శ్రీ మద్భాగవతము - తృతీయ (3వ) స్కందము
23 - దేవహూతి కర్దముల విహారము
మైత్రేయుడు ఇట్లు పలికెను --- తల్లిదండ్రులు వెళ్లిన తరువాత పతివ్రతయగు దేవహూతి భర్తయొక్క ఇంగితమును నేర్పుగా తెలుసు కుంటూ, పార్వతి శివప్రభుని వలె, ఆయనకు ప్రేమతో నిత్యము పరిచర్యను చేసెను.
ఆమె చనువు అంతఃకరణశుద్ది ఆదరము ఇంద్రియజయము సేవా భావము ప్రేమ మధురమగు వాక్కు అనే గుణములను కలిగియుండెను. ఆమె కామము, దంభము, ద్వేషము, లోభము, పాపము, గర్వము అనువా టిని పరిత్యజించెను. ఆమే తేజశ్శాలియగు కర్దముని సావధాను గాలై ప్రయ త్నపూర్వకముగా నిత్యము సేవించి సంతోష పెట్టెను.
మనుపుత్రియగు ఆ దేవహూతీ దైవముకంటే గొప్పవాడగు భర్తను అనుసరించుచుండెను. ఆమె ఆ భర్తనుండి గొప్ప మనోరథములనాకాంక్షిం చెను. ఆమె చిరకాలము వ్రతానుష్ఠానముచే క్లేశమును పొంది చిక్కియుండెను. దేవర్షులలో శ్రేష్ఠుడగు ఆ కర్దముడు ఆమెను చూచి దుఃఖితుడై, దయ కలిగి బొంగురు వోయిన కంఠముతో ప్రేమపూర్వకముగా ఆమెతో నిట్లనెను.
కర్దముడిట్లు పలికెను --- ఓ మనుపుత్రీ! నీవు ఇతరులకు ఇచ్చే మర్యాద గొప్పది. నీ ఉత్తమమగు సేవ, అన్నిటినీ మించిన భక్తి నాకు ఈనాడు సంతోషమును కలిగించినది. నీ ఈ కొనియాడదగిన దేహమును నీవు నా సేవ కొరకై ఉపేక్ష జేసి క్షీణింప జేసినావు. సకల ప్రాణులకు దేహము చాల ప్రియమైనది గదా!
నేను స్వధర్మమునందు నిష్ఠ గలవాడనై చిత్తమును ఏకాగ్రము చేసి తపస్సును, ధ్యానమును, ఉపాసనను చేసి, భగవంతుని అనుగ్రహ రూపములగు విభూతులను (మహిమలను) సంపాదించితిని. వాటి వలన లభించే దీవ్యభోగములయందు భయము గానీ, శోకము గాని లేదు. నన్ను నిరంతరముగా సేవించిన నీకు కూడ అవి వశమైనవి. నేను నీకు దివ్యదృ ష్టిని ఇచ్చెదను. నీవు వాటిని చూడుము.
స్వర్గము మొదలగు ఇతరభోగములెన్ని ఉన్నా, అవి సర్వశక్తిమం తుడగు శ్రీహరియొక్క కనుబొమల ముడివడుటచే వాటి యోజనలు అన్నియు వినష్టమగును. కాలముయొక్క ప్రభావము ముందు అవి యెంత టీవి? నీవు నీ పాతివ్రత్యధర్మమునందు సిద్ధురాలవైనావు. ఆ ధర్మము నీకు దివ్యములగు భోగములను సంపాదించి పెట్టును. మేము ధనము అధికా రము గలవారము అని విర్రవీగే మానవులు ఈ భోగములను పొందలేరు. అట్టి భోగములను నీవు అనుభవించుము.
కర్దముడు అన్ని యోగశక్తులయందు విద్యలయందు నిపుణుడు. ఆయన ఈ విధముగా మాటలాడుటను గని అమాయకురాలగు ఆ దేవ హూతికి మనస్సులోని వ్యథ తొలగిపోయెను.ఆమె ముఖము కొంచెము సిగ్గుతో కూడిన చూపులతో మరియు చిరునవ్వుతో ప్రకాశించుచుండెను. వినయముతో, ప్రేమతో బొంగురు వోయిన కంఠముతో ఆమె ఇట్లనెను.
దేవహూతి ఇట్లు పలికెను --- ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! నీకు అమోఘ ములగు యోగశక్తులపై ఆధిపత్యము గలదు. నీవు సిద్ధపురుషుడవని నేను ఎరుగుదును. ఓ ప్రభూ! నీవు నా భర్తవు. వివాహసమయములో సంతాన మును గురించి నీవు మాటను ఇచ్చియుంటివి. కావున, మనమిద్దరము కలిసి సుఖించాలని నా కోరిక. పతివ్రతలకు శ్రేష్టుడగు భర్తతో సంతాన మును పొందుటయే గొప్ప లాభము.
ఓ ప్రభూ! నీవు శాస్తోపదేశమునతిక్రమించకుండగా మన విహార మునకు కావలసిన సాధనసామగ్రిని సంపాదించుము. నిన్ను చూచుచున్న నా హృదయమును మన్మథుడు పీడించుచున్నాడు. నీతో రమించవలెననే కోరిక అధికముగా నున్ననూ, నా ఈ దేహము కృశించి దీనముగా నున్నది. ఈ దేహము విహారయోగ్యమగునట్లు అనుగ్రహించుము. మన విహారము నకు యోగ్యమైన భవనమును గురించి కూడ విచారించుము.
ఓ విదురా! కర్దముడు ప్రియురాలికి ప్రియమును చేయగోరి, వెంటనే అదే సమయములో యోగశక్తిని చేపట్టి, యథేచ్చగా, సంచరించే విమానమును ఆవిర్భవింప జేసెను.
ఆ దివ్యమగు విమానము కోరికలనన్నింటినీ తీర్చును. అన్ని శ్రేష్ఠ వస్తువులతో కూడియున్న ఆ విమానమునందు అన్ని సంపదలు ఒకదానిని మించి మరియొకటి ఉన్నవి. అది మణిమయమగు స్తంభములచే అలంక రింపబడి యున్నది.
దివ్యమగు సాధనములతో కూడియున్న ఆ విమానము అన్ని కాల ములలో సుఖమును కలిగించును. దానికి రంగు రంగుల జెండాలు, పతా కలు అలంకరించబడినవి.
మాలలు కట్టదగిన రంగు రంగుల పుష్పముల మాలలతో ఆ విమానము అలంకరించబడెను. ఆ మాలల చుట్టూ తుమ్మెదలు ఎగురుతూ మధురముగా ధ్వని చేయుచుండెను. ఆ విమానములో రకరకముల నూలు నార మరియు పట్టు వస్త్రములు సమృద్ధిగా నుండెను.
ఆ విమానములో అంతస్తులు ఒకదానిపై నొకటి నిర్మించబడి యున్నవి. వాటిలో మెత్తలు, శయ్యలు, గాలిని వీచే సాధనములు, ఆసనములు వేర్వేరుగా అమర్చబడి చాల సుందరముగా నుండెను.
దానిలో అక్కడక్కడ అనేకవిధముల అందమైన శిల్పములు చెక్క బడియున్నది. అది ఇంద్రనీలమాణిక్యములు పొదిగిన చదరపు నేలతో మరియు పగడములు పొదిగిన అరుగులతో శోభిల్లుచుండెను.
ద్వారముల కడపలకు పగడములు, తలుపులకు వజ్రములు పొదు గబడినవి. భవనముల అగ్రములయందు ఇంద్రనీలమణులు పొదగబడి, బంగరు కలశములు స్థాపించబడినవి.
ఆ భవనములలో వజ్రముల గోడలయందు పొదిగిన కెంపులు కన్నులవలె భాసించుచున్నవి. ఆ విమానము మేలుకట్టుల సమూహము లతో మరియు బంగరు తోరణములతో కూడియున్నది.
ఆ భవనములలో వివిధపక్షుల శిల్పములు గలవు. హంసలు పావు రములు వాటిని చూచి తమ జాతి పక్షులేనని భావించి వాటితో ఆటలాడు టకు నిరంతరముగా ప్రయత్నిస్తూ గట్టిగా కూయుచున్నవి.
దానిలో అవసరమునకు సరిపోవునట్లుగా విహరించే స్థలములు, విశ్రాంతిగా కూర్చుండే స్థలములు, పరుండే గదులు, వాకిళ్లు, ముంగిళ్లు ఏర్పాటు చేయబడినవి. ఆ విమానమును చూచి, కర్దముడు కూడ ఆశ్చర్య పడునా యన్నట్లు ఉన్నది.
ఇట్టి ఈ గృహమును చూచి దేవహూతి పెద్ద ప్రీతిని పొందలేదు. కర్దముడు సకలప్రాణుల మనస్సులలోని విషయములను గ్రహించగల యోగి. ఆయన తానే ఆమెను మాటలలోనికి దింపి ఇట్లనెను.
ఓ భయస్వభావము గల దేవహూతీ! ఈ సరస్సులో మునిగి ఈ విమానమునెక్కుము. ఈ సరస్సును స్వయముగా శ్రీహరియే తన ఆనంద బాష్పములతో నిర్మించెను. దీనియందు స్నానమును చేసిన మానవులకు మనోరథములీడేరును.
కలువ కన్నుల దేవహూతి పాతబడిన చీరను దాల్చియుండెను. ఆమె జుట్టు జడలు కట్టెను. పాలిపోయిన ఆమె శరీరము మట్టి కొట్టుకొని యుండెను. ఆమె భర్త మాటను అంగీకరించి, పవిత్రమగు జలములతో నిండియున్న ఆ సరస్వతీనదికి చెందిన బిందుసరస్సును ప్రవేశించెను.
ఆ యువతులు ఆమెను చూచి వెంటనే లేచి చేతులను జోడించి నమస్కరించి ఇట్లు పలికిరి --- మేము నీ సేవకురాండ్రము. మమ్ములనాదే శించుము. ఇప్పుడు మేము నీకు ఏమి చేయవలెను?
మర్యాదనెరిగిన ఆ యువతులు అభిమానవతియగు ఆ దేవహూ తిని శ్రేష్ఠమగు సుగంధద్రవ్యములతో కూడిన స్నానమును చేయించి, ఆమెకు నాజూకైన కొత్త నూలు వస్త్రములను ఇచ్చిరి.
వారామెకు అమూల్యములైన కాంతిమంతములగు శ్రేష్టమగు ఆభ రణములను, అన్ని రసములతో కూడియున్న ఆహారమును, అమృతము వంటి మత్తెక్కించే పానీయమును కూడ ఇచ్చిరి.
అప్పుడు ఆ దేవహూతి తనను తాను అద్దములో చూచుకొనెను. ఆమెకు మాలను స్వచ్చమగు వస్త్రములను ధరించిన స్వచ్చమగు దేహము దర్శనమిచ్చేను. ఆ కన్యలు ఆమెకు మంగళాలంకారములను ధరింప జేసి గొప్ప సేవలను చేసిరి.
ఆమె మామూలు స్నానము మాత్రమే గాక, తల స్నానమును చేసెను. తరువాత ఆమె ఆభరణములనన్నింటినీ అలంకరించుకొనెను. ఆమె మెడలో పదకము, చేతులకు గాజులు శోభను చేకూర్చేను. ఆమె పాదములయందలి బంగరు అందెలు గణగణలాడుచుండెను.
ఆమె నడుమునందు అనేకరత్నములు పొదిగిన బంగరు మొల నూలును దాల్చెను. ఆమె గొప్ప విలువైన హారముతో మరియు కుంకుమ మొదలగు మంగళద్రవ్యములతో అలంకరించుకొనెను.
ఆమే ముఖము అందమగు పలు వరుసలతో, అందమగు కనుబొ మలతో, మధురమైన ప్రేమతో నిండిన కడగంటి చూపుతో, పద్మపు మొగ్గ లతో పోటీపడే కన్నులతో మరియు నల్లని కురులతో ప్రకాశించేను.
ఆమెకు అప్పుడు మహర్షివర్యుడు, తనకు ప్రియుడు అగు భర్త గుర్తుకు వచ్చెను. ఆమె ఆ కన్యలతోబాటు ఆ కర్దమ ప్రజాపతి ఉన్నచోటనే నిలిచియుండెను.
అప్పుడామె వేయిమంది స్త్రీలతో సేవింపబడే తనను చూచు కొని, భర్తయొక్క యోగశక్తికి విస్మయమును పొందెను.
కామక్రోధాది శత్రువులను జయించిన ఓ విదురా! దేవహూతి స్నానమును చేసి, తన సహజరూపములోనున్నదే అయిననూ, ఇదివరకే న్నడూ లేదాయన్నట్లు స్వచ్ఛముగా ప్రకాశించుచుండెను. ఆమె చక్కని చీరను దాల్చి భుజములచుట్టూ చక్కగా కప్పుకొనెను. ఆమెను వేయి మంది విద్యాధరకన్యలు చుట్టువారి సేవించుచుండిరి. ఆమెను చూడగానే కర్దముని హృదయములో ప్రేమ ఉదయించెను. ఆయన ఆమెను ఆ విమా నమునెక్కించెను.
కర్దముడు ప్రియురాలియందు అనురాగము గలవాడే ఆయిననూ, ఆయన యోగమహిమకు లోటు లేదు. ఆ విమానములో ఆయనను విద్యా ధరస్త్రీలు సేవించుచుండిరి. కలువల సమూహములను వికసింపజేసి ఆకా శములో తారలచే చుట్టువారబడియున్న అతిసుందరుడగు చంద్రుని వలె ఆయన ప్రకాశించెను.
సిద్ధులచే స్తుతించబడే కర్దముడు ఆ విమానముపై నెక్కి, విద్యాధ రస్త్రీలు సేవించుచుండగా, మేరుపర్వతబిలములయందు చిరకాలము కుబేరుని వలె రమించెను. పైనుండి పడే గంగానదియొక్క మంగళకర మగు ధ్వనిగల ఆ స్థానములో మన్మథమిత్రుడగు వాయువు మెల్లగా సుఖక రముగా వీచుచుండును. కావుననే, అచట ఎనమండుగురు లోకపాలకులు విహరించుచుందురు.
ప్రీతుడైయున్న ఆ కర్దముడు ప్రియురాలితో గూడి, వైఢంభకము సురసనము నందనము పుష్పభద్రకము చైత్రరథము అనే దేవోద్యానముల యందు, మరియు మానససరోవరమునందు రమించెను.
ధగధగలాడుతూ యథేచ్చగా సంచరించే ఆ గొప్ప విమానములో కర్దముడు లోకములను వాయువువలె సంచరిస్తూ, విమానములలో సంచ రించే దేవతలను దాటిపోయెను.
కష్టములను గట్టెక్కించే పవిత్రములగు భగవానుని పాదములను శరణు పొంది ధైర్యముతో జీవించు వారలకు సంపాదించ శక్యము కానిది ఏముండును?
అనేకద్వీపములు మొదలగు రచనతో అనేకములగు అద్భుత ములు గల భూగోళమునంతనూ మహాయోగియగు కర్దముడు తన భార్యకు చూపించి, తన ఆశ్రమమునకు మరలి వచ్చెను.
కర్దముడు తొమ్మిది రూపములను దాల్చినవాడై, విహారమునందు ఉత్సాహము గల మనుపుత్రియగు ప్రియురాలిని అధికముగా రమింపజేసే ను. ఈ విధముగా వారు రమించుచుండగా అనేకసంవత్సరముల కాలము ముహూర్తము వలె గడిచిపోయెను.
దేవహూతి కూడ ఆ విమానములో ప్రీతికరమగు గొప్ప శయ్యను అధిష్ఠించి అతిసుందరుడగు తన భర్తతో కూడియున్నదై గడచి పోయిన కాలమును గుర్తించనే లేదు.
ఈ విధముగా కామలాలసులగు ఆ దంపతులు యోగశక్తిచే రమిం చుచుండగా, వంద శరత్కాలములు (సంవత్సరములు) కొద్ది కాలమువలె గడిచిపోయినవి.
సర్వసమర్థుడగు కర్దముడు ఆత్మజ్ఞాని, దేవహూతి సంకల్పము లన్నీ తెలిసినవాడు. ఆయన ఆమెను తన అర్ధాంగిగా భావన చేసి, తన రూపమును తొమ్మిది రూపములుగా విభాగము చేసి, ఆమెయందు సంతానమును పొందెను.
కావుననే, ఆ దేవహూతి వెనువెంటనే తొమ్మండుగురు అమ్మాయిలను కనెను. అన్ని అవయవములలో సుందరముగానున్న వారందరు ఎర్ర కలువల సుగంధమును కలిగియుండిరి.
అప్పుడు సన్న్యసించుటకు సంసిద్ధుడైన భర్తయగు కర్దముని చూచి, సుందరి పతివ్రతయగు ఆ దేవయాని హృదయము కల్లోలితమై దుఃఖముతో నిండిపోయెను. కాని, ఆమె ముఖముపై చిరునవ్వును చేరుగ నీయలేదు. ఆమె క్రిందకు చూస్తూ మణులవలె ప్రకాశించే గోళ్లు గల పాద ముతో భూమిపై వ్రాస్తూ, కన్నీటి బిందువులను ఆపుకొని, మెల్లగా మృదువుగా ఇట్లు పలికెను.
దేవహూతి ఇట్లు పలికెను - పూజ్యుడవగు నీవు నాకు వివాహకాల ములో ఇచ్చిన మాట ప్రకారముగా సర్వమును సమకూర్చినావు. కాని, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నాకు నీవు అభయమునీయ దగుదువు.
ఓ మహర్షీ! నీవు నీ కుమార్తెలకు తగిన భర్తలను వెదుకవలెను. పైగా, నీవు సన్న్యసించి వనమునకు వెళ్లగా నన్ను ఓదార్చే ఒక పిల్లవాడు మనకు కలుగవలెను.
ఓ ప్రభూ! ఇంద్రియములకు శబ్దాదివిషయములయందు దృఢమగు ఆసక్తి ఉండుటచే, నేను పరమాత్మను ఉపాసించలేదు. ఆ విధముగా . ఇంతకాలము నాకు వ్యర్థమైనది.
నేను ఇంద్రియభోగములయందాసక్తి గలదాననే పరమార్థమును తెలియలేకపోతిని. ఆ విధముగా నాకు నీయందు దృఢమగు సంగము ఏర్పడినది. అయిననూ, నాకు సంసారభయమునుండి విముక్తి కలుగుగాక!
అవివేకి దుష్టులతో సంగము చేసి సంసారములో పడును. అదే సంగమును సత్పురుషులతో చేసినచో, సంగ (సంసార) విముక్తి కలుగును.
ఈ సంసారములో ఎవని కర్మ ధర్మము కొరకు గాని, వైరాగ్యము కొరకు గాని, భగవానుని సేవ కొరకు గాని సమర్థము కాదో, వాడు జీవించి యున్ననూ మరణించినవానితో సమానమే.
భగవానుని మాయ నన్ను నిశ్చయముగా వంచించినది. ఏలయన గా, నీ అనుగ్రహముచే నేను జ్ఞానమును తద్ద్వారా మోక్షమును పొందే అవ కాశము ఉన్ననూ, ఈ సంసారబంధమునుండి విముక్తిని పొందలేకపోతిని.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది .
