శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము

Table of Contents

17 - హిరణ్యాక్షుని దిగ్విజయము

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- స్వయంభువుడగు బ్రహ్మగారు దేవతల తేజస్సు క్షీణించుటకు గల కారణమును ఈ విధముగా వర్ణించి చెప్పెను. దానిని విని దేవతలందరి సందేహములు తొలగిపోయేను. అపుడు వారు స్వర్గమునకు మరలి వెళ్లిరి.

సాధ్వియగు దితి భర్తయగు కశ్యపుడు చెప్పిన దానిని బట్టి తనకు కలుగబోయే సంతానము లోకమునకు ముప్పు తెచ్చునని శంకించుచునే యుండెను. ఆమె వంద సంవత్సరముల పిదప కవల మగపిల్లలను కనెను.

వారిద్దరు జన్మించుచుండగా ఆ సమయములో, స్వర్గమునందు అంతరిక్షములో మరియు భూమిపై జనులకు గొప్ప భయమును కలిగించే అనేకములగు ఉత్పాతములు ఆవిర్భవించినవి.

పర్వతములతో సహా భూఖండములు కంపించినవి. దిక్కులలో అగ్నిజ్వాలలు బయలు దేరినవి. ఉల్కలు, పిడుగులు పడినవి. లోకపీడను కలిగించే తోకచుక్కలు పొడిచినవి.

మిక్కిలి కఠినమగు స్పర్శగల వాయువు నిరంతరముగా ఊలలను పెట్టుచూ వీచెను. ఆ వాయువునకు సుడులే సేన కాగా, ఎత్తుగా లేచిన దుమ్మే ధ్వజమాయెను. దాని ధాటికి పెద్ద పెద్ద వృక్షములు పెకిలించి వేయబడుచుండెను.

ఆకాశములో ఎత్తున మెరుపు తీగలు నవ్వుచున్నట్లు మెరయుచుం డెను. మేఘముల గుంపు ఆకాశమును కప్పివేయగా చీకట్లు క్రమ్ముకొనెను. సూర్యుడు, చంద్రుడు మొదలగు జ్యోతిర్మండలములు గాని, నక్షత్రముల గుంపులు గాని కనబడలేదు. ఎక్కడైననూ ఏ వస్తువైననూ కానరాలేదు.

సముద్రము లోపల కలిచివేయబడి తరంగములు ఉప్పొంగెను. సముద్రము వికలమైన మనస్సు గలవాని వలె ఆక్రోశించేను. మంచినీటి సరస్సులు, నదులు కల్లోలితములయ్యెను. వాటిలోని పద్మములు వాడిపోయెను.

చంద్రగ్రహణములు, సూర్యగ్రహణములు కలిగినవి. సూర్యచం ద్రుల చుట్టూ నిరంతరముగా పరివేషములు (కాంతి గూడు కట్టుట) కలిగిన వి. మేఘములు లేకుండగనే గర్జనలు వినబడినవి. పర్వతగుహలనుండి ! రథము పరుగెత్తే ధ్వని వంటి ధ్వని బయలు దేరినది.

గ్రామముల మధ్యలో ఆడు నక్కలు నిప్పును గ్రక్కుచూ అమంగ ళకరముగా బిగ్గరగా కూసినవి. మగనక్కలు, గుడ్లగూబలు వాటికి తోడైనవి.

అక్కడక్కడ కుక్కలు మెడలను పైకెత్తి అనేకవిధముల శబ్దము లను చేసినవి. వాటిలో కొన్ని ధ్వనులు సంగీతమును, మరికొన్ని ఏడ్పును పోలియుండెను.

ఓ విదురా! మత్తెక్కిన గాడిదలు గుంపులుగా చేరి డెక్కలతో నేలను త్రవ్వుచూ ఖరఖర శబ్దమును చేయుచూ హడావుడిగా ఇటునటు పరుగులు తీసినవి.

గాడిదల ఓండ్ర ధ్వనులకు భయపడి పక్షులు ఏడుస్తూ గూళ్ల నుండి ఎగిరి నేలగూలినవి. గొల్లపల్లేలయందు, అరణ్యములయందు పశువులు భయముచే మలమూత్రములను విడిచి పెట్టుచుండెను.

ఆవులు బెదిరిపోతూ పొదుగులనుండి రక్తమును స్రవించినవి. మేఘములు చీమును వర్షించినవి. దేవతల ప్రతిమలు విశేషముగా కన్నీటిని కార్చినవి. చెట్లు గాలి లేకుండగనే నేల గూలినవి.

ప్రకాశించే క్రూరగ్రహములు శుభకరమగు గ్రహములను, మరియు నక్షత్రగణములను కూడ వక్రమార్గము గుండా దాటి సంచరించ వొచ్చినవి. అవి ఒకదానితో మరియొకటి పోటీ పడినవి.

ఇంతే గాక, ఇతరములగు పెద్ద ఉత్పాతములు కూడ బయలు దేరినవి. వాటి రహస్యమునెరుంగని జనులు వాటిని చూచి భయపడి జగ త్తునకు ప్రళయము దాపురించినదని తలపోసిరి. బ్రహ్మపుత్రులగు సనకాది మహర్షులు మాత్రము సర్వము తెలిసినవారగుటచే భయపడలేదు.

దితియొక్క ప్రథమసంతానమగు ఆ రాక్షసులిద్దరు వెంటనే తమ పరాక్రమమును ప్రకటించువారై, ఇనుము వలె దృఢమైన దేహములు గల వారై, పెద్ద పర్వతముల వలే పెరిగి పెద్దవారైరి.

దిక్కులను వ్యాపించియున్న వారిద్దరి బంగరు కిరీటముల కొనలు ద్యులోకమును తాకుచుండెను. వారి భుజములయందు బాహుపురులు, నడుమునందు అందమైన మొలనూలు ప్రకాశించుచుండెను. వారు వేసే ప్రతి అడుగునకు భూమి కంపించుచుండెను. వారు సూర్యుని కoటే అధికముగా ప్రకాశించుచుండిరి.

ఆ కవల పిల్లలిద్దరికీ కశ్యప ప్రజాపతి నామకరణము చేసెను. వారిలో ముందుగా ప్రజాపతిగారి దేహమునుండి పుట్టిన (జన్మక్రమములో రెండవ వాడు) వానిని హిరణ్యకశిపుడనియు, ఎవనిని దితి ముందుగా కనెనో వానిని హిరణ్యాక్షుడనియు జనులు వ్యవహరించుచున్నారు.

హిరణ్యకశిపుడు తన భుజబలముచే చాల గర్వించి, బ్రహ్మ గారినుండి దేనివలనైననూ మరణము లేని విధముగా వరమును పొంది, లోకపాలకులతో సహా ముల్లోకములను తన వశములో నుంచుకొనెను.

వాని అనుంగు తమ్ముడగు హిరణ్యాక్షుడు నిత్యము అన్నగారికి ప్రీతిని కలిగించెడివాడు. ఆతనికి యుద్ధమునందు ప్రీతి మెండు. ఆతడు గదను చేతబట్టి, యుద్ధమును చేసే అవకాశము కొరకు వెదుకుకుంటూ, స్వర్గమునకు వెళ్లాను.

హిరణ్యాక్షుని వేగమును సహించుట చాల కష్టము. ఆతడు భుజముపై పెద్ద గదను పెట్టుకొని నడుచుచుండగా కాలి బంగరు పెండెరములు గణగణలాడుచుండెను. ఆతడు మెడలో విజయసూచకముగా పుష్పమాలను ధరించి యుండెను. ఆతడు మనోబలముచే, శరీరబలముచే మరియు బ్రహ్మగారి వరముచే గర్వించియుండెను. నిరంకుశుడగు ఆ హీర ణ్యాక్షునకు ఏదన్నా భయము లేదు. వానిని చూచి దేవతలు భయపడి, గరుత్మంతునకు భయపడిన పాముల వలె, దాగియుండిరి.

ఆ రాక్షసరాజునకు గర్వితులై యుండే ఇంద్రాది దేవతలు కానరా లేదు. వారు తన తేజస్సునకు జడిసి దాగియున్నారని ఆతనికి తెలిసిపోయే ను. అపుడాతడు బిగ్గరగా గర్జించెను.

తరువాత మహాబలశాలియగు ఆ హిరణ్యాక్షుడు స్వర్గమునుండి వెనుదిరిగెను. వానికి క్రీడించవలెనని బుద్ది పుట్టెను. అపుడాతడు భయంకర మగు ధ్వనిని చేయుచున్న అగాధమైన సముద్రము లోనికి మదించిన ఏను గువలె ప్రవేశించేను.

ఆ హిరణ్యాక్షుడు సముద్రములో ప్రవేశించగానే, వరుణుని సైనికులగు జలజంతువులు ఏమి చేయాలో తోచక చాల భయమును పొందినవి. ఆతడు వాటి జోలికి పోకున్ననూ, అవి ఆతని తేజస్సును తాళలేక పోయినవి. అవి అపుడు గుంపులు గుంపులుగా చాల దూరము పారిపోయినవి.

ఓ వత్సా! మహాబలుడగు ఆ హిరణ్యాక్షుడు సముద్రమునందు తన ఊపిరిచే లేవగొట్టబడిన పెద్ద పెద్ద తరంగములను లోహమయమగు గదతో కొట్టుతూ అనేకసంవత్సరములు విహరించెను. తరువాత ఆతడు వరుణుని రాజధానియగు విభావరిని చేరుకొనెను.

హిరణ్యాక్షుడు అచట రాక్షసలోకము (పాతాళము) నకు అధీశ్వరు డు, జలజంతుసముదాయములకు ప్రభువు అగు వరుణుని కనుగొనెను అపుడాతడు ఆయనను మోసగించుట కొరకై, చిరునవ్వుతో అల్పుని వ నటిస్తూ, ఆయనకు నమస్కరించి, ఇట్లు పలికెను: ఓ మహారాజా! నాకు యుద్దమును చేసే అవకాశమును కల్పించుము.

ఓ ప్రభూ! లోకపాలకుడవగు నీవు గొప్ప కీర్తి గల ప్రభుడవు. ఎవ రైతే పొగరుతో తామే గొప్ప వీరులమని తలపోయుదురో, నీవు వారి పరా క్రమమును అపహరించెదవు. పూర్వము నీవు లోకములోని దైత్యులను దానవులను జయించి, రాజసూయయాగమును చేసియుంటివి.

ఈ విధముగా పొగరు పెరిగిన హిరణ్యాక్షుడు శత్రుబుద్ధితో జలాధి పతియగు వరుణ భగవానుని గట్టిగా వేళాకోళము చేసెను. కాని, ఆయన పైకి ఉబుకుతున్న కోపమును తన బుద్దిచే చల్లార్చుకొని, ఇట్లు పలికెను: ఓ రాక్షసరాజా! మేము యుద్ధములనుండి విరమించుకున్నాము.

ఓ రాక్షసశ్రేష్టా! యుద్ధవిధానములో నిపుణుడవగు నిన్ను సంతోష పెట్ట గలవాడు సనాతన పురుషుడగు శ్రీహరి కంటే మరియొకడు లేడని నేను భావిస్తున్నాను. కావున, నీవు ఆయన వద్దకు వెళ్లుము. నీవంటి శూరులు ఆయనను కొనియాడుచుందురు. -

ఆ వీరుని నీవు తొందరలోనే చూడగలవు. అపుడు నీ గర్వము తొలగిపోవును. నీవు యుద్ధభూమియందు నిద్రించుచుండగా, నీ చుట్టూ కుక్కలు తిరుగుచుండును. నీవంటి దుష్టులను నశింపజేసి, సత్పురుషుల ననుగ్రహించుట కొరకై ఆయన అవతారములను ధరించుచుండును.

శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు పదునేడవ అధ్యాయము ముగిసినది.