2 - గరుడ పురాణము - ప్రేత కాండము
36 - తీర్థమరణ అనశనవ్రతాల మాహాత్మ్యము
‘పరాత్పరా! అనశన వ్రతం చాలా గొప్పదని విన్నాను గాని అదేమో తెలియలేదు. అలాగే కొంతమంది తీర్థములలో మరణిద్దామను కుంటారెందుకని? దయచేసి నాకివి చెప్పండి’
అడిగాడు గరుడుడు. చెప్పసాగాడు విష్ణువు. ‘తార్క్ష్యా! మృత్యువు రోజుల్లో కొచ్చేసిందని అర్థం చేసుకున్న జ్ఞానులు కొందరు మూడు నాలుగు రోజులలో పోతామనగా అన్న జలాలను విసర్జించి దైవచింతనలోనే గడుపుతూ దైవంలో కలిసిపోతారు. ఇది ఆత్మహత్య ఏ మాత్రమూ కాదు. ఇదే అనశన వ్రతం. ఈ విధంగా ప్రాణత్యాగం చేసినవాడు మృత్యువు దరిజేరగనే వచ్చి నాతో సమానుడైపోతాడు. అతడెన్ని రోజులు అనశనవ్రతం చేస్తాడో అన్ని శ్రేష్ఠ యజ్ఞాలను సమగ్రంగా సంపూర్ణంగా సంపన్నం చేసిన ఫలాన్ని పొందుతాడు. సన్యాసధర్మాన్ని స్వీకరించి ఏ పుణ్యతీర్థంలోనో స్వగృహంలోనో ప్రాణత్యాగం చేస్తే ఇందాక చెప్పిన యజ్ఞఫలానికి రెట్టింపు పుణ్యాన్ని సంపాదించుకోగలడు. మహాభయంకర రోగంతో బాధపడుతూ మృత్యువిక రోజుల్లో వుందని తెలియగానే నన్నే ధ్యానిస్తూ అనశన వ్రతం ద్వారా ప్రాణత్యాగం చేసిన వానికి ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుంది. ఇక ఆ జన్మలో ఏ రోగమూ అంటదు. దేవతుల్యుడై సుశోభితుడై జీవిస్తాడు. రోగగ్రస్తుడైనా సన్యాసాన్ని స్వీకరించి ఆ నియమాలన్నీ పాటిస్తూ అనశన వ్రతం చేసినవానికి పునర్జన్మ వుండదు. తాను అనశనవ్రతం చేస్తూ ప్రతి దినం సద్భ్రాహ్మణులకు భోజనాలు పెట్టి తిల-పాత్రలనూ దీపాలను దానం చేస్తూ దేవపూజన కర్మలను కూడా గావించిన వాడు మృతి చెందిన వెంటనే అన్ని లోకాలలోనూ మహర్షులు పొందిన గౌరవాన్ని పొందుతూ నివసిస్తూ చివరికి ముక్తినొందుతాడు. కాబట్టి అనశనవ్రతం వైకుంఠ ప్రదాయకమే.
పుత్ర, ధన, వైభవాది ఇహ లోక బంధాలన్నిటినీ త్యజించి తీర్థయాత్రలకై తిరుగులేని ప్రయాణం మొదలెట్టిన వానికీ బ్రహ్మానంద భరితులై బ్రహ్మాది దేవతలు తుష్టి పుష్టి ప్రదాయకులై పోతారు. యాత్రలో కూడా అనశనవ్రతం చేస్తూ దారిలోనే మృతి చెందినవారు సప్తర్షిమండలంలో శాశ్వత నివాసాన్ని పొందుతారు. అనశన వ్రతం చేస్తూ విష్ణు పాదోదకం మాత్రమే తాగిన వానికి పునర్జన్మ వుండదు. తీర్థయాత్రను చేయకుండానే మధ్యదారిలోనే మరణించిన అనశనవ్రతికి దగ్గరగా రావడానికి యమదూతలు ఇష్టపడరు. దూరంగా నిలబడి ఆ ప్రశాంతాత్మ రమ్మన్నాక వచ్చి తీసికెళతారు. అనశన వ్రతం చేయకుండా, కొంత వయసు పైబడ్డాక అన్నీ వదిలేసి తీర్థంలో నివసించి మృతి చెందిన వారికి అద్భుత ఫలాలుంటాయని విన్నావు కదా! పుణ్య తీర్థ నివాసి ఏదైనా పనిమీద పక్క వూరెళ్ళి దారిలో చనిపోయినా అతనికి పుణ్యతీర్థ నివాస, మరణ పుణ్యాలు దక్కుతాయి. మరల పుడమిపై పుట్టినపుడు ఉత్తమ దేశంలో ధనమూ, విద్యా పుష్కలంగా నున్న బ్రాహ్మణ కుటుంబంలో జనించి గొప్ప విద్వాంసుడూ, వేదజ్ఞుడనైన పండితుడవుతాడు. అనశన వ్రతమొన్నాళ్ళు చేసినా చావురానివారు క్షేత్ర తీర్థాలలోనే వుండిపోయి చాంద్రాయణ వ్రతం చేయవచ్చును.
వారు ఇంటికి మరలి వచ్చి బ్రాహ్మణుల ఆజ్ఞను పొంది ప్రాయశ్చిత్తమును చేసుకోవచ్చును. స్వర్ణ, గో, భూ, గజ, అశ్వ దానాలిచ్చి మామూలుగా జీవితాన్ని గడుప వచ్చును.
దాన మహిమను గూర్చి మరొక్క విశేషముంది. తండ్రినుద్దేశించి దానమిచ్చిన వానికి మామూలు దానానికి వందరెట్లు పుణ్యం వస్తుంది. అదే తల్లి, సోదరి, సోదరుల నిమిత్తం చేస్తే వేయి, పదివేలు, లక్ష రెట్ల పుణ్యం వస్తుంది. కష్టార్జితమే అయినా అత్యంత చంచలం కూడానైన ధనానికి ఏకైక పరమార్థం దానం.
ధర్మరక్షణ కోసం చేసే ప్రాణత్యాగం అన్నిటికన్న గొప్పది. ధర్మం కోసం నీట మునిగి ప్రాణత్యాగం చేసినవాడు ఏడువేల సంవత్సరాల పాటు స్వర్గంలో నివసించగలడు. అదే అగ్నిలో, వాయు వేగంలో, యుద్ధభూమిలో ధర్మ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికి క్రమంగా పదకొండు, పదహారు, అరవై వేల సంవత్సరాల పాటు స్వర్గనివాస ప్రాప్తి వుంటుంది. గోరక్షకై ప్రాణాలర్పించిన వారికి ఎనభై వేల సంవత్సరాల పాటు స్వర్గలోక నివాసప్రాప్తి వుంటుంది. నిరాహారవ్రతమైతే అక్షయగతి.
