3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము
26 - జమదగ్ని కార్తవీర్య యుద్ధోపశమన వర్ణనం
నారాయణ ఉవాచ – నారాయణ ముని ఇట్లు పలికెను –
మునిశ్రేష్ఠుడగు జమదగ్ని కార్తవీర్యార్జునుడు పలికిన మాటలువిని శ్రీహరిని మనస్సులో స్మరించుకొనుచు, సత్యమైనది, నీతితో కూడుకున్నది హితమైనది అగు మాటను పలుకసాగెను.
మునిరువాచ - మునిశ్రేష్ఠుడగు జమదగ్ని ఇట్లు పలికెను –
ఓ మహారాజా! నీవు ఇంటికిపోయి సనాతనధర్మమును రక్షింపుము. ధర్మము స్థిరముగానునన్నచో సమస్త సంపదలు స్థిరముగా ఉండునుకదా! తిండిలేకయున్న నిన్ను చూచి నాఇంటికి తీసికొనివచ్చి నాశక్తికొలది విధివిధానమున నిన్ను గౌరవించితిని. అట్లే ఇప్పుడు రణరంగమున మూర్చపడియున్న నీకు శుభాశీస్సులనొసగి మూర్ఛనుండి తేరుకోనునట్లు చేసితిని. ఇంకను నీతో మాటాడుట నాకు తగనిది అని జమదగ్ని పలుకగా అతని మాటలు విన్న కార్తవీర్యుడు మునికి నమస్కరించి ఇంకొక రథమునెక్కి నాతోయుద్దము చేయుమని మునితో పలికెను.
జమదగ్ని మహర్షికూడ యుద్ధసన్నాహము చేసికొని మహారాజుతో యుద్దము చేయమొదలిడెను. రాజూకూడ కోపముతో యుద్దముకొనసాగించెను. కపిల ఇచ్చిన శస్త్రముచే ముని మహారాజు చేతిలోని ధనుర్బాణాదికమును హరించి ఆ కపిలగోవు ఇచ్చిన శక్తితో రాజును మూర్చపడగొట్టెను. రాజు మరల తెలివిదెచ్చుకొని కోపము కలవాడై మునితో యుద్దము చేయసాగెను.
కార్తవీర్యుడు ఆగ్నేయాస్త్రమును సంధింపగా ముని దానిని తన వారుణాస్త్రముచే అవలీలగా శాంతినొందునట్లు చేసెను. మహారాజు వారుణాస్త్రమును ప్రయోగింపగా ముని దానిని వాయవ్యాస్త్రముచే శాంతింపచేసెను. రాజూ వాయవ్యాస్త్రమును ప్రయోగించినపుడు ముని దానిని గాంధర్వాస్త్రముచే శమింపజేసెను. రాజు నాగాస్త్రమును వేయగా ముని గరుడాస్త్రముచే దానిని నిష్పలమొనర్చెను. మహారాజు శత సూర్యుల కాంతిగల పాశుపతాస్త్రమును ప్రయోగింపగా జమదగ్ని దివ్యమైన వైష్ణవాస్త్రముచే దానిని వమ్ముచేసెను. మహర్షి నారాయణాస్త్రమును ప్రయోగించినప్పుడు రాజు ఆ యస్త్రమునకు నమస్కరించి శరణువేడెను. అప్పుడాయస్త్రము పైకివెళ్ళి క్షణకాలము దశదిశలను ప్రకాశింపజేసి తానుస్వయముగా అంతర్ధానము చెందెను. అపుడు ముని జృంభణాస్త్రమును ప్రయోగింపగా రాజు రణరంగమున చనిపోయినట్లు పడిపోయెను. ఆ సమయమున ముని అర్ధ చంద్రాకారపు శరముచే మహారాజు సారథిని, రథమును, ధనుర్బాణములను పడగొట్టెను. అట్లే తన బాకుచే మహారాజు కిరీటమును, ఛత్రమును పడగొట్టి వివిధ శస్త్రములచే మహారాజుయొక్క తూణీరమును, గజసైన్యమును పడగొట్టి నాగాస్త్రమును ప్రయోగించి మహారాజుయొక్క మంత్రులనందరను కట్టివేసెను.
జమదగ్ని ఆ మహారాజును మూర్ఛనుండి లేపి అతని మంత్రులందరు అస్త్రబద్ధులై పడియుండుటను అతనికి చూపెమ. తరువాత వారినందరను ముక్తులజేసి రాజునాశీర్వదించి అతనిని ఇంటికిపొమ్మని ముని పలికెను. కానీ రాజు కోపముతో లేచి శూలమును ముని పైకి విసరివేసెను ముని యా శూలమును శక్తియను శస్త్రముచే విరిచెను.
ఆ సమయమున బ్రహ్మదేవు డచ్చటకు వచ్చి ఇద్దరి మధ్య సంధిని కలుగజేసెను. జమదగ్ని అప్పుడు సంతోషముతో బ్రహ్మకు నమస్కరింపగా కార్తవీర్యార్జునుడు బ్రహ్మదేవునకు, మహర్షికి నమస్కరించి తనపట్టణమునకు వెళ్ళిపోయెను. మునియగు జమదగ్ని తన ఆశ్రమమునకు పోగా బ్రహ్మదేవుడు తన లోకమునకు వెళ్ళిపోయెను.
నారదా! ఈవిధముగా నీకు జమదగ్ని కార్తవీర్యుల యుద్ధవృత్తాంతమునంతయు తెలిపితిని. తరువాతి కథను కూడ నీకెరింగింతునని నారాయణముని పలికెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణుల సంభాషణలో పేర్కొనబడిన జమదగ్ని కార్తవీర్యుల యుద్ధవిరామమము ఇరవై యారవ అధ్యాయము సమాప్తము.
