2 - గరుడ పురాణము - ప్రేత కాండము
35 - సపిండీకరణ శ్రాద్ధంలో ప్రేతపిండాన్ని కలిపే పద్దతి - పితర ప్రసన్నత - ఫలితం, పంచకమరణం - శాంతి విధానం, ప్రేత శ్రాద్ధంలో త్యజించవలసిన 18 పదార్థాలు, మూడు షోడశులు, శవయాత్ర
గరుడా! తల్లిపోయి ఆమె పై తరాల వారిద్దరూ బతికే వుంటే, అలాగే తండ్రి పోయి తాత, ముత్తాతలిద్దరూ వుంటే సపిండమెలా పెట్టాలి - అని అడిగావు కదా! విను. ఇట్టి (అ) సందర్భాలలో పుత్రుడు తన తల్లికి పెట్టే పిండాన్ని ఉమా, లక్ష్మీ, సరస్వతీ దేవులతో కలిపి పెట్టాలి. ఈ సంసారంలో ముగ్గురు పురుషులు పిండభోగులైతే ముగ్గురు త్యాజకులు, ముగ్గురు పిండాను లేపకులు, పదవవాడు పంక్తి సన్నిధుడు. యజమాని (అంటే యజ్ఞం చేసేవాడు లేదా శ్రాద్ధకర్మను చేయువాడు) తనకు ముందలి పదిమంది పురుషులనూ తన తరువాతి పది తరాల పురుషులను ఉద్దరించగలడు. మొదట చెప్పబడిన ముగ్గురు పురుషులూ - అనగా తండ్రీ తాతా ముత్తాతా సహీండీకరణం చేయగానే సపిండులుగా భావింపబడతారు. ముత్తాత తండ్రిని వృద్ధప్రపితా మహుడంటారు. ఆయనా ఆయన తండ్రి తాతలూ ‘త్యాజక’ రూపంలో స్వీకరింపబడతారు. ఆపై మువ్వురినీ లేపకులంటారు. ఆపై పంక్తి సన్నిధుడుంటాడు.
ఈ పితరులు ప్రసన్నులైతే ఏమివ్వగలరో చెప్తాను. విను. పుత్రుని శ్రాద్ధకర్మ ద్వారా ఆనందించిన తండ్రి వానికి సత్సంతానమును ప్రసాదిస్తాడు. వంశపరంపర అవిచ్చిన్నంగా కొనసాగుతుంది. దానిని పితామహుడు చూసుకోగలడు. శ్రాద్ధకర్త యొక్క ప్రపితామహుడు స్వర్ణదాత కాగలడు. వృద్ధ ప్రపితామహుడు అన్నవృద్ధిని అందించగలడు.
గమనిక ప్రపితామహుడు శ్రాద్దకర్త యొక్క గో సంపదను వృద్ది చేస్తాడని చెప్పబడింది.
ధనిష్ఠ నుండి రేవతీ దాకా గల నక్షత్రాలకు అశుభ నక్షత్రాలుగా కొన్ని సందర్భాలలో పరిగణన వుంది. రేవతి దాటే దాకా దహనం చేయకూడదంటారు. కాని మృతశరీరాన్ని అన్నాళ్ళు సంరక్షించడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఈ నక్షత్రకాలాలలో మృతి చెందిన వారినుద్దేశించి కొంత శాంతి కార్యాన్ని చేసి అప్పుడు శవానికి దహనాది అంత్యక్రియలు నిర్వహించాలి.
ధనిష్ఠా పంచకాలలో మృతి చెందిన వారికి సద్గతి కలగాలన్నా కర్మ చేసిన వారికి అరిష్టం తొలగాలన్నా విప్రులకు మృతవ్యక్తి నుద్దేశించి నువ్వులు, గోవు, బంగారం, నెయ్యిలను యథాశక్తి దానం చెయ్యాలి. దీని వల్ల అన్ని ఉపద్రవాలూ తొలగిపోతాయి. అశౌచం సమాప్తం కాగానే మృతప్రాణికి సద్గతి లభిస్తుంది. పాత్ర, పాదుక, ఛత్ర, స్వర్ణ ముద్ర, వస్త్ర, దక్షిణలను బ్రాహ్మణులకు ఈ సందర్భంలో దానం చేస్తే పైన తండ్రీ, క్రింద కొడుకులూ కూడా అన్ని విధాలా ఉద్దరింపబడతారు. ఈ విధంగా ధనిష్ఠా పంచకాలకు శాంతి, ప్రాయశ్చిత్తాలను చేయకపోతే నష్టం జరుగుతుంది.
ప్రేతశ్రాద్ధంలో ఈ క్రింది పదునెనిమిదీ ఉండకూడదు. అవి ఆశీర్వాదం, ద్విగుణకుశ, అగ్నౌకరణ, ఓంకారం, ఒకటి కన్న నెక్కువ పిండాలు, ఉచ్చిష్ట శ్రాద్ధం, వైశ్వదేవర్చాన, వికిరదానం, స్వధా ఉచ్చారణ, పితృశబ్ధోచ్చారణ, ‘అను’ శబ్ద ప్రయోగము, ఆవాహన, ఉల్ముఖం, ఆసీమాంత గమనం, విసర్జన, ప్రదక్షిణ, తిలహోమం, పూర్ణాహుతి, బలివైశ్వదేవం.
ఇక షోడశులు. ప్రథమ షోడశిని మలిన షోడశి అంటారు. దీనిని మృత్యు స్థానం, ద్వారం, సగందారి, చితి, శవం చేతిలో, ఆరవ శ్రాద్ధం అస్థి సంచయ కాలంలో జరగాలి. తరువాత పది రోజుల పాటు ఒక్కొక్క పిండంతో చేసేవి కూడ మలిన శ్రాద్ధాలే అవుతాయి.
ద్వితీయ షోడశ మధ్యమ షోడశి అనబడుతుంది. ఇందులో మొదట పద్ధతిగా పదకొండు శ్రాద్ధాలను పెట్టాలి. తరువాత బ్రహ్మ, విష్ణు, శివ, యమ, తత్పురుషుల పేరిట అయిదు శ్రాద్ధాలను పెట్టాలి. వీటి తరువాత నెలకొక్కటి చొప్పున్న పన్నెండు, అవీ కాక పదకొండవ మాసంలో ఊనాబ్దిక, త్రిపాక్షిక, ఊనమాసిక, ఊనషాణ్మాసిక శ్రాద్ధాలను పెట్టాలి. శవశోధన కోసం ఆద్య శ్రాద్ధాన్నీ అన్య త్రిషోడశ శ్రాద్ధకర్మలనూ చేసి వీటన్నిటినీ పితృపంక్తి విశుద్ధి కోసం చేసే యాభయ్యవ శ్రాద్ధంతో కలపాలి. అపుడే మృతులు పితృపంక్తిలో కలిసే యోగ్యతను పొందుతారు. ఇదే పంక్తి సన్నిధి.
శవయాత్ర ప్రారంభానికి ముందే తయారు చేయించిన పాడెకు శవం కాలు సేతులను కట్టి వెయ్యాలి. దానికి ముందే రెండు కాళ్ళ బొటన వ్రేళ్ళను కట్టి వుంచాలి. ఇలా చేయకపోతే వాటిని పిశాచాలు పట్టుకుంటాయి. శవాన్నెప్పుడూ ఒంటరిగా వుంచరాదు. అలా వుంచితే దుష్టయోని ప్రమాదముంటుంది. గ్రామమధ్యంలో శవమున్నపుడు భోజనం చేయరాదు. అలా చేస్తే అన్న జలాలకు బదులు మాంసరక్తాలను తిన్న పాపం వస్తుంది. అలాగే శవయాత్ర గ్రామమధ్యంలోకి వచ్చియున్నపుడు తాంబూల సేవనం, దంత ధావనం, భోజనం, స్త్రీ సహవాసం, పిండదానం చేయరాదు. అలాగే ఆ సమయంలో స్నానం, దానం, జపం, హోమం, తర్పణం, దేవపూజనం చేసినా వ్యర్థాలై పోతాయి.
