శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము
31 - నారద ప్రచేతస సంవాదము
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- శ్రీహరి నిర్దేశించిన కాలము పూర్తి అయిన తరువాత ఆ ప్రచేతసులు శ్రీహరియొక్క వచనమును స్మరించి, కొడుకునకు భార్యను అప్పజెప్పి, ఇంటిని విడిచి సన్న్యసించిరి.
వారు పడమరదిక్కునందలి సముద్రతీరమునకు వెళ్లి, బ్రహ్మవిచా రమునకు సంకల్పమును చేసిరి. ఆ విచారమునందు సర్వప్రాణులయందు తానే ఆత్మరూపముగా నున్నాననే సత్యము గుర్తించబడును. అది జాజలి మహర్షి ముక్తిని పొందిన స్థానము.
ఆ ప్రచేతసులు సర్వక్రియలనుండి విరమించుకొని, మౌనమును పాటిస్తూ, కళ్లు మూసుకొని, నిటారుగా కూర్చున్నవారై, ఆసనమును జయించి, ప్రాణాయామమును చేసి, మనోనిగ్రహమును సంపాదించిరి. వారు శుద్దమగు పరబ్రహ్మయందు మనస్సును నిలిపియుంచిరి. వారిని నారదమహర్షి చూచెను. ఆయనను దేవతలు మాత్రమే గాక, రాక్షసులు కూడ కొనియాడుచుందురు.
నారదుడు రాగానే వారు లేచి నిలబడి నమస్కరించి ఆయన రాకను ప్రశంసించిరి. ఆయనకు యోగ్యమగు ఆసనమునిచ్చి పూజించిరి. ఆయన సుఖముగా కూర్చుండియుండగా, వారిట్లు స్తుతించిరి.
ప్రచేతసులు ఇట్లు పలికిరి --- ఓ దేవర్షీ! నీకు స్వాగతము. దైవా నుగ్రహముచే నీవు మాకు కనబడితివి. సూర్యుని సంచారముచే లోకము లకు వెలుగు కలిగి భయము పోవును. అదే విధముగా నీ సంచారముచే లోకులకు జ్ఞానోదయమై సంసారభయము తొలగును.
ఓ ప్రభూ! శివ భగవానుడు మరియు శ్రీహరి కూడ ఆత్మతత్త్వ మును ఉపదేశించినారు. కాని, మేము చాల కాలము గృహవిషయములలో గట్టి ఆసక్తిని కలిగియుండుటచే, ఆ ఉపదేశమును చాలవరకు మరచితిమి.
కావున, నీవు మాకు యథార్థమగు అద్వయవస్తువుయొక్క సాక్షా త్కారమును కలిగించే ఆత్మజ్ఞానమును ప్రకాశింప జేయుము. దాని వలన మేము తరించ శక్యము కాని సంసారసముద్రమును తేలికగా తరించెదము.
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా మహారా జులగు ప్రచేతసులు ప్రశ్నించగా, పూజ్యుడగు నారద మహర్షియొక్క మనస్సు ఉత్తమమగు కీర్తి గల శ్రీహరియందు సంలగ్నమయ్యెను. ఆయన వారితో నిట్లనెను.
నారదుడిట్లు పలికెను --- జగద్రూపములో ప్రకటమైన శ్రీహరియే ఈ జగత్తునకు ఆత్మ. మానవులకు జగన్నాథుడగు శ్రీహరి సేవలో విని యోగించిన జన్మయే జన్మ; శ్రీహరిని సేవించుటకు చేసే కర్మలే కర్మలు; శ్రీహరి సేవలో వినియుక్తమైన ఆయుర్దాయమే ఆయుర్దాయము; శ్రీహరిని స్మరించే మన స్సే మనస్సు; శ్రీహరిని కీర్తించే వాక్కే వాక్కు.
శ్రీహరి భక్తులకు తనను తాను సమర్పించుకొనును. భక్తులకు ఆత్మజ్ఞానముననుగ్రహించేది శ్రీహరియే. అట్టి శ్రీహరితోడి సంబంధము లేనిచో, మంచి వంశములో పుట్టుట, ఉపనయనము అనే రెండవ జన్మ, యజ్ఞము అనే మూడవ జన్మ, వేదవిహితములైన కర్మలు, దేవతలకు వంటి ఆయుర్దాయము, శాస్త్ర శ్రవణము, తపస్సు, గొప్ప వాక్కులు, మనస్సు లోని గొప్ప ఆలోచనలు, నిపుణమగు బుద్ధి, శరీరబలము, ఇంద్రియ పాట వము, యోగాభ్యాసము, కేవలమగు ఆత్మానాత్మవివేకము, సన్న్యాసము, వేదాధ్యయనము, ఇతరములగు శ్రేయస్సాధనములు మొదలగువాటితో మానవునకు ప్రయోజనమేమున్నది?
వాస్తవములో శ్రేయస్సాధనములన్నింటికి ఆత్మయే అవధి (అనగా, ఆత్మజ్ఞానమునకు దారి తీసే సాధనములు మాత్రమే శ్రేయస్కరములు). ఆత్మజ్ఞానమునిచ్చే శ్రీహరియే సకలప్రాణులకు ప్రియమగు ఆత్మ.
చెట్టు మొదట్లో నీరు పోసినచో, మ్రాను పెద్ద చిన్న కొమ్మలు సర్వ మునకు రసము అందును. ప్రాణశక్తికి ఆహారమును సమర్పించినచో, ఇంద్రియములన్నింటికీ శక్తి లభించును. అదే విధముగా, శ్రీహరిని అర్చించినచో, సకలజగత్తును అర్చించినట్లే యగును.
సూర్యుని వలన అంతరిక్షమునుండి వర్షములు పడును. ఆ వర్షజ లమంతయు మరల వేసవి కాలములో అంతరిక్షములోనికి గ్రహించబడు ను. కదిలే మరియు కదలని ప్రాణుల దేహములన్నియు భూమినుండియే పుట్టి, మరల భూమిలోనే విలీనమగును. అదే విధముగా, సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతియొక్క ప్రవాహరూపమగు ఈ బ్రహ్మాండము శ్రీహరి నుండియే పుట్టి, శ్రీహరిలోననే విలీనమగును.
జగత్తుయొక్క వాస్తవికతత్త్వము శ్రీహరియే. శాస్త్రప్రసిద్ధమైన శ్రీహరియొక్క స్వరూపము ప్రకృతికి అతీతమైనది మరియు స్వయంప్రకా శము. పాంచభౌతికదేహము ప్రకృతికంటే భిన్నముగా నున్నదనియు, ఇంద్రి యశక్తులు ప్రకృతిశక్తికంటే వేరుగానున్నవనియు, తాను పరమాత్మకంటే భిన్నముగా నున్నాననియు మానవులు భ్రమించుచుందురు. ఆ స్వరూప మును ఆత్మరూపముగా తెలుసుకొనుట వలన ఇట్టి భేదభ్రాంతి దూరమగు ను. సూర్యునినుండి వెలువడే కాంతులు సూర్యునికంటే భిన్నముగా లేవు. జాగ్రదావస్థలో ప్రకటమయ్యే ఇంద్రియశక్తులు నిద్రావస్థలో ఏ ఆత్మయందు విలీనమగుచున్నవో, దానికంటే అవి జాగ్రదవస్థలోనైననూ భిన్నముగా ఉన్నట్లు కన్పట్టుటయే గాని, భిన్నముగా లేవు. అదే విధముగా శ్రీహరి నుండి వెలువడిన ఈ జగత్తు శ్రీహరికంటే భిన్నముగా లేదు.
ఓ ప్రచేతసులారా! ఆకాశములో మేఘములు, చీకటి వెలుగులు ఆయా కాలములలో కనబడి మరల అదృశ్యమగుచుండును. అదే విధముగా, శ్రీహరియందు సత్త్వరజస్తమోగుణములరూపములో మాయాశక్తి సృష్టికాలములో ప్రకటమై ప్రళయకాలములో విలీనమగును. ఈ శక్తుల వలననే జగత్తు అనే ప్రవాహము సాగిపోవుచున్నది.
శ్రీహరియే సకలప్రాణులకు ఆత్మ. కాలరూపుడగు ఆయనయే ఈ జగత్తునకు ఉపాదానమగుచున్నాడు. ప్రకృతికి అతీతుడు మరియు పూర్ణుడు అగు శ్రీహరి చిదనుడు గనుక, ఈ త్రిగుణముల ప్రవాహరూప మగు జగత్తుయొక్క గుణదోషములు ఆయనకు సంక్రమించవు. అట్టి శ్రీహ రిని సాక్షాత్తు ఆత్మకంటే అభిన్నము అనే విధముగా సేవించుడు.
సకలప్రాణులయందు దయ, లభించినదానితో తృప్తి పడుట, ఇంద్రియములనన్నింటినీ భోగ్యవిషయములనుండి వెనుకకు మళ్లించి శాంతముగా నుండుట అనువాటిచే దుష్టజనశీక్షకుడగు శ్రీహరి తొందరగా ప్రసన్నుడగును.
కామనలన్నియు తొలగుటచే సత్పురుషుల హృదయములు స్వచ్చముగా నుండును. వారు అట్టి తమ హృదయములో నిరంతరమగు భక్తిచే శ్రీహరిని ప్రతిష్ఠించేదరు. అక్షరపరబ్రహ్మయగు శ్రీహరి భక్తులకు వశుడై యుండుట అనే నిష్ఠ గలవాడై, వారి హృదయములనుండి హృద యాకాశము వలెనే తొలగిపోడు సుమా!
కుత్సితబుద్ధి గల జనులు తాము పెద్ద చదువులను చదివినామనియో, డబ్బు గలవారమనియో, గొప్ప కులమునకు చెందినవారమనియో, పెద్ద పెద్ద పూజలను చేసినవారమనియో గర్వించి, ఇవి ఏమీ లేని సత్పు రుషుల యెడల పాపమునాచరించెదరు. అట్టివారి పూజను శ్రీహరి స్వీక రించడు. ధనమేమీ లేకున్ననూ ఆత్మజ్ఞానమే ధనముగా గల మహాత్ముల హృదయములలోని భక్తిరసము ఆయనకు విదితమే.
స్వస్వరూపమునందు పూర్ణుడగు శ్రీహరి తన భక్తులకు వశుడై యుండును. కావుననే, ఆయన తనను నిరంతరముగా సేవించే లక్ష్మీ దేవిని, సంపదల వెంటబడే రాజులను, దేవతలను కూడ సరకు చేయడు. చేసిన ఉపకారమును గుర్తులోనుంచుకొనే సత్పురుషుడు ఎవ్వాడు అట్టి శ్రీహరిని కొద్ది సేపైననూ విడిచి పెట్టును?
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- భక్తితో ప్రకాశించే ఓ విదురా! స్వయంభువుడగు బ్రహ్మగారి పుత్రుడైన నారద మహర్షి ఈ విధముగా అనే కములగు భగవద్గాథలను ప్రచేతసులకు చెప్పి, బ్రహ్మలోకమునకు వెళ్లెను.
శ్రీహరియొక్క కీర్తిని విన్నవారి మాలిన్యములు దూరమగును. ఆ ప్రచేతసులు కూడ అట్టి శ్రీహరి కీర్తిని నారదుని ముఖమునుండి వినిరి. వారు ఆయన పాదములను ధ్యానిస్తూ, ఆయన ధామమును పొందిరి.
ఓ విదురా! ప్రచేతసులకు నారదునకు శ్రీహరిని కీర్తించే సంవా దము జరిగినది. దానిని చెప్పమని నీవు నన్ను ప్రశ్నించితివి. దానిని ఈ విధముగా నేను నీకు చెప్పితిని.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! స్వాయం భువమనువుయొక్క పుత్రుడగు ఉత్తానపాదుని వంశమును నీకింతవరకు వర్ణించితిని. ప్రియవ్రతుని వంశమును గురించి కూడ తెలుసుకొనుము.
ప్రియవ్రతుడు నారదునినుండి ఆత్మజ్ఞానమును పొందెను. ఆయన రాజ్యమును భోగించి, తరువాత దానిని పుత్రులకు పంచి యిచ్చి, ఈశ్వరునిలో ఐక్యమయ్యెను.
మైత్రేయ మహర్షి ఈ విధముగా పరాజయమునెరుంగని శ్రీహరి యొక్క సత్కథను వర్ణించి చెప్పెను. దానిని విన్న విదురునకు భక్తి బాగావర్ధిల్లుటచే కన్నీరు స్రవించి ఆయన వ్యాకులుడయ్యెను. అపుడాయన ఆ మహర్షి పాదములకు శిరస్సుతో ప్రణమిల్లి, శ్రీహరి పాదములను హృదయములో ధ్యానించెను.
విదురుడిట్లు పలికెను --- ఓ యోగిపుంగవా! దయాహృదయుడ వగు నీవీనాడు అజ్ఞానసముద్రముయొక్క ఆవలి తీరము (జ్ఞానము) ను చూపించితివి. ఆ జ్ఞానమును పొందినవారికి ఏమీ లేకున్ననూ, శ్రీహరి ఆశ్రయము లభించును.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శాంతచిత్తుడగు విదురుడు ఈ విధముగా మైత్రేయునకు నమస్కరించి, ఆయనవద్ద సెలవు తీసుకొని, తన బంధువులను చూచే కోరికతో హస్తినాపురమునకు వెళ్లెను.
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీహరియందు అర్పించబడిన హృదయము గల ఈ మహారాజుల గాథలను విన్నవారికి ఆయుర్దాయము, ధనము, కీర్తి, కల్యాణములు, ఈశ్వరునితోడి ఐక్యము లభించును.
శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధమునందు నారద ప్రచేతస సంవాదమును వర్ణించే ముప్పది ఒకటవ అధ్యాయము ముగిసినది.
నాల్గవ స్కంధము సమాప్తము.
హరిః ఓమ్, తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.
డిజిటల్ పంపిణీ
కౌశికీ
* * *
Digital Distribution
Kausiki
* * *
