3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

5 - పుణ్యక వ్రత ప్రాశస్త్యము

నారాయణ ఉవాచ - నారాయణుడు నారదునితోనిట్లనెను-

నారదా! శంకరుడు చెప్పిన పుణ్యకవ్రతవిధానమును, దాని ఫలితమును విన్న పార్వతి సంతోషించిన మనస్సుతో శుభములనిచ్చు ఆ వ్రతకథను వినిపించుమని మరల పరమేశ్వరుని ఆడిగెను.

శ్రీపార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను-

పరమేశ్వరా! ఈపుణ్యకవ్రతముయొక్క ఫలము చాల ఆద్భుతముగా నున్నది. అట్లే ఈ వ్రత విధానము ఆపూర్వముగానున్నది. ఆందువలన ఆ పుణ్యకవ్రతకథను చక్కగా తెలుపుము. ఆదేవిధముగా ఆవ్రతమును ఎవరు వాడుకలోనికి తెచ్చిరో తెలుపుము అని అడిగెను.

అథపుణ్యకవ్రతకథా - పుణ్యకవ్రతకథా ప్రారంభము

 శ్రీమహాదేవ ఉవాచ - మహాదేవుడిట్లు పార్వతితోననెను-

మనువుయొక్క భార్యయగు శతరూపాదేవికి పుత్రదుఃఖమేర్పడినప్పుడు ఆమె బాధతో బ్రహ్మలోకమునకుపోయి బ్రహ్మతో ఇట్లు పలికెను.

శతరూపోవాచ - శతరూపాదేవి ఇట్లనెను-

ఓబ్రహ్మదేవుడా! గొడ్రాలైన స్త్రీకి సంతానమెట్లు కలుగునో సృష్టికారణకారణుడవైన నీవు తెలుపుము. తలిదండ్రులకు సంతానము లేనిచో వారి జన్మ నిష్పలమగును. వారీ ఐశ్వర్యము, ధనమంతయు వ్యర్థమగును. సంతానము లేనిచో వారి ఇల్లు బోసిపోయినట్లుండును. తపస్సు దానములవలన కలుగు పుణ్యము రాబోవు జన్మలలో సుఖము కలిగించును. కాని పుత్రుడు సుఖమును సంతోషమును ఈజన్మలోనే ఇచ్చును. తలిదండ్రులు పుత్రుని ముఖము చూచినంతమాత్రమున నూరు త్వమేధయాగములు చేసిన ఫలమును పొందుదురు. ఆది పున్నామనరకమునుండి వారిని రక్షించును.

ఓబ్రహ్మదేవుడా! సంతానములేదని బాధపడుతున్న నాకు పుత్రోత్పత్తి కలుగు ఉపాయమును తెలుపుము. లేనిచో నేను నా భర్త ఇద్దరము కలసి అడవికి పోయెదము. సంతానములేని మాకు ఈరాజ్యమెందులకు? ఈ ఐశ్వర్యము, ధనము, భూమీ ఇవన్ని ఉన్నప్పటికి వ్యర్థముగానున్నవి.

విద్వాంసుడు పుత్రులు లేనివాని ముఖము చూచుటకు ఇష్టపడడు. ఆ తలిదండ్రులు సహితము తమ ముఖమును నలుగురికి చూపుటకు సిగ్గుపడుదురు. నీవు మాకు పుత్రోత్పత్తి కలుగుమార్గము చూపించనీచో వీషముడిని, లేక నిప్పులోబడి మా ప్రాణములమ వదలి పెట్టుదుము. సంతానము లేనివారి ఇల్లు శోభలేకయుండును.

ఈవిధముగాశతరూపాదేవి బ్రహ్మదేవునకు తనబాధ చెప్పుకొనుచు ఏడ్చెను. అప్పుడు దయానిధీ యగు బ్రహ్మదేవుడు ఈవిధముగా ఆమెను ఓదార్చెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవు డిట్లు శతరూపతో పలికెను-

ఓ శతరూపా! సమస్తైశ్వర్యములను కలిగించునదీ, అన్ని కోరికలు తీర్చునది, సుఖమునిచ్చునది యగు పుత్రులు కలుగు ఉపాయము నీకు చెప్పెదను వినుము.

ఈ సుపుణ్యక వ్రతమును మాఘశుద్ధ త్రయోదశినాడు సమస్తవాంఛలు తీర్చు శ్రీకృష్ణుని ఆరాధించి చేయవలెను. సమస్త విఘ్నములను తొలగించు ఈ వ్రతమును సంవత్సరకాలము చేయవలెను. ఈవ్రతమునకు అవసరమగు ద్రవ్యములన్నియు వేదమున చెప్పబడినవి. శుక్లయజుర్ వేదమందలి కాణ్వశాఖలో చెప్పబడిన ఈవ్రతమునాచరించి విష్ణుమూర్తితో సమాను డగు పుత్రుని పొందుమని బ్రహ్మదేవుడు చెప్పగా విని శతరూపాదేవి ఆవ్రతము గోచరించి ప్రియవ్రత, ఉత్తాపాదులను పుత్రులను పడసినది.

ఈవ్రతము నాచరించి దేవహూతి నారయణాంశుడగు కపిలమహర్షిని, వసిష్ఠమహర్షి భార్యయగు ఆరుంధతి శక్తిమహర్షిని, అతని భార్య పరాశరుని, అదితి వామనుని, ఇంద్రుని భార్యయగు శచీదేవి జయంతుని, పొందెను. ఉత్తానపాదుని భార్య సునీతీ ఈవ్రతమునాచరించి, తత్ర్పభావమువలన ధ్రువుడను పుత్రుని, కుబేరుని భార్య నలకూబరుడను పుత్రుని, సూర్యుని పత్ని వైవస్వత మనువును, అత్రిభార్యయగు ఆనసూయ చంద్రుని, అంగీరసమహర్షి భార్య సురగురువగు బృహస్పతినీ, భృగుపత్ని  నారాయణాంశసంభూతుడైన శుక్రుని పుత్రునిగా పడసెను.

ఈవిధముగా శంకరుడు పార్వతితో పలికినందువలన అతని ఆజ్ఞననుసరించి పార్వతీదేవి పుణ్యక వ్రతమును ఆచరించెను.

నారదమహర్షీ! నీకింతవరకు గణపతి జన్మకు కారణమైన వృత్తాంతమునంతయు తెల్పితిని. ఇది వినువారికి సుఖమును మోక్షమును కలిగించును.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతిఖండములో నారద నారాయణుల ప్రసంగసమయమున పేర్కొనబడిన పుణ్యకవ్రతకథనమను ఐదవ అధ్యాయము సమాప్తము.