3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము
11 - శనైశ్చరుని అధోదృష్టికి కారణకథనం
నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లు పలికెను.
శ్రీహరి శిశురూపియైన గణపతి నాశీర్వదించి, దేవతలు మునులు పరివేష్టింప సభాస్థలమున రత్న సింహాసనముపై ఆసీనుడయ్యెను. ఆ శ్రీహరి యొక్క కుడిభాగమున శంకరుడు, ఎడమవైపు బ్రహ్మదేవుడు ఆసీనులైరి. ఆతని ముందు కర్మసాక్షి ధర్మవిదులలో శ్రేష్టుడైన ధర్మదేవతయుండెను. ధర్మదేవతయొక్క సమీపమున సూర్యుడు, దేవేంద్రుడు, చంద్రుడు కూర్చొనియుండిరి. దేవతలు, మునులు, శైలములు సుఖముగా కూర్చొనియున్న సభలో నర్తకీ మణులు నాట్యము చేయుచుండగా గంధర్వ కిన్నరాదులు శ్రీహరిగుణములను చక్కగా పాడసాగిరి. వేదములుకూడ శ్రీహరినిగూర్చి చెవులకింపుగా స్తోత్రము చేయసాగినవి.
ఆ సమయమున సూర్యుని కుమారుడగు శనైశ్చరుడు శంకరుని పుత్రుడగు గణపతిని చూడవలెనని అచ్చటకు వచ్చెను. ఆతడు వినయముచే పూర్తిగా శిరస్సువంచుకొనియుండెను. శ్రీకృష్ణుని మనసా వచసా స్మరించుచుండుటచే ఆరవిరిసిన నేత్రకమలములతో మంచి తేజః సంపన్నుడై, తాను శ్రీకృష్ణునిగూర్చి చేసిన తపః ఫలితమును అనుభవించుచుండెను. మండుచున్న ఆగ్నిశిఖలవంటి కాంతిగల ఆ శనైశ్చరుడు నల్లనిరూపుతో, పీతాంబరమును ధరించి ఆందముగా కనిపించుచుండెను. అతడు శ్రీహరిని, బ్రహ్మదేవునీ, శంకరునీ, ఇంకను ఆ సభలోనున్న ధర్మదేవతను, సూర్యుని, దేవతలను, మునులనందరినీ నమస్కరించి వారియొక్క అనుమతి తీసికొని శిశురూపముననున్న గణపతిని చూచుటకుపోయెను.
అంతఃపురముయొక్క ప్రధాన ద్వారమున శూలహస్తుడు శివునితో సమానమైన పరాక్రమము కల విశాలాక్షుడను శివకింకరుని చూచి అతనితో నిట్లనెను.
శనైశ్చర ఉవాచ - శనైశ్చరు డిట్లనెను.
ఓ శంకరునియొక్క కింకరుడా! నేను శివుని ఆజ్ఞకొని, విష్ణువు మొదలగు దేవతలు మరియు మహర్షుల సమ్మతిని తీసికొని పార్వతీపుత్రుని చూచుటకు పోవుచున్నాను. శిశువును చూచిన తరువాత తిరిగి వెళ్ళిపోదును కావున పార్వతీదేవి దగ్గరకు పోవుటకు నాకు అనుమతినిమ్మని శనైశ్చరుడడిగెను.
విశాలాక్ష ఉవాచ - విశాలాక్షుడిట్లు పలికెను.
ఓ శనైశ్చరా! నేను దేవతలయొక్క ఆజ్ఞను శిరసావహించెదను. అట్లే శంకరుని ఆజ్ఞను కూడ నేను అనుష్ఠింతును.
పార్వతీదేవియొక్క సేవకుడగు విశాలాక్షుడు శనైశ్చరుని అంతః పురములోనికి పంపగా వినయముచే తలవంచుకొనియున్న శనైశ్చరుడు రత్నసింహాసనముపైనున్న పార్వతీదేవిని చూచెను. ఆ దేవి రత్నసింహాసనముపై గూర్చుండి, ఐదుగురు పరిచారికలు తెల్లని చామరములు వీచుచూ సేవింపుచుండగా పరిశుద్దమైన వస్త్రమును ధరించి, రత్నభూషణములను అలంకరించుకొని తన పుత్రుని రొమ్మునకు హత్తుకొని నర్తకీమణుల నృత్యమును చూచుచుండెను. పార్వతీదేవి తలవంచుకొనియున్న శనైశ్చరుని యోగక్షేమములు విచారించి ఆశీర్వదించి ఇట్లు పలికెను.
పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను.
ఓ శనైశ్చరా! నీవెందులకు తలవంచుకొని నిలబడినావు. నన్ను కాని, నా పుత్రునికాని నీవెందుకు చూడకున్నావో దానిని నాకు వివరముగా తెలువుము.
శనిరువాచ - శనైశ్చరుడిట్లు పలికెను.
ఓ పార్వతీదేవీ! ఈ లోకముననున్న ప్రాణులన్నియు తాము చేసికొన్న కర్మలననుసరించి శుభా శుభ ఫలితములను పొందుచున్నారు. కర్మవలననే ప్రాణి బ్రహ్మేంద్రాదుల గృహములలో మానవ గృహములలో పశువులు మొదలగు వాటియొద్ద జన్మనెత్తుచున్నాడు. కర్మవలననే వైకుంఠమునుగాని నరకమునుగాని ప్రాణులు పొందుచున్నారు. ఆకర్మవలననే ప్రాణి మహారాజుగా, సేవకుడుగా జన్మనెత్తుచున్నాడు. ఆకర్మవలననే కొందరు వ్యాధులచే బాధపడుచున్నారు. కొందరు ధనవంతులగుచున్నారు. దీనులుగా, బ్రతుకుచున్నారు. బంధువులలో మంచి పేరునుగాని చెడు పేరును గానీ పొందు చున్నారు. ఆట్లే మానవుడు తాను చేయు కర్మప్రభావమువలననే మంచిభార్యను, సత్పుత్రులను, లేక చెడుభార్యను, చెడుపుత్రులను పొందుచున్నాడు. అట్లే కర్మ ప్రభావమువలననే భార్యా రహితుడుగను, పుత్ర రహితుడుగను ఆగుచున్నాడని చెప్పెను.
ఓపార్వతీదేవీ నేను ఎల్లప్పుడు తలవంచుకొనీయుండుటకుగల కథను వినుము. ఇది మిక్కిలి రహస్యమైనది. మాతృస్వరూపిణివైన నీకు చెప్పతగనిది. సిగ్గుకు కారణమైనది.
నేను చిన్నప్పటినుండియే శ్రీకృష్ణుని యందు పరమ భక్తి కలవాడను. అనేకవిధములైన తపస్సులు చేసికొనెడివాడను. ఐనను విషయవాంఛలను వదలుకొనలేదు. అట్టి నాకు మా తండ్రియగు సూర్యుడు చిత్రరథుని పుత్రికనిచ్చి వివాహము చేసెను. ఆమెకూడ ఎల్లప్పుడు తపస్సు చేసికొనెడిది. చక్కని తేజస్సంపన్నురాలు.
ఒకదినము నా భార్య ఋతు స్నాతయై రత్నా భరణములను ధరించి మునుల మనస్సులను మోహింపచేయు వేషమును ధరించి నా సమీపమునకు వచ్చెను. ఆ సమయమున నేను శ్రీహరిపదధ్యానము చేసికొనుచు బాహ్య జ్ఞానము లేక నా మనస్సునంతయు ధ్యానము నందు మగ్నముచేసియుంటిని. కాని నాభార్య కామమోహితయై చిరునగవుకల కళ్ళతో నన్ను సమీపించి శ్రీహరిపదములను ధ్యానింపుచున్న నన్నిట్లు శపించెను.
ఓ శనైశ్చరా! నీవు నాపై కన్నెత్తి చూడక నా ఋతు రక్షణమును చేయనందువలన నీవు చూచిన ప్రతీ వస్తువు నశించిపోవునని శపించెను. నేను ధ్యానము చేసికొని లేచిన తరువాత నా భార్యను సంతోషపెట్టినను ఆమె తన శాపమును మాత్రము ఉపసంహరింపలేకపోయినది. అందు వలన నేను ఏ వస్తువు నైననప నాకంటితో చూడ లేక పోవుచున్నాను. నాటినుండి నా దృష్టి సోకి ఏ ప్రాణి హింసకు గురియగునోయని తలవంచుకొని తిరుగుచున్నానని శనైశ్చరుడు చెప్పెను.
శనైశ్చరుడు తనగాథను వివరింపగా విని పార్వతీదేవి ఆమె సఖిగణము. అచ్చటనున్న నాట్యకత్తెలు, గాయకీ గణమంతయు ఫక్కున నవ్విరి.
శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణములో మూడవదగు గణపతి ఖండమున శని పార్వతీ దేవుల సంభాషణ సమయమున చెప్పబడిన శనైశ్చరుని ఆధోదృష్టికి కారణముగల పదునొకటవ అధ్యాయము సమాప్తము.
