3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

13 -  గణేశ పూజా స్తవ కవచ కథనము

నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లనెను-

తరువాత శ్రీమహావిష్ణువు మంచి ముహూర్తమున దేవతలచే మునులచే గొప్పదైన ఉపహారములతో పూజ చేయించెను. ఆట్లే ఆ బాలునితో నీకు సమస్త దేవతల కంటే ముందు పూజ జరుగునట్లు నేను వరమునిచ్చితిననియు నీవు ప్రాణులందరకు పూజ్యుడవగుదువనీయు, యోగీంద్రుడవగుదువని చెప్పి ఆ శిశువు మెడలో తనమెడలోనున్న వనమాలను వేసి ముక్తిని కలిగించు బ్రహ్మజ్ఞానమును, సమస్తసిద్దులను ఇచ్చి తనతో సముడుగా చేసెను. అట్లే మునులు, దేవతలతో కలసి షోడశోపచారములతో అతనిని పూజించి ఆ శిశువుయొక్క నామస్తోత్రమును కూడ చేసేను.

విఘ్నేశుడు, గణేశుడు, హేరంబుడు, గజాననుడు, లంబోదరుడు, ఏకదంతుడు, శూర్పకర్ణుడు, వినాయకుడు అనునవి అతని పేర్లు. ఈ ఎనిమిది పేర్లు పఠించినచో సమస్తసిద్ధులు కలుగును.

తరువాత ఆ శ్రీహరి మునులను పిలిపించి వారిచే ఆతనికి ఆశీస్సులనిపించెను. ధర్మదేవత ఆ శిశువునకు సిద్ధాసనమునీయగా బ్రహ్మదేవుడు కమండలమును, శంకరుడు యోగపట్టమును, తత్త్వజ్ఞానమును, దేవేంద్రుడు రత్నసింహాసనమును, సూర్యుడు మణిమయ కుండలములను, చంద్రుడు మాణిక్యమాలను, కుబేరుడు కిరీటమును, అగ్ని పరిశుద్ధమైన వస్త్రములను, వరుణుడు రత్నమయఛత్రమును, వాయువు రత్నాల ఉంగరమును, లక్ష్మీదేవి పాలసముద్రమునుండి ఉద్భవించిన రత్న కంకణమును కాలి అందెను, దండకడియమును, సావిత్రీదేవి కంఠ భూషణమును (కంటెను) భారతీదేవి రత్నాల హారమును ఇచ్చెను, ఆట్లే సమస్తదేవతలు, సమస్త దేవతాస్త్రీలు నానావిధభూషణములనిచ్చిరి. అదేవిధముగా మునులు, పర్వతములు అనేకవిధములైన రత్నములనిచ్చిరి, భూదేవి గణేశునకు వాహనముగా, మూషికమును ఇచ్చెను, గంధర్వులు కిన్నరులు, యక్షులు మొదలగువారు నానావిధ ద్రవ్యములతో గణపతికి భక్తిపూర్వకముగా పూజచేసిరి.

జగన్మాతయగు పార్వతీదేవి చిరునవ్వుతో తనపుత్రుడగు గణేశుని రత్నసింహాసనముపై కూర్చుండపెట్టి రత్నకలశములతో తెచ్చిన సమస్తతీర్థములందలి నీటిచే మునులు స్తోత్రములు, వేదమంత్రములు చదువుచుండగా స్నానము చేయించెను. తరువాత ఆ గణపతికి మిక్కిలి పరిశుద్ధమైన రెండు వస్త్రములనిచ్చెను. ఆటుపిమ్మట దూర్వ, అక్షతలు, పూవులు, చందనము కలిగిన గోదావరీ నది యొక్క నీటిచే పాద్యమును, గంగానదియొక్క తీర్థముచే ఆర్ఘ్యమును, పుష్కరమందలి నీటిచే ఆచమనీయమును ఇచ్చెను. దేవతా వైద్యులగు ఆశ్వినీ కుమారులు సిద్ధము చేసిన విష్ణు తైలమును పూసి అమూల్యరత్నములు కల అందమైన ఆభరణములను వేసినది. అటుపిమ్మట పారిజాత కుసుమములు, మాలతి, చంపకము మొదలగు పుష్పములను, ఇంకను పూజించుటకు తగిన ఇతరమైన పత్రపుష్పములమ, తులసీదళములమ చందనము. ఆగరు, కరివంటి సుగంధద్రవ్యములను, కుంకుమను, ధూపమును, రత్నదీపములను సమర్పించినది.

దూపదీపములు సమర్పించిన పిదపి పార్వతీదేవి గణపతికి ఇష్టమైన నైవేద్యమును పెట్టినది. ఆ నైవేద్యములో మాపులలడ్డూలు, యవలు, గోధుమలరవ్వలో చేసిన లడ్డూలు చాలా రుచికల పక్వాన్నెములు, మంచి రుచిగల తియ్యని స్వస్తికమను వంటకములు, బెల్లపు పానకమున వేసి కట్టబడిన పేలాలు, అటుకుల లడ్డులు, సమస్తమైన కూరగాయలతోకూడిన అన్నము, పిండివంటలు కలవు. అదేవిధముగా పాలు, పెరుగు, తేనె, సాయివంటి వపపులనపారముగా అతనికి నివేదించెను. మరియు దానిమ్మ మారేడు పండు, ఖర్జూరములు, వెలగ, మామిడి, పనస, నారికేళము మొదలగు ఫలములనన్నిటినీ పార్వతీదేవి గణపతికి సమర్పించినది. అటుపిమ్మట కర్పూరము మొదలగు సుగంధ ద్రవ్యములచే పరిమళింపబడిన నిర్మలమైన గంగాజలమును త్రాగుటకై ఇచ్చెను. తరువాత. కర్పూరము మొదలగు సుగంధద్రవ్యములు గల తాంబూలమును భక్ష్యములతోనున్న బంగారుపాత్రలను అతనికి ఇచ్చినది.

అదేవిధముగా హిమవంతుని పరిచారకులందరు ఆ గణపతిని భక్తితో పూజచేసిరి.

“ఓం శ్రీం హ్రీం క్లీం గణేశ్వరాయ బ్రహ్మరూపాయ చారవే సర్వసిద్ధిప్రదేశాయ విఘ్నేశాయ నమోనమః" అనునది గణపతి మంత్రము. ఈ మంత్రమున చదువుచు బ్రహ్మాది దేవతలందరు షోడశోపచారములకు అవసరమైన పూజాద్రవ్యములను గణపతికి నివేదించి సంతోషపడిరి.

పై గణపతి మంత్రమున ముప్పై రెండు అక్షరములున్నవి. ఆ మంత్రము సమస్తమైన కోరికలను తీర్చును. ధర్మార్థ కామ మోక్షములయొక్క ఫలితములనిచ్చును. పైగా అన్ని విధములైన సిద్దులనామంత్రము కలిగించును. ఈ మంత్రరాజమును ఐదులక్షల పర్యాయములు ఏకాగ్రబుద్ధితో జపించినవానికి మంత్రసిద్ధి కలుగును. ఈ మంత్ర సిద్దినందిన వాడు శ్రీమహావిష్ణువుతో సమానుడగును. గణాధిపతియొక్క నామములను పరించుటవలన సమస్తవిఘ్నములు భయముతో పరుగెత్తి పోవును. అవి నామస్మరణము చేసినవాడు సర్వసిద్ధి సమన్వితుడై గొప్ప వక్తయగుమ, గణపతి మంత్రస్మరణ గణపతి సంతుష్టుడై ప్రత్యక్షమైనచో ఆ భక్తుడు బృహస్పతితో సమాను డగును. మహాకవులలో మిన్నయగును. విద్వాంసులలో గురువులలో అతడు మిక్కిలి శ్రేష్టుడుగా పేరుపొందును.

ఈ గణపతి మంత్రమును స్మరించుచు గణపతిని పూజించిన దేవతలు ఆనందసాగరములో ఓలలాడి గొప్ప ఉత్సవమును జరుపుకొని అనేకవిధములైన వాద్యములను మ్రోగించుచుండిరి. వారు ఆ సమయమున బ్రాహ్మణులకందరకు భోజనములు పెట్టి వారికి మరియు భట్రాజులకు విశేషముగా దానములు చేసిరి.

 నారాయణ ఉవాచ - నారాయణ ముని నారదునితో  నిట్లనెను-

ఆ సమయమున దేవతలు మునులున్న ఆ సభలో విష్ణుమూర్తి గణపతిని పూజించి సమస్త విఘ్నములను తొలగించు ఆ గణేశునీ అమితమైన భక్తితో ఇట్లు స్తుతించెను.

ఓ దేవా నేను నిన్ను స్తుతింపవలెనని భావించుచున్నాను. కాని, బ్రహ్మస్వరూపుడవు, జ్యోతిర్మూర్తివి, సనాతనడవగు నిన్ను యథానురూపముగా వర్ణింప జాలకున్నాను.

ఐనను నీవు సమస్తదేవతలలో, సమస్త సిద్ధగణములలో సమస్తయోగులలో మిక్కిలి శ్రేష్ఠమైనవాడవు. నీవు సర్వ భూత స్వరూపుడవు. సర్వేశ్వరుడవు, జ్ఞాన రాశి మూర్తీ భవించినట్లున్న వాడవు. నీవు ఆవ్యక్తుడవు, నాశనములేనివాడవు, నిత్యుడవు, సత్యరూపుడవు, ఆత్మరూపుడవు, వాయువువలె సర్వత్ర వ్యాపించి యున్నావు. నిర్లిప్తుడవు, అక్షయడవు, సమస్త జీవులు చేయుచున్న కర్మలకన్నిటికి నీవే సాక్షివి.

మాయతోనున్న ఈ ఆంతులేని సంసార సాగరమున నీవు నావను చక్కగా నడుపుచూ ఆవలితీరమును చేర్చ గల నావికుడవు, భక్తులను సదా అనుగ్రహించువాడవు. నీవు శ్రేష్టుడవు మిక్కిలి గొప్పవాడవు, వరములనిచ్చువాడవు, వరములనొసగు దేవతలందరిలో నీవే శ్రేష్ఠమైనవాడవు. నీవు స్వయముగా సిద్దుడవు, సిద్దిస్వరూపుడవు, సమస్త సిద్దుల నొసగువాడవు. సమస్త సిద్దులను పొందుటకు కారణమైనవాడవు. ధ్యానాతిరిక్తుడవు నీవే. ధ్యానింపదగినవాడవు నీవే. ధ్యానింపశక్యము కానివాడవు నీవే. పరమధార్మికుడవు. ధర్మరూపుడవు, ధర్మములన్నియు తెలిసినవాడవు, ధర్మా ధర్మ కర్మలయొక్క ఫలితములనిచ్చువాడవు నీవే, సంసారమనే వృక్షమునకు బీజరూపుడవు, ఆంకురరూపుడవు దానికి ఆశ్రయమైనవాడవు ఆన్నియునీవే. నీరూపము ఇంద్రియములకన్నీటికి అతీతమైనది. స్త్రీ, పుం. నపుంసక రూపములన్నియు నీకు సంబంధించినవే.

నీవు సమస్త దేవతలలో మొదటివాడవు. సమస్త దేవతల కంటే ముందు పూజనందు కొను వాడవు. సమస్త చరాచర సృష్టి కోటిచే మునీశ్వరులు దేవతాధిపతులందరిచే పూజల నందు కొనుచున్నావు, నీవు నీ ఇచ్చామాత్రమున సగుణరూపుడవు, నిర్గుణరూపుడవుగా ప్రకాశించుచున్నావు. నీవు స్వయముగా ప్రకృతిస్వరూపుడవు, ప్రకృతినుండి ఉద్భవించినవాడవు, చివరకు ప్రకృతికి అతీతుడవు

నిన్ను నీగుణములను వేయి తలలుగల ఆదిశేషుడు కాని, ఐదు తలలుగల శంకరుడుకాని, నాలుగుముఖములున్న బ్రహ్మదేవుడుగానీ, చదువులతల్లియగు సరస్వతీదేవిగాని వర్ణింపలేరు. చివరకు నేను కూడ నీస్వరూపమును చక్కగా వర్ణింపలేను. అట్లే నిన్ను వేదములన్నియు, వేద, వేదార్థ చర్చలు జరుపుకొను వేదవాదులు సహితము వర్ణింపజాలకున్నారు అని విష్ణువు గణపతిని స్తుతించెను.

ఈవిధముగా శ్రీమహావిష్ణువు దేవతలు, మునీశ్వరులందరూ ఉన్న ఆ సభలో గణపతిని స్తుతించి ఇతర దేవతలందరివలె మిన్నకుండెను.

గణపతియొక్క ఈ స్తోత్రమును ప్రాతర్మధ్యాహ్న సాయంసంధ్యలందు నియమనిష్టలతో భక్తిపూర్వముగా చదివినచో విఘ్నాధిపతి అతని విఘ్నములనన్నిటినీ నాశనము చేయును. మంగళకారియగు గణపతి ఆతనికి సమస్త మంగళములను కలిగించును. పరదేశ గమన సమయమున ఈ స్తోత్రమును భక్తితో చదివినచో ఆతని అభీష్టములన్నియు తప్పక తీరును. ఈ స్తోత్రమును భక్తితో చదివినవారికి దుఃస్వప్నము కలిగినను సుస్వప్నమువలె సుస్వప్న ఫలితమును గణాధిపతియొసంగును. అతనికి ఎన్నడుకూడ దుష్ట గ్రహముల వలన కలుగు బాధయనునది ఉండదు. ఆతని శత్రువులందరు నశింతురు. బంధువుల సంఖ్య పెరుగుమ, ఆతని ఇంట లక్ష్మీదేవి స్థిరముగానుండి అతనికి పుత్ర పౌత్ర సంతతి కలుగును. ఆతడు నమస్వైర్యములను పొందును. మరణానంతరము ఆతడు వైకుంఠమును చేరును. శ్రీగణేశుని అనుగ్రహమువలన ఆతనికి సమస్త పుణ్యతీర్థములు సేవించిన ఫలము, సమస్త యజ్ఞములాచరించినందువలన కలుగు ఫలితము, సమస్త దానము చేసినచో లభించు ఫలమంతయు లభించును. అని నారాయణ మునీశ్వరుడు నారదునితో పలికెను.

నారద ఉవాచ - నారదమహర్షి ఇట్లు పలికెను-

ఓ నారాయణమునీ! నీఅనుగ్రహమువలన శ్రీగణేశుని పూబను, స్తోత్రమును వింటిని. ప్రస్తుతము నాకు సంసారమనే సాగరమును తరింపజేయు గణపతి కవచమును వినవలెనని కోరిక కలదు. కావున మీరు నాకు దానిని వివరముగా తెలుపుడని కోరెను.

నారాయణ ఉవాచ - నారాయణముని నారదుని తో  ఈవిధముగా పలికెను-

శ్రీమహావిష్ణువు మొదలగు దేవతాగణము మునిసంఘము గణపతిపూజను చక్కగా నిర్వర్తించిన పిదప శనైశ్చరుడు, జగన్నాయకుడు అందరినీ తరింపజేయు శ్రీమహావిష్ణువుతో ఈవిధముగా పలికెను.

శనైశ్చర ఉవాచ - శని ఈవిధముగా పలికెను-

నాకు మాయాస్వరూపిణియగు శక్తితో వివాదమేర్పడినది. అందువలన ఏర్పడు విఘ్నములను తొలగించుకొనుటకు శ్రీ గణపతియొక్క కవచమును ధరింపవలెనని యున్నది. అందువలన ఓ వేద వేదార్థ తత్త్వజ్ఞా సమస్త దుఃఖములను, సమస్త పాపములను తొలగించుటకై విఘ్నరాజయొక్క కవచమును నాకు వినిపించమని అడిగెను.

శ్రీవిష్ణురువాచ - శ్రీమహావిష్ణవిట్లు పలికెను-

ఈ వినాయక కవచము ముల్లోకములయందెచ్చటను లభింపదు. పురాణములలోనిది అతిరహస్యముగా కనిపించును. ఆగమములయందిది అసలే కనిపింపదు.

సమస్త విఘ్నములను తొలగించునీ విఘ్నరాజ కవచము సామవేదమునకు చెందిన కొథుమ శాఖలో మాత్రము చెప్పబడినది.

ఓ శనైశ్చరా! రాజ్యమునివ్వవచ్చును. తన తలనైనా ఇవ్వవచ్చును. కాని ఈ కవచమును ప్రాణాపాయము సంభవించినపుడైనను ఇతరులకీయరాదు. ఈ కవచము యొక్క మహిమవలన భక్తుడు ప్రత్యక్షము కావచ్చును. మాయమైపోవచ్చును. అట్టి గణపతి కవచము నిత్యమైనది. దీనికి ఆధిదేవతయగు గణపతి నిత్యమైనవాడు.

గణపతిపూజ, సోత్రము ప్రతీకల్పమున కన్పించును. మునులు వీటిని గణపతి జన్మింపక ముందు నుండే సేవించుచుండిరి. అంతటి ప్రాచీనమైనవి ఈతని పూజా స్తోత్రములు. నేను ఆవతారములనెత్తి జన్మించి కర చరణాద్యవయవములు కల్గిన శరీరము ధరించినట్లే వినాయకుడు సైతము అవతారరూపియై పార్వతీదేవి గర్భమున జన్మించినాడు.

గణపతి కవచమును ధరించిన మహార్షులందరు జీవన్ముక్తులైరి. దేవతలు భయపడక శత్రువులందరను పరిహరింపగలిగిరి. ఈ కవచమును ధరించినచో మృత్యువు భయముతో వారిజోలికిపోదు. అతడు నిత్యయౌవనుడై జీవించును. ఆతనికి అశుభములు కాని పరాజయమనునది కానీ ఎన్నడు కలుగవు,

ఈ కవచమును పదిలక్షలమార్లు ఏకాగ్రచిత్తముతో జపించినచో ఆతనికి మంత్రసిద్ధికలుగును. ఈ కవచము సిద్ధించినచో అతడు మృత్యువును సహితము జయింపగలుగును. సిద్దకవచుడైనవాడు చక్కని వాడ్మియగును చిరంజీవియగును. ఈ కవచమును గురుముఖతః విన్నంతమాత్రమున ఆతడు సర్వత్ర విజయము పొందగలడు. అట్లే అంతట పూజ్యం మన్ననలనందుకొవగలడు. ఈ గణపతి కవచము చాలా మంగళప్రదమైనది. దీనిని ధరించినవారికి సమస్త పాపములు నశించును.

ఈ గణాధిపుని కవచమును చదువుతున్నప్పుడు ఆ కవచ మంత్రముల యొక్క శబ్దము వినపడినంత మాత్రమున భూత, ప్రేత, పిశాచ, కూష్మాండ, బ్రహ్మరాక్షస, డాకినీ, యోగినీ, యక్ష, భేతాళ, భైరవాదులు బాలగ్రహాదులు భయపడి పరుగెత్తి పోవును. అట్లే ఆధివ్యాదులు, శోకాదులు గరుత్మంతుని చూచినపాములవలె ఆతనిని సమీపింపజాలవు.

ఈ కవచమును ఋజస్వభావము కలవాడును, వినయ విధేయతలు కల తన శిష్యునకు మాత్రమే ఉపదేశింపవలెమ. ఆట్లుకాక దుష్టుడైన వానికి దీనిని ఉపదేశించినచో గురువు వెంటనే మృత్యువు వాతపడును.

ఓ శనైశ్చరా! ఈ గణపతి కవచమునకు సాక్షాత్ విఘ్నరాజే దేవత. అతడే ఋషి బృహతీ దాని చందస్సు. ఈ కవచము కవచములన్నిటికి సారభూతమైనది.

“ఓం గం హుం శ్రీగణేశాయస్వాహా" అను మంత్రము నా శిరస్సును కాపాడుగాక. ముప్పైరెండు అక్షరములు కలిగిన గణేశమంత్రము నా నొసటిని ఎల్లప్పుడు రక్షించుగాక! ఓం హ్రీం క్లీం శ్రీం అను మంత్రము నా నాసికను ఎల్లప్పుడు కాపాడుగాక.

"ఓం గౌం గం శూర్పకర్ణాయస్వాహా" అను మంత్రము   పెదవుల నెల్లప్పుడు రక్షించుగాక. పదునారు అక్షరముల గణపతి మంత్రము నా దంతములను, దౌడను, నాలుకను ఎల్లప్పుడు రక్షించుగాక, ఓం లం శ్రీం లంబోదరాయ స్వాహా అను మంత్రము నా చెక్కిలిని కాపాడుగాక, “ఓం శ్రీం హ్రీం విఘ్న నాశాయ స్వాహా” అను మంత్రము నా చెవులను రక్షించుగాక. 'ఓం శ్రీం గం గజాననాయ స్వాహా అను మంత్రము నా భుజములను రక్షించుగాక, 'ఓం హ్రీం వినాయకాయ స్వాహా అను మంత్రము నా పృష్ఠభాగమును రక్షించుగాక. 'ఓం శ్రీం హ్రీం' అను మంత్రము నా ఎముకల గూడును, రొమ్మును కాపాడుగాక, విఘ్నములను హరించు గణపతి నా చేతులను, పాదములను, సర్వావయవములను రక్షించుగాక. నా తూర్పు దిశను లంబోదరుడు, ఆగ్నేయదిశను విఘ్ననాయకుడు, దక్షిణదిక్కును విఘ్నేశుడు, గజాననుడు నైఋతి దిశను, పార్వతీపుత్రుడు పశ్చిమదిశను, శంకరాత్మజుడు వాయవ్యదిశను సర్వపరిపూర్ణుడైన శ్రీకృష్ణుని ఆంశయగు గణపతి నా ఉత్తరదిశను, ఏకదంతుడు ఈశాన్యదిగ్భాగమును హేరంబుడు ఊర్ధ్వభాగమును, గణపతి అధోభాగమును, సర్వపూజ్యుడు అన్ని దిక్కులను, యోగి శ్రేష్ఠుడు స్వప్నావస్థయందు జాగ్రదావస్థయందు నన్ను కాపాడుగాక.

ఓ శనైశ్చరా! సమస్తమంత్రములకు సారభూతమైనది, మిక్కిలి అద్బుతమైన, సంసారమోహనమను పేరుగల గణపతి కవచమును నీకు చెప్పితిని.

ఈకవచమును నాకు గోలోకమున రాసమండలమందున్న శ్రీకృష్ణపరమాత్మ ఉపదేశించెను. నేను నీకు ఈ కవచమునుపదేశించితిని. సమస్త బాధలను తొలగించునది, అందరిచే మన్ననలనందుకొను శ్రేష్ఠమగు ఈ గణపతి కవచమును అర్హతలేనివానికి ఎన్నడును ఉపదేశింపరాదు.

ఈకవచమును ఉపదేశించిన గురువును శాస్త్ర పద్దతిలో పూజించి 'దీనిని కంఠమందు లేక కుడిచేతికి కట్టుకొన్నచో ఆతడు విష్ణుమూర్తితో సమానుడగును. వేలకొలదీ ఆశ్వమేధయాగములు వందలకొలదీ వాజిపేయ యాగములు ఈ కవచమునకు పదునారవవంతైన కాజాలపు

ఈ కవచమును వదలి పెట్టి శ్రీమహాగణాధిపతి మంత్రమును కోటిపర్యాయములు జపించినను మంత్రము సిద్ధింపదు. ఇట్లు సంసారమోహనమను పేరుగల ఈ కవచమును శ్రీమహావిష్ణువు శనైశ్చరునకు ఉపదేశించెను.

శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణమున మూడవదగు గణపతిఖండమున నారద నారాయణమునుల సంవాదసమయమున చెప్పబడిన గణేశుని పూజ, స్తోత్రము, కవచము గల పదమూడవ అధ్యాయము సమాప్తము.