2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

23 - ప్రేతాలు కల్పించే స్వప్నాలు, వాటికి ప్రాయశ్చిత్తాలు

ఎవరి కోసమని భ్రమిస్తూ ఇన్ని పాపాలు చేసి ఈ ప్రేత యోనిలో పడిపోయి బాధలు పడుతున్నామని ఈ ప్రేతాలు అనుకుంటాయో వారినే వచ్చి పట్టుకుంటాయి. తమ సతీసుతుల, బంధుమిత్రుల కలలలో భయంకరమైన అశ్వాలుగా, ఏనుగులుగా, ఎద్దులుగా, వికృతరూపులైన మానవులుగా కనిపించి బాధిస్తాయి. కొంతమంది నిద్రపోతుండగా వచ్చి వారి శయ్యలను అన్ని విధాలా అపభ్రంశం చేసి పడేస్తాయి. మనిషి తెల్లారి లేచి చూసుకొనే సరికి తానూ తన పక్కా చాలా అసహ్యకరంగా తయారౌతారు. కొందరికి తాము సంకెళ్ళచే బంధింపబడినట్లు కల వస్తే మరికొందరికి చనిపోయిన తమ వారు పరువు తక్కువ, నిందనీయ వేషాలలో తిరుగుతున్నట్టు కల వస్తుంది. తింటున్న వాని నుండి అన్నాన్ని తామే లాగుకొని పారిపోతున్నట్లు, దాహంతో ఆబగా నీరు త్రాగబోతున్న వారి నుండి ఆ నీటిని తామే లాక్కొని పారిపోతున్నట్లు కొందరికి కలలు వస్తాయి. ఇవన్నీ ప్రేతాల నిర్వాకాలే. ప్రేతాలలో ఒక రకమే పిశాచాలు. ఇవన్నీ వాటి విన్యాసాలు.

ఎద్దు మీద సవారీ చేస్తున్నట్లు, ఎద్దులతో కలసి ఎక్కడికో వెళుతున్నట్టు, ఆకాశంలో భయంగా పడిపోయేలా ఎగురుతున్నట్టు, ఆకలితో అలమటిస్తూ తీర్థంలో తిరుగుతున్నట్టూ, ఆవు, ఎద్దు, గుఱ్ఱం, పక్షులతో తన గొంతులోనే వాటి భాషను మాట్లాడుతూ గోష్టి సలుపుతున్నట్లూ, తన నుదుటిపై తనకే ఏనుగు, దేవతలు భూతప్రేత నిశాచరాదుల చిహ్నాలు కనిపిస్తే తనకీ పిశాచజన్మే వస్తుందని అర్థం.

పక్షీంద్రా! ప్రేతయోని సంబంధితాలైన ఎన్నో చిహ్నాలు కలల్లో వచ్చి కంగారు పెట్టేవి ఉన్నాయి. తన అన్నదమ్ములు, భార్య, కొడుకు ఎవరైనా పోయినట్టు కల వస్తే అది ప్రేత దోషమే. మనిషికి ఆకలిదప్పులతో తాను ఆరాటపడుతున్నట్లూ వాటిని తీర్చండి మహాప్రభో’ అని ఎవరినో యాచిస్తున్నట్లు కల వస్తే ప్రేత దోషాన్ని వదలించుకోవాలని వెంటనే ఏదైనా తీర్థానికి పోయి తన పితరులందరికీ పిండదానం చేసి ప్రేతసంతృప్తిని సాధించాలి. పుత్ర, పితా, భ్రాత, పత్ని, పశు, పత్యాది ముఖ్యులు. ఇల్లు వదలి బయటికి పోతున్నట్టు కల వచ్చినా కూడా ప్రేత దోషముందని అర్థము.

ఇలాటి స్వప్న దోషాలకు ప్రాయశ్చిత్తమెలా చేయించుకోవాలో విను. వ్యక్తి ఇంట్లో గాని తీర్థంలోగాని స్నానం చేసి మారేడు మూలంలో జల తర్పణమివ్వాలి. వేద పారంగతులైన బ్రాహ్మణులను బాగుగా పూజించి వారికి నల్లని ధాన్యాలను దానమివ్వాలి. తరువాత యథాశక్తి హవనం చేసిన పిమ్మట గరుడ పురాణ పారాయణ చేయించుకోవాలి. శ్రద్ధాపూర్వకంగా ఈ అధ్యాయాన్ని చదివినా, విన్నా వారికి ఏ ప్రేతదోషమూ అంటదు. అప్పటికే అంటి వుంటే మంటిలో కలసి పోతుంది.