3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము
41 - కైలాస వర్ణనము
నారాయణ ఉవాచ- నారాయణ ముని ఇట్లు పలికెను –
భార్గవరాముడు శ్రీకృష్ణకవచమును ధరించి తత్ర్పభావమువలన భూమియందున్న క్షత్రియులందరను హతమార్చి తన గురువైన పరమశివునకు నమస్కరించుటకై కైలాసపర్వతమునకు పోయెను. అచ్చట ఉన్న గురుపత్నియగు పార్వతీదేవిని, తమ సుగుణములతో శ్రీహరిని పోలిన గురు పుత్రుడైన కుమారస్వామి మరియు గణాధిపతిని సందర్శించుకొనవలెనని మనోవేగముతో పోయి కైలాసపర్వతమును చూచెను.
ఆపర్వతము చాల అందమైనదీ. శుద్ధమైన స్ఫటికముల వంటి మణులతో, బంగారు భూముల వంటి రాజ మార్గములతో నున్నది. అచ్చటి మణి మండపముల వేదికలు కాషాయము, ఏఱుపువర్ణములతో నుండెను. ఆ మణి మండపములకు ముత్యముల హారములున్నవి. అచ్చట దివ్యమైన యక్షుల నివాసములు కోట్ల కొలది కలవు. అచ్చటి సౌధములయొక్క ద్వారములు, స్తంభములు, మెట్లు అన్నియూ మణులలో నున్నవి. ఆ సౌధ విమానముల పైన బంగారు కలశములున్నవి. అచ్చటి యక్షులు, యక్షాధిపతులు అందరు రత్నములు బంగారము కల ఆభరణములను ధరించి తెల్లని చామరములతో శివునకు సేవ చేయుచుందురు. అచ్చటి స్త్రీలు చాల అందమైనవారు. వారుకూడ రత్నాలంకారములను ధరించి యుందురు. అచ్చటి బాలురు, బాలికలు చిత్రములను, బొమ్మలను చూచుచు నవ్వుచు ఆడుకొనెదరు. అచ్చట పారిజాత వృక్షములు, ఆకాశగంగా నదీ తీరమున నున్న పద్మములు, సువాసన గల ఇతర పుష్పములు కూడ కలవు. అచ్చటనున్న సిద్ధులు కామధేనువు నాశ్రయించుకొని కల్పవృక్షముల యొక్క నీడలో నివసింతురు. వారు అణిమ మొదలగు సిద్దవిద్యలందు నిపుణులు. అచ్చటి వటవృక్షములు చాల ఎత్తైనవి, విశాలమైనవి కూడ. వాటికి అనేక వందల కొమ్మలున్నవి. ఆ వృక్షములందున్న పక్షులు ఇంపుగా శబ్దము చేయుచుండును. చక్కని వాసన, చల్లని గాలిగల అనేక పుష్పోద్యానములు సరస్సులు అచ్చట నున్నవి. అచ్చట సిద్ధేంద్రుల సౌధములన్నియు మణులచే రత్నములచే నిండియున్నవి.
పరుశురాముడు కైలాసనగరమును చూచి సంతోషముతో గొప్ప శోభతో నున్న శంకరుని సౌధమును చూచెను.
ఆసౌధమును విశ్వకర్మ బంగారము, మణులు, రత్నములతో నిర్మించెను. ఆ భవనము యొక్క ప్రాకారము మూడు లేక ఐదు యోజనముల ఎత్తుతో, నాలుగు యోజనముల వైశాల్యములో చతురస్రముగా, నాలుగు కోణములతో అందముగా కనిపించును.
ఆసౌధముయొక్క ద్వారము అనేక చిత్రములు గల రత్నముల తలుపులతో నున్నది. అచ్చట వేదికలు స్తంభములన్నియు మణులతో నున్నవి.
ఆసౌధమునకు కుడిభాగమున వృషభేంద్రుడు, ఎడమవైపు సింహము, ఇంకను నందీశ్వరుడు, మహాకాళుడు, పింగళాక్షుడు, విశాలాక్షుడు బాణుడు, విరూపాక్షుడు, వికటాక్షుడు, భాస్కరాక్షుడు, రక్తాక్షుడు, వీకటోదరుడు, నంహార భైరవుడు, కాలభైరవుడు, రురుభైరవుడు, మహాభైరవుడు, కృష్ణాంగభైరవుడు, క్రోధభైరవుడు, కపాలభైరవుడు, రుద్రభైరవుడు ఇంకను, సిద్దేంద్రులు, రుద్రగణములు, విద్యాధరులు, యక్షులు, భూతములు, ప్రేతములు, పిశాచములు, కూష్మాండులు, బ్రహ్మరాక్షసులు, భేతాళులు, దానవులు, జడలను ధరించియున్న యోగీంద్రులు, యక్షులు, కింనరులు, కింపురుషులు మొదలగువారి నందరను అతడు దర్శించుకొనెను.
భార్గవరాముడు నందీశ్వరుడు మొదలైన వారినందరను చూచి వారినందరను పలుకరించి నందీశ్వరుని ఆజ్ఞను గైకొని సంతోషముతో శివుని సౌధములోనికి ప్రవేశించెను.
ఆ మందిరమున నూరు గదులున్నవి. అవి యన్నియు రత్నములతో నిండియున్నవి. ఆ గదులయొక్క విమానములందు రత్న కలశములున్నవి. అట్లే ఆ గదుల యొక్క కవాటములన్నియు అమూల్యములైన రత్నములతో మణులతో, అద్దములతో ప్రకాశించుచున్నవి. అచ్చటి స్తంభములన్నియు మణులతో నిర్మింపబడినవి. మెట్లన్నియు మణిమయములే. అనేక చిత్రములతో, మాణిక్యములు ముత్యాలు కల మాలలతో నిండియున్న శంకరుని ఆభ్యంతరమందిర ద్వారమును పరశు రాముడు చూచెను.
శంకరుని ఆభ్యంతర మందిరమున ఎడమప్రక్క కార్తికేయుని, కుడివైపు గణపతిని, ఇంకను శిపునితో సమానమైన పరాక్రమముగల వీరభద్రుని చూచెను. అట్లే రత్న సింహాసనములపై రత్నాలంకార శోభితులైన శంకరుని ప్రధానానుచరులను, క్షేత్రపాలురను కూడా భార్గవరాముడు చూచెను. అతడు గణపతి మొదలగు వారినందరను పలుకరించి అభ్యంతర మందిరము లోనికి పోబోయెను.
భార్గవరాముడు పరమశివుని అభ్యంతర మందిరము లోనికి పోవుచుండగా గణపతి అతనిని ఆపి ఇట్లనెను. భార్గవరామా! మహాదేవుడు ఇప్పుడు నిద్రలోనున్నాడు. నేను లోనికి వెళ్ళి ఈశ్వరుని యొక్క ఆజ్ఞను తీసికొని వత్తును. అప్పుడు ఇద్దరము కలసి లోనికి వెళ్లుదము. అంత వరకు ఇక్కడనే ఉండమని కోరెను.
గణపతి యొక్క మాటలు విని మహాబలుడు మాటలలో బృహస్పతివంటి వాడగు పరశురాముడు ఇట్లు మాట్లాడసాగెను అని నారాయణుడు నారదునితో చెప్పెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణ మునుల సంవాద సమయమున తెల్పబడిన కైలాస పర్ణనమసు నలుబది యొకటవ అధ్యాయము సమాప్తము.
