శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము
29 - భాగవత ధర్మములు - ఉద్ధవుని బదరికాశ్రమ యాత్ర
ఉద్ధవుడు పలికెను - శ్రీకృష్ణా! ఇంద్రియజయము లేనివాడీ యోగము ననుష్ఠించుట చాల కష్టమని నా అభిప్రాయము. వ్యక్తి సునాయాసముగా విముక్తిని పొందే ఉపాయమును తేలికగా తెలియునట్లు నాకు చెప్పుము.
పద్మములవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! మనస్సును నిగ్రహించుచున్న యోగులు తరచుగా ఆ మనస్సును నిగ్రహించే ప్రయత్నములో అలసిపోయెదరు. మనస్సు ఏకాగ్రము కాకుండుటచే వారు విషాదమును పొందెదరు.
పద్మములు వంటి కన్నులు గల ఓ జగన్నాథా! ఇందువలననే, వివేక వంతులు ఆనందమును నింపే నీ పద్మమువంటి పాదమును సుఖముగా ఆశ్రయించెదరు. ఇది నిశ్చయము. కాని, మేము యోగనిపుణులము, కర్మనిపుణులము అనే అహంకారము గల ఈ సాధకులు కొందరు నీ పాదములను సేవించరు. వారిని నీ మాయ విఘ్నములతో హింస పెట్టును.
సకలప్రాణులకు హితమును చేసే ఓ శ్రీకృష్ణా! నీవు తప్ప వేరు శరణు లేని నీ భక్తులకు నిన్ను నీవే సమర్పించెదవు. ఇది నీకు చిత్రమా యేమి? కాదు. ఏలయనగా, బ్రహ్మాదులు తాము ప్రభువులై ఉండి కూడా నీకు మొక్కుచుండగా, వారి శోభాయుక్తములైన కిరీటముల కొనలు నీవు పాదములు పెట్టే పీఠమును నొక్కుచుండును. అట్టి నీవు పశువులతో (రామావతారములో వానరాదులతో శ్రీకృష్ణావతారములో కోతులు, గోవులు, లేళ్లతో) మైత్రిని ఇష్టపడితివి.
సకలజగత్తునకు ఆత్మవు, ప్రియుడవు, అంతర్యామివి నీవే. నిన్ను ఆశ్రయించినవారలకు నీవు సకలపురుషార్థములనిచ్చెదవు. తనకు చేసిన ఉపకారమును స్మరించే కృతజ్ఞుడెవడైననూ అట్టి నిన్ను విడిచి పెట్టునా? విడిచి పెట్టడు. ఏదో ఒకదానిని సేవించినచో సంపద కలిగిననూ, ఆ సంపద వలన మానవుడు నిన్ను విస్మరించును. అట్టి భజనమును ఎవడైనా చేయునా? చేయడు. నీ పాదముల ధూళిని సేవించే మాకు లభించనిది ఏమి గలదు? ఏమీ లేదు.
ఓ ఈశ్వరా! నీవు దేహధారులకు బయట గురురూపముగా, లోపల అంతర్యామిరూపముగానుండి అమంగళములను పారద్రోలి నీ స్వరూప మును ప్రకటము చేయుచున్నావు. అట్టి నీకు సర్వజ్ఞులు కూడ బ్రహ్మ దేవుని ఆయుర్దాయకాలముచేనైననూ ప్రత్యుపకారమును చేయలేరు. కాని, నీ ఉపకారమును స్మరించి వారు మహానందమును పొందెదరు.
శ్రీ శుక మహర్షి పలికెను - తన మాయాశక్తియొక్క గుణములచే మూడు మూర్తులను స్వీకరించిన దేవదేవుడైన శ్రీకృష్ణునకు జగత్తు ఆటబొమ్మ. ప్రేమతో నిండిన హృదయము గల ఉద్దవుడీ విధముగా ప్రశ్నించగా, ఆయన ప్రేమతో మనస్సును దోచివేసే చిరునగవుతో నిట్లు పలికెను.
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- బాగుంది! చాల మంగళకరములైన నా ధర్మములను చెప్పగలను. వాటిని శ్రద్ధగా అనుష్ఠించే మానవుడు మరణశీలుడే అయినా, మృత్యువును (సంసారమును) జయించుట దుర్ఘటమే అయినా, అట్టివాడు మృత్యువును జయించును.
సాధకుడు మనస్సుతో నన్నే భావన చేసి చిత్తమునందు నన్నే స్మరించవలెను. సాధకుడు తన మనస్సులో నా ధర్మములయందు ప్రేమను కలిగియుండవలెను. ఆతడు నన్నే స్మరిస్తూ క్రమక్రమముగా కర్మలనన్నింటినీ నా కొరకు చేయవలెను.
దేవతలు, రాక్షసులు, మనుష్యులలో నా భక్తులు ఆచరించిన కర్మలను, నా భక్తు లైన సజ్జనులు నివసించే స్థానములను ఆశ్రయించవలెను.
భక్తుడు స్వయముగా గానీ, పదిమందితో కలిసి గాని, పర్వదినముల యందు, జనసమ్మేళనములయందు నా కొరకు గొప్ప ఉత్సవమును చేయించవలెను. దానిలో గానము, నాట్యము, కళాప్రదర్శనలు మొదలగునవి, ఛత్రచామరాదిమహారాజవిభూతులు ఉండవలెను.
ఆకాశము వలె లోపల బయట నిండి ఉన్న నాకు ఆవరణము లేదు. శుద్ధమైన చిత్తము గల సాధకుడు సకలప్రాణులయందు మరియు నయందు కూడ ఆత్మరూపునిగా నన్నే దర్శించవలెను.
గొప్ప బుద్ది గల ఓ ఉద్దవా! సాధకుడీ విధముగా సకలప్రాణులను నా రూపముగా దర్శిస్తూ సత్కరించవలెను. కేవలము ఆత్మజ్ఞాననిష్ఠను ఆశ్రయించవలెను.
వేద వేత్త, అధముడు, చోరుడు, బ్రాహ్మణభక్తుడు, సూర్యుడు, నిప్పురవ్వ, శాంతుడు, క్రూరుడు అనువారిలో ఒకే ఆత్మను సమముగా దర్శించువాడే పండితుడు.
జనులయందు సర్వదా నా ఉనికిని భావన చేసే వ్యక్తికి తొందరలోనే (సములయెడల) పోటీ తత్త్వము, (గొప్పవారి యెడల) అసూయ (గుణమునందు దోషమునారోపించుట), (తక్కువవారి యెడల) చిన్న చూపు, అహంకారము అనే దోషములు నిశ్చయముగా తొలగిపోవును.
సాధకుడు దేహమును బట్టి గొప్ప-తక్కువ అనే దృష్టిని చేయరాదు. తనవారు నవ్వుచున్నా సిగ్గును విడిచి పెట్టి కుక్కలు, అధములు, గోవులు, గాడిదలతో సహా సకలప్రాణులకు సాష్టాంగనమస్కారమును చేయవలెను.(పశువులకు తిండి పెట్టుటయే నమస్కారము).
సాధకుడు సకలప్రాణులలో నన్ను భావన చేసే జ్ఞానము కలిగే వరకు ఈ విధముగా దేహము, వాక్కు, మనస్సుల చేష్టలతో ఉపాసించవలెను.
ఈ విధముగా ఉపాసించువానికి సర్వము బ్రహ్మరూపమే. ఆత్మసాక్షా త్కారమనే విద్యచే ఆతడు అంతటా బ్రహ్మను చూచును. ఆతని సందేహ ములన్నీ పటాపంచలగును. ఆతడు సకలకర్మలనుండి నివృత్తుడగును.
మనోవాక్కాయముల వ్యాపారములచే సకలప్రాణులలో నన్ను భావిం చుట అనునది యే ఉపాయములన్నింటిలో సమీచీనమని నా సిద్ధాంతము.
ఓ ఉద్దవా! నన్ను నిష్కామముగా ఉపాసించుట అనే ఈ ధర్మమును ఒకసారి ఆరంభించినచో, దానికి లేశమైననూ వినాశము లేదు. ఎందుకంటే, ఇది గుణాతీతము. దీనిని ఈ విధముగా సరిగా నేనే నిశ్చయించితిని.
సత్పురుషులలో శ్రేష్ఠుడవగు ఓ ఉద్ధవా! భయము, శోకము ఇత్యాది సందర్భములలో వ్యక్తి చేసే పలాయనము, ఆక్రందనము మొదలైన ఏయే ప్రత్యేకఫలము లేని శ్రమ గలదో, దానిని కూడ పరమాత్మనగు నాకు నిష్కామముగా సమర్పించినచో, అది కూడ ధర్మమే యగును.
ఈ లోకములో ఈ జన్మలో మరణించే శీలము గల మిథ్యాదేహముతో సత్య-అమృతస్వరూపుడనగు నన్ను పొందవచ్చును. ఇదియే బుద్ధిశాలుర బుద్ధి, నేర్పరుల నేర్పు.
నేనీ విధముగా నీకు సకలవేదాంతసిద్ధాంతముయొక్క సంగ్రహమును సంక్షేపవిస్తారపద్ధతిలో చెప్పితిని. ఇది దేవతలకు కూడ దుర్లభము.
నీ కొరకు సుస్పష్టమైన యుక్తులు గల ఆత్మజ్ఞానమును పలు మార్లు చెప్పితిని. దీనిని తెలుసుకున్న మానవుడు సంశయములను పోగొట్టుకొని జీవన్ముక్తిని పొందును.
నీ ప్రశ్నకు నేను చక్కగా వివేకపూర్వకముగా సమాధానమును చెప్పితిని. దీనిని చింతన చేయు సాధకుడు వేదములో కూడ రహస్యమైన పరబ్రహ్మను (ఆత్మరూపముగా) పొందును. పరబ్రహ్మ కాలాతీతము.
ఎవడైతే ఈ జ్ఞానమును నా భక్తులకు చాల పుష్కలముగా (సుస్పష్టముగా) నేర్పునో, బ్రహ్మజ్ఞానమునుపదేశించే అట్టివానికి నన్ను నేను నాచే వశము చేసుకొనెదను (ఆత్మరూపుడనై ప్రకాశించెదను).
ఈ సంవాదము పవిత్రము, పావనము చేయువాటిలో సర్వోత్తమము. దీనిని బాగుగా అధ్యయనము చేయు వ్యక్తి జ్ఞానమనే దీపముతో నన్ను ఇతరులకు చూపిస్తూ, తాను పవిత్రుడగును.
ఏ మానవుడైతే ప్రతిదినము ఈ సంవాదమును సావధానుడై శ్రద్దతో వినునో, అట్టిపాడు నాయందు పరా(నిష్కామ)భక్తిని చేయును. ఆతనిని కర్మలు బంధించవు.(జీవన్ముక్తుడగును).
మిత్రుడవగు ఓ ఉద్దవా! నీకు బ్రహ్మస్వరూపము చక్కగా తెలిసినదా? నీ మోహము, మనస్సునందు పుట్టే ఈ శోకము కూడ తొలగిపోయినవా?
నీవీ జ్ఞానమును డాంబీకుడు, నాస్తికుడు, మోసగాడు, సేవ చేయనివాడు, భక్తి లేనివాడు, గర్విష్టి అనువారలకు ఈయరాదు.
ఈ దోషములు లేని బ్రాహ్మణభక్తునకు, ప్రియమైన వ్యక్తికి, 'పకారికీ, శౌచము గలవానికి, భక్తి ఉన్న శూద్రులకు, స్త్రీలకు ఈ నమునుపదేశించవలెను.
తత్త్వమును తెలియగోరువాడీ సంవాదమును తెలుసుకున్నచో, తెలియదగినది ఇంకేమీ మిగిలియుండదు. మధురమైన అమృతమును త్రాగిన తరువాత త్రాగదగినది మరేదీ మిగిలి ఉండదు.
నాయనా! మానవులు జ్ఞానముచే మోక్షమును, కర్మచే ధర్మమును, యోగముచే కామనాసిద్ధిని, వర్తకము, దండనీతి మొదలగువాటిచే అర్థమును పొందెదరు. కాని, నీకు ఆ నాలుగు ప్రయోజనములు నేనే.
మరణధర్ముడగు మానవుడు ఎప్పుడైతే సకలకర్మలను (కర్తృత్వ మును) విడిచి పెట్టి నాకు ఆత్మసమర్పణము చేయునో, అప్పుడాతడు నాకు విశేషించి సమ్మాన్యుడగును. ఆతడు అమృతత్వము (జీవన్ముక్తి) ను పొందును. ఆతడు నిశ్చయముగా నాలో ఐక్యమగుటకు యోగ్యుడు,
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- పవిత్రకీర్తియగు శ్రీకృష్ణుడీ వీధముగా
యోగమార్గమును చక్కగా నిరూపించెను. శ్రీకృష్ణుని ఆ వచనమును విని ఉద్ధవుడు చేతులు కట్టుకొని నిలబడెను. ప్రేమతో ఆయన కంఠము గద్గదము కాగా, కన్నులు నీటితో నిండిపోయెను. ఆయన ఏమీ పలుకలేదు.
ఓ పరీక్షిన్మహారాజా! ఉద్దవుడు ప్రేమతో కల్లోలితమైన తన మనస్సును ధైర్యముతో నిగ్రహించెను. తాను కృతార్థుడనైతినని తలపోస్తూ ఆయన దోసిలి యొగ్గి యాదవవీరుడగు శ్రీకృష్ణుని పద్మమువంటి పాదమునకు తల ఆన్చి నమస్కరించెను. అపుడాయనతో ఉద్ధవుడిట్లనెను.
ఉద్దవుడిట్లు పలి కెను --- స్వయంభువుడగు బ్రహ్మదేవుని తండ్రివగు ఓ శ్రీకృష్ణా! నేను మోహమనే గాఢమైన అంధకారమునాశ్రయించితిని. నీ సన్నిధి, ఉపదేశము దానిని పారద్రోలినవి. అగ్నికి సమీపములోనున్నవానికి చలి, చీకటి, భయము అనునవి పీడను కలిగించ సమర్థములగునా? కావు.
దయామయుడవగు నీవు నీ మాయాశక్తిచే అపహరించబడిన విజ్ఞానరూపమగు దీపమును తిరిగి సేవకుడనగు నాకు ఇచ్చితివి. నీవు చేసిన ఉపకారమును గుర్తించిన ఎవ్వాడు నీ పాదమూలమును విడిచి పెట్టి మరియొకదానిని శరణు పొందును?(ఎవ్వడూ అట్లు చేయడు).
దాశార-వృష్టి-అంధక-సాత్వతవంశీయులగు యాదవులపై నాకు మిక్కిలి దృఢమైన ఆసక్తి అనే పాశము ఉండెను. ఇప్పుడది ఆత్మజ్ఞానమనే శస్త్రముచే (నీ చేతనే) ఛేదించబడినది. సృష్టి వర్ధిల్లుట కొరకై నీవే ఆ పాశమును ప్రసరింపజేసితివి. ఇది నిశ్చయము.
ఓ మహాయోగీ! నీకు నమస్కారము. నేను నిన్ను శరణు వేడుచున్నాను. నీ పద్మమువంటి పాదమునందు శాశ్వతమైన ప్రీతి. ఉండే విధముగా నన్ను అనుగ్రహించుము.
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ ఉద్దవా! నా ఆదేశముచే నీవు నా బదరికాశ్రమమునకు వెళ్లుము. అచట నా పాదములనుండి పుట్టిన పవిత్రమైన గంగ నీటిలో స్నానమును, ఆచమనమును చేసి శుచివి కమ్ము.
ఓయీ ఉద్దవా! అలకనందను దర్శించి సకలపాపములను కడిగివేయుము. నారబట్టలను ధరించి, అడవిలో దొరికే పళ్లు మొదలగువాటిని తింటూ భోగములయందు తృష్ణ లేకుండ నుండుము.
శీతోష్ణాదిద్వంద్వముల రూపములోనుండే ఇంద్రియవిషయములను సహించుము. చక్కని శీలముతో జితేంద్రియుడవై శాంతముగా నుండుము. ఏకాగ్రచిత్తముతో శాస్త్రార్థపరిజ్ఞానమును, స్వానుభవమును పొందుము.
నీవు నానుండి నేర్చిన తత్త్వమును చక్కగా విచారము చేసి అనుసంధానము చేయుము. నీవు వాక్కును, చిత్తమును నాయందు ప్రవేశ పెట్టుము. నా ధర్మములయందు నిష్ఠను కలిగియుండుము. ఈ విధముగా, నీవు సత్త్వరజస్తమోగుణములను మూడింటిని అతిక్రమించి, ఆ గుణములకతీతుడనగు నన్ను (ఆత్మరూపముగా) పొందగలవు.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను -- శ్రీకృష్ణుని తత్త్వమును తెలియుటచే సంసారబంధము తొలగిపోవును. ఆయనచే ఈ విధముగా ఉపదేశించబడిన ఆ ఉద్దవుడు ఆయన చుట్టూ ప్రదక్షిణముగా తిరిగి సాష్టాంగనమస్కారము చేసెను. ఆ ఉపదేశముచే ఉద్ధవునకు సుఖదుఃఖాదిద్వంద్వములయందు సమత్వము నెలకొనెను. అయిననూ, ఆయన వెళ్లిపోయే సమయములో ఆర్ద్రమగు హృదయము గలవాడై భగవానుని పాదములను కన్నీటి బిందువులతో అభిషేకించెను.
ఉద్దవునకు శ్రీకృష్ణుని పై గల ప్రేమ సుతరాము విడిచి పెట్ట శక్యము కానిది. ఆయన ఈ వియోగమునకు భయపడిపోయెను. ఆయనను విడిచి పెట్టుట ఉద్ధవునకు శక్యము కాకుండెను. ఈ విధముగా ఉద్ధవుడు వ్యాకులుడై కష్టమును పొందెను. ఆయన శ్రీకృష్ణ ప్రభుని పాదుకలను తలపై దాల్చి మరల మరల నమస్కరించి వెళ్లాను.
ఉద్ధవుడు గొప్ప భగవద్బక్తుడు. ఆయన అప్పుడా శ్రీకృష్ణుని హృద యమునందు నిలుపుకొని బదరికాశ్రమమునకు వెళ్లి తపస్సు చేసెను. జగ త్తునకు నితాంతము హితకారియగు శ్రీకృష్ణుడు ఉపదేశించిన విధముగా ఆయన శ్రీహరిని ఆత్మరూపముగా పొందెను (జీవన్ముక్తుడాయెను).
భగవానుడు ఆనందస్వరూపుడు. వేదము ఆయనయొక్క సముద్రము. దాని సారమే ఈ ఉపదేశము. యోగేశ్వరులచే సేవించబడే పాదములు గల శ్రీకృష్ణుడు దీనిని భగవద్భక్తుడగు ఉద్దవుని కొరకు ఉపదేశించెను. ఈ జ్ఞానమనే అమృతమును కొంచెమైనా మంచి శ్రద్ధతో సేవించే వ్యక్తి విముక్తుడగుటయే గాక, వాని సంగముచే జగత్తు కూడ విముక్తమగును.
వేదకర్తయగు భగవానుడు సంసారభయమును పోగొట్టుటకై తుమ్మెదవలె వేదముల సారమును పైకి తీసి జ్ఞాన (శాస్త్రార్థపరిజ్ఞానము)-విజ్ఞానము (ఆత్మానుభవము) ల సారమును తన భక్తుల సముదాయములకు అనుగ్రహించెను. ఆయనయే సముద్రమునుండి అమృతమును పైకి తీసి దేవతలకు అనుగ్రహించెను. జగత్కారణుడగు ఆ పురుషోత్తముడే శ్రీకృష్ణుడనే పేరుతోనున్నాడు. ఆయనకు నేను నమస్కరించుచున్నాను.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో ఆత్మతత్త్వమును నిరూపించే
ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29).
