3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము
15 - కార్తికేయ, నందికేశ్వరుల సంవాదము
నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లనెను-
తన పుత్రుని విషయము తెలిసిన పార్వతీప రమేశ్వరులు విష్ణుమూర్తి, దేవతలు, మునులు మొదలగువారు ప్రేరేపింపగా మహాబలపరాక్రమవంతులైన దూతలను కృత్తికల దగ్గరకు పంపించిరి. ఆ దూతలలో వీరభద్రుడు, విశాలాక్షుడు, శంఖుకర్ణుడు, కబంధకుడు, నందీశ్వరుడు, మహాకాళుడు, వజ్రదంతుడు, భగంధరుడు, గోధాముఖుడు, దధీముఖుడు, మొదలగువారున్నారు. ఇంకను లక్ష క్షేత్రపాలురు, మూడులక్షల భూతములు, నాలుగు లక్షల భేతాళురు, ఐదులక్షలు యక్షులు, నాలుగులక్షల కూష్మాండులు, మూడు లక్షల బ్రహ్మరాక్షసులు, నాలుగు లక్షల డాకీనులు, మూడులక్షల యోగీనులు, వికృతాకారము కలవారు, శివునితో సమానమైన పరాక్రమము కలవారు అగు ఆంతులేని రుద్రులు, భైరవులు మొదలగువారు కలరు.
ఆ శివదూతలందరు శస్త్రాస్త్రములను ధరించి కృత్తికలయొక్క భవనమును చుట్టుముట్టిరి. అప్పుడు శివదూతలను చూచి కృత్తికలు అమితమైన భయముతో బ్రహ్మతేజో విరాజితుడగు కార్తికేయుని ఆశ్రయించిరి.
కృత్తికా ఊచుః –
కృత్తికలు ఈవిధముగా పలికిరి.
నాయనా! ఈ అసంఖ్యాకమైన సైన్యములు మన ఇంటిని చుట్టుముట్టుకొన్నవి. భయంకరమైన ఈ సైన్యములెవ్వరివో మాకు తెలియదని పలికిరి.
కార్తికేయ ఉవాచ - కార్తికేయుడు కృత్తికలతో నిట్లనెను-
అమ్మలారా! మీరు భయపడకుడు. నేనుండగా మీరు భయపడవలసిన అవసరములేదు. ఐనను కర్మఫలితమును ఎవ్వరు వారించలేరని పలికెను.
ఆ సమయమున శివుని సేనాధిపతియగు నందికేశ్వరుడు కార్తికేయుడు మరియు కృత్తికలముందు నిలబడి ఇట్లు పలికెను.
నందికేశ్వర ఉవాచ - నందికేశ్వరు డిట్లు పలికెను-
ఓ తమ్ముడా! నన్ను ఇచ్చటకు పంపించిన శ్రీ మహా విష్ణువు యొక్క, జగత్సంహార కారకుడగు శంకరునియొక్క, నీతల్లియగు పార్వతీదేవియొక్క మరియు నాయొక్క మాటలను శ్రద్ధగా విమము.
గణపతియొక్క ఉత్సవముమ జరుపుకొను సమయమున కైలాసపర్వతముపై సభలో బ్రహ్మవిష్ణుశివాది దేవతలుండిరి. అప్పుడు పార్వతీదేవి జగత్పరిపాలకుడగు విష్ణువును నీగురించి అడిగినది. అప్పుడు శ్రీమహావిష్ణువు నీగురించీ దేవతలనందరినడిగెను. ఆసమయమున దేవతలు ఒక్కొక్కరు తమకు తెలిసిన విషయమును చెప్పిరి. చివరకు ధర్మాధర్మకార్యములకెల్ల సాక్షీభూతులైన ధర్మాదిదేవతలు నీవు కృత్తికల ఇంటిలోనున్నట్లు తెలిపిరి.
పూర్వము పార్వతీ పరమేశ్వరులు రహస్య క్రీడలాడు కొనుచున్నప్పుడు దేవతలు చూడగా శంకరునియొక్క వీర్యము భూమిపై పడినది. భూదేవి ఆతని వీర్యమును భరింపలేక దానిని వహ్నిలోనుంచగా అగ్నిదేవుడు రెల్లుగడ్డిలో(శరవనములో) దానీని వదలిపెట్టెను. అచ్చట జన్మనెత్తిన నిన్ను కృత్తికలు తీసికొనిపోయిరి. అందువలన నీవిప్పుడు కృత్తికలతో కలసి కైలాసమునకు పోయినచో అచ్చట విష్ణువు నిన్ను సేనాధిపతిగా అభిషేకించును. అప్పుడు దేవతలొసగిన సమస్త శస్త్రములను పొంది నీవు తారకాసురుని సంహరింపగలవు.
నీవు ప్రపంచమునంతయు సంహరింపజాలు మహాదేవునియొక్క పుత్రుడవు. అట్టి నిన్ను ఈ కృత్తికలు కాపాడలేరు. ఎండినచెట్టు తన తొఱ్ఱలో అగ్నిని దాచుకొనజాలనట్లు, దీప్తిమంతుడవైన నీవు ఆ కృత్తికల ఇంటిలో ఉండలేవు. పెద్దబావిలో పడిన గజరాజువలె వీరి ఇంటిలో నీవు ప్రకాశింపలేవు. మానవుడు తన చేతులనడ్డు పెట్టినచో సూర్యుడు, మాయముకానట్లు నీవు ఎవరి తేజస్సు వలన మాయము కావు. నీవు సాక్షాత్ మహా విష్ణువు వలె జగములంతయు వ్యాపించియున్నవాడవు, అందువలన కృత్తికలకు వ్యావ్యుడవుకావు. ఆకాశమేవిధముగా దేనికి వ్యాప్యముకాదో అట్లే స్వతః వ్యాపకమగువో నీవల్లే స్వతః. వ్యాపకుడవు, నీవు విషయములనుండి నిర్లిప్తుడవైన యోగీంద్రుడవు కాన వేరుకాదు. నీవు విశ్వమునకంతయు ఆధారభూతుడవు, ఈశ్వరుడవు.
నదులకన్నిటికి నివాసస్థానమగు సముద్రము ఒక నదిలో ఎట్లు అణగియుండదో అట్లే సర్వాశ్రయుడవైన నీవు కృత్తికల ఇంటిలో ఉండలేవు, గరుత్మంతుడు చిన్న పిట్టగూటిలో ఎట్లుండలేడో నీవుకూడ కృత్తికల ఇంటిలో ఉండలేపు, యోగులు కాని వారు జ్ఞానమునెట్లు తెలియరో ఆట్లే గుణములు, తేజస్సులకు రాశివి, భక్తులననుగ్రహించుటకు జన్మనెత్తిన నిన్ను కృత్తికలు గుర్తింపలేరు. మూడులైన శ్రీహరిభక్తి రహితులు, మిక్కిలి గొప్పనైన శ్రీహరిభక్తిని గుర్తించనట్లు, కప్పలు తమతో కలసియుండు పద్మము గొప్పదనమును గుర్తించనట్లు కృత్తికలు నీయొక్క గొప్పతనమును గుర్తింపలేరు. పైగా నీకు అనాదరణ చేయుదురు. అందువలన మావెంట కైలాసమునకు రమ్మని కోరెను.
కార్తికేయ ఉవాచ - కార్తికేయుడు ఇట్లు పలికెను-
సోదరా! నందికేశ్వరా! భూతవర్తమాన భవిష్యత్కాలములకు సంబంధించిన సమస్త జ్ఞానము నాకు కలదు.
అట్లే నీవుకూడ మహాజ్ఞానివి. మృత్యుంజయుని ఆశ్రయించియున్న నిన్ను ప్రత్యేకించి పొగడవలసిన పనిలేదు. తమ తమ కర్మవనుసరించి ఆయా జన్మలనెత్తినవారు ఆయాజన్మలందు మోక్షమును పొందలేరు. కర్మననుసరించి ఆయా జన్మలనెత్తినవారు విద్వాంసులైనా మూర్ఖులైనా వారు విష్ణుమాయవల్ల మోహితులై తమ జన్మ చాలా గొప్పదని భావింతురు. ఆ విష్ణుమాయ జగములకన్నటికి మాతృరూపిణి, సమస్త సృష్టికంటే ఆద్యురాలు. ప్రపంచమునకంతయు మంగళమును కలిగించునది. ఆ విష్ణుమాయయే హిమాలయ పర్వతరాజు భార్యయగు మేనకు పుత్రికగా జన్మించి అమితమైన, తీవ్రమైన తపమాచరించి శంకరునకు భార్య కాగలిగెను,
బ్రహ్మ మొదలుకొని గడ్డివరకున్న సమస్త సృష్టి అశాశ్వతమైనది. మరియు మిధ్యయైనది. ఈ చరాచరసృష్టియంతయు శ్రీకృష్ణునినుండి పుట్టుచున్నది. మరల అతనియందే విలీనమగుచున్నది.
నేను ప్రతి కల్పమున మాయకు బద్ధుడనై జన్మించుచున్నాను. ఆయా జన్మలలో సహితము జగన్మాతయగు పార్వతీదేవియే నాకు తల్లి. ఈ ప్రపంచముననున్న స్త్రీలందరు ప్రకృతిరూపిణియగు ఆ శక్తి నుండి ఉద్భవించినవారే. వారిలో కొందరు ఆ శక్తియొక్క ఆంశలుకాగా, మరికొందరు ఆమెయొక్క అంశాంశలు. ఇంకను కొందరు అంశాంశాంశలు.
ప్రకృతియొక్క అంశస్వరూపమైన కృత్తికలు జ్ఞానము కలవారు, యోగినులు కూడ. ఆట్టి కృత్తికల స్తన్యముచే వారిచ్చు ఉపహారములచే నేను పేరిగినాను. వారికి నేను పెంపుడు కొడుకును. వారు నన్ను పెంచి పెద్దచేసినందువలన వారు నాకు తల్లులు. అట్లే నేను, ప్రకృతిరూపిణి యగు పార్వతికి పుత్రుడను. పరమేశ్వరుని వీర్యమువలన జన్మనెత్తినవాడను. ఐనను ఓ నందీశ్వరా! నేను పర్వతరాజపుత్రియగు పార్వతియొక్క గర్భమునుండి జన్మింపలేదు. అందువలన పార్వతీదేవి ధర్మతః మాతయే కానీ జన్మనిచ్చిన తల్లికాదు. అట్లే ఈ కృత్తికలు సహితము ధర్మతః తల్లులే కాని జన్మతః తల్లులు కారు.
స్తన్యము నిచ్చునది, గర్భమున ధరించునది, తిండి పెట్టునది, గురువుయొక్క భార్య, ఇష్టదేవతయొక్క భార్య, సవతితల్లి, తన తోబుట్టువులగు స్త్రీలు, కోడలు, తన భార్య తల్లి(అత్తగారు), అమ్మమ్మ, నాయనమ్మ, సోదరుని భార్య, మేనమామ భార్య, మేనత్త, తల్లియొక్క అక్కాచెల్లెండ్లు, తన సోదరుల పుత్రికలు అను పదునారుగురు తల్లులని వేదమున (ధర్మశాస్త్రమున) చెప్పబడిరి.
నన్ను పెంచి పెద్దచేసిన కృత్తికలు నమస్తసిద్దులను తెలిసినవారు, పరమైశ్వర్యసంపన్నులు, త్రిలోకపూజ్యులు, వీరు బ్రహ్మదేవుని పుత్రికలు కానీ క్షుద్రులుమాత్రము కారని పలికెను.
శ్రీమహావిష్ణువుచే పంపించబడిన శివానుచరుడవగు నీవుకూడ శంకరునకు పుత్రునితో సమానుడవు. అందువలన నీమాటను త్రోసి వేయకూడదు కావున నేను నీతోవచ్చి దేవతలనందరను చూచెదనని కార్తికేయుడు పలికెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణమునుల సంవాద సమయమున పేర్కొనబడిన నందీశ్వర, కార్తికేయుల సంవాదముగల పదునైదవ అధ్యాయము సమాప్తము.
