3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

1 – పార్వతీ పరమేశ్వరుల సంభోగ వర్ణనము

శ్రీమన్నారాయణునకు మానవులలో ఉత్తముడైన నరుడను మహర్షికి, సరస్వతీదేవికి వ్యాసునకు నమస్కరించి జయజయధ్వానముచేయవలెను. ఇది ప్రార్థనాశ్లోకం.

నారద ఉవాచ-  నారదమహర్షి నారాయణునితో ఇట్లనెను-

ఓనారాయణమునీ! నీఅనుగ్రహమువలన అమృతసముద్రమని పేరొందినది, అజ్ఞానులకు జ్ఞానమును కలిగించునది, అందరకు ఇష్టమైనది, సర్వోత్కృష్టమైనది యగు ప్రకృతిఖండమును వింటీని.

ఇప్పుడు అందరకు మంగళప్రదమైన శ్రీగణేశఖండమును వివవలెనను కోరిక నాకు కల్గినది. ఆతని జన్మ, ఆతని చరిత్ర శుభములకే శుభమైనది. కావున దానిని వినవలెనని అనుకొనుచున్నాను.

దేవతా శ్రేష్టుడగు ఆ గణపతి పార్వతీదేవిపుత్రుడుగా ఎట్లు ఉద్భవించెను? పార్వతీదేవి సహితము గజముఖుడగు ఆ బాలకుని “ఏవిధముగా కన్నది? ఆ గణపతి ఏదేవునియొక్క అంశో? ఎవరివలన జన్మించెను? అతనిజన్మప్రకారమెట్టిది? అతడు యోనిజుడా అయోనిజుడా? ఆ బ్రహ్మతేజస్సు ఎటువంటిది? అతని పరాక్రమవిశేషములెట్టివి? ఆతడెట్టి తపస్సు చేసెను? ఆతనికి లభించిన జ్ఞానమెట్టిది ఆతని కీర్తి వివరములేమి? ఈసమస్తవిశ్వములందు బ్రహ్మ, నారాయణుడు, శంకరుడు వంటి దేవతలుండగా ఈతనికి ప్రథమపూజను ఆందరెందులకు చేయుచున్నారు?

ఆతని జన్మవృత్తాంతము పురాణములలో చాలా రహస్యముగా నున్నదని వింటిని, ఆ గణేశుడు గజముఖుడుగా, ఏకదంతుడుగా ఎట్లయ్యెను మొదలగు విషయములనన్నిటిని వినవలెనని కోరికకలదు.

మిక్కిలి సుందరమైన ఆ గణేశుని చరిత్రను నాకు సంపూర్ణముగా వివరింపుడని ప్రార్థించుచున్నాను అని పలికెను.

శ్రీనారాయణ ఉవాచ – శ్రీమన్నారాయణుడిట్లనెను-

ఓనారదమహర్షి శ్రీగణపతియొక్క చరిత్ర చాలా రహస్యమైనది. మిక్కిలి ఆశ్చర్యమును కలిగించునది, సమస్తపాపములను, శోకములను హరించునది. సమస్తవిఘ్నములను తొలగించునది.

ఈతని చరిత్ర సమస్తశుభములను కలిగించును, సుఖమును మోక్షమును కలిగించును. సమస్తపాపములకు కారణమైన దుష్కర్మలను పోగొట్టును,

పూర్వకాలమున రాక్షసులు దేవతలను మిక్కిలి బాధించెడివారు. దానవపీడితులైన దేవతల ప్రార్థన ననుసరించి తేజోరాశినుండీ పుట్టిన దుర్గాదేవి రాక్షసులనందరను సంహరించినది. ఆ దుర్గాదేవియే సతీదేవి యను పేర దక్షునకు పుత్రికగా జన్మించినది. ఆ సతీదేవి దక్షయజ్ఞమున తండ్రియగు దక్షుడు తన భర్తను నిందింపగా విని సహింపలేక యోగబలము వలన తన శరీరమును వదలిపెట్టి హిమవంతునకు అతని భార్యయగు మేనాదేవికి పుత్రికగా జన్మించినది. యుక్తవయస్కురాలగు తన పుత్రికను హిమవంతుడు శంకరునకిచ్చి వివాహము చేసెను.

ఆప్పుడు శంకరుడు పార్వతీదేవిని తీసికొని నిర్జనమైన నర్మదానదీతీరమునకు తీసికొనిపోయెను. ఆక్కడనున్న పుష్పద్యానవనమున పుష్పములు, చందనములతో రతికి అనుకూలమైన శయ్యను ఏర్పరచి అచ్చట అనేకనేక దేవతావర్షములు ఆమెతో సంభోగించెను.

దుర్గాదేవియొక్క శరీరస్పర్శతోనే పరమేశ్వరుడు పులకించి మైమరచిపోగా, శంకరుని అవయవస్పర్శవలన పార్వతీదేవి పులకించి మైమరచిపోయినది. వారిద్దరు హంసలు, బాతులు తీరుగుచున్న ప్రదేశమున గండు కోకిలలు మనోహరముగా శబ్దించుచున్న సమయమున, తుమ్మెదల ఝంకారములతో పువ్వుల పైనుండి వచ్చు సుగంధమందమారుతములతో ఆ ప్రదేశమంతయు పరమారమణీయముగానుండగా నీర్జనమైన స్థలమున సుఖసంభోగమున తేలియాడుచుండిరి.

కాని సమయమునేమాత్రము పట్టించుకొనకుండా వారు సంభోగముననున్నందువలన దేవతలు చాల చింతించి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళిరి. బ్రహ్మదేవుడు సహితము దేవతలను వెంటబెట్టుకొని శ్రీమన్నారాయణుని సన్నిధికి వెళ్ళాను. ఆచ్చట బ్రహ్మదేవుడు పార్వతీపరమేశ్వరుల విషయమును నారాయణునకు చెప్పుచున్నప్పుడు దేవతలందరు చిత్రములోని బొమ్మలవలె అచ్చట నిలుచుండిరి.

బ్రహ్మోవాచ – బ్రహ్మదేవుడిట్లనెను-

కింభూతం భవితాపత్యం తన్నః కథితుమర్హసి

శంకరుడు వేయి దేవమాన సంవత్సరములనుండి రతిలోనిమగ్నుడై రతికార్యమును విరమింపక ఉన్నాడు. అందువలన ఓజగదీశ్వరుడవైన శ్రీమన్నారాయణమూర్తీ! ఈదంపతులకెట్టి సంతానము కలుగునో మాకు తెలుపుడు ఆని బ్రహ్మా శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించెను.

శ్రీభగవానువాచ - భగవంతుడగు నారాయణమూర్తి ఇట్లనెను-

జగములనన్నిటిని సృష్టించు ఓబ్రహ్మదేవుడా! మీరు భయపడవలసిన అవసరము లేదు. మీకు సమస్తము శుభములే కలుగును. నన్ను శరణుపొందినవారికి దు:ఖము ఎన్నటికిని కలుగదు. ప్రస్తుతము నీవు, ఈదేవతాగణము అందరు కలసి శంకరుని వీర్యము భూమిపై పడునట్లు చేయుడు, శంకరుని వీర్యము పార్వతీదేవి కడుపున పడినచో దేవరాక్షసులనందరును సంహరించు పుత్రుడు పుట్టును కావున నేను చెప్పినట్లు చేయుడు అనీ పలికేను.

ద్వారిష్ఠితో వక్రశిరా శక్రః ప్రాహ మహేశ్వరం

శ్రీమన్నారాయణుని అనుజ్ఞనుపొంది దేవతలందరు నర్మదాతీరమునకు వెళ్ళగా బ్రహ్మదేవుడు బ్రహ్మలోకమునకు పోయెను. దేవతలచ్చట పర్వతముల నడుమనున్న స్థలమున భయముతో విషణ్ణవదనులైరి. ఆ భయమువల్లనే ఇంద్రుడు కుబేరుని, కుబేరుడు వరుణుని, వరుణుడు వాయువును, వాయువు యమధర్మరాజును, యముడు అగ్నిని, అగ్నిదేవుడు సూర్యుని, సూర్యుడు చంద్రుని, చంద్రుడు ఈశ్వరుని ఇట్లు దేవతలొకరినొకరు శంకరుని రతిభంగము చేయు మని ప్రేరేపించుచుండిరి.

చివరకు దేవేంద్రుడు పార్వతీపరమేశ్వరులున్న ఇంటిద్వారమువద్ద . ముఖము తిప్పుకొని శంకరునితో ఇట్లనెను.

ఇంద్ర ఉవాచ - ఇంద్రుడిట్లు పలికెను-

ఉవాచ భీతో ద్వారస్థః భయాల్తో వక్రచక్షుషా

ఓమహాదేవ! నీవేమి చేయుచున్నావు? యోగీశ్వరుడవు, జగదీశుడవు, భక్తులభయములపోగొట్టునీకు నమస్కారము.

ఇంద్రుడిట్లు పలికిపోగానే సూర్యుడచ్చటకు వచ్చి తన తలతిప్పుకొని భయపడుచు ఇట్లనెను.

శ్రీసూర్య ఉవాచ – సూర్యభగవానుడిట్లనెను-

జగములనన్నిటిని పరిపాలించు ఓమహాదేవా! నీవు ఏమిచేయుచున్నావు. దేవతా శ్రేష్టుడవగు పార్వతీనాథా! నీకు నమస్కారము. అని సూర్యుడు పలికి భయముతో అక్కడినుండి వెళ్ళిపోయెను. అప్పుడాస్థలమునకు చంద్రుడువచ్చి తలప్రక్క కుదిప్పి ఇట్లనెను.

చంద్ర ఉవాచ - చంద్రుడిట్లు పలికెను-

ముల్లోకములకు ఈశ్వరుడవగు ముక్కంటీ! నీవేమిచేయుచున్నావు. స్వయంపూర్ణుడవు. ఆత్మారాముడవగు నమస్కరింతును అని చంద్రుడు భయముతో పలికి ఊరకుండగా వాయువచ్చటకు వచ్చి ఇట్లనెను.

పవన ఉవాచ - వాయుదేవు డిట్లు పలికెను-

లోకములకన్నిటికిని బంధువగు ఓజగన్నాథుడా! నీవిప్పుడేమి చేయుచున్నావు? ధర్మార్థకామమోక్షములనే చతుర్వర్గములకు కారణమైన ఓసనాతనుడా! నీకు నమస్కారము.

ఈవిధమైన దేవతలస్తోత్రమును విని యోగనము చక్కగా పెరిగిన పరమశివుడు పార్వతీదేవిని వదలి పెట్టినచో ఆమె ఏమనుకొనునో అని భయపడి రతికార్యమును వదిలి పెట్టలేదు. ఐనను దేవతలు తనను మరల స్తుతింపబోవుచున్న విషయము నెరిగి తననాలింగనము చేసికొన్న పార్వతీదేవిని వదలి సుఖసంభోగమును త్యజించెను.

ఆ సమయమున మహేశ్వరునకు వీర్యస్ఖలనమై అది భూమిపై పడినది. ఆ మహేశ్వరవీర్యమే కుమారస్వామిగా రూపుదాల్చినది.

నారదా! ఆతీమనోహరమైన తరువాతి కథను కుమారస్వామి జన్మవృత్తాంతమును వివరింపునప్పుడు నీకు చెప్పెదను. ప్రస్తుతము నీవు కోరుకున్న గణపతి వృత్తాంతమును నీవు వినుమని నారాయణు డనెను.

 శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణమున మూడవదగు గణపతిఖండములో నారద నారాయణుల సంవాదము కల మొదటి అధ్యాయము సమాప్తము.