శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము

Table of Contents

4 - విదురుడు మైత్రేయుని వద్దకు వెళ్లుట

ఉద్దవుడు ఇట్లు పలికెను --- తరువాత ఆ యాదవులు ఆ బ్రాహ్మ ణుల అనుమతిని పొంది భుజించిరి. తరువాత వారు మద్యమును త్రాగి, దాని ప్రభావముచే నశించిన వివేకము గలవారై, ఒకరినొకరు సూటిపోటి మాటలతో నిందించుకొనిరి.

ఈ లోపులో సూర్యుడు అస్తమించెను. మద్యప్రభావముచే వారి వివేకము నశించియుండెను. అడవిలో వెదుళ్లకు ఒకదానితో మరియొక దానికి రాపిడి కలిగే విధముగా, వారిలో వారికి సంఘర్షణ బయలుదేరెను.

 

శ్రీకృష్ణ భగవానుడు తన మాయాశక్తియొక్క ప్రభావముచే యాద వకులమంతయు ఆ విధముగా వినష్టమగుటను చూచెను. అపుడాయన సరస్వతీనదిలో స్నానమును చేసి, చెట్టు మొదట్లో కూర్చుండెను.

శరణు జొచ్చిన వారిని కష్టములనుండి గట్టెక్కించే శ్రీకృష్ణ భగవా నుడు తన వంశమును ఉపసంహరించ గోరినవాడై నాతో, బదరికీ వెళ్లిపో మ్మని చెప్పెను.

అంతశ్శత్రువులను నశింపజేసిన ఓ విదురా! ఆయన అభిప్రా యము నాకు తెలియును. అయినప్పటికీ, నేను ఆ ప్రభుని పాదములకు దూరమగుటను సహించలేను. కావుననే, నేను ఆయన వెనుకనే వెళ్లితిని.

నేను ప్రియతముడగు ఆ శ్రీకృష్ణ ప్రభుని వెదుకుతూ ఆయననే స్మరించుచుంటిని. సర్వమునకు ఆశ్రయమైనవాడు, తనకు మరియొక ఆశ్రయము లేనివాడు, లక్ష్మీపతి, పరమసుందరుడు అగు ఆ శ్రీకృష్ణుడు సర స్వతీ నదీతీరమునందు ఒంటరిగా కూర్చుని యుండగా నేను చూచితిని.

శుద్ధసత్త్వమయుడగు ఆయన తెలుపుతో కూడిన స్వచ్ఛమగు నీల వర్ణమును కలిగియుండెను. ఆయన ఎర్రని కన్నులు ప్రసన్నముగా నుండె ను. నాలుగు చేతులను, పచ్చని పట్టు వస్త్రమును చూచి, నేను ఆయనను దూరమునుండియే గుర్తు పట్టితిని.

ఆయన పద్మమువంటి కుడికాలిని ఎడమకాలిపై పెట్టి, లేత రావి చెట్టునకు నడుమును ఆనించి కూర్చుండెను. ఆయన పళ్లు మొదలగు ఆహారమును ఇంద్రియసుఖములను విడిచి పెట్టియున్ననూ, పుష్టిగా ఆనం దముగా ఉండెను.

గొప్ప భగవద్బక్తుడు, వ్యాసుని ప్రియమిత్రుడు, కృతకృత్యుడు అగు మైత్రేయుడు స్వచ్ఛందముగా లోకములను తిరుగుతూ ఆ భగవా నుని సన్నిధికి యాదృచ్ఛికముగా విచ్చేసేను.

మైత్రేయ మహర్షికి శ్రీకృష్ణునియందు గొప్ప ప్రేమ గలదు. ఆయన ఆనందముతో భక్తితో తలను వంచి వినుచుండెను. అప్పుడు మోక్ష ప్రదాతయగు ఆ శ్రీకృష్ణుడు ప్రేమతో చిరునవ్వుతో నావైపు చూసి, ఆ విధ ముగా నాకు ఆనందమును కలిగించి, నా శ్రమను అంతనూ పోగొట్టి, ఇట్లు పలికెను.

శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను --- ఓ ఉద్దవా! నీవు పూర్వజ న్మలో వసువు. నీ అంతఃకరణమునందలి కోరికను నేను ఎరుగుదును. ఇతరులకు పొంద శక్యము కాని ఆ కోరికను తీర్చెదను. పూర్వము జగత్తును సృష్టించే ప్రజాపతులు, వస్తువులు కలిసి చేసిన యజ్ఞములో నీవు నన్ను పొందగోరి ఆరాధించితివి.

ఓ ఉద్దవా! నీవు సాధుపురుషుడవు. ఈ సంసారములో నీకు ఇది ఆఖరి జన్మ. ఏలయనగా, నీకు నా అనుగ్రహము లభించినది. పైగా, నేను మానవలోకమును విడిచి పెట్టి వెళ్లే ఈ సమయములో నీవు దైవయోగముచే నన్ను ఏకాంతములో స్వచ్ఛమగు భక్తితో దర్శించితివి.

పూర్వము సృష్ట్యాదియందు నా నాభియందలి పద్మములో కూర్చునియున్న బ్రహ్మకు నేను నా మహిమను ప్రకాశింపజేసే సర్వోత్కృ ష్టమగు జ్ఞానమునుపదేశించితిని. ఆ ఉపదేశమును విద్వాంసులు భాగవత మని వ్యవహరించుచున్నారు (ఆ జ్ఞానమును నేను నీకు ఇప్పుడు ఇచ్చు చున్నాను).

ఈ విధముగా ఆయన నాతో ఆదరపూర్వకముగా పలికెను. నేను ఆ పరమపురుషుని అనుగ్రహమునకు ప్రతిక్షణము పాత్రుడనైతిని. నాకు ఆయనయందలి ప్రేమచే రోమాంచము కలిగి మాట తడబడుచుండెను. నేను కన్నీటిని విడుస్తూ చేతులను జోడించి ఇట్లు పలికితిని.

ఓ ప్రభూ! నీ పాదపద్మములను సేవించువారలకు ఈ సంసార ములో ధర్మార్థకామమోక్షములనే నాలుగు పురుషార్థములలో ఏది దుర్లభము? (ఏదియు దుర్లభము కాదు). ఓ పరబ్రహ్మ స్వరూపుడా! అయిన నూ, నేను వాటిని కోరుట లేదు. ఏలయనగా, నేను నీ పాదపద్మములను సేవించాలనే ఉత్కంఠ గలవాడను.

నీకు కామనలు లేవు. నీవు అకర్తవు. కాని, నీవు కర్మలను చేయు చునే ఉందువు. నీకు పుట్టుక లేదు. కాని, నీవు అవతరించుచునే యుందు వు. నీవు కాల (మృత్యు) స్వరూపుడవు. కాని, నీవు శత్రువులకు భయపడి పారిపోయి ద్వారక అనే దుర్గములో తల దాచుకొంటివి. ఆత్మస్వరూపము నందు రమించే నీవు పదివేల భార్యలు గల గృహస్థుడవు. ఈ విషయము లను గమనించినప్పుడు పండితులకు కూడ బుద్ధి సంశయములో పడును.

ఓ ప్రభూ! నీవు మొక్కవోని అఖండసచ్చిదాత్మజ్ఞానము గలవాడ వు. అయిననూ, నీవు నన్ను పిలిచి, ఏమీ తెలియనివాని వలె, చాల సావధానుడవై సలహాలను అడిగెడివాడవు. ఓ దేవా! ఈ సంగతి మా మనస్సును మోహ పెట్టుచున్నది.

 

ఓ ప్రభూ! భగవానుడవగు నీవు నీ స్వరూపమును ప్రకాశింపజేసే సర్వోత్కృష్టమగు రహస్యజ్ఞానమును బ్రహ్మకు సమగ్రముగా చెప్పియుంటివి. ఆ జ్ఞానమును గ్రహించే సామర్థ్యము మాకు ఉన్నచో, చెప్పుము. దాని వలన, మేము సంసారదుఃఖమును తేలికగా అధిగమించేదము.

నేనీ విధముగా నా హృదయములోని అభిప్రాయమును పరబ్రహ్మ స్వరూపుడగు ఆ భగవానునకు విన్నవించితిని. అపుడు పద్మములవంటి కన్నులు గల ఆ శ్రీకృష్ణుడు నాకు తన స్వరూపమగు ఆత్మయొక్క పరమ స్థితిని ఉపదేశించెను.

నేను ఈ విధముగా సర్వులచే ఆరాధింపబడే పవిత్రపాదములు గల భగవానుడే గురువు కాగా, ఆత్మతత్త్వమును తెలుసుకొనే సాధన మును అధ్యయనము చేసి, ఆయన పాదములకు నమస్కరించి, ఆయనకు ప్రదక్షిణము చేసి, ఇచటకు వచ్చియుంటిని. నా చిత్తము ఆయన విరహ ముచే వ్యాకులితమై యున్నది.

ఓ విదురా! నేను శ్రీకృష్ణుని దర్శనముచే ముందుగా ఆనందము ననుభవించిననూ, ఇప్పుడు ఆయన వియోగదుఃఖముననుభవించుచున్నాను. బదరికాశ్రమము ఆయనకు ప్రియమైనది. కావున, నేను ఆ స్థానము నకు వెళ్లేదను.

ఆ బదరికాశ్రమమునందు నారాయణ దేవుడు, పూజ్యుడగు నరము హర్షి మానవుల ననుగ్రహించుట కొరకై చిరకాలము సౌమ్యమగు తప స్సును తీవ్రముగా చేసిరి.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా మిత్రుల వధను గురించి సహింప శక్యము గాని సమాచారమును ఉద్దవునినుండి విని, వివేకి యగు విదురుడు పైకి ఉబుకుచున్న దుఃఖమును వివేకజ్ఞానముచే తన లోపలనే శమింప జేసెను.

శ్రీకృష్ణుని సేవించి ఆయనచే స్వీకరించబడినవారిలో ఉద్ధవుడు ప్రముఖుడు. గొప్ప భగవద్భక్తుడగు ఆ ఉద్ధవుడు బదరికాశ్రమమునకు వెళ్ల బోవుచుండగా, కౌరవులలో ఉత్తముడగు విదురుడు ఆయనయందలి విశ్వాసముతో, ప్రేమతో ఇట్లు పలికెను.

విదురుడు ఇట్లు పలికెను --- యోగేశ్వరుడగు శ్రీకృష్ణ భగవా నుడు తన స్వరూపముయొక్క రహస్యమును తేటతెల్లము చేసే ఉత్కృష్ట మగు జ్ఞానమును నీకు బోధించినాడు. దానిని నీవు మాకు కూడ చెప్పుట యోగ్యముగా నుండును. ఏలయనగా, విష్ణుభక్తులు. తమ భక్తుల కార్య మును సిద్ధింపజేయుట కొరకై సంచారమును చేయుచుందురు గదా!

ఉద్దవుడిట్లు పలికెను --- కాని, నీవు తత్త్వజ్ఞానము కొరకై మైత్రేయ మహర్షిని ఆరాధించ వలెను. ఏలయనగా, సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే మానవలోకమును విడువ గోరి, ఆఖరి సమయములో ఆయ నకు అట్టి ఆదేశమును ఇచ్చియున్నాడు.

శ్రీశుక మహర్షి ఇట్లు చెప్పేను --- ఈ విధముగా విదురునితో కలిసి జగద్రూపుడగు భగవానుని గుణములను వర్ణించగా, ఆ భగవద్గాథ అనే అమృతముచే ఉద్దవుని మనోవేదన అంతయు తొలగి పోయినది. ఆయన ఆ రాత్రిని యమునా నదియొక్క ఇసుకతిన్నెలపై క్షణకాలము వలె గడిపి, తరువాత వెళ్లాను.

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- అతిరథులు, మహారథులు, వారికి కూడ నాయకులు అగు వృష్టిభోజవంశీయులు అందరు మరణించిరి. ముల్లోకములకు ప్రభువగు శ్రీకృష్ణ భగవానుడు కూడ దేహమును విడిచిపెట్టెను. కాని, యాదవులలో ముఖ్యుడగు ఒక్క ఉద్ధవుడు మాత్రము  మిగిలియుండెను. ఇది ఎట్లు సంభవమయ్యెను?

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సత్యసంకల్పుడగు శ్రీకృష్ణ భగవానుడు కాలము వచ్చినప్పుడు బ్రాహ్మణ శాపము అనే మిషచే తన వంశమును పూర్తిగా ఉపసంహరించి, తాను కూడ దేహత్యాగమును చేయ బోతూ, ఇట్లు తలపోసేను.

నేను ఈ లోకమునుండి నిష్క్రమించుచున్నాను. ఇప్పుడు నా (నన్ను బోధించే) జ్ఞానమునకు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, జితేంద్రియుడు అగు ఉద్ధవుడు మాత్రమే నిశ్చయముగా తగియున్నాడు.

ఉద్దవుడు జితేంద్రియుడు. ఆయన అంతఃకరణములోని సత్వరజ స్తమోగుణములచే మరియు బాహ్యమునందలి గుణకార్యములగు శబ్దాది విషయములచే విచలితుడు కాడు. కావున, ఆయన నాకంటే ఏ మాత్రము తీసిపోడు. . కావుననే, నా జ్ఞానమును జనులకు ఉపదేశిస్తూ, ఆయన ఈ లోకములోనే కొంత కాలము నిలిచియుండుగాక!

ముల్లోకములకు గురువు, తండ్రి, వేదము అనే ప్రమాణముచే తెలియబడువాడు, వేదమునకు కారణమైనవాడు అగు శ్రీకృష్ణునిచే ఈ విధముగా ఆదేశించబడినవాడై, ఉద్ధవుడు బదరికాశ్రమమునకు చేరుకొని, ఏకాగ్రచిత్తముతో శ్రీహరిని ఆరాధించెను.

శ్రీకృష్ణుడు దేహమును విడిచిన ఈ విధానము ధీరచిత్తులకు ధైర్య మును వర్ధిల్లజేయును. కాని, గుండె దిటవు లేని అజ్ఞానులగు ఇతరులు ఇట్టి కార్యమును ఎన్నడైననూ చేయలేరు.

కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! పరమభక్తుడగు ఉద్ద వుడు వెళ్లిన తరువాత, శ్రీకృష్ణుడు తనను స్మరించినాడని ఆయననుండి విన్న విదురుడు ఆ శ్రీకృష్ణునే స్మరిస్తూ, ప్రేమచే వ్యాకులమైన మనస్సు గలవాడై రోదించెను.

కృతకృత్యుడు, భరతవంశ శ్రేష్ఠుడు అగు విదురుడు యమునాన దీతీరమునుండి బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణము చేసి, గంగానదీతీ రమునందు మైత్రేయ మహర్షి ఉన్న స్థానమునకు చేరెను.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి మూడవ స్కంధములో నాల్గవ అధ్యాయము ముగిసినది.