2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

20 - ప్రేతబాధల స్వరూపం - వాటి నుండి విముక్తి

గరుడా! ఇక ప్రేతాల గూర్చి అడిగావు కదా, విను. కపటం, మోసం వీటికి మూలం. ఇతరుల ధనాన్నీ స్త్రీలనూ ద్రోహబుద్ధితో అపహరించే వారు రాక్షసాది నిశాచర యోనుల్లో పుడతారు. పుత్ర మోహం కొద్దీ వారి సుఖం కోసం అన్ని రకాల మోసాలూ, దౌర్జన్యాలు చేసి కూడబెట్టి చచ్చినవారు శరీర రహితులై ఆకలి దప్పులతో అలమటిస్తూ గాలిలో ధూళిలో తిరుగుతుంటారు. వీరు, దొంగల వలె, పితరుల కోసం అక్కడక్కడ పెట్టిన జలాన్నపహరిస్తుంటారు. ఈ పాపం వల్ల వారి ప్రేత జీవనం మరింత కాలం పెరిగిపోతుంది. వారే జ్వరాలుగా రోగాలుగా పీడలుగా మారి స్వంత ఇంటిలోనే చేరి తమ వారినే పట్టి పీడిస్తుంటారు. తలనొప్పులూ, విషూచులు - ఇలాటి అనేక రోగాలు కారణం లేకుండానే, నియమ బద్ధంగా ఆహారం తీసుకొనేవారికి కూడా తగలడం ఈ ప్రేతాల చలవే.

బతికున్నంతకాలం తామెంతగానో ప్రేమించినవారినే చచ్చి ప్రేతాలైన వీరు బాధిస్తారు. తమ ఇంటి సమీపంలో నున్న ఇతరులను కూడా, వారు అధర్మం చేస్తేనే, బాధించగలరు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. ప్రేత బంధువులైనా ఇతరులైనా శ్రీ రుద్ర భగవానుని మంత్రాన్ని జపిస్తూ, ధర్మానురక్తులై, దేవతలనూ అతిథులనూ పూజిస్తూ, సత్య, ప్రియ వచనాలనే పలుకుతూ వున్నంతకాలం ఏ ప్రేతమూ వారి ఇంటి చాయలకైనా వెళ్ళలేదు. ప్రేతాలు నాస్తికులనూ ఇతరత్ర పాపులనే ముట్టుకోగలవు.

రౌద్రజాపీ ధర్మరతో దేవతాతిథి పూజకః ।

సత్యవాక్ ప్రియవాదీ చ న ప్రేతైః స హి పీడ్యతే ॥

సర్వక్రియా పరిభ్రష్టో నాస్తికో ధర్మనిందకః ।

అసత్య వాద నిరతో నరః ప్రేతైః స పీడ్యతే ॥ ఽ0.17

గరుడా! కలికాలంలో అపవిత్ర క్రియలను గావించేవారు ప్రేతయోనిలో పడతారు. లోకంలో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలలో నొకడు సుఖపడవచ్చు, మరొకడు పాపకర్మలను చేయడానికే ఇష్టపడవచ్చు, వేరొకడు ప్రేతాలచే పీడితుడు కావచ్చు, ఇంకొకడు ధనధాన్యాలతో సంపన్నుడుగా నుండవచ్చును. వీరిలోనే సంతాన వంతుడొకడైతే ఉన్న ఒక్క కొడుకూ వేరొకనికీ దక్కకపోవచ్చు. కొడుకులే ఒకడికీ పుడితే మరొకడికీ కూతుళ్ళే కలగవచ్చు. కాబట్టి ఎవని కర్మఫలం వానిదే. దానికి పుట్టుకతో సంబంధం లేదు. అలాగే ప్రేతాలు పట్టుకున్నపుడు కర్మయే కారణమవుతుంది కాని వంశ ప్రతిష్ఠ కాదు.

ప్రేత దోషం కూడ అందరికీ ఒకలాగే వుండదు. ప్రేతగ్రస్తులలో నొకడికి అనుకోకుండా అందరు బంధువులతోనూ విరోధం వస్తుంది. మరొకడు సంతానహీనునిగా మిగిలిపోవచ్చు. కొందరికా సంతానం మిగలదు. కొందరు పశుహీనులూ బంధుహీనులూ ధనహీనులు అయిపోతారు. కొన్ని ప్రాంతాల్లో ప్రేత ప్రమేయం వల్ల ప్రకృతి పరివర్తనం చెందడం కూడా వుంది. మాతాపితలను ఎవడైనా హత్య చేశాడంటే వాడిని ప్రేతం పట్టుకొందని నిశ్చయించుకోవచ్చు. నాస్తికత కూడా ప్రేత ప్రభావమే. నిత్యకర్మలపై ఆసక్తి పోయి జపహోమాలను మాని వేయాలనే బుద్ధి పుట్టడం ప్రేత ప్రేరణం. అలాటి వానిలో పరధనాప హరణాలోచన కూడా ప్రేత నిర్ణయమే. ఇలా మనిషికి జరిగే ప్రతి కీడు వెనుకా ప్రేత ప్రమేయముంటుంది. పాపపుటాలోచనలున్న వారినే ప్రేతం ఆవహించి భాధించగలదు.