శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము

Table of Contents

30  - దేహాభిమానులగు జీవుల అధోగతిని వర్ణించుట

బలమగు వాయువు మేఘపంక్తిని ఎగరగొట్టును. ఆ మేఘపంక్తికి వాయువుయొక్క ప్రభావము తెలియదు. అదే విధముగా ఈ కాలము జీ వుని సంసారములో గిరగిర త్రిప్పి పీడించును. కాని, జీవుడు దాని గొప్ప ప్రభావమును తెలియజాలడు. ఇది నిశ్చయము.

 మానవుడు సుఖమును పొందాలనే ఆశతో కష్టపడి ఏయే వస్తువు లను సంపాదించునో, వాటినన్నింటినీ కాలరూపములోని దైవము తుడిచిపె ట్టును. దాని వలన, ఆ మానవునకు దుఃఖమే మిగులును.

మందమతియగు జీవుడు ఇట్లు దుఃఖించుటకు కారణమేమనగా, అనిత్యమగు దేహమును, దానికి సంబంధించిన ఇల్లు పొలము ధనము మొదలగు వాటిని అజ్ఞానముచే నిత్యములని భావించుచున్నాడు.

ఈ సంసారములో జీవుడు మనుష్యపశుదేవాది యోనులలో దేని యందు జన్మించిననూ, దానిని సుఖప్రాయముగా భావించి విరక్తిని పొందుట లేదు.

జీవుడు శ్రీహరియొక్క మాయచే విశేషముగా మోహమును పొందియున్నాడు. అట్టి జీవుడు, నరకమునందున్ననూ, అక్కడ లభించే అల్పసుఖమును మరిగి, ఆ దేహమును కూడ విడుచుటకు ఇష్టపడడు.

మానవుడు దేహము, భార్య, సంతానము, ఇల్లు, డబ్బు, బంధు వులు మొదలగువాటిపై గట్టిగా లగ్నమైన హృదయమునందు అనేకము లగు మనోరథములను కలిగి, తాను గొప్పవాడినని తలపోయుచుండును.

మోహితుడగు మానవుడు దుష్టమైన హృదయము గలవాడై, వీటిని పోషించాలనే మనోవ్యథలో పడును. వాని అవయవములన్నియు ఆ వ్యథచే అధికమగు తాపమునకు గురిచేయబడును. అట్టివాడు నిరంతర ముగా పాపములను చేయును.

గృహస్థుని దుష్టలగు స్త్రీలు ఏకాంతమునందు మాయచేసి ఆక ర్షించెదరు. పైగా చిన్న పిల్లల ముద్దు ముద్దు కబుర్లచే గృహస్థుని ఇంద్రియ ములు, అంతఃకరణము ఆకర్షితమగును. దుఃఖప్రధానమగు గృహకార్యము లయందు కపటమునకు ప్రముఖస్థానము ఉండును. వాటిని ఏమరుపాటు లేకుండగా నిర్వహించే గృహస్థుడు దుఃఖమును పోగొట్టే ఉపాయమును చేసుకొని, ఆ దుఃఖనివృత్తినే సుఖమని తలపోయును.

అన్ని సందర్భములలో హింసను చేసి సంపాదించిన ధనము మొదలగువాటితో తన వారిని పోషించు మానవుడు, వారు తినగా మిగిలిన దానిని తిని, ఆ విధముగా హింసతో వారిని పోషించుటచే, తాను నరకము నకు వెళ్లును.

మానవుడు జీవిక కొరకు ఎంత ప్రయత్నించిననూ ఒకప్పుడు అది లుప్తమగుచునే యుండును. కాని, లోభముచే పరాభూతమైన మనస్సు గలవానికి ఆ లోభమునకు తగ్గ ధనమును సంపాదించే శక్తి ఉండదు. అపు డాతడు ఇతరుల ధనముపై కన్ను వేయును.

 వ్యామోహమును పొందియున్న వ్యక్తి దురదృష్టవంతుడగుటచే సంపద లేక, చేసిన ప్రయత్నములు వ్యర్థము కాగా, కుటుంబమును పోషిం చలేక దీనుడై చింతిస్తూ నిట్టూర్పులను విడుచుచుండును.

ఈ విధముగా వ్యక్తి తనను తాను పోషించుకోలేని స్థితిలోనున్న ప్పుడు వాని భార్య మొదలగువారు పూర్వము ఆదరించిన విధముగా ఆద రించరు. ముసలి ఎద్దును దుష్టులగు వ్యవసాయదారులు నిరాదరించిన తీరున, వారాతనిని అనాదరము చేయుదురు.

ఆ స్థితిలో కూడ వైరాగ్యమును పొందని వ్యక్తి పూర్వము తాను పోషించినవారిచే ఇప్పుడు పోషించబడుచుండును. ముసలితనము వానికి వికృతాకారమును తెచ్చి పెట్టును. ఆ విధముగా ఆతడు మరణమునకు ఎదురు చూస్తూ ఇంటిలో పడియుండును.

తన ఇంటిలోని వారు కుక్కకు వలె తనముందు విసిరిన అన్న మును ఆతడు భుజించును. ఆతనికి అజీర్ణముచే జఠరాగ్ని మందగించి తక్కువ ఆహారమును మాత్రమే తినును. కావుననే, ఆతడు పని చేసే శక్తి కూడ తగ్గి, ఒకచోట పడియుండును.

 ఆతనికి ఊపిరి పైకి దన్ని కనుగ్రుడ్లు పైకి ఎక్కును. శ్లేష్మము నాడులను మూసివేయును. దగ్గు ఆయాసము ఆతనికి శ్రమను కలిగించు చుండును. ఆతడు కంఠములో ఘురఘుర శబ్దమును చేయుచుండును.

ఆతడు పరుండియుండగా బంధువులు చుట్టూ చేరి అధికముగా దుఃఖించుచుందురు. ఈతడు మృత్యువుయొక్క పాశమునకు చిక్కి యుండుటచే, వారు పలుకరించిననూ బదులు చెప్పలేడు.

ఈ విధముగా ఆతడు బలముగానున్నప్పుడు కుటుంబపోషణవ్యా పారములో తలమున్కలవుతూ ఇంద్రియములపై విజయమును సాధించ లేదు. ఇప్పుడు తన బంధువులు ఏడ్చుచుండగా అధికమగు నొప్పితే నశించిన బుద్ధిశక్తి గలవాడై మరణించును.

అపుడు యమదూతలు ఆతనికి కనబడెదరు. వారు కోపముతో నిండిన కన్నులతో భీతిని గొల్పుదురు. వారిని చూచి ఆతడు తన హృదయ ములో చాల భయపడి మలమూత్రములను విడిచి పెట్టును.

వారాతనిని యాతనలకు తగిన దేహమునందు పారవేసి, మెడకు గట్టిగా త్రాళ్లను కట్టి, రాజభటులు శిక్షార్హుడగు అపరాధిని వలె, చాల పొడ వైన యమలోకమార్గమునందు నడిపించేదరు.

వారిద్దరు ఈతనిని బెదిరిస్తూ ఉంటే ఈతని గుండె పగిలి వణుకు పుట్టును. దారిలో ఈతనిని కుక్కలు కరచును. అతడు తాను చేసిన పాప మును గుర్తుకు తెచ్చుకుంటూ దుఃఖిస్తూ వెళ్లును.

ఆ జీవుని తీవ్రమగు ఆకలి దప్పికలు బాధించుచుండును; సూర్యుడు, దావాగ్ని, సుడిగాలులు ఆతనిని పీడించుచుండును. నడిచే దారిలో కాలే ఇసుక ఉండును. దారిలో విశ్రామస్థానము గాని, త్రాగే నీరు గాని ఉండదు. యమదూతలు కొరడాతో వీపుపై కొట్టుచుందురు. ఆ జీవుడు శక్తి లేకున్ననూ అతికష్టము మీద ఆ దారిలో ముందుకు సాగును.

ఆ జీవుడు అలసి అక్కడక్కడ దారిలో మూర్చిల్లి మరల లేచి పాపులకు తగిన చీకటితో నిండిన ఆ దారిలో యమదూతలచే యమపురికి తీసుకు వెళ్లబడును.

యమలోకమార్గము నిడివి తొంభై తొమ్మిది వేల యోజనములు, ఈ దూరమును వారాతనిని రెండు లేక మూడు ముహూర్తముల కాల ములో తీసుకువెళ్లెదరు. అచట ఆతడు యాతనలను పొందును.

జీవుని అవయవముల చుట్టూ కాలే కట్టెలను వేసి మండించెదరు ఒకప్పుడు ఈతడు తన శరీరమునుండి మాంసమును కోసి భక్షించునట్లు చేసెదరు; లేదా, ఇతరులు వీని మాంసమును కోసి వీనిచే తినిపించెదరు.

ఆ యమపురియందు జీవుల ప్రేవులను వారు బ్రతికియుండగనే కుక్కలు గ్రద్దలు పీకివేయును. సర్పములు తేళ్లు అడవి ఈగలు కరచుచుం డగా వారి దేహములకు చాల పీడ కలుగును.

అచట జీవులను ప్రతి అవయవమును ముక్కలు ముక్కలుగా కోసెదరు. ఏనుగులు మొదలగు వాటిచే తొక్కించెదరు. కొండకో మ్ములనుండి పారద్రో సెదరు. నీటిలో, గోతిలో ముంచి నొక్కి యుంచెదరు.

స్త్రీపురుషులు పరస్పరము ఆసక్తిచే అధర్మమును చేసినచో, దాని వలన కలిగించబడే యాతనలను వారు అనుభవించెదరు. తామిస్రము, అంధతామిస్రము, రౌరవము మొదలగు యాతనలు గలవు.

 అమ్మా! స్వర్గము, నరకము ఇక్కడనే గలవని కొందరు చెప్పుచు న్నారు. నరకమునకు సంబంధించిన యాతనలు మనకు ఇక్కడనే ప్రత్యక్ష మగుచున్నవి.

మానవుడు కుటుంబమును పోషించుటకు గాని, లేక తన పొట్ట పోసుకొనుటకు గాని పాపములను చేసినచో, మరణించునప్పుడు ఈ దేహ ము కుటుంబము అనే రెండింటినీ విడిచి పెట్టి ఆ పాపముల ఫలమును ఈ విధముగా అనుభవించును.

మానవుడు ఇతరప్రాణులకు ద్రోహమునాచరించి ఈ దేహమును - పోషించినచో, ఆ విధముగా పోషించబడిన ఈ తన దేహమును ఇక్కడనేవిడిచి పెట్టి ఒంటరిగా నరకమునకు వెళ్లును. ఆతడు చేసిన పాపమునే ఆతడు ఆ యమలోకమార్గములో భోగించును.

సర్వస్వమును కోల్పోయినవాడు చాల పీడను పొందును. అదే విధమగు దుఃఖమును అధర్మముగా జీవించువాడు అనుభవించును. అన్యాయముగా కుటుంబమును పోషించు మానవునిచే దైవము ఆ పాప ముయొక్క ఫలమును నరకములో అనుభవింప జేయును.

కేవలము అధర్మమార్గములో కుటుంబమును పోషించే ఉత్సా హము గల జీవుడు నరకముయొక్క అంతిమస్థానమగు అంధతామిస్ర మును పొందును.

పాపములను చేయు వ్యక్తి మనుష్యలోకమునకు నికృష్టస్థానము లోనుండే నరకములోని యాతనలను, మనుష్యజన్మకంటే నికృష్టమగు పశువు మొదలగు జన్మలను క్రమముగా అనుభవించి, ఆ విధముగా పని త్రుడై మరల తిరిగి మనుష్యజన్మను పొందును.

శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో

ముప్పదియవ అధ్యాయము ముగిసినది (30).