర్యముతో ఒకరినొకరు చూచుకుంటూ ఉండిరి.
ఓ పరీక్షిన్మహారాజా! తాము విషజలమును త్రాగి మరణించి మరల లేచి నిలబడుట గోవిందుని అనుగ్రహదృష్టి చేతనేనని వారు తలపోసిరి.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్దములో ధేనుకాసురుని ఉద్దరించుటను వర్ణించే పదునైదవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 15 of the Bhāgavata Mahā Purana is as follows:
As Śrī Kṛshṇa and Balarāma reached the *Paugaṇḍa* age (around seven to ten years), they were entrusted with the care of full-grown cows, wandering through the woods playing flutes, wrestling, and singing. One day, the cowherd boys mentioned the Tālavana forest, which was filled with ripe, fragrant palm fruits but guarded by the fierce donkey demon Dhenukāsura and his demonic herd. Desiring the fruits, Balarāma and Kṛshṇa entered the forest. Balarāma shook the palm trees with His mighty arms, sending ripe fruits cascading to the ground. Outraged, Dhenukāsura charged and kicked Balarāma's chest with his hind legs. Balarāma seized the donkey demon by his hind legs, swirled him around, and hurled him into the top of a palm tree, crushing the demon and destroying his entire herd.