భాగవత మహా పురాణము
51 - కాలయవనుడు భస్మమగుట - ముచుకుంద స్తుతి
శ్రీశుక ఉవాచ ।
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఉదయించుచున్న చంద్రుడు వలె నగరము బయటకు వచ్చిన ఆ నల్లనయ్యను కాలయవనుడు చూచెను. మిక్కిలి అందగాడగు ఆయన పచ్చని పట్టు వస్త్రమును ధరించెను.
శ్రీకృష్ణుని వక్షఃస్థలము పై లక్ష్మీదేవి పుట్టుమచ్చయై ఉన్నది. ఆయన మెడకు ప్రకాశించే కౌస్తుభ మాణిక్యము అలంకారము. ఆయన బలిసిన పొడవాటి నాల్గు చేతులను, కొత్త పద్మము వంటి లేత యెరుపు కన్నులను కలిగియుండెను. (కాలయవనుడు చూచిన రూపమిది).
శోభాయుక్త మైన చక్కని చెక్కిళ్లు గల ఆయన ముఖము పై సర్వకాలములలో ఆనందము తాండవించును. స్వచ్చమైన చిరునగవు గల ఆయన పద్మమువంటి ముఖముపై మెరిసిపోయే మొసలి ఆకారపు కుండలములను ధరించియుండెను.
ఈ పురుషుడు శ్రీహరియే. ఎందుకంటే, ఈయన శ్రీవత్సమనే పుట్టు మచ్చ, నాల్గు చేతులు, పద్మములవంటి కన్నులు, అడవి పూల మాల ఉన్న గొప్ప అందగాడు (అని కాలయవనుడు నిశ్చయించుకొనెను).
నారద మహర్షి చెప్పిన లక్షణములను బట్టి ఈతడు మరియొకడు కాజాలడు. ఈయన ఆయుధములు లేకుండా కాలి నడకన పోవుచున్నాడు. నేను కూడ ఆయుధముల లేకుండా ఈతనితో యుద్ధము చేసెదను.
ఆయన ముఖము త్రిప్పుకోని పరుగెత్తుచుండెను. కాలయవనుడీ విధముగా నిశ్చయించి యోగులకైననూ కష్టముతో పొందబడే ఆయనను పట్టుకొనగోరి వెనుక పరుగెత్తాను.
ఆయన యవనప్రభుడగు కాలయవనునికి ప్రతి అడుగుకీ చేతికి చిక్కినట్లే కన్పట్టెను. ఈ విధముగా ఆయన వానిని చాల దూరమందలి పర్వత గుహవద్దకు తీసుకొని పోయెను.
యదువుయొక్క వంశములో పుట్టిన నీకు పారిపోవుట తగదు, అని నిందిస్తూ ఆతడు వెంట పడెను. కాని, ఆతని మనోమాలిన్యములింకనూ నశించకపోవుటచే ఈ శ్రీకృష్ణుని ఆతడు చేరుకో (స్పృశించ) లేదు.
ఈ విధంగా కాలయవనుడు నిందిస్తున్నా, శ్రీకృష్ణ భగవానుడు కొండ గుహలో ప్రవేశించేను. కాలయవనుడు కూడ ప్రవేశించి ఆ గుహలో నిద్రిస్తున్న మరియొక మనిషిని చూచెను.
అరే! ఈతడు దూరముగా - ఇక్కడికి నన్ను తీసుకువచ్చి తాను సజ్జనుడు వలె నిద్రిస్తున్నాడు, అని ఆ మూర్ఖుడు తలపోసెను. ఆ వ్యక్తి శ్రీకృష్ణుడేనని తలచి వాడు ఆతనిని కాలితో గట్టిగా తన్నెను.
చాల కాలము నిద్రించిన ఆయన నిద్ర లేచి మెల్లగా కన్నులను తెరచి నలువైపులా చూస్తూ, ప్రక్కనే నిలబడియున్న ఆ కాలయవనుని చూచెను.
భరతవంశీయుడవగు ఓ రాజా! అంతలో (నిద్ర చెడగొట్టినందులకు) కోపించిన ఆయన చూపు ఆ కాలయవనునిపై పడెను. ఆతని దేహమునుండి అగ్ని పుట్టి క్షణములో ఆతనిని కాల్చి బూడిద చేసెను.
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! కాలయవనుని మట్టుబెట్టిన ఆ పురుషుడెవరు? ఏ వంశము వాడు? ఆయన పరాక్రమమెట్టిది? ఆయన గుహను చేరి నిద్రించుటకు కారణమేమి? ఆయన ఎవని పుత్రుడు?
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ గొప్ప వ్యక్తి ఇక్ష్వాకువంశములో మాంధాతకు పుత్రుడై జన్మించి ముచుకుందుడని ప్రసిద్ధి గాంచినవాడు. ఆయన బ్రాహ్మణభక్తుడు, సత్యమైన ప్రతిజ్ఞ గలవాడు.
రాక్షసుల వలన భయపడిన ఇంద్రుడు మొదలైన దేవతలు తమను రక్షించుమని ఆయనను కోరిరి. ఆయన వారిని చాల కాలము రక్షించెను.
వారికి స్వర్గలోకరక్షకునిగా కుమారస్వామి లభించెను. అప్పుడు వారు ముచుకుందునితో నిట్లనిరి -- ఓ రాజా! మమ్ములను రక్షించుట అనే కష్టమును నీవు విరమించుము.
ఓ వీరుడా! నీవు మానవలోకమునందు నిష్కంటకమైన రాజ్యమును విడిచి పెట్టి మమ్ములను రక్షించుటకై సకలకామనలను విడిచి పెట్టినావు.
నీ సమకాలీనులగు పుత్రులు, భార్యలు, బందుగులు, కార్యదర్శులు, సలహాదారులు, ప్రజలు కూడ కాలము చేసినారు. వారిప్పుడు లేరు.
సర్వసమర్థమగు కాలము బలవంతులలో కెల్లా బలమైనది. వినాశము లేని కాలము సర్వమును శాసించును. భగవత్స్వరూపమగు కాలము క్రీడిస్తూ, పశుల కాపరి పశువులను వలే, ప్రాణులను వశములోనుంచును.
నీవు ఇప్పుడు మానుండి మోక్షమును మినహాయించి ఏదేని వరమును కోరుకొనుము. నీకు మంగళమగు గాక! ఆ మోక్షమునిచ్చే సమర్థుడు కాలాతీతుడగు శ్రీహరి భగవానుడొక్కడు మాత్రమే.
గొప్ప కీర్తి గల ఆ ముచుకుందునితో దేవతలిట్లు పలికి నిద్రను వరముగానిచ్చిరి. ఆయన వారికి ప్రణమిల్లి గుహను ప్రవేశించి నిద్రించెను.
నీవు నిద్ర పోతూండగా మధ్యలో ఏ మూర్ఖుడైతే నిద్ర లేపునో, వాడు నీవు కేవలము చూచినంత మాత్రాన ఆ క్షణమే బూడిద యగుగాక! (అని దేవతలు వరమునిచ్చిరి).
కాలయవనుడు బూడిద కాగానే బుద్ధిశాలియగు ముచుకుందునకు యాదవ శ్రేష్ఠుడగు శ్రీకృష్ణ భగవానుడు తన దర్శనమునిచ్చెను.
ముచుకుందుడు మేఘము వలె నల్లనైన శ్రీకృష్ణుని చూచెను. పచ్చని పట్టు వస్త్రములను దాల్చిన ఆయన వక్షఃస్థలము పై రేఖారూపిణియగు శ్రీతో, మెడలో కౌస్తుభమాణిక్యముతో విరాజిల్లెను.
నాలు చేతులు గల ఆ శ్రీహరి వైజయంతి అనే పంచరత్నమాలతో ప్రకాశించుచుండెను. ఆయన ప్రసన్నమగు ముఖము మెరిసిపోయే మకరకుండలములతో అందముగా నుండెను.
మానవలోకమునకు దర్శించదగిన శ్రీకృష్ణుడు ప్రేమతో, చిరునవ్వుతో చూచుచుండెను. సుందరయువకుడగు ఆయన మదించిన సింహము వలే గంభీరముగా నడచును.
శ్రీకృష్ణుని తేజస్సుచే ముచుకుందుడు పరాభూతుడయ్యెనే గాని, శ్రీకృష్ణుని ఎవ్వరైననూ తమ తేజస్సుచే చకితుని చేయలేరు. గొప్ప బుద్ధిశాలియగు ముచుకుందునకు సందేహము కలిగి కృష్ణుని ప్రశ్నించెను.
ముచుకుంద ఉవాచ ।
ముచుకుందుడిట్లు పలికెను --- ఈ నిర్జనమగు అడవి భయంకరమైనది, ప్రవేశించ శక్యము కానిది. దీనిలో ప్రవేశించి, పద్మములవలె కోమలములైన పాదములతో నీవు అధికమగు ముళ్లు గల స్థానమునందు సంచరించుచున్నావు. నీవెవరివి?
తేజశ్శాలురలో కెల్లా మూర్తీభవించిన తేజస్సు, పూజనీయుడు అగు అగ్నివా? సూర్యుడవా? చంద్రుడవా? లేక, మరియొక లోకపాలకుడవా?
బ్రహ్మవిష్ణుమహేశ్వరులు దేవతలకు కూడ దేవులు. నీవు వారిలో పురుషోత్తముడగు శ్రీహరివని తలంచుచున్నాను. ఏలయన, నీవు కాంతిచే గుహయందలి చీకటిని పరాస్తము చేయుచున్నావు.
ఓ పురుషోత్తమా! మీకిష్టమైనచో వినగోరే మాకు మీ పుట్టుక, చేసే పని, పేరు, మీ వంశప్రవర్తకుల గురించి దాచి పెట్టకుండా చెప్పుడు.
ఓ పురుషోత్తమా! నేనైతే ఇక్ష్వాకు వంశమునకు చెందిన క్షత్రియుడను. ఓ ప్రభూ! నన్ను ముచుకుందుడంటారు. నేను యువనాశ్వుని పుత్రుడగు మాంధాత యొక్క పుత్రుడను.
నేను చాల కాలము తెలివిగా ఉండి, అలసిపోతిని, నా ఇంద్రియములు స్వాధీనత తప్పినవి. నేనీ నిర్జనప్రదేశమునందు యథేచ్చగా నిద్రించగా, ఎవడో ఒకడు నన్ను నిద్ర లేపినాడు.
ఆతడైతే తన పాపము చేతనే నిశ్చయముగా బూడిద చేయబడినాడు. వెనువెంటనే శోభాయుక్తులగు తమరు నాకు కనబడిరి. తమరు శత్రుసంహారకులు.
ఓ మహాతేజశ్శాలీ! సహించ శక్యము కాని నీ తేజస్సుచే నా దర్శనశక్తి విహతమై నేను చాల సేపు చూడ లేకున్నాను. కాని, నీవు ప్రాణులకు పూజనీయుడవని మాత్రము తెలియుదును.
ప్రాణులకు రక్షకుడగు శ్రీకృష్ణ భగవానునితో ముచుకుంద మహారాజు ఈ విధముగా సంభాషించెను. ఆపుడాయన నవ్వుతూ మేఘగర్జన వలె గంభీరమైన వాక్కుతో ఇట్లు బదులు చెప్పెను.
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓయీ! నాకు జన్మలు, క్రియలు, పేర్లు వేలకొలదీ ఉన్నవి. అవి అనంతములగుట వలన, నేను కూడా వాటిని లెక్కించలేననేది నిశ్చయము.
ఎవడైననూ ఒకప్పుడు భూగోళము యొక్క ధూళికణములను బహుజన్మలచే లెక్కించవచ్చునేమో గాని, నా జన్మలను, గుణములను, కర్మలను, పేర్లను మాత్రము ఏనాడైననూ లెక్కించలేడు.
ఓ మహారాజా! భూతవర్తమానభవిష్యత్కాలములలో సిద్ధములైన నా అవతారములను, లీలలను మహర్షులు వరుసగా వర్ణించియు అంతము చేరలేకున్నారు.
ఓయీ! అయినప్పటికీ నా వర్తమానములోని జన్మకర్మలను గురించి చెప్పెదను, వినుము. పూర్వము బ్రహ్మదేవుడు భూమికి బరువగుచున్న అసురులను సంహరించి ధర్మమును రక్షింపుమని నాకు విన్నవించెను.
యదువు వంశమునందు దేవకీవసుదేవులకు పుత్రుడనై నేను అవతరించితిని. వసుదేవుని పుత్రుడనగు నన్ను వాసుదేవుడని పిలిచెదరు.
ఓ పరీక్షిన్మహారాజా! కంసుని రూపములోనున్న కాలనేమి, సత్పురుషు లను ద్వేషించే ప్రలంబుడు, అఘుడు మొదలగు రాక్షసులు సంహరించ బడినారు. నీవీ కాలయవనుని నీ తీక్ష్ణమగు చూపుతో దహించితివి.
అట్టి నేను నిన్ను అనుగ్రహించుటకై ఈ గుహకు వచ్చితిని. పూర్వజన్మలో నీవు భక్తవత్సలుడనగు నన్ను అధికముగా ఆరాధించితివి.
ఓ రాజర్షీ! వరములను కోరుము. నీ కోరికలనన్నింటినీ తీర్చెదను. నన్ను శరణు పొందినవాడే జనుడైననూ మరల దుఃఖించుటకు తగడు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణుడిట్లు పలుకగా ముచుకుందుడు ఆనందమును పొంది ప్రణమిల్లెను. ఆతనికి గర్గాచార్యుని మాట గుర్తుకు వచ్చి శ్రీకృష్ణుడు నారాయణదేవుడేనని గుర్తించేను.
ముచుకుంద ఉవాచ ।
ముచుకుందుడిట్లు పలికెను --- స్త్రీలు గాని, పురుషులు గాని ఈ మానవులు నీ మాయచే వ్యామోహమును పొందినారు. వారు అనర్థమగు సంసారమునందు దృష్టి గలవారై నిన్ను ఆరాధించుట లేదు. వారు మోసపోయి సుఖము కొరకు - దుఃఖనిలయములగు గృహవ్యవహారములయందు ఆసక్తులగుచున్నారు.
పాపసంబంధము లేని ఓ దేవా! మానవుడీ లోకము (కర్మభూమి) లో అంగవైకల్యము లేని మానవజన్మను ఏదో విధముగా ప్రయత్నము లేకుండానే పొందినాడు. ఇట్టి జన్మ దుర్లభము. అయిననూ, దుష్టమగు (భోగములయందు తగుల్కున్న) బుద్ధి గల మానవుడు సంసారమనే చీకటి నూతిలో పడినవాడై పశువు వలె నీ పాదపద్మమును సేవించుట లేదు.
ఓ అపరాజితా! రాజునై రాజ్యముయొక్క సంపద చే బాగా గర్వించితిని. దేహమే ఆత్మ అనే అభిమానముతో సంతానము, భార్య, సంపద, భూమి అనువాటియందు ఆసక్తిని పెంచుకొని అంతు లేని చింతనతో నా ఈ కాలము వ్యర్థముగా వెళ్లిపోయినది.
కుండ, గోడల వలె దృశ్యమగు ఈ దేహమునందు రాజునని పాదుకున్న అభిమానము కలిగి. నేను బాగా గర్వించితిని. రథములు, ఏనుగులు, గుర్రములు, పదాతుల సైన్యములు చుట్టువారి రాగా భూమిని పర్యటిస్తూ (కాలరూపుడవగు) నిన్ను లెక్క చేయకుంటిని.
చేయవలసిన పనుల గురించి చింతతో మానవుడు భగవద్భజనము విషయములో అసావధానుడై యుండును. బాగా పెరిగిన లోభము గలవాడై మానవుడు ఇంద్రియభోగములయందు అధికమగు స్పృహతో నుండును. కాని, కాలరూపుడవగు నీకు మరుపు తెలియదు. ఆకలిచే నాలుకలతో పెదవులను ఆస్వాదించే పాము ఎలుకను వలె, నీవు వానిని వేగముగా సమీపించి మ్రింగి వేసెదవు.
ఒకప్పుడీ దేహము రాజు అనే పేరుతో బంగారముతో అలంకరించబడిన రథములపై, ఏనుగులపై సంచరించెడిది. నీ స్వరూపమైన కాలమును ఎవ్వరూ అతిక్రమించలేరు. అదే దేహము కాలప్రభావముచే (బయట పారవేసినచో) పక్షుల రెట్ట, (నేలలో పాతినచో) క్రిములు, (కాల్చినచో) బూడిద అనే పేర్లు గలది యగును.
ఓ ఈశ్వరా! ఒక వ్యక్తి నాల్గు దిక్కులను జయించి ఊహకైననూ విరోధులు లేనివాడై సౌర్వభామసింహాసనమునధిష్ఠించి సమానులైన రాజులచే సమ్మానించబడినవాడు కావచ్చును. అదే వ్యక్తి సంభోగసుఖములు విశేషముగా గల గృహమునందు యువతులచే ఆటబొమ్మ (కోతి) వలె ఆడించబడును.
మానవుడు భోగములయందలి అపేక్ష చేతనే భోగములనుండి నివృత్తుడై దానధర్మములను, ప్రతనియమములను, వైదికకర్మలను అను ష్ఠించును. మరల తాను చక్రవర్తి కావాలని ఈ పుణ్యములనాచరించును. అట్టి పెచ్చు మీరిన తృష్ణ గలవాడు సుఖమునకు అర్హుడు కాజాలడు.
ఓ శ్రీహరీ! సంసారములో పరిభ్రమించే మానవునకు ఎప్పుడైతే సంసారమునుండి మోక్షమునకు సమయము వచ్చునో, అప్పుడే సత్సంగము లభించును. ఏ కాలమునందైతే సత్సంగము కలుగునో, అప్పుడే మానవునకు నీయందు భక్తి కలుగును. మాయాశక్తికి, జగత్తునకు ప్రభుడవగు నీవే సత్పురుషులకు శరణము.
ఓ ఈశ్వరా! నాకు అనుకోకుండా రాజ్యమనే పాశమునుండి విముక్తి కలిగినది. ఇది నీచే చేయబడిన అనుగ్రహమేనని తల చేదను. సాధు స్వభావులగు సార్వభౌములు కూడ ఏకాంతములో నిన్ను భజించుటకై అడవిని ప్రవేశించగోరి ఇట్టి రాజ్యాధికారనివృత్తినే ప్రార్థించెదరు.
ఓ ప్రభూ! ఏమీ లేనివారు కూడ కోరదగినవాటిలో శ్రేష్టమైనది నీ పాదముల సేవ. అది తక్క మరియొక వరమును నేను కోరను. ఓ శ్రీహరీ! ఎందుకంటే, వివేకియగు ఎవ్వాడు తనను సంసారములో బంధించే వరములను కోరును? (ఎవడైననూ కోరడు).
ఓ ఈశ్వరా! కావున (కామనలు బంధిస్తాయి గనుక), నేను సత్త్వరజస్తమోగుణముల సంసర్గము గల సాంసారికకామనలను పూర్తిగా విడిచి పెట్టెదను. నేను పూర్ణుడవగు నిన్ను శరణు వేడుచున్నాను. సంసారసంబంధము లేశమైననూ లేని నీయందు గుణములు లేవు. రెండవది లేని నీవు ప్రకృతికి అతీతమైన అఖండ చైతన్యస్వరూపుడవు.
శరణునిచ్చే ఓ పరమాత్మా! నేనీ లోకములో చిరకాలమునుండి కర్మఫలములచే పీడించబడి, వాటి వాసనలచే తపింపజేయబడుచున్నాను. నాలోని కామక్రోధములు మొదలైన అంతశ్శత్రువులకు ఇంకనూ తృష్ణ తీరలేదు. నాకే విధముగానైననూ శాంతి లభించలేదు. ఓ ఈశ్వరా! పద్మమువంటి నీ పాదము వద్ద భయమునకు, శోకమునకు తావు లేదు. సత్యమైన నీ పాదమును నేను చేరితిని. ఆపదలతో సతమతమయ్యే నన్ను కాపాడుము.
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- సార్వభౌముడవైన ఓ మహారాజా! నీ బుద్ది నిర్మలము, ఉన్నతకోటికి చెందినది. ఎందుకంటే, నేను వరములతో ప్రలోభ పెట్టితిని. ఐనా నీ బుద్ధి కామనలచే కుంఠితమవలేదు.
భక్తులను సావధానులను చేయుట కొరకు (నీ సావధానతను పరీక్షించుట కొరకు) మాత్రమే నేను నిన్ను వరములతో ప్రలోభ పెట్టితినని తెలియుము. నాయందు అనన్యమగు భక్తి గలవారల బుద్ది ఏ నాడైననూ కామనలచే భేదమును పొందదు.
ఓ రాజా! భక్తి లేకుండా కొందరు ప్రాణాయామము-ధారణ మొదలగువాటిచే మనస్సును ఏకాగ్రము చేసెదరు. కాని, వారి మనస్సులోని వాసనలు క్షయము కాకుండుటచే, అది మరల విషయభోగములవైపు పరుగెత్తుట అనుభవములోనున్న విషయమే.
నీవు నాయందు మనస్సు నిలిపి భూలోకములో యథేచ్చగా సంచరించుము. నీకు నాయందు ఏనాడైననూ తొలగిపోని భక్తి నిశ్చయముగా కలుగుగాక!
క్షత్రియధర్మమును పాలించిన నీవు వేట-ఆహారము మొదలగు సంద ర్భములలో ప్రాణులను నిశ్చయముగా చంపితివి. నన్ను శరణు పొంది ఏకాగ్రమగు చిత్తముతో తపస్సు చేసి ఆ పాపమును పోగొట్టుకొనుము.
ఓ రాజా! నీవు వెంటనే రాబోయే జన్మలో సకలప్రాణులయందు అతిశయించిన ప్రేమ గల బ్రాహ్మణ శ్రేష్ఠుడవు కాగలవు. అప్పుడు నీవు అద్వితీయుడనగు నన్ను నిశ్చయముగా పొందగలవు.
శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములోకాలయవనుడు భస్మమగుటను, ముచుకుందస్తుతిని వర్ణించే ఏబది, ఒకటవ అధ్యాయము ముగిసినది (51).
Summary of chapter 51 of the Bhāgavata Mahā Purana is as follows:
Leaving the defenseless city of Mathurā, Śrī Kṛshṇa walked out of the gates unarmed, enticing Kāla-yavana to chase Him on foot. Leading the arrogant barbarian king miles into a dark mountain cave, Kṛshṇa stepped aside in the shadows. Inside the cave slept King Muchukunda, an ancient monarch of the Ikshvāku dynasty who had fought heroically for the devatās and had been granted a boon of uninterrupted sleep, along with the power to reduce anyone who awakened him to ashes. Mistaking the sleeping Muchukunda for Kṛshṇa, Kāla-yavana kicked him hard. Muchukunda awoke in a rage, cast his glance upon Kāla-yavana, and instantly incinerated the barbarian king to ashes. Svayam Bhagavān Śrī Kṛshṇa then revealed His radiant four-armed form to Muchukunda, who offered exalted prayers of surrender, abandoned all material desires, and departed for Badarīkāśrama to engage in penance.