3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

21 - ఇంద్రునకు లక్ష్మీప్రాప్తి

నారద ఉవాచ –  నారదముని ఇట్లు పలికెను-

ఓ నారాయణమునీ! దేవతలు ఏ బ్రాహ్మణశాపమువలన తమ సంపదను కోల్పోయిరో అట్లే దేవేంద్రుడు దేవతలు లోకములకు తల్లియగు లక్ష్మీదేవినెట్లు పొందిరో, రహస్యమైన ఆ విషయమును నాకు వివరింపుడని అడిగేను.

నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఇట్లనెను.

దేవేంద్రుడు తన వాహనమగు గజముచే, రంభచే తిరస్కరింపబడి, సంపదను కోల్పోయి. విచారవదనముతో అమరావతి పట్టణమునకు పోయెను. అప్పుడచ్చట అతని బంధువులు లేక శత్రువులుండిరి. అందువలన ఆ పట్టణము దైన్యముతో ఉన్నట్లు దూతలు చెప్పగా అతడు తోటి. దేవతలతో కలసి బృహస్పతి ఇంటికి వెళ్ళాము. అచ్చట నున్న తన గురువును తీసికొని ఇంద్రుడు బ్రహ్మలోకమునకు పోయెను.

దేవేంద్రుడు, అతని గురువగు బృహస్పతి దేవతలతో కలసి  బ్రహ్మదేవుని, వేదవాక్యములచే, స్తోత్రములచే స్తుతించిరి. అప్పుడు బృహస్పతి ఇంద్రుని విషయమునంతయు బ్రహ్మదేవున కెరింగించెను. బృహస్పతి మాటలు విన్న బ్రహ్మదేవుడు తలను వంచుకొని ఇట్లు మాటాలాడసాగెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను-

ఓ దేవేంద్రుడా! నీవు నా ముని మనుమడవు. ఎల్లప్పుడు రాజుగానున్నావు. నీ భార్యయగు శచీదేవి లక్ష్మీదేవితో సమానురాలు. ఐవన పరస్త్రీలోలుడవు. పరస్త్రీ లోలుడవైనందువలననే గౌతమమహర్షి శాపమువలన నీకు ఆకారమున వికారము కలిగినది. ఐనను సిగ్గును వదలి తిరిగి పరస్త్రీ లోలునివైతివి,

పరస్త్రీలోలునకు సంపద, కీర్తి యుండునా? ఆ పాపుని అంతటా నిందించుచుందురు. నీకు దుర్వాసమహర్షి శ్రీహరి నైవేద్య రూపమైన పుష్పమునీయగా రంభా లోలునివై ఆ పుష్పమును ఏనుగు శిరస్సుపై పారవేసితివి. వేశ్యయగు ఆ రంభ ఇప్పుడెచ్చటనున్నది. నీవు మాత్రము రాజ్యలక్ష్మిని కోల్పోతివి. అందరకు శారీరక సౌఖ్యమునందజేయు ఆ రంభ నిన్ను క్షణములో వదలివేసినది. చంచల స్వభావయగు వేశ్య ఎల్లప్పుడు సంపదకలవానిని మాత్రమే కోరుకొనును. అట్లే పాతవారిని వదలిపెట్టుచు కొత్తవారిని కోరుకొనుచుండును.

సరే జరిగిందేదో జరిగిపోయినది. జరిగిన కార్యము తిరిగి వెనుకకురాదు. అందువలన జరిగినదానికై చింతింపక లక్ష్మీదేవియొక్క అనుగ్రహమునకై నారాయణుని భక్తితో సేవింపుమని అనెను.

బ్రహ్మదేవుడీ విధముగా పలికి జగత్కారణుడగు శ్రీమన్నారాయణుని మంత్రమును, స్తోత్రమును, కవచమును అతనికి ఉపదేశించేను, అప్పుడు దేవేంద్రుడు తన గురువు, ఇతర దేవతలతో కలసి పుష్కర క్షేత్రమున శ్రీహరి మంత్రమును జపించుచు స్తోత్రమును కవచమును పఠించెను. ఇట్లు పుణ్యదేశమైన భారతభూభాగమున ఆహారరహితుడై ఒక సంవత్సరము వరకు శ్రీహరిని సంపద కొరకు సేవించెను.

ఇంద్రుడు చేసిన తపస్సునకు శ్రీహరి సంతోషించి ఇంద్రుని దగ్గరకు వచ్చి అతనికి ఆభిమత వరమునిచ్చెను. అట్లే ఐశ్వర్యమును పెంపొందించు లక్ష్మీస్తోత్రమును, లక్ష్మీకవచమును, మంత్రమును అతనికి ఉపదేశించి వైకుంఠమునకు పోయేను. ఇంద్రుడు శ్రీమహాలక్ష్మీ కవచమును స్వీకరించి లక్ష్మీస్తోత్రముచే ఆమెను స్తుతించి లక్ష్మీదేవి అనుగ్రహమును పొందెను. అందువలన ఇంద్రుడు తన శత్రువులను జయించి తన అనుచరులైన దేవతాగణముతో కలిసి అమరావతిన్ (స్వర్గమున) తిరిగి పొందగలిగాడు.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతిఖండమున నారద నారాయణ మునుల సంవాద సమయమున తెలుపబడిన ఇంద్రునకు లక్ష్మీప్రాప్తియను ఇరువది యొకటవ అధ్యాయము సమాప్తము.