3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

25 - జమదగ్ని, కార్తవీర్యుల యుద్దము

నారాయణ ఉపోచ - నారాయణముని ఇట్లనెను –

కార్తవీర్యుడు తన మనస్సు బాధపడుచుండగా శ్రీహరిని స్మరించుకొనుచు కోపముతో మునిదగ్గరకు ఒక దూతను పంపెను.

ఆ దూత కార్తవీర్యుడు పలికినట్లు ఇట్లనెను. ఓ మునీ నేను నీకు సేవకుడను, అతిథినికూడ. ఈ రెండిటిని చక్కగా ఆలోచించుకొని నేను కోరుకొనిన కామధేనువునైనను నాకిమ్ము; లేనిచో యుద్ధమునకైనను సిద్ధము కమ్మని పలికెను.

జమదగ్నిముని ఆదూత మాటలను విని నవ్వుచు హితవైనది, సత్యమైనది, నీతియుక్తమైన మాటలనిట్లు పలికెను.

మునిరువాచ - జమదగ్ని ముని ఇట్లు పలికెను –

తిండితిప్పలు లేని రాజును చూచి ఇంటికి తీసికొనివచ్చి నా శక్తికొలది అతనికి తగిన భోజనమును వివిధపదార్థములతో పెట్టితిని. అట్టి రాజు నా ప్రాణముల కంటె ప్రియమైన కామధేనువు కావలెనని ఆడుగుచున్నాడు కాని నేనా అవును ఇవ్వలేను కావున తప్పక యుద్ధము చేయుదుననెను.

జమదగ్ని మహర్షి మాటలు విన్న దూత కార్తవీర్యునకు సభలో ఈ విషయమునంతయు చెప్పగా ఆతడు భయముతో యుద్ధసన్నాహము చేయమొదలిడెను.

జమదగ్నిముని కామధేనువు దగ్గరకు పోయి నేనిప్పుడు ఏమి చేయవలెను? నావికుడు లేని నౌకవలె నేను లేనిచో నాసైన్యముండునని పలుకగా ఆ కామధేనువతనికి అనేక విధములైన శస్త్రములను ఇచ్చి యుద్ధ శాస్త్రోపదేశమును, శస్త్ర సంధాన పద్దతినీ, శస్త్రముల యొక్క ఉపయోగము మొదలగు వాటినన్నిటినీ తెలిపి ఓ మునీ! నీకు యుద్ధమున తప్పక విజయము లభించును. నీకు ఏ శస్త్రము వలనను మరణము సంభవింపదని చెప్పుచు దత్తాత్రేయ మహర్షి శిష్యుడు, వ్యర్థముగా శక్తిని ధరించి తిరుగుచున్న కార్తవీర్యునితో బ్రాహ్మణుడవగు నీవు యుద్ధము చేయుట తగదని కామధేనువు పలికెను.

విజ్ఞుడైన జమదగ్ని ముని కూడ తన సైన్యమునంతయు సమీకరించుకొని రణ రంగమునకు బయలుదేరెను.

కార్తవీర్యుడు కూడ యుద్ధరంగమును ప్రవేశించి తొలుత జమదగ్నికి నమస్కరించి యుద్ధమును ప్రారంభించెను. రెండు సైన్యములమధ్య గొప్పయుద్ధము జరిగినది. కపిల సృష్టించిన సైన్యమువలన రాజుసైన్యము జయింపబడెను. అట్లే రాజు యొక్క రథము విచిత్రముగా విరిగిపోయెను. కపిల సృష్టించిన సేన వలన ఆ మహారాజయొక్క ధనుస్సుకూడ విరిగిపోయెను. అందువలన కార్తవీర్యుడు కపిల సైన్యములను జయింపలేకపోయెను. ఆ సమయమున కపిలసైన్యము శస్త్రవర్షముచే రాజును ఉక్కిరిబిక్కిరి చేసెను. ఆ సైన్యముయొక్క శరవర్షమునకు, శస్త్రవర్షమునకు తట్టుకొనలేక కార్తవీర్యుడు రణరంగమున మూర్ఛపొందెను.

యుద్ధమున రాజగు కార్తవీర్యుని సైన్యము కొంతమాత్రమే మిగిలియుండెను. మరికొంత పలాయనమును చిత్తగించెను. మునీంద్రుడగు జమదగ్ని తన అతిధియగు కార్తవీర్యుడు మూర్ఛనొందియుండుటను గమనించి దయతో ఆ మహారాజుయొక్క మిగిలిన సైన్యమును చంపక వదలిపెట్టాను. కపిల సృష్టించిన సైన్యము కపిలయందు విలీనమయ్యెను. అప్పుడు ముని దయతో అతనికి జయము కలుగునట్లు ఆశీర్వదించి తన కమండలువులోనున్న నీటితో ఆ మహారాజు మూర్చనుండి తేరుకొనునట్లు చేసెను. రాజగు కార్తవీర్యుడు రణరంగమున మూర్చనుండి తేరుకొని భక్తితో మునికి నమస్కరించి చేతులు కట్టుకొని నిలబడెను. ముని యాతనికి శుభాశీసుల నొసగి ఆలింగనము చేసికొని అతనికి స్నానము చేయించి భోజనమును సైత మొసగెను.

బ్రాహ్మణులయొక్క హృదయమెల్లప్పుడు నవ్య నవనీతము వలె మృదువుగా నుండును. ఇతరుల యొక్క మనస్సు కత్తియొక్క అంచువలె దారుణమైయుండును.

అందువలన జమదగ్నిముని రాజాతో నీవు ఇంటికి వెళ్ళిపొమ్మని పలికెను.

రాజోవాచ - రాజగు కార్తవీర్యు డిట్లు పలికెను –

పరాక్రమశాలివగు జమదగ్ని మహర్షీ! నాకు ఇష్టమైన కామధేనువునైననిమ్ము లేనిచో నాతో యుద్ధమునైన సేయుమనికోరెను.

శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణుల సంవాదసమయమున పేర్కొనబడిన జమదగ్ని కార్తవీర్యార్జునుల యుద్ధవర్ణనము కల ఇరువదియైదవ అధ్యాయము సమాప్తము.