2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

24 - అల్పాయువు - కారణాలు

గరుడా! మనిషి నూరేళ్ళూ బతకాలనే వేదం చెప్పింది కాని కలికాలంలో ఆ మాటకి అవాంతరం ఏర్పడింది. నిందిత కర్మలను నిరంతరాయంగా కావించువాడెక్కువ కాలముండడు. వానికి వేద జ్ఞానం కొరవడడం కారణంగా వంశంలో పరంపరగా వస్తున్న సదాచారములను పాటింపడు. బద్దకస్తుడై చేయవలసిన సత్కర్మలను చేయకపోగా దుష్టకర్మాసక్తుడై, భోజనం కూడా ఎవరింటిలోనో చేసి వేస్తూ, స్వంతంగా కుటుంబాన్ని నెలకొల్పకుండా పరస్త్రీసంగుడై కాలక్షేపం చేసే వానికి ఆయువు క్షీణిస్తుంది. శ్రద్ధాహీనులు, అపవిత్రులు, నాస్తికులు, శుభకార్యాలను చేపట్టనివారు, పరద్రోహులు, అసత్యవాదులు అయిన బ్రాహ్మణులు ఎక్కువ కాలముండరు. ప్రజలను రక్షించవలసిన వారే ఆ పని చేయకుండా, క్రూరులై, ఇటు ధర్మాచరణమూ చేయక, వ్యసనపరులై మూర్ఖులై, వేదాను శాసనాన్ని పట్టించుకోకుండా ప్రజా పీడన పరాయణులై ప్రవర్తించు క్షత్రియులను భూమాత భరించదు.

సామాన్య మానవులు కూడ కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. స్నానదానాదులు లేకుండా రోజులు గడిపేవారు వ్యర్థులే.

స్నానం దానం జపో హోమో స్వాధ్యాయో దేవతార్చనం ।

యస్మిన్ దినే నసేవ్యంతే స వృథా దివసో నృణాం ॥ ఽ4.19

పక్షీంద్రా! పుట్టినవాడు గిట్టక తప్పదు. మరణించినవాడు మరల పుట్టుట కూడా సహజమే కాని, దానిని తప్పించిన వారున్నారు. మనిషి మరణం లేకుండా కోరుకోవడం అన్యాయమే. కాని మరల పుట్టుక వుండకూడదనుకోవడం అనగా జన్మరాహిత్యాన్ని వాంఛించడం మంచిది. ఆ కోరిక తీరాలంటే లెక్కలేనన్ని త్యాగాలు చేయాలి, అనంతంగా శ్రమ పడాలి. తనకెంతో ప్రియమైన వాటినన్నిటినీ దానం చేసి వేయాలి.

తిన్నది అరిగించుకొనే శక్తి, రతి శక్తి, దాన శక్తి - ఈ మూడూ దుర్లభ శక్తులు. సరైన భోజనం, అనుకూలవతియైన స్త్రీ, ధర్మ న్యాయార్జిత ధనం - ఈ మూడు వస్తువులూ ఆ మూడు శక్తులు మనిషిని మోక్షం వైపు నడిపిస్తాయి.

భోజ్యే భోజన శక్తిశ్చ రతిశక్తిర్వర స్త్రియః ।

విభవే దానశక్తిశ్చనాలస్య తపసః ఫలం ॥

దానాద్భోగా నవాప్నోతి సౌఖ్యం తీర్థస్య సేవనాత్ ।

సుభాషణాన్ మృతోయస్తు స విద్వాన్ ధర్మ విత్తమః ॥ ఽ4.45

అదత్త దానాచ్చ భవేద్దరిద్రో

దరిద్రభావాచ్చ కరోతి పాపం ।

పాపప్రభావాన్నరకం ప్రయాతి

పునర్దరిద్రః పునరేవ పాపీ ॥ ఽ4.46

దానం చేయనివాడు దరిద్రుడై పుడతాడు. ధనసంపాదన కోసం పాపాలు చేస్తాడు. పాపాల వల్ల నరకానికి పోతాడు. మరల దరిద్రునిగానే పుడతాడు.