3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

18 - విఘ్నేశ విఘ్నకథనం, గజముఖ కారణము

నారద ఉవాచ - నారద మహర్షి ఇట్లు పలికెను –

వేదవేదాంగముల తత్త్వమంతయు తెలిసిన నారాయణ మహర్షికి ఒక చిన్న విషయమునడుగుచున్నాను. నేను ఎక్కువ సందేహములున్నవాడను కావున దయచేసి సందేహనివృత్తిసేయుము.

మహాత్ముడు, దేవతలకెల్ల అధిపతి. శంకరుని పుత్రుడగు విఘ్నరాజు స్వయముగా విఘ్నములనెల్ల పోగొట్టును. అట్టి వీఘ్నాధిపతికి విఘ్నమెట్లు కలిగినది? అట్లే పార్వతీపుత్రుడగు ఆ గణపతి శ్రీకృష్ణభగవానుని అంశచే జన్మించెను. గ్రహముల కన్నిటికీ అధిపతియగు ఆ గణపతి తల శని గ్రహము యొక్క చూపుపడినందువలన తెగిపోయినట్లు చెప్పితిరి. ఇదెట్లు సంభవమగునో విశదీకరింపుడని నారదుడు ప్రార్థించెను.

నారాయణ ఉవాచ - నారాయణుడిట్లు పలికెను –

ఓ నారదమహర్షి విఘ్ననాయకుని శిరస్సు తెగిపడుటకు కారణమైన కథయున్నది. అది చాలా ప్రాచీనమైనది.

ఒకప్పుడు సూర్యుడు సుమాలి, మాలి ఆనువారిని కొట్టుచుండగా పరమకారుణికుడైన శంకరుడు చూచెను. అప్పుడు అతడు కోపమును పట్టజాలక తన శూలముతో ఎనిమిదిమార్లు కొట్టెను. వజ్రమువలె అమోఘమైన శంకరుని శూలము తగులుటచేత సూర్యుడు స్పృహదప్పి రథము నుండి కింద పడి పోయెను. కండ్లు తేలవేసి పడిపోయిన పుత్రుని చూచి కశ్యప ప్రజాపతి తనపుత్రుని రొమ్ముపైనుంచుకొని దుఃఖముతో చాలాకాలము విలపించెను. దేవతలు కూడా భయముతో హాహాకారములు చేయుచు విలపింపసాగిరి. సూర్యుడు లేనందువలన ప్రపంచమంతయు చీకటితో నిండిపోయెను.

మిక్కిలి తేజస్సుకలవాడు, బ్రహ్మదేవుని మనుమడగు కశ్యపప్రజాపతి బ్రహ్మ తేజో విరాజితుడై కాంతిలేక పడియున్న తన పుత్రుడగు సూర్యుని, అతని దురవస్థకు కారకుడైన శంకరుని చూచి కోపముతో నీ శూలముచే నా పుత్రుని రొమ్ము ఏవి ధముగా చేదింపబడెనో అట్లే నా శాపము వలన నీ పుత్రుని శిరస్సుకూడ తెగిపడుననీ శాపమిచ్చెను.

త్వరగా సంతోషపడు శంకరుడు కోపమును విడిచి తనయొక్క బ్రహ్మజ్ఞానమువలన సూర్యుని వెంటనే పునర్జీవితుని చేసెను. త్రిమూర్తులయొక్క అంశస్వరూపుడు, త్రిగుణాత్మకుడగు సూర్యుడు చైతన్యము నొంది తండ్రికి, భక్తవత్సలుడగు శంకరునకు భక్తితో నమస్కరించి తన తండ్రియగు కశ్యప ప్రజాపతి శంకరునకు శాపమిచ్చిన విషయమును తెలిసికొని తండ్రిని కోపించెను.

ఈ ప్రపంచమున సమస్తము పనికిరానిది, నాశనమునొందునది. పరమాత్మ మాత్రము వీటికి అతీతుడు. విద్వాంసుడగువాడు మంగళస్వరూపమైన సత్యమును వదలి అమంగళమునెప్పుడు కోరుకొనడు. కావున నేనుకూడ విషయవాంఛను వదలి శ్రీ కృష్ణ పరమాత్మనెల్లప్పుడు సేవింతునని పలికెను.

అప్పుడు దేవతలు పంపగా అచ్చటకు వచ్చిన బ్రహ్మదేవుడు సూర్యునకు జ్ఞానబోధ చేసి విషయముల యందు ప్రవర్తించునట్లు చేసెను. తరువాత బ్రహ్మదేవుడు శంకరుడు సూర్యునకు ఆశీస్సులనొసగి తమ తమ ఇండ్లకు పోయిరి. కశ్యప ప్రజాపతికూడ స్వస్థానమునకు వెళ్ళగా సూర్యుడు తామండవలసిన రాశిలో ఉండెను.

ఇక మాలి, సుమాలియను వారు శ్వేత కుష్టు రోగము వలన అవయములన్నిపోగా శక్తిహీనులు, కాంతిహీనులైరి.

బ్రహ్మదేవుడు మాలి, సుమాలీయను వారితో మీరు సూర్యుని కోపము వలన ఈ విధముగా రోగగ్రస్తులైతిరి, అందువలన మీ రుసూర్యుని సేవింపుడని సూర్యమంత్రమును, సూర్యస్తోత్రమును, కవచమును తెలిపి తన లోకమునకు వెళ్ళిపోయెను.

అటుపిమ్మట వారు పుష్కర క్షేత్రమునకు పోయి త్రిసంధ్యలయందు స్నానము చేయుచు సూర్యమంత్రమును భక్తితో జపించుచు సూర్యుని సేవింపసాగిరి, సూర్యుడు వారి భక్తికి మెచ్చి వారికి వరమునీయగా తిరిగి నిజరూపమును పొందిరి.

ఈవిధముగా విఘ్న నాయకునకు విఘ్నము కలుగుటకు కల కారణమునంతయు నీకు వివరించితిని. ఓ నారదమునీ! నీవింకను వినదలచినదేదైనా ఉన్నచో అడుగుమని నారాయణ ముని అనెను.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణ మునుల సంవాదమున పేర్కొనబడిన విఘ్నేశునికి విఘ్నము కలుగుటకు గల కారణమును తెలుపు పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.