3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము
37 - భద్రకాళీ కవచ నిరూపణం
నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లు పలికెను-
ఓ నారాయణమునీ! నాకు భద్రకాళీయొక్క కవచమును, దశాక్షరమైన భద్రకాళీ మంత్రమును తెలిసికొనవలెనని యున్నది. నీవు సర్వము తెలిసినవాడవు కావున వీటిని నాకు వివరింపుమని కోరెను.
నారాయణ ఉవాచ- నారాయణ ముని ఇట్లు చెప్పెను-
ఓనారద! దశాక్షరియగు మహావిద్య, గోప్యముగా ఉంచ తగినది. ముల్లోకములయందు లభ్యము కానిదగు ఈ కవచమును నీకు నేను వివరించి చెప్పెదను.
“ఓం హ్రీం శ్రీం క్లీం కాళికాయై స్వాహా" అనునది దశాక్షరి యగు భద్రకాళీ మంత్రము. దీనిని సూర్యగ్రహణ సమయమున పుష్కరక్షేత్రమున రాజునకు దూర్వాసమహర్షి ఉపదేశించెను. ఈ మంత్రమును పది లక్షల పర్యాయములు జపించినచో మంత్ర సిద్ది కలుగును. అట్లే ఈ కవచమును ఐదు లక్షల పర్యాయములు పఠించినచో కవచ సిద్ధి కలుగును. ఇట్లు మంత్ర సిద్ధిని కవచ సిద్ధిని పొంది రాజగు సుచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చెను. ఆ కవచముయొక్క ప్రభావమువలన సుచంద్రుడు భూమినంతయు జయించెను అని పలికెను.
నారద ఉవాచ- నారద మహర్షి ఇట్లు పలికెను
నీ అనుగ్రహమువలన ముల్లోకములయందు దుర్లభమైవ కాళికా దేవియొక్క దశాక్షరీ మంత్రమును వింటిని. ఇప్పుడు నాకు భద్రకాళీయొక్క కవచమును నాకు తెలుపుమని కోరెను.
నారాయణ ఉవాచ- నారాయణ ముని ఇట్లు పలుకసాగెను-
ఓ నారదమునీ నీకు అత్యుద్భుతమైన భద్రకాళీ కవచమును వివరింతును. దీనిని పూర్వకాలమున శ్రీమన్నారాయణుడు త్రిపురాసుర సంగ్రామ సమయమున శివుడు విజయమును పొందవలెనని ఆతనికి ఉపదేశించెను. శంకరుడు దీనిని దుర్వాసమహర్షికి ఉపదేశింపగా ఆతడు సుచంద్ర మహారాజునకు ఉపదేశించెను.
ఈక వచము మిక్కిలి రహస్యమైనది. సమస్త మంత్రములకు సారభూతమైనది అని అనెను.
ఓం హ్రీం శ్రీం క్లీం కాళికాయై స్వాహా అను మంత్రము నా శిరస్సును రక్షించుగాక!
క్లీం అను మంత్రము నా కపాలమును రక్షించుగాక! హ్రీం హ్రీం హ్రీం అను మంత్రము నా కన్నుల రక్షించుగాకl
ఓం హ్రీం త్రిలోచనే స్వాహా అనునది నా నాసికను రక్షించుగాక! క్లీం కాళికీ రక్ష రక్ష స్వాహా అనునది నా దంతముల రక్షించుగాక!
క్లీం భద్రకాళికీ స్వాహా అను మంత్రము నా అధరములను రక్షించుగాక!
ఓం హ్రీం క్రీం క్లీం కాళికాయై స్వాహా అనునది నా కంఠమును రక్షించుగాక!
ఓం హ్రీం - కాళికాయై స్వాహా అను మంత్రము నా కర్ణములను రక్షించుగాక!
ఓం శ్రీం క్రీం క్లీం కాల్యైస్వాహా అను మంత్రము నా స్కంధములను రక్షించు గాక!
ఓం క్లీం భద్రకాల్యై స్వాహా అను మంత్రము నా వక్షస్థలమును రక్షించుగాక!
ఓం క్లీం కాళీకాయై స్వాహా అను మంత్రము నా నాభిని రక్షించుగాక!
ఓం హ్రీం కాళికాయై స్వాహా అను మంత్రము నా పృష్టభాగమును రక్షించుగాక! రక్తబీజవినాశిన్యై స్వాహా అను మంత్రము నా చేతులను ఎల్లప్పుడు రక్షించుగాక!
ఓం హ్రీం క్లీం ముండమాలిన్యై స్వాహా అను మంత్రము నా పాదములను రక్షించుగాక!
ఓం హ్రీం చాముండాయైస్వాహా అను మంత్రము నా సర్వాంగముల రక్షించుగాక!
కాళికాదేవి నా తూర్పుదిక్కును, రక్త దంతిక ఆగ్నేయ దిగ్భాగమును, చాముండ దక్షిణ దిగ్భాగమును, కాళిక నా నైఋతి దిగ్భాగమును, శ్యామ నా పశ్చిమ దిశను, చండిక నా వాయవ్య దిగ్భాగమును, వికటాస్య నా ఉత్తర దిగ్భాగమును, అట్టహాసినీ నా ఈశాన్య దిగ్భాగమును, లోలజిహ్వ నా ఊర్ద్వ దిగ్భాగమును, ఆద్యయగు మాయ నా అధో భాగమును, విశ్వప్రసు నన్ను జలమున, స్థలమున, ఆకాశమున ఎల్లప్పుడు రక్షించుగాక.
ఓ నారదా! ఈవిధముగా నీకు సమస్త మంత్రముల యొక్క సారభూతమైనది, సమస్త కవచముల యొక్క సారభూతమైన భద్రకాళీ కవచమును తెల్పితిని.
ఈ కవచము యొక్క ప్రభావము వలన సుచంద్రుడు అఖండమైన భూమండలమునకు అధిపతి కాగలెను. అట్లే మాంధాత చక్రవర్తి కాగలిగేను. ప్రచేతసుడు. లోమశుడు ఈ కవచము యొక్క ప్రభావము వలననే సిద్ధులు కాగల్గిరి. పిప్పలాయనుడగు సౌభరి యోగులలో శ్రేష్ఠుడయ్యెను.
ఈ కవచము సిద్ధించినచో అతడు సమస్త సిద్ద గణమున శ్రేష్ఠుడగును. మహాదానములు, సమస్త తపస్సులు, సమస్త వ్రతములు ఈ కవచమునకు పదునారవ ఆంశమైన కాజాలవు.
ఈకవచమును వదిలి పెట్టి జగన్మాతయగు భద్రకాళీ మంత్రమును కోటి పర్యాయములు జపించినను ఆ మంత్రము సిద్దింపదు అని పలికెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున తెలుపబడిన భద్రకాళీ కవచమను ముప్పయి యేడవ యధ్యాయము సమాప్తము.
