2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

26, 27 - సపిండీకరణ శ్రాద్దము యొక్క గొప్పతనం ప్రతివర్ష విహిత మాసిక శ్రాద్ధ అనివార్యత

గరుడా! మనిషి మరణానంతరం ఒక యేడాది మహా-పథ యాత్రను చేస్తాడు కదా! అప్పుడు ఎవరికైతే పుత్రపౌత్రాదుల ద్వారా సపిండీకరణ శ్రాద్ధం జరుగుతుందో వారు పితృలోకానికి వెళతారు. కాబట్టి ఏడాది పూర్తి కాగానే తద్దినం పెడుతుండాలి. అలాగే వర్షాంతంలో ప్రేత పిండాన్ని కూడా జతపఱచాలి. దాని వల్ల ఏ కారణంగానైనా ప్రేతయోనిలో పడిన పితరులకు దాని నుండి విముక్తి లభిస్తుంది. అప్పుడు వారు పితృలోకవాసులవుతారు. (అక్కడ తపస్సు చేసి నరకాన్ని తప్పించుకొనే అవకాశం లభిస్తుందని ఇతరత్ర చెప్పబడింది- అను)

గృహస్థు ఇంట్లో ఎవరైనా మృతి చెందితే అపరకర్మలు ముగిసేదాకా ఆ గృహంలో శుభకార్యాలను చేయరాదు. సపిండీకరణ జరిగే దాకా భిక్షువులా ఇంటి భిక్షను స్వీకరింపరాదు. సాధారణంగా పదురెండవ దినాన్నే సపిండీకరణకు ప్రశస్తంగా భావిస్తారు. మృతవ్యక్తి అగ్నిహోత్రియైనా కాకున్నా పన్నెండవ రోజునే సపిండీకరణ చెయ్యాలి. కొందరు ఋషులు మాత్రం పన్నెండవరోజు, మూడవ పక్షం, అరవ మాసం, వర్షాంతంలలో ఏదో ఒక రోజు సపిండీకరణం చెయ్యవచ్చని అంగీకరించారు.

పుత్రవంతునికి సపిండీకరణ తరువాత ఎప్పుడూ కూడా ఏకోద్దిష్టాన్ని చేయరాదు. శ్రాద్ధములెన్ని పెట్టినా ఎక్కడ నిర్వహించినా ఏకోద్దిష్టం పనికి రాదు. పుత్రుడు శక్తి ఉన్నా లేకపోయినా తన తండ్రికి పార్వణ శ్రాద్ధం పెట్టవలసినదే. పుత్రరహితునికి సపిండీకరణ శ్రాద్ధం పెట్టరాదు.

బ్రాహ్మ (మరియు శాస్త్రోక్త) వివాహం ప్రకారం పెండ్లి జరిగిన (వృద్ధురాలై) మృతి చెందిన స్త్రీకి పతి గోత్రంతోనే కర్మ చేయాలి. ఆసురాది అశాస్త్రీయ వివాహితకు ఆమె తండ్రి గోత్రంతో ఆ కర్మను చేయాలి. మృతునికి అపరకర్మలు చేయడానికధికారి ఎవరనేది ఇదివఱకే చెప్పబడింది కదా! అయితే ఈ విషయంలో మనువు ఇలా నిర్ణయించాడు :

భ్రాతౄణా మేకజాతానా మేకశ్చేత్ పుత్రవాన్ భవేత్ ।

సర్వేతే తేన పుత్రేణ పుత్రిణో మనురబ్రవీత్ ॥ ఽ6.ఽ6

అన్నదమ్ములలో నొకడే పుత్రవంతుడైతే ఆ అన్నదమ్ములందరికీ పితృకార్యాలకు ఆ పుత్రుడే అధికారి అవుతాడు. చూడాకరణ - ఉపనయన సంస్కారాలు జరిగిన పుత్రుడు తన తండ్రి శ్రాద్ధకర్మను నిర్వహించవచ్చును. చూడాకరణం మాత్రమే జరిగిన పుత్రుడు కూడా కర్మనైతే చేయవచ్చును. కానీ స్వధామంత్రాలనే పలకాలి; వేదమంత్రాలను చదువరాదు.

స్త్రీకి సపిండీకరణం ఆమె పతి, మామ, మామగారి తండ్రిలతో కలిపి జరుపబడాలి.

గరుడా! సంవత్సర కాలంలో ప్రేత సంబంధి క్రియను దేనిని చేసినా విద్వాంసులు మృతుని నామ గోత్రాల నుచ్చరిస్తూనే చేయాలి. సపిండీకరణం చేసి భోజన, ఘటాదిక దానాలనూ, పద దానాలనూ, ఇతర దానాలనూ అన్నిటినీ మృతవ్యక్తి నుద్దేశించే చేయాలి. ఏడాదికి సరిపడునట్లుగా లెక్కవేసి అన్నాన్నీ జలపూర్ణఘటాలనూ బ్రాహ్మణులకు దానమివ్వాలి. పిండదానం తరువాత, యథాశక్తి, సంవత్సర గ్రాసాన్ని బ్రాహ్మణుని కివ్వాలి. అలా చేస్తే మృతవ్యక్తి యముని వద్దకు దివ్య దేహధారియై విమానంలో సుఖంగా వెళ్ళగలడు.

అన్నం పానీయ సహితం సంఖ్యాం కృత్వాబ్ది కస్యచ ।

దాతవ్యం బ్రాహ్మణే పక్షిం జల పూర్ణ ఘటాదికం ॥

పిండాంతే తస్య సకలా వర్షవృత్తిః స్వశక్తితః ।

దివ్యదేహో విమానస్థః సుఖం యాతి యమాలయం ॥ ఽ6.36

తండ్రి ఉండగానే కొడుకు మరణిస్తే అతని సపిండీకరణలో తండ్రి పేరుండదు; తాత ముత్తాతలవే ఉంటాయి. అలాగే పతి ఉండగానే మరణించిన స్త్రీ సపిండీకరణలో అమె మామగారు, ఆయన తండ్రి గోత్ర నామాలుంటాయి.

గమనిక కొన్ని ప్రత్యేక పరిస్థితులెదురైనపుడు కర్మ చేయవలసిన పద్దతి, సతి అగ్ని ప్రవేశంతో సహా, జిజ్ఞాసువుల కోసమే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది.

ఖగరాజా! మృతప్రాణికి సుఖాన్ని కలిగించే కొన్ని విశేష కర్మలనిప్పుడు వినిపిస్తాను. మృతి తరువాత పన్నెండవ రోజు యథావిధిగా సపిండనాది సమస్త కార్యాలనూ నిర్వర్తించిన తరువాత ఆ ఏడాది పొడుగునా ప్రతి దినమూ నీటికుండలనూ అన్నాన్నీ దానం చేస్తూ మాసిక శ్రాద్ధాలను కూడా పెట్టాలి. ప్రేతకార్యమున్న రోజు ఇంకే కార్యాన్నీ చేపట్టరాదు. అలా చేస్తే నష్టం జరుగుతుంది. మృతునికై చేసే కార్యాలను అదే యేడాదిలో మరల మరల చేస్తుంటే ప్రేతానికి సుఖం కలుగుతుంది. నిజానికి అక్షయ సుఖాలే అబ్బవచ్చు. రోజూ చేసే దానానికి అదనంగా ప్రతి మాసంలోనూ మృతుడు పోయిన తిథినాడు అన్నోదక పూర్ణఘటాలను దానం చేయవచ్చును. వృద్ధి శ్రాద్ధ సపిండీకరణలో కూడా ప్రతి మాసంలో ఒక పిండాన్నీ, అన్నాన్నీ, జల పూర్ణ కుంభాలనూ దానం చేయవచ్చును.

(బభ్రువాహన మహారాజు కథే మరల ఇక్కడ కనిపిస్తుంది. అయితే రెండు విషయాలు అదనంగా చేర్చబడ్డాయి. వాటిని అనుబంధంలో చూడవచ్చును)