నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు నారదునితో పలికెను –
సావిత్రీ ఆడిగిన ప్రశ్నల విని యమధర్మరాజు ఆశ్చర్యపడి జీవులయొక్క కర్మవిపాకమెట్లుండునో తెలుపుటకు మొదలిడేమ.
యమ ఉవాచ- యముడు సావిత్రితో ఇట్లనెను –
ఓ సావిత్రి! నీవయసిప్పుడు పన్నెండు సంవత్సరములు మాత్రమే. కాని నీ జ్ఞానము ప్రాచీన విద్వాంసుల కన్నము, యోగినుల కన్నను, జ్ఞానవంతులకన్నను మిన్నయైనది. మీ తండ్రియగు అశ్వపతి చేసిన తప్పువలన సావిత్రీదేవితో సమానురాలవుగా, ఆమె అంశతో, ఆమె వరమువలన నీవు పుట్టినావు.
లక్ష్మీపతి వక్షఃస్థలమున లక్ష్మీదేవి ఎట్లుండునో శంకరుని ఎదపై పార్వతీదేవి ఎట్లుండునో శ్రీకృష్ణదేవునికి రాధ ఎట్లున్నదో బ్రహ్మ దేవునకు సావిత్రి, ధర్మునకు మూర్తీదేవి, మనువునకు శతరూప, కర్దమ ప్రజాపతికి దేవహూతీ, వసిష్ఠునకు అరుంధతీదేవి, కశ్యపప్రజాపతికి అదితి, గౌతమ మహర్షికి అహల్య, దేవేంద్రునకు శచీదేవి, చంద్రునకు రోహిణి, మన్మథునకు రతీదేవి, అగ్నిదేవునకు స్వాహాదేవి, పితృదేవతలకు స్వధాదేవి, సూర్యునకు సంజ్ఞాదేవి, వరుణునకు వరుణాని, యజ్ఞానకు దక్షిణ, ఆదివరాహమూర్తికి భూదేవి, కుమారస్వామికి దేవసేనల వలె నీవు నీభర్తయగు సత్యవంతునకు ప్రియురాలవు కమ్ము అట్లే సౌభాగ్యవతివి కూడ కమ్ము.
ఓ సావిత్రి నీ కిట్టి వరమునిచ్చితిని. ఇంకను నీకిష్టమైన కోరిక ఏదైన ఉన్నచో చెప్పుము నీకోరికను సంపూర్ణముగా తీర్తునని యమధర్మరాజు సావిత్రితో పలికెను.
సావిత్ర్యువాచ- సావిత్రి ఈవిధముగా ఆనెను –
ఓయమధర్మరాజా! నాకు సత్యవంతునకు నూరుగురు పుత్రులు కలుగునట్లు, నాతండ్రికి పుత్రసంతానము కలుగునట్లు, నా మామగారికి కళ్ళు, రాజ్యము లభించునట్లు, నేను సత్యవంతునితో కలిసి శ్రీహరి మందిరమైన వైకుంఠమునకు పోవునట్లు వరమీమ్ము.
ఇక నాకు జీవుల కర్మవిపాకమెట్లు జరుగునో ప్రపంచము విస్తరించుటకు గల కారణమును వివరించి తెల్పుడు.
మహాసాధ్వియగు సావిత్రి నీవు కోరిన కోరికలన్నియు తీరును. ఇక నీవడిగిన జీవ కర్మ విపాకమును వివరించుచున్నాను.
పుణ్యకర్మలు, పాపకర్మలు చేసికొన్నవారు తత్ఫలమనుభవించుటకై ఈ భారతఖండమున పుట్టుచున్నారు. ఈపుణ్యఖండమున తప్ప ఇతరత్ర జనులు శుభాశుభాకర్మ ఫలములను అనుభవించలేరు. దేవతలు, దైత్యులు, దానవులు, గంధర్వులు, రాక్షసాదులు, మానవులు వీరందరు తమతమ కర్మలననుసరించి పుట్టుచున్నారు. వీరందరు సమానమైన జీవనమును గడుపుటలేదు.
విశిష్టమైన జీవనము కలవారు సమస్తయోనులందు జన్మించి తాము చేసిన కర్మఫలమనుభవించుచున్నారు. ముఖ్యముగా మానవులు ఈవిధముగా వివిధయోనులయందు జన్మనెత్తుచున్నారు. పూర్వ కర్మార్జితమైన ఫలము శుభమైనా అశుభమైనా అనుభవించుచున్నారు. పుణ్యకర్మవలన స్వర్గాది ఫలితమును పొందగా అశుభకర్మవలన నరకమును చెందుచున్నారు.
కర్మనిర్మూలనము వలన కలుగు ముక్తి రెండు విధములు. ఒకటి నిర్వాణరూపమైనది. రెండవది శ్రీకృష్ణపరమాత్మ సేవా రూపమైనది.
పాప కర్మచేయువాడు రోగియగును, క్షీణాయుష్కుడగును. దుఃఖమును పొందును గుడ్డి, చెవిటి, మూగవంటి అవయవహీనుడగును. అట్లే సుకృతమును చేసినచో ఆరోగ్యవంతుడుగా, దీర్ఘజీవిగా, సుఖవంతుడుగా, సర్వసిద్ధి సంపన్నుడుగా నగుమ.
ఇప్పుడు చెప్పిన దంతయు సామాన్యమైనది. ఇక విశేషవిషయమును వినుము.
సమస్త జీవులలో భారతదేశమున పుట్టిన మానవజాతి చాలా శ్రేష్ఠమైనది. ఆ మానవులలో కూడ బ్రాహ్మణజాతీ చాలా గొప్పది. వారిలో కూడ విష్ణుభక్తుడైన బ్రాహ్మణుడు చాలా గొప్పవాడు.
ఆ విష్ణుభక్తులు రెండు విధములుగానుందురు. ఒకరు నిష్కాములు. ఇంకొకరు సకాములు. కోరికలు గల విష్ణుభక్తులు ప్రధానమైన వారైనప్పటికీ నిష్కాములైన పోరు అసలైన విష్ణుభక్తులు. సకాముడైన విష్ణుభక్తుడు కర్మఫలములననుభవించుచు సుఖముగానుండును. నిష్కామిటైన విష్ణుభక్తుడు దేహత్యాగము చేసిన తరువాత విష్ణులోకమునకు వెళ్ళును. నిష్కామియగు విష్ణుభక్తుడు వైకుంఠమున ఎల్లప్పుడు ఉండును. ద్విభుజాడైన శ్రీకృష్ణపరమాత్మను సేవించు నిష్కామియగు భక్తుడు దివ్యరూపమును ధరించి గోలోకముననుండును. చతుర్భుజుడైన నారాయణుని సేవించు నిష్కామీ భక్తుడు దీవ్యరూపమును ధరించి వైకుంఠమునకు వెళ్ళును. వారు సదా ఆ లోకములందే ఉండి పరమాత్మను సేవించుచుందురు.
సకాములైన వైష్ణవులు వైకుంఠమునకు పోయినను తిరిగి భారతదేశమునకు వచ్చి ద్విజాతులలో పుట్టుదురు. వారు కాలము గడిచిన కొలది నిష్కాములగుదురు. శ్రీహరి వారికి నిర్మలమైన భక్తిని ఇచ్చును.
బ్రాహ్మణులు వైష్ణవులు కాని వారందరు అన్ని జన్మలలో సకాముకులై ఉందురు. వారికి నిర్మలమైన భక్తి యుండదు. విష్ణుభక్తి కూడ ఉండదు.
పుణ్య తీర్థములలోనుండి తపస్సు చేసికొను ద్విజులు బ్రహ్మ లోకమునకు వెళ్ళి ఆ పుణ్యఫలము తీరగానే భారతదేశమునకు తిరిగి వత్తురు. తమ ధర్మము సదా ఆచారించు సూర్యభక్తులైన బ్రాహ్మణులు సూర్యలోకమునకు పోయి వారి పుణ్యఫలము పూర్తియైన వెంటనే భారతదేశమునకు తిరిగివత్తురు. తమ ధర్మమును ఎల్లప్పుడు వదలక ఆచరించు శైవులు, శక్తి నుపాసించువారు శివలోకమగు కైలాసమును చేరుకొని వారి పుణ్యఫలము తీరిన వెంటనే భారత దేశమునకు తిరిగి వత్తురు. తమ ధర్మమును తప్పక, అనుష్ఠించు అన్య దేవతా భక్తులగు బ్రాహ్మణులు స్వర్గలోకమును చేరి పుణ్యము క్షీణింపగా భారతదేశమునకు తిరిగి చేరుకొందురు.
శ్రీహరి భక్తులు, నిష్కాములైన బ్రాహ్మణులు తమ ధర్మము ఆచరింపక నిర్లక్ష్యము చేసినను శ్రీహరి భక్తి బలమున వైకుంఠమునకు తప్పక చేరుదురు. స్వధర్మమును వదలి ఇతర దేవతలను పూజించు బ్రాహ్మణులు భ్రష్టాచారులై నరకమునకు తప్పక పోదురు.
స్వధర్మము సదా అనుష్టించు చతుర్వర్ణములవారు వారు చేసి కొన్న పుణ్యఫలముననుభవింతురు. స్వధర్మమును వదలి పెట్టిన అన్ని వర్ణములవారు నరకమునకు తప్పక పోదురు. అచ్చట వారి కర్మఫలము తీరినవెంటనే భారతభూమికి తిరిగి వత్తురు.
తమ ధర్మములను ఎల్లప్పుడు అనుష్ఠించు బ్రాహ్మణుడు స్వధర్మ నిరతుడైన బ్రాహ్మణునకు తన కన్యకనిచ్చి పెండ్లిచేయునో అతడు పదునల్గురు దేవేంద్రుల కాలము వరకు చంద్రలోకమున ఉండును. అట్లే ఆభరణసహితయైన (పాలంకృత) కన్యాదానము చేసినచో పై దానికి రెట్టింపు ఫలితముననుభవించును. సకాములైన బ్రాహ్మణులు పై విధముగా చంద్రలోకమునకు పోపుదురు. కానీ నిష్కాములైన వైష్ణవులు ఫలమేమి కోరక కన్యాదానము చేసినచో వైకుంఠమునకు పోవుదురు. గవ్యమును (ఆవుపాలు, పెరుగు, నేయి మొదలగు వాటిని) వెండిని, వస్త్రమును, సస్యమును, పండ్లను, మంచినీటిని కన్యకను బ్రాహ్మణులకు దానము చేసిన వారు మన్వంతర కాలము వరకు చంద్రలోకమున నివసింతురు.
బంగారమును, ఆవులను, రాగి మొదలగు వస్త్రములను ఎవరు పరిశుద్ధుడైన బ్రాహ్మణునకు దానము చేయుదురో వారు పదివేల సంవత్సరముల వరకు సూర్యలోకమున చక్కని ఆరోగ్యముతోనుందురు, భూమిని, ధాన్యమును బ్రాహ్మణులకు దానము చేసినవాడు సూర్యచంద్రులున్నంతవరకు విష్ణులోకమైన శ్వేత ద్వీపమున నుండును.
స్వధర్మనిరతుడైన బ్రాహ్మణునకు భక్తితో ఇల్లును కట్టి దానము చేసినచో వారు చాలా కాలము స్వర్గలోకమున సుఖింతురు. దీనినే పుణ్యదినమున దానము చేసినచో ఆ ఇల్లు ఎన్ని రేణువులతో నిర్మితమైనదో అన్ని సంవత్సరములు స్వర్గలోకమున సుఖముగా నుందురు.
దేవాలయములు కట్టించినవారు ఆ దేవాలయము యొక్క రేణువులెన్ని యున్నచో అన్ని సంవత్సరములు ఆయా దేవతలలోకమున నివసింతురు. చక్కని దేవాలయమును కట్టి దానము చేసినచో సామాన్య దేవాలయ దానము కంటే నాలుగురెట్లు అధికమైన పుణ్యము పొందును. పూర్తమును (వాపీ, కూప తటాకము, దేవాలయాది నిర్మాణము, అన్నదానము, తోటలు పెట్టుట) చేసినచో పై దానికంటే వందరెట్లు ఎక్కువ ఫలితము లభించును. పుణ్య తీర్థమున చేసిన దానము పై దాని కంటే ఎనిమిది రెట్లెక్కువ పుణ్యమును కలిగించునని బ్రహ్మదేవుడు పేర్కొనెను.
చెరువును తవ్వి ప్రజలందరకు దానము చేసిన మానవుడు పది వేల సంవత్సరాలు జనలోకమున నివసించును. స్లోల్లువేల ధనువుల పొడవు వెడల్పు (నాలుగు హస్తములు పొడవు ఒక ధనువు) కల దానిని వాపీ (బావి) యందురు. అట్టి వాహిని నిర్మించి ప్రజలకు దానము చేసినచో అది తటాక పుణ్యము కంటే వందరెట్లెక్కువ పుణ్యమును పొందును. ఆనకట్టను కట్టినచో తటాకపుణ్యమునే పొందును. తగిన వరునకు కన్యాదానము చేసినచో పది బావుల పుణ్యము లభించును. అదే సాలంకృత కన్యాదానము చేసినచో దానికంటే రెట్టింపు పుణ్యమును పొందును.
చెరువును తవ్వించినచో సాలంకృత కన్యాదానము చేసిన ఫలమును పొందును. చెరువులోని బురదనంతా తీసివేసినచో చెరువు తవ్విన ఫలము లభించును. బావిలోని బురదనంతయు తీసివేసినచో బావి తవ్విన ఫలితమును పొందును. రావిచెట్టును పాతి, ప్రతిష్ఠ చేసినచో తపోలోకమున పదివేల సంవత్సరములు సుఖముగానుండును, ఉద్యానవనమును నిర్మించిన వాడు ధ్రువలోకమున పదివేల సంవత్సరములు సుఖముగానుండును.
ఈ భారత దేశమున విష్ణ్యాలయముపై విమానమును (శిఖరమును) నిర్మించినచో విష్ణులోకమున మన్వంతర కాలముండును. ఆ విమానమును చిత్రములతో (ప్రతిమలతో) అలంకరించి నిర్మించినచో నాలుగు మన్వంతరములు విష్ణులోకమున నుండును. విష్ణుమూర్తికై పల్లకిని నిర్మించి దానము చేసినవాడు విమానమును నిర్మించినంత ఫలితమును పొందును. శ్రీహరికై ఊయల మండపమును నిర్మించినవాడు వైకుంఠమున మన్వంతర కాలముండును.
సౌధములున్న (ధర్మశాలలు) రాజమార్గమును నిర్మించినవాడు పదివేల సంవత్సరములు స్వర్గలోకమున సుఖముగా నుండును. దేవతలకు దానము చేసినను, బ్రాహ్మణులకు దానము చేసినను సమానమైన ఫలితమే కలుగును. తాను ఈ జన్మముననే పూర్వ జన్మముననో చేసిన దాన ఫలముననుభవించును, దానమే చేయని వానికి దానఫలము ఏవిధముగా కలుగును? అందువలన దానము చేసినచో తత్ఫలమైన స్వర్గాది సుఖములననుభవించి తిరిగి భారతదేశమున జన్మించును. ఆతడు చేసిన పుణ్యకర్మలననుసరించి బ్రాహ్మణుల ఇంటిలోనో ఉత్తములైన వారి ఇంటిలోనో జన్మించును. ఈ భారతదేశమందలి బ్రాహ్మణుడు పుణ్యకర్మలు చేసి తత్ఫలితమైన స్వర్గాదిలోక సౌఖ్యములననుభవించి తిరిగి బ్రాహ్మణుడుగానే పుట్టును.
తమతమ విధ్యుక్త ధర్మములను వదిలి పెట్టిన బ్రాహ్మణులు అనేక జన్మలెత్తి తాము చేసికొన్ని కర్మభోగముల ననుభవించి తిరిగి బ్రాహ్మణ వంశముననే పుట్టుదురు.
తాము చేసిన కర్మ శుభమైనా అశుభమైనా ఎన్ని కోట్ల సంవత్సరముల వరకైనా అనుభవించి తీరవలెను. అప్పుడే కర్మక్షయము కలుగును. దేవసందర్శనము, పుణ్యతీర్థ సేవనము, కాయవ్యూహముల వలన మానవుడు పరిశుద్ధుడగును.
సావిత్రి! ఇంకను నీవు వినదల్చినదేదైనా ఉన్నచో చెప్పుము. తప్పక చెప్పెదను అని యమధర్మరాజు పలికెను.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున సావిత్రీ ఉపాఖ్యానములో చెప్పబడిన కర్మవిపాకమున తమ తమ కర్మల ననుసరించి పొందు స్థానముల వివరణ గల ఇరువది యారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 26 of the Brahma Vaivarta Mahā Purana - Prakṛti Khaṇḍa is as follows:
Balancing the sobering description of hellish realms, Yamarāja proceeded to detail the glorious rewards and celestial planets attained by souls who perform righteous deeds and selfless service. He highlighted that constructing public wells, planting fruit trees, feeding the hungry, respecting Brāhmaṇas and guests, protecting cows, and maintaining strict marital fidelity lead to birth in heavenly realms filled with divine delights, long life, and spiritual prosperity. Above all celestial rewards, Yamarāja declared that unshakeable devotion to Lord Śrī Kṛshṇa and the continuous chanting of His holy names completely eradicate all karmic debts, bypassing the lower realms entirely.