3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

44 - గణపతి స్తోత్రము

పార్వత్యువాచ- పార్వతీదేవి ఇట్లు పలికెను –

ఈ దుర్గాదేవి శంకరుని దాసియను విషయమందరకును తెలియును. ఇంకను నేను ఎట్టి కోరికలు లేని దాసిని. అట్టి దాసి బ్రతికియున్నను ఆమె జన్మ వ్యర్థమేయగును. అటువంటి దాసీపుత్రుడగు గణపతి మరియు నీ శిష్యుని నీవు విచారించుట సమంజసము. ఈ విషయమున నీకు వీరభద్రుడు, కుమారస్వామి, నీ ఆనుచరులందరు సాక్ష్యముగానున్నారు. వీరందరకు గణపతి భార్గవ రాములు సమానమైన వారే. ధర్మ నిరూపణస మయమున సాక్ష్యమిచ్చునప్పుడు సత్పురుషులకు శత్రువైనను, మిత్రుడైనను ఒకే విధముగానుందురు. అట్లే ఒకరిపై ద్వేష భావముకాని, మరియొకరిపై ప్రేమగానియుండదు. అందు వలన సాక్ష్యముచ్చునప్పుడు అబద్దములను ఎవరుకూడ చెప్పరు. సభలో తెలిసిన విషయమును సంకల్పములోనైన, కోపములోనైన, లోభము, భయమువంటి కారణములవలన కాని వక్రీకరించి చెప్పినచో అతడు తన వంద తరముల వారిని కుంభీపాక నరకమునకు పంపును. అట్లే అతడు సూర్య చంద్రులున్నంత వరకు తనవారితో కలిసి కుంభీపాక నరకముననుండును.

నేను గణపతి, భార్గవరాముల దోషములను నిర్ణయించి చెప్పగలిగినప్పటికిని నా భర్తయగు మీ ముందు చెప్పుట వేద విరుద్ధము కాగలదు. రాజున్న సభలో కింకరునివలె సూర్యుని ముందు మిణుగురు పురుగువలె మీముందు నాజ్ఞానము వెలవెలబోవును. చాలాకాలము తపస్సుచేసి నిన్ను భర్తగా పొందితిని. అందువలన మీ భయము వలన నేను న్యాయ నిర్ణయము చేయలేకున్నాను, భార్గవరాముడు నా పుత్రునకు గాయము కలిగించేనను కోపముతో, దుఃఖముతో, నా పుత్రునిపైగల వాత్సల్యముచే నేను చెప్పిన మాటలను మీరు క్షమింపుడని తన భర్తయగు శివుని పార్వతి కోరినది.

మీరు కోపముచే నన్ను వదలిపెట్టిన నాకు పుత్రుడున్నను లాభములేదు. మంచి కులమునందు పుట్టిన పతివ్రతా స్త్రీ కి నూరుగురు పుత్రులకంటె భర్త గొప్పవాడుగా కనిపించును. తెలివిలేనిది, చెడుకులమున పుట్టినది, చెడు నడక గల స్త్రీ తన భర్తను గౌరవించదు.

సత్కులములో పుట్టిన సాధ్వీమణి తన భర్త దుష్టుడైనను, పతితుడైనను, మూర్ఖుడైనను, దరిద్రుడైనను, రోగియైనను, జడస్వభావము కలిగియున్నను అతనిని విష్ణుమూర్తిని గౌరవించినట్లు గౌరవించును. ఆగ్ని, సూర్యుడు ఎంతగొప్ప తేజస్సంపన్నులైనను పతివ్రతా తేజస్సులో పదునారవవంతైన కాజాలరు, అట్లే గొప్పవైన దానములు, పుణ్య కార్యములు, సర్వ వ్రతములు, సమస్త ఉపవాసములు ఇవన్నియు భర్తృసేవలో పదునారవ వంతైనను కాజాలవు. సత్కులములో జన్మించిన పతివ్రతా శిరోమణికి పుత్రుడు గాని, తండ్రి గాని, సోదరుడు గాని, సమీప బంధువు గాని ఎవ్వరైనను తనభర్తతో సమానమైన వారు కాజాలరని పార్వతీదేవి పలికెను.

ఈవిధముగా పార్వతీదేవి భర్తతో పలికి, తనభర్తయొక్క పాదపద్మములను సేవింపుచు నిర్భయముగా నున్న భార్గవరాముని చూచి ఇట్లు పలికెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికేను.

ఓ భార్గవరామా! నీవు బ్రాహ్మణుడవు. పైగా పండితుడవు. జమదగ్ని మహర్షియొక్క పుత్రుడవు. పరమ యోగియైన శంకరునకు శిష్యుడవు. ఇక నీ తల్లియగు రేణుక మహాపతివ్రత లక్ష్మీదేవి యొక్క అంశ కలది. సద్వంశములో జన్మించినది. అట్లే నీ మాతా మహుడగు రేణుకుడు విష్ణుభక్తుడు. నీ మేనమామ నీ తాత గారి కంటే ఎక్కువ విష్ణు భక్తి గల వాడు. నీవు మను వంశమునకు చెందిన రేణుక భూపతికి దౌహిత్రుడవు. నీ మేనమామ సాధు స్వభావము గలవాడు, బల పరాక్రమ వంతుడు, విష్ణుభక్తుడు కూడ. మరి నీవు ఎవరి దోషమువలన ఈ విధముగా ఐతివి. నీవు దుష్ట స్వభావము గల వాడవగుటకు కారణమేమిటో నాకు తెలియదు. నీవు దయాసముద్రుడగు గురువు వలన పరశువును పొందితివి. దానిని తొలుత క్షత్రియులపై పరీక్షించి తరువాత నీ గురుపుత్రుని పై ప్రయోగించితివి.

గురువువకు దక్షిణ సమర్పించుట తగినదని వేదములు చెప్పుచున్నవి. కాని నీవు గురుపుత్రుని దంతమును భగ్నము చేసితివి. ఇక అతని శిరస్సును త్రెంపివేయుము. నీవు మా పుత్రుడగు గణపతిని యుద్ధమున జయించి కూడ మా ముందు నిలిచితివి. అట్లే మా ఆశీస్సులను పొంది ఈ లోకములందు గౌరవమును పొందితివి. నీవు శంకరునియొక్క అమోఘమైన బలముచే, అతని వరముచే గండ్రగొడ్డలిచే గణపతిని జయించితివి. పరమేశ్వరుని అనుగ్రహమున్నచో నక్క సింహమును చంపును. అట్లే నీవు గణపతిని జయించితివి.

గణపతి నీ వంటి లక్ష కోట్ల జనమును అవలీలగా సంహరించును. జితేంద్రియులలో శ్రేష్ఠుడగు గణపతి ఈగను కూడ చంపడు. ఈ గణపతి తేజస్సులో శ్రీ కృష్ణునితో సమానుడు. అతని అంశ స్వరూపుడు. ఇతర దేవతలు శ్రీకృష్ణుని అంశాంశరూపులు.

శంకరునియొక్క ప్రభావము వలన అతని వరమువలన గణపతి పూజను ప్రజలు తొలుత చేయుదురు. అతడు పుణ్య వ్రతము యొక్క ప్రభావమువలన, శంకరుని వరము వలన జన్మించెను.

ఈ విధముగా పార్వతీ దేవి పలికి భార్గవ రాముని చంపబోయెను. అప్పుడు భార్గవ రాముడు శ్రీకృష్ణునకు నమస్కరించి తన గురువైన శంకరుని కూడ మనస్సులో స్మరించుకొనెను.

ఆ సమయమున ఆక్కడకు ఒక బ్రాహ్మణ బాలకుడు వచ్చెను. అతడు చాల పొట్టిగా నుండెను. కోటి సూర్యులతో సమానమైన కాంతి గల ఆ బ్రాహ్మణ కుమారుని దంతములు, వస్త్రములు, యజ్ఞోపవీతము అన్నియు తెల్లగా ఉన్నవి. అతడు దండమును, ఛత్రమును, ఉజ్వలమైన తిలకమును ధరించెను. అతని మెడలో తులసి మాలలు రత్న భూషణములున్నవి. అతని చేతులకు రత్న కేయూరములు కలవు. పాదములకు రత్న నూపురములు, శిరస్సున రత్న కిరీటము, చెవులకు రత్న కుండలములు కలవు. అతడు ఎడమ చేతితో స్థిరముద్రను, కుడి చేత అభయముద్రను ధరించి బాలురు, బాలికలు నవ్వుచు తన వెంటరాగా అచ్చటకు వచ్చెను. అప్పుడతనిని కైలాసముననున్న జనులందరు సంతోషముతో చూచిరి.

ఆ బ్రాహ్మణ కుమారుని శంకరుడు చూచి తన పుత్రులు పరివారము, దుర్గాదేవితో కలిసి అతనికి సాష్టాంగ దండ ప్రణామములొనర్చెను.

అప్పుడా బ్రాహ్మణ కుమారుడు అందరకు వారివారి కోరికలు తీరునట్లు ఆశీర్వదించెను. ఆ కైలాస నగరముననున్న బాలకులు సైతము అతనిని చూచి చాలా ఆశ్చర్యమును పొందిరి.

శివుడా బ్రాహ్మణ బాలకుని షోడశోపచారములతో వేదోక్త ప్రకారముగా పూజించెను. అట్లే తన తలను వంచుకొని శుక్ల యజుర్వేదమునకు సంబంధించిన కాణ్వ శాఖయందు చెప్పబడిన స్తోత్రముచే ఆ బాలకుని స్తుతించెను. ఇంకను అధికమైన తేజస్సుతో నిండిన ఆ బాలుని రత్న సింహాసనమున కూర్చుండబెట్టి వినయ విధేయతలతో నిట్లు పలికెను.

శంకర ఉవాచ- శంకరుడిట్లు పలికెను –

ఆత్మారాములగు మీ వంటి వారిని క్షేమమడుగుట తెలివి తక్కువ అనిపించును. మీరు ఇతరులకు క్షేమమును కలిగింతురు క్షేమము మిమ్ములను ఆధారము చేసికొని యుండును.

నా ఇంటికి మీరు వచ్చినందువలన నా జీవితము సఫలమైనది. నేను చేసిన శ్రీకృష్ణసేవకు ఫలితముగా మీరు నాకు అతిథగా వచ్చితిరి, సమస్త పూర్ణుడగు శ్రీకృష్ణుడు దయా సముద్రుడు గావున ప్రపంచమును ఉద్దరించుటకై ఈ భారత క్షేత్రమున తనయొక్క అంశతో పుట్టుచున్నాడు. అందువలన మీరు శ్రీకృష్ణుని అంశ కలిగినవారు.

అతిథిని పూజించినచో సమస్త దేవతలను పూజించినట్లగును. అతిథి ఎవరి ఇంటికి వచ్చి సంతృప్తితో పోవునో ఆ యజమానిని గురించి శ్రీహరి సంతోషపడును.  సమస్త పుణ్య తీర్థములందు స్నానము చేసినచో, సమస్త దానములిచ్చినచో, సమస్త వ్రతములందు ఉపవాసమాచరించినచో సమస్త యజ్ఞములు చేసినచో, సమస్త తపస్సులు ఆచరించినచో, ఇంకను నిత్యనైమిత్తికములగు, సమస్త పుణ్యకార్యములు చేసినచో కలుగు పుణ్యఫలము అతిథి సేవలో పదునారవ వంతెననను కాజాలవు. అతిధి ఇంటికి వచ్చి భగ్నాతుడై, కోపముతో ఎవరి ఇంటినుండి తిరిగి పోవునో ఆ ఇంటి యజమాని కోటి జన్మల నుండి చేసిన పుణ్యమంతయు నశించును.

స్త్రీలను, గోవులను, బ్రాహ్మణులను చంపినవాడు, మేలును మరచినవాడు, గురు భార్యతో సంగమించువాడు, తలిదండ్రులను, గురువులను నిందించువాడు, మానవ హింస సేయువాడు, సంధ్యా వందన మాచరింపనివాడు, శ్రీహరిని నిందించువాడు, బ్రాహ్మణుని ధనమును, అగ్రహారములను అపహరించువాడు, కూట సాక్ష్యములను చెప్పువాడు, మిత్రులకు ద్రోహము చేయువాడు, వృషభముపై నెక్కి తిరుగువాడు, వంటలు చేసి బ్రతుకువాడు, శవములను దహించువాడు, పురోహితుడు, శూద్ర స్త్రీని ఉంచుకొన్న బ్రాహ్మణుడు, శూద్రుల ఇంట శ్రాద్దాన్నమును భుజించువాడు, కన్యలనమ్ముకొని బ్రతుకువాడు, శ్రీహరియొక్క పేరును చెప్పుకొని బ్రతుకువాడు, లాక్షారసమును, మాంసమును, నూవులను, గుఱ్ఱములను, ఆవులను అమ్ముకొని బ్రతుకు బ్రాహ్మణుడు, ఏకాదశీ తిథినాడు శ్రీకృష్ణుని పూజింపని బ్రాహ్మణుడు వీరందరు మహా పాతకులుగా పేర్కొనబడుచున్నారు. వీరందరు కాల సూత్ర నరకమున శత బ్రహ్మలు గతించు వరకుందురు.

అతిథిని అవమానమొనర్చినవాడు వీరందరికన్నను నీచుడు అని శంకరుడు పలికెను.

నారాయణ ఉవాచ- నారాయణముని నారదునితో ఇట్లనెను –

శంకరుని పలుకులను విన్న బ్రాహ్మణ రూపధారి, జగత్పతి యగు శ్రీమహావిష్ణువు మేఘగర్జనవలె గంభీరముగా శంకరునితో ఇట్లు పలికెను.

ఇచ్చట జరుగుచున్న కోలాహలమును విని శ్రీ కృష్ణ భక్తుడగు ఈ భార్గవరాముని రక్షించుటకై శ్వేత ద్వీపము నుండి ఇచ్చటకు వచ్చితిని. కృష్ణభక్తులకు అశుభము ఎన్నడును జరుగదు. గురువు యొక్క అనుగ్రహములేని వారిని తప్ప కృష్ణ భక్తులందరిని చేతి యందు చక్రమును ధరించి నేను రక్షింతును. గురువు కోపించినచో వారిని నేనెప్పుడు రక్షించను. గురువును అవమానించుట ఎప్పుడును తగదు. గురువు యొక్క సేవను చేయని వాని కంటే పాపాత్ముడెక్కడను ఉండడు.

అందరి కంటేను జనకుడు గౌరవించ తగినవాడు. జనకునియొక్క అనుగ్రహము వలననే మానపు డీ ప్రపంచమును చూడగలుగుచున్నాడు. జన్మ నిచ్చినందు వలన అతనిని జనకుడని, పెంచి పోషించి నందువలన పితయని పిలుతురు అంత కంటెను గొప్ప కారణము వలన అతడు ప్రజాపతి యగుచున్నాడు.

గర్భమున ధరించి, కని, పెంచినందువలన తల్లి దండ్రికంటే ఎక్కువగా మాన్యురాలగును. అన్నదాత తల్లి కంటే నూరురెట్లు ఎక్కువగా గౌరవింపతగినవాడు. అన్నము పెట్టువాడు లేనిచో ఈ శరీరము నష్టమగును. అందువలన అన్న దానము చేయువాడు విష్ణ్వాంశ కల వాడగును. అన్న దాత కంటే ఇష్టదైవము నూరురెట్లు అధికముగా పూజింపతగినది. విద్య లేక మంత్రోపదేశము చేయు గురువు ఇష్ట దేవత కంటే నూరురెట్లు మిన్న అగుచున్నాడు.

అజ్ఞానమను చీకటి యావరించియున్న ఈ విశ్వమును జ్ఞానమును దీప సహాయముతో సమస్తమును చూపింప గలుగు గురువును మించిన బంధువు ఎవ్వరూ కాజాలరు. గురువు ఉపదేశించిన మంత్రము వలన తపస్సు వలన మానవుడు సమస్త సుఖములను పొందగలడు. అట్లే అతడు సమస్త సిద్ధులు పడసి సర్వజ్ఞుడు కాగలడు.

గురువు నేర్పిన విద్యవలన మానవుడు సర్వత్ర విజయము పొందును. అందువలన గురువు అందరికంటెను గౌరవింపదగినవాడు. విద్యా మదముతోనైన ధన మదముతోనైన గురువును గౌరవింపని వానికి బ్రహ్మ హత్యాది పాపములన్నియు కలుగును. గురువు దరిద్రుడైనను, పతితుడైనను, క్షుద్రుడైనను అతనియందు సామాన్య బుద్ధి యున్నచో ఆ శిష్యుడు ఎన్నో పుణ్య తీర్థములందు స్నానమాచరించినను అతడు పవిత్రుడు కాజాలడు. అట్లే అతడు పుణ్యకర్మలు చేయుటకు అధికారి కాజాలడు. తల్లిని, తండ్రిని, భార్యను, గురుభార్యను, గురువును, కపటబుద్దిచే పోషించని మానవుడు మహా పాతకి యగును.

గురువు పరబ్రహ్మరూపుడు, అతడే విష్ణురూపుడు, మహేశ్వర స్వరూపుడు, చతుర్ముఖ బ్రహ్మరూపుడు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, వాయువు, వరుణుడు, అగ్ని రూపుడు, ఈ విధముగా గురువు సర్వరూపుడైన పరమాత్మయగుచున్నాడు.

వేదమును మించిన శాస్త్రము, కృష్ణుని మించిన దేవుడు, గంగను మించిన తీర్థము, తులసీ దళము వంటి పుష్పము, భూమి కంటే ఓర్పు కల వ్యక్తి, పుత్రుని కంటె ప్రియమైనవాడు, దైవమును మించిన శక్తి, ఏకాదశీ వ్రతమును మించిన వ్రతము, సాలగ్రామము వంటి యంత్రము, భారతము వంటి క్షేత్రము, బృందావనము వంటి పుణ్యస్థలము, కాశీ వంటి మోక్షము నొసగు క్షేత్రము, శివుని వంటి విష్ణుభక్తుడు, పార్వతీ దేవి వంటి పతివ్రత ఈ లోకమునందు కనిపించదు. అట్లే విద్యతో సమానమైన బంధువు, గురువును మించినవాడు ఎక్కడను లేడు.

విద్యనొసగిన గురువుతో సమానముగా అతని భార్యను, పుత్రుని గౌరవింపవలెను.

కానీ పరశురాముడు గురు భార్యయగు పార్వతీని, అతని పుత్రుడగు గణపతిని అవమానించెను. అందువలన నా భక్తుని దోషమును నివారించుటకు నీ ఇంటికి వచ్చితినని బ్రాహ్మణ బాలక వేషమును ధరించిన శ్రీ మహా విష్ణువు పలికెను.

నారాయణ ఉవాచ- నారాయణముని నారదునితో ఇట్లు పలికెను –

ఈ విధముగా శ్రీమహావిష్ణువు శంకరునితో పలికి పార్వతీదేవితో సత్యసారమైన మాటలనిట్లు పలికెను.

శ్రీవిష్ణురువాచ- శ్రీమహావిష్ణువిట్లు పలికెను –

ఓ పార్వతీదేవి వేదసారము, నీతియుక్తమైన నా మాటలను శ్రద్ధగా వినుము.

ఓ పార్వతి! నీకు గణపతి కుమారస్వామి ఎటువంటివారో శంకరుని శిష్యుడైన భార్గవరాముడు కూడ అటువంటివాడే. నీకు శంకరునకు ఏ విషయమున భేదమేమియు కనిపించదు. అందువలన సర్వజ్ఞురాలవైన నీవు ఈ విషయమును యథోచితముగ విచారించి పనిచేయుము.

ఒకపుత్రునితో మరి యొక పుత్రుడు వివాదమునకు దిగుట దైవ దోషము వలన సంభవించును. దైవమును ఎవ్వరు అతిక్రమింపలేరు. అది మిక్కిలి బలీయమైనది.

ఓ పార్వతీ! వేదములందు నీ పుత్రుని నామము ఏకదంతుడని ప్రసిద్ధిచెందినది. ఈ పేరును సమస్త దేవతలు గౌరవింతురు.

ఓ తల్లి! సామవేదమున గణపతి యొక్క నామాష్టకము కలదు. అది సమస్త విఘ్నములను హరించును. కాన దానిని శ్రద్ధగా వినుము అని శ్రీ మహావిష్ణువు పలికెను.

గణేశుడు, ఏకదంతుడు, హేరంబుడు, విఘ్ననాయకుడు, లంబోదరుడు, శూర్పకర్ణుడు, గజవక్త్రుడు, గుహాగ్రజుడు అనునవి గణపతి యొక్క అష్ట నామములు.

శంకరుని ప్రియురాలవగు ఓ తల్లి! నీ పుత్రుని అష్టనామముల అర్థమును కూడ వినుము. ఈ నామాష్టకము స్తోత్రములన్నిటిలోను సారభూతమైనది. సమస్త విఘ్నములను పోగొట్టునది.

“గ” శబ్దము జ్ఞానార్థమును సూచించును. “ణ” అను శబ్దమునకు ముక్తియనునది అర్థము. ఈ రెండింటికి ఈశ్వరుడైన పరబ్రహ్మ కావున ఆతనికి గణేశుడను పేరు కలిగినది.

“ఏక” అను శబ్దమునకు ప్రధానము అను అర్థము కలదు. “దంత” శబ్దమునకు బలమను అర్థము కలదు. అందరి కన్నను బలము ప్రధానముగా కలవాడు కావున అతనిని ఏకదంతుడందురు.

“హే” అనునది దీనార్థమును తెలుపును, “రంబ” అను పదమునకు పాలకుడను అర్థము కలదు. దీనజనులను రక్షించువాడు కావున అతడు హేరంబుడయ్యెను.

“విఘ్న” అను శబ్దమునకు ఆపదలను అర్థము కలదు. “నాయక” శబ్దము ఖండనమను అర్థమున కలదు. ఆపదలను ఖండించువాడు గావున అతడు విఘ్ననాయకుడయ్యెను.

విష్ణుమూర్తి, మరియు తండ్రియగు శంకరుడు పెట్టిన వివిధములైన ఖాద్యములను తిని నందువలన అతని ఉదరము వేలాడుచుండెను. అందువలన ఆతనిని లంబోదరుడని పలికిరి.

గణపతి యొక్క చెవులు చేటలవ లెనున్నవి. అవి విఘ్నములనన్నిటిని పోగొట్టును, సంపదలను కలిగించును. జ్ఞానరూపమైనవి. అటువంటి కర్ణములు కలవాడు కావున అతడు శూర్పకర్ణుడయ్యెను.

విష్ణు ప్రసాద రూపమైన పారిజాత పుష్పమును దుర్వాసమహర్షి దేవేంద్రునకివ్వగా ఆ పుష్పమునతడు ఏ గజము యొక్క తలపై ఉంచెనో అట్టి గజముఖము కలవాడు కావున అతడు గజవక్త్రుడయ్యెను.

ఈ గణపతి గుహునికి ముందు జన్మించెను. అందు వలననే సమస్త దేవతలయందు అగ్ర పూజ నందుకొను గణపతిని గుహాగ్రజుడని పిలుతురు.

ఓ పార్వతీ! గణపతియొక్క నామాష్టకము నానాశక్తి సమన్వితమైనది. అట్లే అనేకార్థములు కలది.

దీనిని మూడు పూటలు ప్రతిదినము చదివినచో అతడు ఎల్లప్పుడు సుఖము కలిగియుండును. అట్లే అంతట జయమును పొందును. అదే విధముగా గరుత్మంతుని చూచిన సర్పములు పరుగెత్తిపోయినట్లు అతనిని చూచినచో విఘ్నములన్నీయు పరుగెత్తిపోవును. గణనాథుని అనుగ్రహమువలన అతడు మహా జ్ఞాని యగును. ఈ నామాష్టకమును పుత్రులు లేనివాడు శ్రద్దగా చదివినచో పుత్రులు కలుగుదురు. వివాహమును ఆశించువానికి చక్కని భార్య లభించును. మహాజడుడుగా ఉండువాడు గొప్ప కవియగును.

ఓ పార్వతీదేవీ! భార్గవరాముడు కూడ నీకు పుత్రుని వంటి వాడే. అందువలన అతనిపై కోప పడకుముని శ్రీ మహా విష్ణువు కోరెను.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున పేర్కొనబడిన గణేశ స్తోత్రము గల నలుబది నాలుగవ అధ్యాయము సమాప్తము.