భాగవత మహా పురాణము
73 - శ్రీకృష్ణ భగవానుడు రాజులను బంధవిముక్తులను చేయుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- జరాసంధుడు అవలీలగా జయించి కొండ పల్లములో బంధించిన రాజులు ఇరవై వేల ఎనిమిది వందల మంది విముక్తిని పొందిరి. వారు మలినవస్త్రములతో మలినదేహములతో బందీనుండి బయటకు వచ్చిరి.
ఆ రోజులు ఆకలిచే మరియు బంధించి ఉంచుటచే దేహమంతా కృశించి ఉండిరి. వారి మోములు ఎండిపోయెను. వారు మేఘము వలె నల్లనై పచ్చని పట్టు వస్త్రమును దాల్చిన శ్రీకృష్ణుని చూచిరి.
నాలుగు చేతులు గల ఆయన వక్షఃస్థలము పై లక్ష్మీదేవి స్వర్ణరేఖయై రాజిల్లెను. ఆయన కన్నులు పద్మపు దుద్దులవలె అరుణవర్ణముతో నుండెను. మకరకుండలములతో వెలిగిపోవుచున్న ఆయన మోము అందముగా, ప్రసన్నముగా నుండెను.
చేతిలో పద్మము, గద, శంఖము, చక్రములతో శోభిల్లే ఆయన కిరీటము, హారము, కంకణములు, మేఖల, బాహుపురులనలంకరించుకొనెను.
ఆయన మెడలో శ్రేష్ఠమైన కౌస్తుభమాణిక్యము, వనమాలలను అలంకరించుకొనెను. ఆయనను - ఆ రాజులు కళ్లతోపానము చేయుచున్నారా, నాలుకతో ఆస్వాదించుచున్నారా యన్నట్లు చూచిరి.
ఆ రాజులు ఆయనను ముక్కు పుటములతో ఆఘ్రాణించుచున్నారా, చేతులతో కౌగిలించుచున్నారా యన్నట్లు చూచిరి. ఆయనను చూచుటచే వారి పాపములు నశించెను. వారాయన కాళ్లకు తలలను వంచి మొక్కిరి.
శ్రీకృష్ణుని దర్శనముచే కలిగిన ఆనందము ఆ రాజుల బంధక్లేశమును నశింప జేసెను. వారు దోసిలి యొగ్గి ఇంద్రియాంతర్యామియగు శ్రీకృష్ణుని వచనములతో స్తుతించిరి.
రాజాన ఊచుః ।
రాజులు ఇట్లు పలికిరి --- ఓ శ్రీకృష్ణా! అవినాశివగు నీవు దేవనాయకులగు బ్రహ్మాదులను కూడ శాసించెదవు. శరణు జొచ్చినవారి ఇడుముల బాపే నీకు నమస్కారము. మేము భయంకరమగు సంసారము వలన విరక్తులమై నిన్ను శరణు జొచ్చినాము. మమ్ములను కాపాడుము.
ఓ ప్రభూ! సర్వశక్తిమంతుడవగు నీవు మధుకైటభులనే రాక్షసులను సంహరించితివి. మేమీ మగధరాజగు జరాసంధుని తప్పు పట్టము. ఎందుకంటే, రాజులు రాజ్యభ్రష్టులగుట కూడ నీ అనుగ్రహమే.
రాజ్యాధికారమును బట్టి వచ్చిన సంపదలచే గర్వించి ఉచ్చృంఖలుడైన రాజు శ్రేయస్సును పొందడు. నీ మాయచే మోహితుడైనవాడు అనిత్యమగు సంపదలు నిత్యములని తలపోయును.
అవివేకులు ఎండమావిని జలాశయమని భ్రమ పడెదరు. ఇదే తీరున అవివేకులు అసత్యమగు శబ్దాదిభోగప్రపంచము సత్యమని భ్రమించెదరు.
ఇదివరలో మా వివేకబుద్ది ధనగర్వముచే నష్టమై 'ఈ భూమిని జయించాలనే కోరికతో ఒకరితోనొకరు విరోధించెడివారము. మిక్కిలి నిర్ణయులమై మా ప్రజలను మేమే చంపుతూ, మా యెదుట మృత్యు రూపుడవై నిలిచియున్న నిన్ను లెక్కచేయక ఉత్కటముగా గర్వించితిమి.
ఓ శ్రీకృష్ణా! కాలము నీ రూపమే. దాని వేగమును తెలియుట కాని, దాని శక్తిని దాటుట గాని శక్యము కాదు. ఆ కాలము మాకు సంపదలు లేకుండా చేసినది. కాని, నీ దయచే మా గర్వము నశించి నీ పాదములను స్మరించెదము గాక!
ఓ ప్రభూ! అందువలన, రాజ్యము ఎండమావిని పోలినది. రోగములకు ఉత్పత్తిస్థానమై సర్వదా క్షీణిస్తూ ఉన్న దేహముతో ఆ రాజ్యమును సేవించవలెను. మరణించిన తర్వాత కర్మఫలరూపముగా స్వర్గాదులు లభించునని చెప్పే మాటలు చెవులకు ఇంపుగానుండును. కాని, మేము ఈ రాజ్యమును గాని, ఆ స్వర్గమును గాని కోరుట లేదు.
మేము సంసారములోనున్ననూ నీ పద్మములవంటి పాదముల స్మరణము తొలగిపోరాదు. మాకు అట్టి ఉపాయమును ఉపదేశింపుము. .
ప్రణమిల్లినవారి చిత్తమలములను నశింపజేసే శ్రీహరి వసుదేవపుత్రుడగు శ్రీకృష్ణుడై గోవులను పాలించేను. ప్రాణులలో ప్రత్యగాత్మరూపుడైయున్న ఆయన కొరకు పలు నమస్కారములు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- బంధవిముక్తులైన రాజులు శరణు జొచ్చినవారిని రక్షించే దయాళువగు శ్రీకృష్ణ భగవానుని స్తుతించు చుండిరి. ఆయన మధురమగు వాక్కుతో వారితోనిట్లనెను.
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లనెను --- ఓ రాజులారా! ఆత్మస్వరూపుడనై సర్వమును శాసించే నాయందు మీకు మిక్కిలి దృఢమైన భక్తి కలుగవలెనని మీరు కోరినారు. నిశ్చితముగా అటులనే కాగలదు.
ఓ రాజులారా! మీ భక్తినిశ్చయము మంగళప్రదము. మీరు సత్యమును పలుకుతారు. సంపద, అధికారములచే కలిగే ఉత్కటమగు గర్వము మానవులను పిచ్చివారిని చేయుట నాకు కనబడుచునే యున్నది.
హైహయుడు, నహుషుడు, వేనుడు, రావణుడు, నరకుడు, మరియు ఇతరులైన దేవదానవమానవుల ప్రభువులు సంపద వలన కలిగిన గర్వము వలన రాజ్యభ్రష్టులైరి.
శరీరము, దానితో సంబంధమున్నవి పుట్టేవి, గిట్టేవి అనే ఈ సత్యమును మీరు తెలియుడు. నన్ను యజ్ఞములతో ఆరాధిస్తూ సావధానులై ప్రజలను ధర్మబద్ధముగా పాలించుడు.
పుత్రపౌత్రాదిసంతానమును విస్తరింపజేయుడు. సుఖదుఃఖములను, లాభనష్ణ ములను, లభించిన ప్రతిదానిని సమదృష్టితో సేవించుడు. మనస్సును నాయందు నిలిపి కాలమును గడుపుడు.
మీరు దేహము, ఇంద్రియభోగములు మొదలగువాటియందు ఉదాసీనులై ఆత్మనిష్ఠులు కండు. దృఢమైన నియమనిష్ఠలతో మనస్సును నాయందు బాగుగా నిలుపుడు. సాధన సిద్దించిన (మరణించిన తరువాత పరబ్రహ్మనగు నన్ను మీరు పొందగలరు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ముల్లోకములకు ప్రభుడగు శ్రీకృష్ణ భగవానుడు రాజులకీ విధముగా ఉపదేశించి, వారికి స్నానము చేయించుటకై స్త్రీపురుషులను నియోగించెను.
భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు సహదేవుని ద్వారా ఆ రాజులకు వారి హోదాకు తగిన వస్త్రములను, ఆభరణములను, హారములను, అంగరాగములను ఏర్పాటు చేయించెను.
చక్కగా స్నానము చేసి బాగుగా అలంకరించుకున్న ఆ రాజులకు ఆయన శ్రేష్ఠమగు ఆహారముతో భోజనమునేర్పాటు చేసెను. తరువాత వారి హోదాకు తగ్గట్లుగా తాంబూలము, శయ్య మొదలగు వివిధ భోగములనేర్పాటు చేయించేను.
మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణ భగవానుడా రాజులను కష్టమునుండి విడి పించి ఆదరించెను. వారు శుద్దమగు కుండలములను దాల్చి, శరత్కాలము నందు చంద్రాది జ్యోతిర్మండలములు వలె విశేషముగా ప్రకాశించిరి.
ఆయన మణులు పొదిగిన బంగరు ఆభరణములనలంకరించుకున్న ఆ రాజులను మంచి గుర్రములు లాగే రథములనెక్కించెను. ఆయన వారికి మధురవచనములతో ప్రీతిని కలిగించి తమ తమ దేశములకు పంపెను.
ఈ తీరున పరమోదారుడైన కృష్ణుడు వారిని ఆపదనుండి విడిపించెను. వారా జగన్నాథుని, ఆయన లీలలను మాత్రమే ధ్యానిస్తూ వెళ్లిరి.
వారు పురుషోత్తముని లీలను అమాత్యులు మొదలైన రాజప్రకృతులకు చెప్పిరి. శ్రీకృష్ణ భగవానుడే విధముగా ఆదేశించెనో, వారదే విధముగా సావధానులై అనుష్ఠించిరి.
శ్రీకృష్ణ భగవానుడు భీమునిచే జరాసంధుని వధింపజేసెను. ఆయన సహదేవుని సత్కారమునందుకొని భీమార్జునులతో గూడి వెళ్లాను.
వారు శత్రువులను జయించి ఇంద్రప్రస్థమును చేరి శంఖములను పూరించి, బంధువులకు హర్షమును, శత్రువులకైతే దుఃఖమును కలిగించిరి.
ఆ శంఖధ్వనిని విని ఇంద్రప్రస్థములో నివసించే జనులు మనస్సులో ప్రీతి జెంది మగధరాజగు జరాసంధుడు మరణించి యుండునని తలచిరి. ధర్మరాజు మనోరథము (రాజసూయము) కూడ పూర్తి ఆయెను.
తరువాత భీముడు, అర్జునుడు, దుష్టజనశిక్షకుడగు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజునకు నమస్కరించి, తాము నిర్వర్తించిన కృత్యమునంతనూ వినిపించిరి.
శ్రీకృష్ణ భగవానుడు సంపన్నము చేసిన ఆ జరాసంధవధను గురించి విని ధర్మరాజు ఆనందముతో కన్నీటి బిందువును విడిచి పెట్టెను. ముంచుకొచ్చిన ప్రేమ కారణముగా ఆయన ఏమీ చెప్పలేకపోయెను.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో
శ్రీకృష్ణ భగవానుడు రాజులను బంధవిముక్తులను చేయుటను వర్ణించే
డెబ్బది మూడవ అధ్యాయము ముగిసినది (73).
* * * * *
Summary of chapter 73 of the Bhāgavata Mahā Purana is as follows:
Following Jarāsandha's death, Śrī Kṛshṇa met the ninety-six liberated kings who had been held in dark mountain dungeons. The kings, stripped of their former royal pride through suffering, fell at Śrī Kṛshṇa's lotus feet and offered profound prayers acknowledging that material empires are fleeting mirages and begging only for unalloyed devotional service. Śrī Kṛshṇa restored their kingdoms, instructed them to govern righteously as saintly rulers (*Rājarshis*), and dispatched them safely to their home realms before returning to Indraprastha to initiate the preparations for the Rājasūya Yajna.