2 - గరుడ పురాణము - ప్రేత కాండము

Table of Contents

33 - యమరాజ చిత్రగుప్త భవనాల, స్వరూపాల వర్ణన

గరుడా! యమమార్గమెలా వుంటుందో విన్నావు కదా! దాని చివర దక్షిణ నైరృత దిశలో వివస్వత పుత్రుడైన యమరాజు పురి వుంటుంది. ఈ దివ్య నగరం సంపూర్ణ వజ్రమయం. దేవతలూ అసురులూ ఎవరూ దానిని భేదించలేరు. అనగా ఆయన ఆజ్ఞ లేనిదే ప్రవేశించలేరని భావము. చతురస్రాకారంలో నున్న ఆ నగరికి నాలుగు ద్వారాలూ, ఏడు ప్రాకారాలూ, తోరణాలూ ఉంటాయి. యమధర్మరాజు స్వయంగా తన దూతలతో అందులోనే నివసిస్తాడు. ఈ నగర విస్తారమొక వెయ్యి యోజనాలు. అన్ని ప్రకారాల రత్నాలతో పరివ్యాప్తమై, నిత్యం మెరుస్తుండే కాంచన కాంతులతో సూర్యసమాన కాంతులను వెదజల్లే ఆ నగరిలో యమధర్మరాజు భవనం బంగారు కాంతులతో మెరసిపోతుంటుంది. అదొక అయిదు వందల యోజనాల్లో వ్యాపించి వుంది. వెయ్యి స్తంభాలపై నిలబెట్టబడిన ఆయన కొలువు వజ్రఖచిత, వైఢూర్యసజ్జిత ఆసనాలతో అలంకరింపబడి వుంది. దాని గవాక్షమంతా ముత్యాల తాపడంతో అలరారుతుంటుంది. వందలకొద్దీ పతాకలు రెపరెపలాడుతూ వుంటాయి. వందల కొద్దీ ఘంటల ధ్వనులెల్ల వేళలా వినబడుతుంటాయి. తోరణ ద్వారాలు లెక్కకు మిక్కిలిగా వున్నాయి. ఇంతేకాక అనేక అన్యాన్యా భూషణాలతో ఆ నగరం విలసిల్లుతుంటుంది. అందులో పది యోజనాల మేర నీల మేఘ సమాన శోభా సంపన్నమైన సమ, శుభ ఆసనంపై భగవంతుడైన యమధర్మరాజు స్థితుడై వుంటాడు. ఆయన ధర్మజుడు, ధర్మశీలి, ధర్మయుక్తుడు, లోకకల్యాణకారి. ఆయన రూపము పాపులకు మాత్రమే భయంకరంగా వుంటుంది కాని ధర్మపరులకూ అక్కడి ఇతర జనులకూ చల్లగా అందంగా సుఖకరంగా వుంటుంది. అక్కడ శీతల మండవాయువు ప్రవహిస్తుంటుంది. అనేక రకాల ఉత్సవాలు జరుగుతుంటాయి. ధర్మసూక్ష్మాలకి సంబంధించి వ్యాఖ్యానాలు వినవస్తుంటాయి. మంగళకరంగా గంటలు మోగుతుంటాయి. ఇంతటి దివ్యమైన వాతావరణంలో నిత్యం ప్రాణుల మేలునే కోరుకొంటూ కొలువు దీరి వుంటాడు యమధర్మరాజు.

యమ నగరి మధ్యలో ఏబది యోజనాల విస్తీర్ణంలో చిత్రగుప్తుని భవనముంటుది. దాని యెత్తు పది యోజనాలు. దాని చుట్టూ ఇనుప పరిఖ నాలుగు వైపులా వుంటుంది. దాని మధ్య గొప్ప దివ్యభవనం ఆయన నివాసం. ఈ భవనానికి వందల సంఖ్యలో దారులున్నాయి. అవన్నీ పతాకలతో సుశోభితాలై వుంటాయి. కొన్ని వేల దీపాలు నిత్యం వెలుగుతుంటాయి చిత్రగుప్తుని భవనంలో. ఈ సదనంలో నిత్యం గీతాల ఆలాపనలూ వాద్యయంత్రాల ధ్వనులూ, వాద్యయంత్రాల ఆలాపనలూ వినిపిస్తుంటాయి. ఈయన భవనంలో బ్రహ్మాండమైన అతిలోక రామణీయకంతో విలసిల్లే చిత్రపటాలూ, కుడ్యచిత్రాలు వుంటాయి. వీటి మధ్య ముత్యాలచే నిర్మితమై పరమ విస్మయకరమైన పనితనంతో చేయబడిన సింహాసనంపై ఆసీనుడై లోకబాంధవుడైన చిత్రగుప్తుడు మనుష్యుల, అన్య ప్రాణుల ఆయుగణనను చేస్తుంటాడు. ఆయనకు పుణ్యులపై మోహం కాని పాపులపై కోపం గాని వుండవు.