3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

35 - శంకర కవచ కథనం

నారాయణ ఉవాచ- నారాయణ ముని ఇట్లు నారదునితో పలికెను-

మనోరమాదేవి తన ప్రాణనాథుని క్షణకాలము తన రొమ్ముపై నుంచుకొని తన భర్త చెప్పిన భవిష్యద్విషయములను మనస్సులో నుంచుకొని తన పుత్రులను కింకరులను, బంధువులనందరను పిలిపించుకొని శ్రీహరి పాదములను మనస్సులోనుంచుకొని తన భర్త చెప్పిన మాటలు సత్యమగునవి విశ్వసించెను.

తరువాత ఆ దేవి యోగమార్గమున మూలాధారాది షట్చక్రములనతిక్రమించి, తన శిరస్సున వాయువునుంచుకొని. బ్రహ్మరంధ్రముననున్న సహస్ర దళకమలమున నీటి బుడగలవంటి విషయముల నుండి తన మనస్సును తప్పించి నిష్కళంకమైన పరబ్రహ్మయందు దానిని సుస్థిరము చేసెను. నిర్మూలము, సంసార రహితమగు ద్వివిధ కర్మలను వదలి పెట్టుచు తన ప్రాణములను కూడ విడిచినది. కాని ఆమె తన మనస్సులో తన ప్రాణముల కన్న గొప్పనైన తన భర్తను మాత్రము వదిలి పెట్టలేదు.

రాజగు కార్తవీర్యార్జునుడు తన భార్య చనిపోయిన విషయమును తెలిసికొని ఏడ్వసాగెను. అట్లే అతడు యుద్ధ సన్నాహములను వదలి పెట్టి ఆమెను కౌగిలించుకొని ఇట్లు మాట్లాడెను.

రాజోవాచ- రాజగు కార్తవీర్యుడిట్లు పలికెను-

ఓ మనోరమా! నీవు లేచినచో నేను యుద్ధమునకు పోను.నన్ను చక్కగా చూడుమని రాజు మాటి మాటికి విలపించుచుండెను. అతడుతన గడచిన స్మృతులను జ్ఞాపకమునకు తెచ్చుకొనుచు ఓ మనోరమా! నీవు లేచి శ్రీశైల పర్వతమునకు పోయినచో అచ్చట పూర్వము వీహరించినట్లే విహరింతుము. ఆట్లే ప్రియురాలా! నీవు లేచి గోదావరీనదికి పోయినచో ఆనదిలో పూర్వమాచరించినట్లే జలక్రీడలుచేయుదము. ఇంకను నీవు లేచి నందనవనమునకు పోయినచో పుష్పభద్రానదీతీరమునున్న నిర్జన ప్రాంతమున విహరించుదము. అట్లే నీవు లేచి మలయ పర్వతమునకు వెళ్ళినచో, అచ్చటి చందనవనమున నీతోరమింతును, అచ్చటివాయువు చల్లగాను. పరిమళభరితముగాను ఉండును. ఆ ప్రదేశము గండుతుమ్మెదల ధ్వనితో, గండుకోయిలల కుహూ సాదముతో నిండియుండును. ఆచ్చట నీవు నన్ను చందనము, ఆగురు, కస్తూరి, కుంకుమ మొదలగు సుగంధ ద్రవ్యములపై పూతను పూయుము. చందనముతో నిండిన సర్వావయవములు కల నన్ను చూడుము. అమృతోపమానములగు సమధురవచనములలో సన్ను పలుకరింపుము. నీవీప్పుడు కోపముతో ఎందుకు పలుకరింపవని దుఃఖించుచు రాజూ. పలికెను.

కార్తవీర్యుడు దుఃఖముతో పలుకుచున్న మాటలు విని ఆశరీరవాణి ఆ మహారాజుతో ఇట్లు పలికెను. ఓమహారాజా! నీవు ఓపిక పట్టుకొనుము. దత్తాత్రేయస్వామియొక్క ఆనగ్రహమువలన నీవు మిక్కిలి జ్ఞానమును సంపాదించుకొంటివి. మహాజ్ఞానివగు నీవే ఏడ్చుచున్నావు, ఈ సంసారమంతయును నీటి బుడగవలె చాల అందముగా కన్పించుచున్నను ఆది . క్షణికమైనది. దానికై నీవు బాధపడుట తగదు.

నీభార్యయగు మనోరమ పరమ పతివ్రత. లక్ష్మీదేవియొక్క ఆంశవలన జన్మించినది కావుననే లక్ష్మీదేవి నివసించుచున్న వైకుంఠమునకు పోయినది. అందువలన నీవు కూడ రణరంగమున ప్రాణములను వదలి వైకుంఠమునకు పొమ్మని పలికెను.

ఆకాశవాణి యొక్క మాటలను విని కార్తవీర్యుడు భార్యాశోకమును వదలి చందనపు కట్టెలతో దివ్యమైన చితిని చేయించెను. తరువాత పుత్రునీ ద్వారా సంస్కారములనన్నిటిని చేయించి చితికి నిప్పు పెట్టించెను. అటుపిమ్మట బ్రాహ్మణులకు దానముగా అనేక విధములైన రత్నములను, వస్త్రములను తనకు చెందిన కోశాగారమున నున్న ధనమంతయు ఇచ్చెను. ఇదియంతయు మనోరమ యొక్క పుణ్యము వలననే జరిగినది. ఆసమయమున కార్తవీర్యునియొక్క ఇంటిలో ఎచ్చట చూచినను తినుడు తినుడని, దానములనిండు, ఇండు అనుశబ్దములు మాత్రమే వినవచ్చినవి.

రాజు బాధపడుచున్న మనస్సులోనే, తన సైన్యసమూహమును, వాద్యములను, భాండాగారమును వెంట పెట్టుకొని-- యుద్దమునకు బయలు దేరిను. అతడు యుద్ధమునకు పోవు సమయమున త్రోవలో అనేకాశుభ శకునములు కనిపించినను వెనుదిరుగక యుద్దమునకు పోయిన మహారాజు మరల ఇంటికి తిరిగి రాలేదు.

కార్తవీర్యుడు రణరంగమునకు పోవుచున్నప్పుడు మార్గమధ్యలో తల విరియబోసికొని ముక్కు తెగిపోగా దిగంబరగా ఏడ్చుచు నల్లని వస్త్రములు ధరించిన స్త్రీని, విధవా స్త్రీని, చెడు మాటలు మాట్లాడునది, రోగముతోనున్న కుట్టీనిని (తార్చెడుస్తీని) భర్త, పుత్రులులేని స్త్రీని, వ్యభిచారము చేయు స్త్రీని, కుమ్మరివానిని, గానుగవానిని, వ్యాధుని, పాములనాడించుచు బ్రతుకు పురుషుని, మలిన వస్త్రములు ధరించినవానిని, చాలా భయంకరమైన అవయవములు కలవానిని, నగ్నముగా నున్నవానిని, కాషాయ వస్త్రములు కలవానిని, వసను అమ్ముకొని బ్రతుకువానిని, తన కన్యను అమ్ముకొనువానిని, చితిపై మండుచున్న శవమును, శవము యొక్క బూడిదను, ఆరిపోవుచున్న నిప్పును చూచుచు రణరంగమునకు పోయెను.

ఇంకను ఆతడు తన మార్గములో సర్పదష్టుడైన పురుషుని, సర్పమును, తొండను, కుందేలును, విషమును, శ్రాద్ధపాకమును, శ్రాద్ధపిండములను, మోటకమును, నూవులను, అర్చకుని, వృషభమునెక్కి తిరుగువానిని, శూద్రుని యొక్క శ్రాద్దాన్నమును భుజించువానిని, శూద్రులకు వంట వండి బ్రతుకువానిని, శూద్రులచే పూజలు చేయించువానిని. గడిబొమ్మను, శవములను కాల్చువానిని, శూన్యమైన కుంభమును, పగిలిన కుండను, నూనె, ఉప్పు, ఎముకలను, ప్రత్తిని, తాబేలును, కుడిప్రక్క మొరుగుచున్న కుక్కను, భయంకరముగా ఊళవేయునక్కను, క్షౌరము చేయగా పడిన వెండ్రుకలను, గోళ్ళను, మలమును, కలహమును, ఏడ్పును, చనిపోయినందువలన ఏడ్చుచున్న జనమును, కూట సాక్ష్యములు చెప్పువానిని, దొంగను, హంతకుని, చెడిపోయిన స్త్రీయొక్క భర్తను, పుత్రులను, ఆమె వంటను తిను బ్రాహ్మణుని, దేవతలు, గురువు, బ్రాహ్మణుల యొక్క ధనము నపహరించువానిని, ఇతరులకు దానముగా నీయబడిన వస్తువు నపహరించిన వానిని, దుర్మార్గుని, ఇతరుల హింసించువానిని, సూచకుని, తల్లిదండ్రులను పోషించని వానిని, బ్రాహ్మణుని హింసించువానిని, రావిచెట్టును పడగొట్టు వానిని అబద్దములాడు వానిని, కృతఘ్నుని, తన దగ్గర దాచి పెట్టిన వస్తువుల నపహరించువానిని, బ్రాహ్మణులకు, న మిత్రులకు ద్రోహాము చేయు వానిని, విశ్వాసఘాతకుని, గురువులను, దేవతలమ, బ్రాహ్మణులను ఎల్లప్పుడు నిందించువానిని, జీవులను చంపువానిని, ఆవయవములు లేనివానిని, దయలేనివానిని, వ్రతోపపవాసములు చేయనివానిని. వ్రతనియమము లేని వానిని. కల్లును, రక్తమును కక్కుకొనుచున్నవానిని, దున్నపోతును, గాడిదను, మలమూత్రములను, శ్లేష్మమును, భయంకరమైన పుట్టెను, ఈదురుగాలిని, రక్తవర్షమును, చెట్లు పడిపోవుటను, తోడేలును, పంది, గద్దను, డేగను, ఎలుగుబంటినీ, పాశములను. ఎండిపోయిన కట్టెలను, కాకిని, దానమును తీసికొనుచున్న బ్రాహ్మణుని, తంత్రమంత్రమువలన జీవించువానిని, వైద్యుని, ఎట్టిని పుష్పములను, ఔషధమును, ఊకను, చెడువార్తను, మరణవార్తను, బ్రాహ్మణశాపమును. దుర్వాసనగల వాయువును చూచెను. దానిచే అతని మనస్సు వికలమైనది. ఎడమ పార్స్వము ఆదరసాగినది. జాడ్యమేర్పడినది.

ఈవిధముగా కార్తవీర్యునకు మార్గమధ్యములో అపశకునములు కలిగినవి.

కార్తవీర్యార్జునుడు రణరంగమునకు పోవుచుండగా త్రోవలో అపశకునములెదురైనను ఎట్టి శంకలేక తన సైన్యముతో రణరంగమును ప్రవేశించెను. ఆ రణరంగమున తనకెదురుగా ఉన్న పరశురాముని చూచి తన రథము నుండి వెంటనే దిగి తోటి రాజులతో కలసి భక్తితో దండ ప్రణామమాచరించెను. అప్పుడు భార్గవరాముడు కార్తవీర్యునితో నీవు కోరుకున్నట్లు స్వర్గమునకు పోయెదవని ఆశీర్వదించెను. బ్రాహ్మణాశీర్వచనములు అనుల్లంఘనీయములు కదా!

కార్తవీర్యుడు తనతోటి రాజులతో కలసి భార్గవరామునకు నమస్కరించి, అనేకాయుధములతో వెంటనే తన రథము. నధిరోహించెను. యుద్దము చేయుటకు ముందు బ్రాహ్మణులకు దానములు చేసి యుద్ధవాద్యములగు దుందుభి మృదంగము మొదలగు వాద్యములను యుద్ధసూచకముగా మ్రోగించెను.

అప్పుడు భార్గవరాముడు కార్తవీర్యునితో అతని తోడి రోజుల ముందు హితము, సత్యము, నీతియుక్తమగు మాటలిట్లు పలికెను.

పరశురామ ఉవాచ- పరశురాముడిట్లు పలికెను.

ఓరాజా! నీవు ధర్మతత్పరుడవు. చంద్రవంశమున పుట్టిన వాడవు. ఇంకను విష్ణుమూర్తికి అంశావతారమగు దత్తాత్రేయుని శిష్యుడవు. అతడు మహాజ్ఞాని. నీవు కూడ స్వయముగా విద్వాంసుడవు. వేదములన్నియు తెలిసిన దత్తాత్రేయునినుండి వేదములను చదివిన నీకు సజ్జనులను హింసించుట అను దుర్బుద్ధి ఏవిధముగా నేర్పడినది.

నీవు ఇంతకు ముందు లోభగుణముచే కోరికలు లేని బ్రాహ్మణుని చంపితివి. ఆతని భార్య తన భర్తృశోకము వలన బాధచెంది భర్తతో సహగమనము చేసినది. దానివలన నీకేమి లాభము జరిగినది? ఈసంసారమంతయు తామరాకు పై నున్న నీటిబొట్టువలె ఆశాశ్వతమైనది. సత్కీర్తి లేక దుష్కీర్తి ఈరెంటిలో ఒకటి మాత్రమే లోకమున మిగులును, సత్పురుషులకు అపకీర్తి కలిగెనన్నచో దానికంటే మించినదేమి కలదు? కపిల (కామధేనువు) ఎచటకు పోయెను? నీవెచటకు పోతివి? రాజువగు నీవెక్కడ? ముని ఎక్కడ? మీ ఇరువురి మధ్య వివాదమెక్కడ? వివేకవంతుడగు రాజు చేసిన ఇట్టి దుష్కృత్యమును వివేక మేమాత్రమును లేని అమాయకుడు కూడా చేయడు.

నీవు ఉపోష్యమున్న విషయమును పరమధార్మికుడగు నాతండ్రి గమనించి నీకు భోజనము పెట్టిన దానికి నీవు చక్కని ఫలితము నిచ్చితివి, నీ వేదాధ్యయనము, ప్రతిదినము బ్రాహ్మణులకు విధిపూర్వకముగానిచ్చిన దానముల వలన ఈ ప్రపంచమంతయు నిండిపోయినది. అట్టి నీకు ముసలితనమున అపకీర్తి లభించినది గదా! దానము చేయువాడు, శ్రేష్టుడు, ధర్మకార్యముల నాచరించువాడు, చక్కని పేరున్నవాడు, పుణ్యవంతుడు, విద్వాంసుడు ఆగు కార్తవీర్యుని వంటివాడు పుట్టడు, పుట్టబోడు అని ఈ ప్రపంచమున పెద్దలు, వంది మాగధులు కొనియాడుచున్న నీకు ఇటువంటి చెడు కీర్తి కలిగినది.

ఓరాజా! పరుషమైన వాక్కు సహింపరానిది. అది పదునైన శస్త్రము వంటిది. సత్పురుషుల నోటినుండి కష్టసమయమున కూడ రెండు విధములైన మాటలు రావు. నేను నీపై ఆరోపణలు చేయలేదు. సత్యమైన మాటగనే చెప్పితిని. అందువలన ఈ రాజసమూహమున్న చోట నీవు నాకు ఉత్తరమిమ్ము. ఇచ్చట సూర్య, చంద్ర, మను వంశములకు చెందిన రాజులున్నారు. ఈ సభయందు నీవు సత్యమును పలుకుము. నీ మాటలను పితృదేవతలు, దేవతలు కూడ విందురు. అట్లే మంచి చెడ్డలు చెప్పగలిగిన రాజు శ్రేష్ఠులందరు నీ ప్రత్యుత్తరమును విందురు.

సజ్జనులెల్లప్పుడు పక్షపాతము లేక న్యాయముగా ఉందురని భార్గవ రాముడు పలికెను.

భార్గవ రాముడు రణరంగమున ఈవిధముగా కార్తవీర్యార్జునునితో పలికి యూరకుండెను. అప్పుడు బుద్ధియందు బృహస్పతితో సమానమైన కార్తవీర్యుడు ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను.

కార్తవీర్యార్జున ఉవాచ- కార్తవీర్యార్జునుడిట్లనెను-

ఓ భార్గవరామా! నీవు శ్రీహరియొక్క అంశస్వరూపుడవు. శ్రీహరి భక్తుడవు. ఇంద్రియములనన్నిటినీ జయించిన వాడవు, నీవు నీ గురువుల దగ్గర ధర్మ విషయములను తెలిసికొంటివో వారికే నీవు గురువువంటివాడవు.

తన కర్మననుసరించి లేక సద్బుద్ధితోనైనా బ్రహ్మభావనను తన ధర్మముననుసరించి చేయువాడు బ్రాహ్మణుడని పిలువబడుచున్నాడు. లోపల మననము చేయుచు బయట కర్మలనాచారించువాడు ముని. అతడెల్లప్పుడూ మౌనముగా నుండి అవసరమైన సమయమున మాత్రమే మాటలాడును. బంగారమున, మట్టిపాత్రయందు, ఇంటిపై, ఆడవిపై, బురదపై, చక్కని చందనముపై సమభావము కలవాడే యోగి యనబడును. సమస్తజీవులయందు సమతా భావనచే హరి బుద్దిని కలిగియుండువాడు, శ్రీహరి యందు భక్తి భావన కలవానిని హరి భక్తుడని అందురు. బ్రాహ్మణులకు తపస్సే ధనము. అది కల్పతరువు వంటిది. కామధేనువు వంటిది, కావుననే వారికెల్లప్పుడు తపస్సుపై కోరిక యుండును. క్షత్రియులకు ఐశ్వర్యముపై, వైశ్యులకు వాణిజ్యమున కోరికయుండును కానీ క్షత్రియులు తపస్సు చేయుటను పెద్దలు నిందింతురు. అట్లే బ్రాహ్మణులు వివాదముల జోలికి పోవుట అప్రశస్తమందురు. అనురాగియైనవాడు కర్మపై అనురాగముతో రాజసిక కార్యములు చేయును. రాగాంధుడు రాజసీకుడైన వానిని రాజని పిలుతురు. అందువలన అనురాగముచే నేను జమదగ్ని మహామునిని కామధేనువు కావలెనని జమదగ్ని మహర్షిని యాచించితిని. అనురాగియగు క్షత్రియునకీ విషయమున తప్పేమి కలదు. మీకు తప్ప కామధేనువు ఏమహర్షికి కలదు, మునులకు యుద్ధముపై కోరిక భోగములననుభవింపవలెనని అనుకొనుట తగిన విషయము కాదు. అట్లే ముప్పది యక్షౌహిణుల సైన్యమును, మూడుకోట్ల రాజేంద్రులను చంపి ఒంటరిగా నున్న నన్ను చంపబూనుటను సహింపలేక జమదగ్ని మహర్షిని చంపితిని. తనను చంపుటకు ప్రయత్నించువాడు వేదవేదాంగ పారగుడైనను ఆతనిని చంపినచో బ్రహ్మహత్యాదోషమంటదు అందువలన నా తప్పేమీ లేదని కార్తవీర్యుడనెను.

పరులను హింసించువారు చేసికొనవలసిన ప్రాయశ్చిత్తమును గురించి వేదములందెచ్చట చెప్పబడలేదు. వారిని వధించుటయే తగినదని బ్రహ్మదేవుడు చెప్పెను.

నీతండ్రి మహా బల పరాక్రమ వంతులగు రాజాల నెందరినో సంహరించెను. ఇచ్చటనున్న వారందరు వయస్సులో చిన్న వారైన రాజపుత్రులు, శిశువులు. నీవుకూడ రాజులనందరను ఇరువదియొక్క మార్లు తిరిగి సంహరింతునని ప్రతిజ్ఞ చేసితివి కదా. నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకొమ్ము.

క్షత్రియులకు యుద్ధము చేయుట వారి వృత్తి, ఆయుద్దమున చనిపోవుట నిందింపతగినది కాదు. కాని బ్రాహ్మణులు యుద్దము చేయుట వేదములందు, లౌకికి శాస్త్రములందు ఎచ్చటను కనిపించదు.

తపోధనులు, వాక్కులే బలముగా కల బ్రాహ్మణులకు శాంతి, స్వస్తి వాచనము అనునవి ధర్మములు. క్షత్రియులకు యుద్ధము చేయుట వైశ్యులకు వర్తకము చేయుట, భిక్షుకులకు బిచ్చమెత్తుట, శూద్రులకు బ్రాహ్మణసేవ, వైష్ణవులకు శ్రీహరిసేవ, శ్రీహరి దాస్యము ధర్మములు, విష్ణుభక్తులకు శ్రీహరి బలము. దుష్టులకు హింస, తపస్సులకు తపమాచరించుట, వేశ్యలకు ఆలంకరించుకొనుట, స్త్రీలకు యౌవనము, రాజాలకు ప్రతాపము, చిన్నపిల్లలకు ఏడ్చుట, సత్పురుషులకు సత్యము పలుకుట, దుష్టులకు అబద్దములాడుట, తక్కువ ధనము కలవారికి కూడబెట్టుట, పండితులకు విద్య, సాహసవంతులకు ధైర్యము, ధనవంతులకు ధనము, శాంత స్వభావులకు వివేకము కలిగియుండుట, సద్గుణములు కలవారికి ఐక్యముగానుండుట, దొంగలకు దొంగతనము చేయుట, చెడు నడక గల స్త్రీలకు ప్రియముగా పలుకుట, కపటము, ఆధర్మాచరణము స్వభావ సిద్ధమైనది.

అదేవిధముగా దుష్టజంతువులకు హింసించుట, సతులకు భర్తృశుశ్రూష దేవతలకు వరములు, శాపములిచ్చుట, శిష్యులకు గురువును సేవించుట, గృహస్థులకు ధర్మాచరణము సేయుట, భృత్యులకు సేవజేయుట, వందిమాగధులకు స్తోత్రము చేయుట, బ్రహ్మచారులకు పరబ్రహ్మమును గురించి తెలిసికొనుట, యతులకు సదాచారము, సన్యాసులకు ఆత్మభారమును పరమాత్మపై నుంచుట, పాపాత్ములకు పాపములు సేయుట, అశక్తులకు శ్రీహరిని సేవించుట, పుణ్యవంతులకు పుణ్యకార్యములు చేయుట, ప్రజలకు రాజా యొక్క అండలోనుండుట అనునవి స్వభావ సిద్ధమైనవి.

ఆట్లే వృక్షములకు పండ్లు కలిగియుండుట, జలజంతువులకు జలములో నుండుట, సస్యములకు చేపలకు నీరు, రాజులకు శాంతి, ఇంకను బ్రాహ్మణులకు కూడా శాంతి కలిగియుండుట బలముమ కలిగించునవి.

బ్రాహ్మణుడు శాంతముగా నుండ వలయునే కానీ యుద్ధము నాచరించుట యమనది ఎక్కడను కన్పించలేదు, విన్పించలేదు. భగవంతుడగు శ్రీమన్నారాయణమూర్తీ యుండగానే ఇటువంటి విపరీతము కన్నీంచుచున్నదని కార్తవీర్యుడు పలికెను.

కార్తవీర్యుడు ఈవిధముగా ఆని ఊరకొనగా పరశురాముడు సైతము ఊరకుండెను.

అప్పుడు పరశురాముని సోదరులు తమ సోదరుని ఆజ్ఞననుసరించి ఆనేక శస్త్రాస్త్రములను ధరించి యుద్ధము చేయుటకు మొదలిడిరి. భార్గవరాముని సోదరులు యుద్ధ సన్నద్ధులగుటను గమనించిన మహాబలుడగు మత్స్యదేశాధిపతి తాను కూడ యుద్ధమునకు సన్నద్ధుడయ్యెను.

యుద్ధమునకై వచ్చుచున్న భార్గవరాముని సోదరులను మత్స్య రాజు తన బాణములచే నివారింపగా వారు ఆతని బాణపరంపరను ముక్కలు ముక్కలు చేసిరి. ఆప్పుడు మత్స్యరాజు వారిపై దివ్యాస్త్రమును వేయగా వారు పాశుపతాస్త్రములను వేసి మత్స్యరాజుయొక్క దివ్యాస్త్రమును విరిచి వేసిరి. అట్లే తమ దివ్యాస్త్రములచే ఆ మహారాజుయొక్క ధనుర్బాణములను, రథమును, సారథిని, అతని సైన్యమును అవలీలగా ఖండించిరి. ధనుర్బాణములు లేని ఆ మహారాజును చూచి భార్గవరాముని సోదరులు సంతోషముతో ఆతనిని చంపుటకై శంకరుని శూలమును చేతిలోనికి తీసికొనిరి.

భార్గవరాముని సోదరులు మత్స్య రాజు పై శంకరుని శూలమును ప్రయోగించుచున్న సమయమున వారితో ఆకాశవాణి ఇట్లు పలికెను.

ఓ బ్రాహ్మణులారా! మీరు మత్స్యరాజు పై శంకరుని శూలమును ప్రయోగింపకుడు. ఆరాజునకు పూర్వము దుర్వాసముని దివ్యమైన శివకవచము నిచ్చెను. సమస్తావయవములను రక్షించు ఆ దివ్యకవచము ఆమహారాజుయొక్క మెడలో ఇప్పటికిని ఉన్నది. మత్స్యరాజు గొప్ప దాత. ఆడిగిన వానికి కాదనక తన ప్రాణములనైనను సమర్పించును. అట్టి రాజును మీరు శివకచమునిమ్మని తొలుత యాచన సేయుడని పలికినది. ఐనను ఆముని కుమారులు శూలమును ప్రయోగింపగా అది మహారాజు దగ్గరకు వచ్చి నూరు ముక్కలైపోయినది.

ఆ సయమున ఆకాశవాణి మాటలు విన్న శృంగియను జమదగ్ని పుత్రుడు సన్యాసి వేషమును ధరించి యుద్ధరంగమునకు వచ్చి ఆరాజును శివకవచము నిమ్మని ప్రార్థించెను. మత్స్య రాజు బ్రహ్మాండ విజయమను ఆ శివ కవచమును బ్రాహ్మణ కుమారున కిచ్చి వేసెను. శివకవచమును తీసికొన్న బ్రాహ్మణ కుమారుడతనిపై శివుని త్రిశూలమును ప్రయోగింపగా దానివలన గొప్పబలవంతుడు, చంద్రవంశమున పుట్టిన ఆ మత్స్యరాజు భూమిపై పడి ప్రాణములు వదిలెను.

నారద ఉవాచ- నారద మహర్షి ఇట్లు పలికెను

ఓ నారాయణమునీ! మత్స్యరాజు ధరించిన శివకవచమును తెలిసికొనవలెనని యున్నది. దయచేసి నాకు దానిని వివరించి చెప్పుడని పల్కెను.

ఓనారదమహర్షీ! సమస్తావయవములను రక్షించు బ్రహ్మాండ విజయమను శంకరుని కవచమును సావధానముగా వినుము.

సమస్త పాపములను హరించు శంకరుని షడక్షర మంత్రమును దుర్వాసమహర్షి మత్స్య రాజునకు ఉపదేశించెను. ఈ షడక్షర మంత్ర సహితమైన శంకరుని కవచమును ధరించినచో వారికి ఆస్త్రములవలనను, శస్త్రములవలనను, నీటియందైనను, అగ్నియందైనను మృత్యువు సంభవింపదు.

ఈ శివ కవచమును ధరించి, చదువుచున్నందువలన బాణాసురుడు శివత్వమును పొందెను. అట్లే నందీశ్వరుడు శివునితో సమానుడయ్యెను. వీరభద్రుడు వీరులలో శ్రేష్ఠుడయ్యెను. హిరణ్యకశిపుడు ముల్లోకముల జయింపగలిగెను. హిరణ్యాక్షుడు సహితము ఈ కవచము వలననే విజయము సాధింపగలెను. ఆట్లే ఈ కవచమును ధరించి పఠించు చున్నందువలననే అతడు విశ్వపూజితుడయ్యెను. అదేవిధముగ జైగీషవ్యుడను ముని, వామదేవుడు, దేవలుడు, పవనుడు, అగస్త్యుడు పులస్త్యుడు వీరందరు లోకమాన్యులైరనీ పలికెను.

ఓం నమః శివాయ అను మంత్రము నా శిరస్సును రక్షించుగాక!

ఓం నమః శివాయ స్వాహా అను మంత్రము నానోసటిని రక్షించుగాక!

ఓం హ్రీం శ్రీం క్లీం శివాయ స్వాహా అను మంత్రము నాకండ్లను రక్షించుగాక!

ఓం హ్రీం శ్రీం హూం శివాయనమః అను మంత్రము నా నాసికను రక్షించుగాక!

 ఓం నమః శివాయ - శాంతాయ స్వాహా అను మంత్రము నా కంఠమును రక్షించుగాక! ఓం హ్రీం శ్రీం హూం సంహార కర్త్రే స్వాహా అను మంత్రము నా చెవులను రక్షించుగాక!

ఓం హ్రీం శ్రీం పంచవక్త్రాయ స్వాహా అను మంత్రము నా దంతములను రక్షించుగాక!

 ఓం హ్రీం మహేశాయ స్వాహా అను మంత్రము నాపెదవులను రక్షించుగాక!

ఓం హ్రీం శ్రీం క్లీం త్రినేత్రాయ స్వాహా అను మంత్రము నా వెంట్రుకలను రక్షించుగాక

 ఓం హ్రీం ఐం మహా దేవాయ స్వాహా అను మంత్రము నా వక్షస్థలమును రక్షించుగాక

ఓం హ్రీం శ్రీం క్లీం మైం రుద్రాయస్వాహా అను మంత్రము నాబొడ్డును రక్షించుగాక!

ఓం హ్రీం మైం శ్రీమీశ్వరాయ స్వాహా అను మంత్రము నాపృష్ఠ భాగమును రక్షించుగాక! ఓం హ్రీం క్లీం మృత్యుంజయాయ స్వాహా అనునది నాకనుబొమ్మలను బాహువుల రక్షించుగాక!

ఓం హ్రీం శ్రీం హీమీశానాయ స్వాహా అను మంత్రము నా పార్శ్వభాగముల రక్షించుగాక! ఓం హీమీశ్వరాయ స్వాహా అను మంత్రము నా ఉదర భాగమును రక్షించుగాక!

ఓం శ్రీం హ్రీం మృత్యుంజయాయ స్వాహా అనుమంత్రము నా బాహువుల రక్షించుగాక!

ఓం హ్రీం శ్రీం క్లీమీశ్వరాయ స్వాహా అనుమంత్రము నాచేతులను రక్షించుగాక!

ఓం మహేశ్వరాయ రుద్రాయ అనుమంత్రము నానితంబ భాగమును రక్షించుగాక!

ఓం హ్రీం శ్రీం భూతనాథాయ స్వాహా ఆనుమంత్రము నా పాదములను రక్షించుగాక!

ఓం సర్వేశ్వరాయ శర్వాయ స్వాహా అనుమంత్రము నా పాదముల రక్షించుగాక!

భూతేశుడు నాప్రాగ్భాగమును, శంకరుడు నా ఆగ్నేయ దిగ్భాగమును, రుద్రుడు దక్షిణ దిగ్భాగమును, నైఋతి దిగ్భాగమును స్థాణువు, ఖండ పరశువు పశ్చిమ దిగ్భాగమును, చంద్రశేఖరుడు వాయవ్యదిగ్భాగమును, గిరీశుడు ఉత్తరదిగ్భాగమును, ఈశ్వరుడు ఈశాన్య దిగ్భాగమును, మృడుడు ఊర్ధ్వభాగమును, మృత్యుంజయుడు అధోభాగమును, భక్తవత్సలుడగు పినాకి జలమున, భూభాగమున, ఆకాశమున, స్వప్నావస్థయందు, జాగ్రదవస్థయందు భక్తుడనగు నన్ను ప్రేమతో ఎల్లప్పుడు రక్షించుగాక!

నారదా! ఈవిధముగ పరమాద్భుతమైన శివకవచమును నీకు వివరించితినని నారాయణముని పలికెను.

ఈ శివకవచమును పదిలక్షల మార్లు జపించినచో అది సిద్ధియగును. కవచము సిద్ధించిన వాడు రుద్రునితో సమానుడగును. ఈ కవచమును నీపై గల ప్రేమచే నీకు తెలిపితిని. దీనిని ఆర్హతలేనివారికి ఉపదేశింపకూడదు.

ఈకవచము శుక్లయజుర్వేమునకు సంబంధించిన కాణ్వశాఖయందు చెప్పబడినది. ఇది మిక్కిలి రహస్యమైనది. దుర్లభమైనది కూడ. వేలకొలది అశ్వమేధయాగములు, వందలకొలది రాజసూయయాగములన్నియు ఈకవచము యొక్క గొప్పతనమున పదునారవ వంతైనను కాజాలవు, ఈ కవచము యొక్క అనుగ్రహము వలన దానిని పఠించినవాడు జీవన్ముక్తుడగును. అట్లే అతడు సర్వజ్ఞుడై సమస్త సిద్ధులను బడసి మనోవేగముచే పోవు శక్తిని పొందును.

ఈ కవచమును వదలి శంకరుని కోట్లకొలది శివమంత్రములచే జపించినను అతనికి మంత్రసిద్ధి కలుగదని నారాయణుని నారదునితో ననెను.

శ్రీ బ్రహ్మ వైవర్తమహాపురాణమువ మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున చెప్పబడిన శంకర కవచమను ముప్పది యైదవ అధ్యాయము సమాప్తము.