3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

30 - శివదత్తాస్త్ర శస్త్రాదిప్రాప్తి

శంకర ఉవాచ - శంకరుడిట్లు పరశురామునితో పలికెను –

ఓ బ్రహ్మచారీ నీవెవరు? నీ తండ్రి పేరేమి? నీవెక్కడ ఉంటున్నావు. ఎందుకు నన్ను స్తుతింపుచున్నావు. నీకు నేను చేయగలిగినదేమి? నీ కోరిక ఏమున్నదో నాకు తెలుపుము అని పలికెను.

పార్వత్యువాచ- పార్వతీదేవి ఇట్లు పలికెను –

ఓ బ్రహ్మచారీ! నీవు శోకముతోనున్నట్లు కలతచెందిన మనస్సుతో నున్నట్లు కనిపించుచున్నావు. నీవు వయస్సులో చాల చిన్నవాడవు. కాని శాంతుడవు. నీవు గుణములచే గుణవంతులలో కెల్లను గొప్పవాడవనిపించుచ్నుది.

భృగురువాచ- భార్గవ రాముడిట్లు పలికెను –

ఓ ప్రభూ! నేను జమదగ్ని మహర్షి పుత్రుడను. నాతల్లి పేరు రేణుక. నేను భృగు వంశమున జన్మించితిని. నా పేరు పరశురాముడు. ఓదయానిధీ! నన్ను విద్యయను మూల్యముచే కొని దాసునిగా చేసికొమ్ము. దీనవత్సలడవగు నీవు శరణుగోరిన నన్ను రక్షింపుము.

నాతండ్రియగు జమదగ్నిముని వేటకై వచ్చి తిండిలేక పడియున్న కార్తవీర్యార్జునునకు కామధేనువిచ్చిన వస్తువులచే ఆతిథ్యమునిచ్చెను. అపుడా రాజూ కామధేనువు కొరకు మాతండ్రిని చంపెను. నాతల్లియగు రేణుక సహితము నాతండ్రితో అనుగమనము చేసినందువలన నేనిప్పుడు అనాథుడనైతిని. ఇప్పుడు నాకు తండ్రివి నీవే. ఈ పార్వతీ దేవియే నాతల్లి. అందువలన మీరు మీపుత్రుని కాపాడునట్లు నన్ను కాపాడుడు. నేను తండ్రి చంపబడెనను శోకము వలన ఈ భూ మినంతయు ఇరువది యొక్క మార్లు తిరిగి రాజులను వారు లేకుండునట్లు చేయుదునని ప్రతిజ్ఞ చేసితిని. అట్లే నా తండ్రిని సంహరించిన కార్తవీర్యుని యుద్ధమున చంపెదనని అంటిని.

ఓ భగవంతుడా! ఈ నా ప్రతిజ్ఞ తీరునట్లు మీరు చేయుడని పలికేను.

బ్రాహ్మణుడగు భార్గవ రాముని మాటలు విన్న పరమశివుడు పార్వతీదేవి ముఖమును తలవంచుకొని చూడగా, ఆదేవి ఎండిన గొంతు కలదయ్యెను.

పార్వత్యువాచ- పార్వతి దేవి ఇట్లు పలికెను –

ఓ తపస్వీ! నీవు బ్రాహ్మణపుత్రుడవు. శమ దమ గుణములు ఉండవలసిన వాడవు. కాని నీవు నీతండ్రిని చంపెనను కోపముతో ఈభూమిపై నున్న క్షత్రియులనందనరను ఇరువది యొక్క మార్లు తిరిగి చంపదలచితివి. ఇది. గొప్ప సాహసకార్యము. అట్లే రాజగు కార్తవీర్యార్జునుని ఆయుధము లేక చంపవలెనని అనుకొనుచున్నావు. ఆ కార్తవీర్యుడు కనుబొమను ముడిచినంతమాత్రమున లోక కంటకుడగు రావణుడు జయింపబడిను. అతనికి దత్తాత్రేయుడు శ్రీహరి కవచమును వ్యర్థము కాని శక్తియను ఆయుధమునిచ్చెను. అమోఘమైన ఆ శక్త్యాయుధము వలననే నీతండ్రి చనిపోయెను.

శ్రీహరి మంత్రమును, స్తోత్రమును రాత్రింబగళ్ళు పఠించువావిని ఈ ప్రపంచమున ఎవ్వరుచంపలేరు కావున నీకోరికను వదలు కొమ్మని పలికెను.

ఓ బ్రాహ్మణకుమారా! నీఇంటికి తిరిగిపొమ్ము. ఈవిషయమున శంకరుడేమి చేయజాలడు. భూలోకమున నున్న ఇతర భూపతులందరు నా సేవకులు. నేనుండగా వారికి భయము కూడ కలుగదని పలికెమ.

కాళ్యువాచ- కాళికాదేవి ఇట్లు పలికెను –

దుష్టుడవగు బ్రాహ్మణవటూ! పొట్టివాడు చంద్రుని చేతులతో పట్టుకొనుటకు ప్రయత్నించినట్లు నీవు ఈ భూమిపై మన్న రాజులనందరను చంపవలెనని కోరుకొనుచున్నావు. ఆ రాజులందరు అనేక యజ్ఞముల నాచరించిన మహాపుణ్యాత్ములు, గొప్ప పరాక్రమము కలవారు. పైగా నా యొక్క సేవకులు. వీరిని శంకరుని యొక్క సహాయమున చంపవలెనని అనుకొనుచున్నావు అని పలికెను.

పరశురాముడు కాళీ పార్వతుల మాటలు విని శోకముతో బిగ్గరగా నేడ్చెను. ఇంకనూ వెంటనే వారిముందు తన ప్రాణములు వదలిపెట్టుటకు సిద్ధమయ్యెను. అప్పుడా బ్రాహ్మణుని దుఃఖమును చూచిన కరుణానిధియగు శంకరుడు. కాళికాదేవి, పార్వతి దేవియొక్క భావమును గ్రహించి వారి యనుమతితో భార్గవరామునితో ఇట్లు పలికెను.

శంకర ఉవాచ- శంకరుడిట్లు పలికెను –

ఓ భార్గవరామా! నేడు మొదలు నీవు నాకు పుత్రుని వంటివాడవు. నీకు ముల్లోకములందును లభించని అతి రహస్యమైన మంత్రమును ఉపదేశింతును. అట్లే నేను ఉపదేశింపబోవు పరమాద్భుతమైన కవచ ప్రభావము వలన, నాయొక్క అనుగ్రహమువలన నీవు తప్పక కార్తవీర్యుని చంపెదవు. అట్లే ఈభూమిపై రాజులు లేకుండ ఇరువదియొక్కమార్లు తిరిగి వారిని చంపెదవు. ఈ ప్రపంచమున నీకీర్తి నిండిపోవునని పలికి పరమాద్భుతమైన త్రైలోక్య విజయమను కవచమును, స్తోత్రమును, పూజావిధానమును, పురశ్చరణపద్దతివి, మంత్రానుష్టాన విధానమును, దానియొక్క నియమములను, మంత్రము సిద్ధించుస్థలమును, మంత్రము జపింపవలసిన కాలమున, సంఖ్యను, భార్గవరామునకు పరమశివుడు బోధించెను.

అట్లే చతుర్విధ వేదములను, షడ్వేదాంగములు మొదలగు వానిని చదివించెను. అటుపిమ్మట నాగపాశము, పాశుపతము, బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వాయవ్యాస్త్రము, వారుణాస్త్రము, గాంధర్వాస్త్రము, గరుడాస్త్రము, జృంభణాస్త్రము, గది, శక్తి, పరశు, శూలము మొదలగు శస్త్రాస్త్రములకు సంబంధించిన మంత్రములును, శస్త్రాస్త్రముల సంహారక్రమమును, తూణీరములమ, అక్షయసాయకములను, ఆత్మరక్షణ చేసికోనుపద్దతివి, యుద్ధమున విజయమును పొందు పద్దతిని, మాయా యుద్ధమును, తన సైన్యముల రక్షించుకొనుపద్ధతిని, శత్రుసైన్యముల నాశనము చేయు రీతిని, యుద్దమున కష్టము వచ్చినప్పుడు తప్పించుకొను నానా ప్రకారములైన ఉపాయములను, మృత్యువును హరించు మోహినీ విద్య మొదలగు వాటిని పరమేశ్వరుడు భార్గవ రామునకు ఉపదేశించెను.

భార్గవరాముడు గురువుయొక్క సమీపమున చాలాకాలముండి సమస్త విద్యలు నేర్చుకొని పుణ్యతీర్థమున మంత్రసిద్ధిని పొంది గురువగు పరమేశ్వరునకు నమస్కరించి వెళ్ళిపోయెను.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమువ మూడవది యగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున పేర్కొనబడిన పరశురామునకు శస్త్రాస్త్రప్రాప్తియనెడు ముప్పదియవ అధ్యాయము సమాప్తము.