శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము
3 - మాయను తరించే ఉపాయము - కర్మయోగము
నిమి మహారాజు ఇట్లు పలి కెను --- పరమేశ్వరుడగు శ్రీహరియొక్క మాయాశక్తి మాయను చేసే ఇంద్రాదులను కూడ మోహపెట్టును. దానిని మేము తెలియగోరుచున్నాము. పూజనీయులగు తమరు మాకు చెప్పడు.
నేను సంసారమునందలి తాపములచే వేయంచబడు చున్న మర్త్యుడను. శ్రీహరి గాథలను వర్ణించే అమృతతుల్యములగు తమరి వాక్కులు ఆ సంసారదుఃఖమునకు మందు వంటివి. వాటిని సేవించుచున్న నాకు తృప్తి కలుగుట లేదు.
అంతరిక్షుడిట్లు పలికెను --- గొప్ప భుజశక్తి గల ఓ రాజా! జగత్కారణు డగు శ్రీహరి తన అంశలైన జీవులకు శబ్దాది విషయముల భోగము మరియు మోక్షము సిద్ధించుట కొరకై ఈ ప్రసిద్ధములైన పంచమహాభూత ములతో ప్రాణుల దేహములను సృష్టించెను. ఆ ప్రాణులలో దేవతలు మొదలగు గొప్పవి, పశుపక్ష్యాది తక్కువ జీవోపాధులు కూడ గలవు.
పరమాత్మ ఈ విధముగ పంచభూతములతో ప్రాణుల దేహములను సృష్టించి, వాటిలో ప్రత్యగాత్మరూపముగా ప్రవేశించినాడు. ఆ పరమాత్మ తననే అంతఃకరణాభిమానియగు ఒక నేను-గా, పది (జ్ఞాన-కర్మ) ఇంద్రియ శక్తులుగా విభజించుకొని, సత్త్వాదిగుణముల కార్యములగు శబ్దాదులను అనుభవించుచున్నాడు.
ఆ పరమాత్మ సర్వశక్తిమంతుడు. అయిననూ, సృష్టించబడిన ఈ దేహమునందు ఆత్మాభిమానముతో, తనచే శక్తిమంతములుగా చేయబడిన గుణకార్యములగు ఇంద్రియములతో గుణకార్యములే అయిన శబ్దాది విషయములను భోగించును. ఈ విధముగా పరమాత్మయే ఈ సంసారములో దేహమునందు తగుల్కొనియున్నాడు.
పరమాత్మ దేహాభిమానముచే జీవుడై కర్మేంద్రియములతో కర్మలను చేయును. ఆ కర్మల వలన పుట్టే వాసనలే తరువాతి జన్మలోని దేహమునకు నిమిత్తములగును. ఆ జీవుడు సుఖదుఃఖరూపమగు కర్మఫలములననుభవిస్తూ ఈ సంసారములో పరిభ్రమించుచున్నాడు.
జీవుడు కర్మఫలరూపముగా కలిగే జన్మలనెత్తుతూ అనేకదుఃఖముల ననుభవించును. ఆతడీ విధముగా కర్మలకు పరవశుడై జగత్తుయొక్క మహాప్రళయము వరకు జన్మమరణములను పొందుచునే యుండును.
మహాప్రళయములో పంచభూతములు విలీనమయ్యే సమయము వచ్చినప్పుడు ఆది-అంతములు లేని కాలము నామరూపాత్మకమగు జగత్తును మాయాశక్తిలోనికి వీలీనము చేయును. అప్పుడు పృథివ్యాది స్థూలభూతములు, గుణకార్యములైన శబ్దాది విషయములు విలీనమగును.
ఆ కాలమునందు భూలోకములో వంద సంవత్సరములు సుతరాము భయమును గొల్పే అనావృష్టి కలుగును. అప్పుడు బాగా పెరిగిన వేడి గల సూర్యుడు ముల్లోకములను అధికముగా తపింప జేయగలడు.
ఆది శేషుని నోటియందలి అగ్ని పైకి జ్వాలలను కలిగియుండును. వాయువుచే ప్రేరేపించబడిన ఆ అగ్ని పాతాళలోకమునుండి మొదలు పెట్టి తగులబెడుతూ అంతటా విస్తరించును.
సాంవర్తకమనే (ప్రళయమునందలి) మేఘముల గుంపు వంద సంవత్సరములు నిరంతరముగా ఏనుగు తుండములను పోలిన ధారలను వర్షించును. బ్రహ్మాండము నీటిలో మునిగిపోవును.
రాజా! ఉపాధి లయమగుట వలన బ్రహ్మాండాభిమానియగు హిరణ్య గర్భుడు బ్రహ్మాండదేహమును విడిచి పెట్టి, ఇంధనము లేని అగ్ని మహాగ్ని యందు వలె, నామరూపములకతీతమైన పరబ్రహ్మయందు విలీనమగును.
వాయువు గంధమును హరించగా పృథివి జలములో విలీనమగును. అదే వాయువు రసమును హరించగా జలము అగ్నిలో విలీనమగును.
ప్రళయాంధకారము రూపమును హరించగా అగ్ని వాయువునందు విలీనమగును. ఆకాశము స్పర్శగుణమును హరించగా వాయువు ఆకాశమునందు విలీనమగును.
కాలరూపుడగు ఈశ్వరుడు శబ్దగుణమునపహరించగా ఆకాశము తామసాహంకారమునందు విలీనమగును. సమష్టి ఇంద్రియములు, సమష్టిబుద్ధి సమష్టి రాజసాహంకారమునందు, సమష్టి మనస్సు ఇంద్రియాధిష్ఠానదేవతలతో సహా సాత్త్వికాహంకారమునందు విలీనమగును. అహంకారము తన సత్త్వరజస్తమోగుణములతో బాటుగా పరబ్రహ్మయందు విలీనమగును.
భగవానుని సత్త్వ (తెలుపు) రజస్ (ఎరుపు) తమస్ (నలుపు) అనే గుణములు గల ఈ మాయయే జగత్తు యొక్క సృష్టి స్థితిలయములను చేయునని మేము వివరముగా చెప్పితిమి. నీవింకనూ ఏమి వినగో రెదవు?
నిమి పలి కెను --- ఓ మహర్షీ! ఈశ్వరుని ఈ మాయను అతిక్రమించుట చాల కష్టము. దేహమే ఆత్మయనే నిశ్చయము గల జనులు మనస్సునకు పరవశులై యుందురు. వారికి తెలిసినది కర్మ మాత్రమే. వారీ మాయను ఏ ప్రకారముగా తరించెదరో, అట్టి ఉపాయమును చెప్పుడు.
ప్రబుద్దుడిట్లు పలి కెను -- మానవులు స్త్రీపురుషుల జంటలుగా ఏర్పడి కర్మలను చేసెదరు. దుఃఖములను దూరము చేసి సుఖమును పొందాలని వారి ఆకాంక్ష. కానీ, వారు సుఖములకు దూరమై దుఃఖభాజనులగుచుందురనే విషయము గమనించదగ్గది.
మానవులు కష్టపడి కర్మలను చేసి సంపాదించే సంపద, ఇల్లు, సంతానము, బంధువులు, పశుసంపదలు నిరంతరముగా పీడను కలిగించును. చంచలములగు ఈ ధనాదులు వ్యక్తియొక్క మృత్యువునకు కూడ హేతువులగుచుండును. వీటితో ఏమి సుఖము దక్కును?
ఈ విధముగా జీవుడు కర్మలను చేసి నిర్మించుకున్న స్వర్గలోకము నశించే శీలము గలది. మండలాధిపతుల అధికారము వలె, స్వర్గసుఖములో తారతమ్యములుండుటయే గాక, ఏదో ఒకనాడు అంతమయ్యేదేనని తెలియవలెను.
ఆత్మజ్ఞానము వలన కలిగే మోక్షమే సర్వోత్తమమైన శ్రేయస్సు. కావున, సాధకుడు ఆ జ్ఞానమును పొందగోరి గురువును శరణు వేడవలెను. గురువు వేదమునందు నిపుణుడు, పరబ్రహ్మతత్త్వమునరసినవాడు, శమదమాదులయందు నిష్ఠ గలవాడు అయి ఉండవలెను.
సాధకుడా గురువునే ఇష్ట దైవముగా భావించి నిష్కపటమైన సేవను చేస్తూ, భగవద్భక్తికి చెందిన ధర్మములను నేర్వవలెను. వాటిచే ఆత్మస్వరూపుడగు శ్రీహరి ప్రీతి చెందును. శ్రీహరి భక్తునకు తననే ఇచ్చివేయును.
మొదట మనస్సులో సర్వమునందు అనాసక్తిని అభ్యసించి, సాధువులతో సంగమును చేయవలెను. ప్రాణులలో యథోచితముగా, అనగా తక్కువ ప్రాణులయందు దయను, సమానమైన ప్రాణుల యెడల మైత్రిని, ఉత్తముల యెడల వినయమును, నిష్కపటముగా నేర్వవలెను.
పరిసరములు, దేహము, మనస్సు శుచిగానుండవలెను. సాధకుడు తపస్సు చేస్తూ సహనశక్తిని, మౌనమును అభ్యసించవలెను. తిన్నని స్వభావము గల సాధకుడు బ్రహ్మచర్యమును పాటిస్తూ వేదమునధ్యయనము చేయవలెను. అహింసను పాటిస్తూ, సుఖదుఃఖములు మొదలైన ద్వంద్వములయెడల సమత్వము (హర్షవిషాదములు లేకుండుట) ను కలిగియుండవలెను.
సాధకుడు సకలప్రాణులయందు ఆత్మరూపుడైన ఈశ్వరుని భావిస్తూ ఏకాంతముగా నుండవలెను. గృహమునందు స్వత్వభావన లేకుండా, శుద్ధమైన ముతక వస్త్రాన్ని ధరించి, ఆహారం ఏది లభిస్తే దానితో సంతుష్టుడు కావలెను.
సాధకుడు భగవతతిపాదకమైన శాస్త్రమునందు శ్రద్దను కలిగి ఉంటూనే, ఇతరశాస్త్రములను నిందించరాదు. మనస్సును ప్రాణాయామముతో, వాక్కును మౌనముతో, కర్మను ఫలత్యాగముతో నియమించవలెను. సత్యమును పలుకవలెను. మనస్సును, బా హ్యేంద్రియములను నియంత్రించవలెను.
సాధకుడు అద్భుతములైన శ్రీహరి అవతారములను, లీలలను, గుణములను విని, కీర్తించి, ధ్యానించవలెను. సాధకుడు సకలచేష్టలను శ్రీహరి కోరకే సమర్పించవలెను.
యజ్ఞాది కర్మలు, దానము, తపస్సు, జపము, నడవడి అనువాటిని సాధకుడు పరమాత్మకు సమర్పించవలెను. సాధకుడు తనకు ఇష్టమైన సర్వమును, భార్యను,, సంతానమును, ఇంటిని, ప్రాణములను కూడ పరమాత్మకు నివేదించవలెను.
ఇంతేగాక, సాధకుడు శ్రీకృష్ణుడే ఆత్మనాథుడుగా గల భక్తులను, భగవానుని, కదిలే మరియు కదలని (చెట్టుచేమలు) ప్రాణులను, గొప్పవారిని, సాధుజనులను సేవించవలెను.
భక్తులు పావనమగు భగవత్కీర్తిని ఒకరితోనొకరు చర్చించవలెను. దాని వలన పరస్పరము ప్రేమ వర్ధిల్లి, సంతోషము కలిగి, అహంకారము (జీవభావము) తొలగును.
సాధనభక్తిని అభ్యసించిన సాధకులకు శ్రీహరియందు ప్రేమ అనే భక్తి కలుగును. వారు ప్రేమతో శ్రీహరిని స్మరిస్తూ ఇతరులచే స్మరింపజేసెదరు. శ్రీహరి స్మరణము పాపముల గుట్టలను పోనాడును. ఆ స్మరణముచే అట్టి భక్తులకు దేహమునందు రోమాంచము కలుగుచుండును.
లోకవ్యవహారమునకు దూరముగానుండే ఆ భక్తులు జన్మరహీతుడగు శ్రీహరిని స్మరిస్తూ ఒకప్పుడు కళ్ల నీళ్లు పెట్టెదరు; ఒకప్పుడు నవ్వేదరు; ఆనందిస్తూ కీర్తించెదరు; ఒకప్పుడు గానము చేసి నాట్యమాడెదరు; మరియొకప్పుడు ధ్యానించెదరు. వారు పరమాత్మను సాక్షాత్కరించుకొని మౌనముగా నుండెదరు.
ఈ విధముగా సాధకుడు నారాయణుడే పరమార్థముగా గలవాడై భాగవత ధర్మములనభ్యసించి భక్తిని అలవరచుకొనును. తరించ శక్యము కాని మాయను ఆతడా భక్తిచే తేలికగా తరించును.
నిమి_మహారాజు ఇట్లు పలికెను --- నారాయణుడనే పేరుతో నిర్దేశించబడే పరబ్రహ్మ ప్రాణులలో ఆత్మరూపుడై ఉన్నాడు. ఆ పరబ్రహ్మయొక్క స్వరూపమును తమరు మాకు చెప్పడు. ఎందుకంటే, బ్రహ్మవేత్తలలో తమరు శ్రేష్ఠులు.
పిప్పలాయనుడు పలి కెను -- ఓ రాజా! స్వయముగా కారణరహితమైన పరబ్రహ్మ ఈ జగత్తుయొక్క సృష్టి స్థితిలయములకు కారణమగుచున్నది. వ్యక్తియొక్క జాగ్రత్స్వప్నసుషుపులనే మూడు అవస్థలయందు మాత్రమే గాక, వాటికి అతీతమైన సమాధియందు కూడ పరబ్రహ్మయే చైతన్యరూప ముగా కొనసాగుచున్నది. దేహము, ఇంద్రియములు, ప్రాణాపానాదులు, అంతఃకరణము జీవంతములై ప్రవర్తిల్లేది పరబ్రహ్మవలనేనని తెలియుము.
అగ్నిని తననుండి పుట్టిన మిణుగురులు ప్రకాశింప జేయలేవు. అదే విధముగా, ఈ పరబ్రహ్మను మనస్సు ఊహ చేయ లేదు, వాక్కు వర్ణించలేదు, కన్ను చూడలేదు, జీవుడు తెలియలేడు, క్రియాశక్తి పొందలేదు, జ్ఞానేంద్రియములు విషయముగా చేయ లేవు. వేదవాక్కునకు మూలము పరబ్రహ్మయే. వేదవాక్కు తాను పరబ్రహ్మను ఇదమిత్తముగా నిరూపించలేను అని నిషేధించి, తద్ద్వారా పరబ్రహ్మకు లక్షకము (ని షేధశేషముగా నిర్దేశించునది) మాత్రమే అగుచున్నది. నిషేధమునకు అవధియగు పరబ్రహ్మ లేనిదే, నిషేధమైననూ ఘటిల్లదు.
సృష్టికి ముందు సత్త్వరజస్తమస్సులనే మూడు గుణముల సమాహారమైన మాయాశక్తి మాత్రమే ఉండెను. దానినుండి మహత్తత్త్వము ఆవిర్భవించెను. ఆ మహత్తత్త్వము ఉపాధిగా గల జీవతత్త్వమే హిరణ్యగర్బుడని మహాత్ములు చెప్పెదరు. దానినుండి అహంకారము, దానినుండి ఇంద్రియాధిష్టానదేవతలు, ప్రాణాపానాదులు, పంచభూతములు, సుఖదుఃఖాత్మకమగు జగత్తు ప్రకటమైనవి. ఈ తత్త్వములన్నీ పరబ్రహ్మరూపములే. పరబ్రహ్మయే కార్యకారణముల రూపముగా మాత్రమే గాక, వాటికి అతీతముగా కూడ ఉన్నది.
బ్రహ్మాత్మకు పుట్టుక, మరణము, వర్ధిల్లుట, క్షీణించుట మొదలైన భావవికారములు లేవు. ఎందుకంటే, ఆత్మ బాల్యస్వప్నాద్యవస్థలయందు ఆయా కాలములలో వచ్చి పోయే సకలవికారములకు సాక్షి. ప్రాణులు వేరైనా ప్రాణము ఒక్కటే. అదే విధముగా, ఆత్మ సర్వదేశకాలములలో కేవలము జ్ఞానఘనమై ఉన్నది. కన్ను మొదలైన ఇంద్రియవ్యాపారములను బట్టి ఘటాది వివిధజ్ఞానములుగా కల్పించబడే ఆత్మ సదనము.
గ్రుడ్డునుండి పుట్టినవి (పక్షులు), జరాయువు (గర్బవేష్టనచర్మ) నుండి పుట్టినవి (మానవులు, పశువులు), విత్తునుండి పుట్టినవి (చెట్టుచేమలు), మురికినుండి పుట్టినవి ( పేలు మొదలైనవి) అని ప్రాణులు నాలుగు రకములు. ఆ సకలప్రాణులను అనుసరించి ఉండే ప్రాణశక్తి ఒక్కటే గదా! అదే విధముగా, సకలప్రాణులలోని ఆత్మ ఒక్కటే. వ్యక్తి నిద్రించినప్పుడు ఇంద్రియసముదాయము, నేను అనే వృత్తి, అంతఃకరణము కూడ విలీనమగును. కాని, నిద్ర లేచిన తరువాత మనకు కలిగే సుఖస్మృతి సుషుప్తిసాక్షియగు ఆత్మను బోధించును.
సత్త్వాది గుణములు, కర్మలు మనస్సును మలినము చేయును. భక్తుడు పద్మనాభుని పాదములను ప్రేమించుట వలన గొప్ప భక్తి ఉదయించి మనస్సులోని మాలిన్యములను కడిగివేయును. స్వచ్చమగు కన్నులకు సూర్యప్రకాశము వలె, అట్టి స్వచ్చమగు హృదయమునందు ఆత్మతత్త్వము సాక్షాత్కారించును.
నిమి మహారాజు ఇట్లు పలికెను --- మాకు కర్మయోగమును బోధించుడు. దానిని అనుష్ఠించే వ్యక్తి అంతఃకరణము శుద్ధమగును. ఆతడు ఈ జన్మలోనే కర్మబంధమును పోరాడి సర్వోత్తమమైన ఆత్మనిష్ఠ (జీవన్ముక్తి) ను పొందును.
పూర్వము తండ్రి ఇక్ష్వాకువు ప్రక్కనే ఉండగా నేను బ్రహ్మదేవుని పుత్రులగు సనకాదులను ఈ ప్రశ్నను అడిగితిని. కాని, వారు చెప్పలేదు. అట్లు చెప్పకుండుటకు గల కారణమును కూడ చెప్పడు.
ఆవిర్ఘ త్రుడిట్లు పలికెను --- కర్తవ్యకర్మ, కర్మను చేయకుండుట, నిషిద్ధకర్మను చేయుట అనేది వేదప్రతిపాద్యమే గాని, లౌకికము కాదు. ఆ వేదము ఈశ్వరునినుండి ఆవిర్భవించినదగుట వలన ఈ కర్మ విషయమై పండితులు కూడ మోహపడెదరు.
ఈ వేదము తత్త్వమును గుప్తముగా నుంచి చెప్పను. అజ్ఞానులను కర్మబంధమునుండి విముక్తులను చేయుటయే వేదతాత్పర్యము. పిల్లలకు రోగనివృత్తి కై మందును తాయిలముతో బాటు ఇచ్చినట్లుగా, వేదము అజ్ఞానులకు ఫలమునందభిరుచి కలిగించి కర్మలను విధించుచున్నది. ఈ కర్మల తాత్పర్యము నైష్కర్మ్యమే గాని, కర్మఫలము కాదు.
ఎవడైతే తాను అజ్ఞానియై ఉండి ఇంద్రియపరవశుడై వేదవిహితకర్మను ఆచరించడో, ఆతడు నిషిద్దకర్మ అనే అధర్మమును చేయును. దానిచే, ఆతడు జననమరణప్రవాహములో పడిపోవును.
సాధకుడు వేదవిహితమైన కర్మను మాత్రమే ఫలాసక్తి లేకుండా ఈశ్వరార్పణబుద్దితో చేయవలెను. దాని వలన ఆతడు తత్త్వజ్ఞానమును పొందును. ఆత్మస్వరూపమునందు క్రీయాసంబంధము లేదు. కర్మఫలమును చెప్పే శ్రుతివాక్యము (ఫలశ్రుతి) నకు తాత్పర్యము సాధకునకు విహితకర్మయందు అభిరుచిని కలిగించుట మాత్రమే.
పరమాత్మకు నేను-నాది అనే అజ్ఞానగ్రంథి వలననే జీవభావము కలిగినది. ఆ గ్రంథిని శీఘ్రముగా పోగొట్టుకొన గోరే సాధకుడు నిత్యకర్మ లను చేస్తూ, ఆగమవిధానముతో కూడ శ్రీహరిదేవుని ఆరాధించవలెను.
సాధకుడు ఆచార్యుని అనుగ్రహముతో మంత్రదీక్షను పొందవలెను. ఆయన వానికి పూజావిధిని ఉపదేశించును. అపుడాతడు తనకు నచ్చిన మూర్తి ద్వారా పురుషోత్తముని ఆరాధించవలెను.
సాధకుడు శుచియై మూర్తికి ఎదురుగా కూర్చుని భూతశుద్దిని, ప్రాణాయామముచే నాడీశోధనమును చేయవలెను. తరువాత అంగన్యాస కరన్యాసములతో రక్ష చేయవలెను. తరువాత దేశకాలాదులకనుగుణముగా లభించే ద్రవ్యములతో శ్రీహరిని మూర్తియందు ఆరాధించవలెను. హృదయమునందు కూడ శ్రీహరిని ధ్యానించవలెను.
సాధకుడు పూజాద్రవ్యములను, పూజాస్థానమును, తన మనస్సును పవిత్రము చేసుకొని, మూర్తిని నీటితో శుభ్రము చేయవలెను. తరువాత ఏకాగ్రమగు చిత్తము గలవాడై ఆసనమును సంప్రోక్షించి, అర్ఘ్యపాద్యాదుల నిచ్చి, హృదయమునందలి శ్రీహరిని భావన ద్వారా మూర్తిలో స్థాపించి, హృదయాదిన్యాసములను చేసి మూలమంత్రముతో పూజించవలెను.
పాదములు మొదలైన అంగములతో, సుదర్శనము మొదలైన ఉపాంగములతో, అనుచరులతో కూడిన ఆయా (అభీష్ట మైన) మూర్తిని మూలమంత్రముతో పూజించవలెను. పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రములు, అలంకారము, ధూపము మొదలగువాటిని సమర్పించవలెను.
పరివారముతో కూడిన శ్రీహరిని గంధము, పుష్పములు, అక్షతలు, మాలలు, ధూపము, దీపము, నైవేద్యములతో యథావిధిగా చక్కగా పూజించి, స్తోత్రములతో స్తుతించి నమస్కరించవలెను.
సాధకుడు తనను భగవద్రూపునిగా ధ్యానిస్తూ, శ్రీహరి మూర్తిని చక్కగా పూజించవలెను. నిర్మాల్యమును తల పై దాల్చి, సత్కరించబడిన శ్రీహరిని తన హృదయమునందు (మందిరమునందు) స్థాపించవలెను.
ఎవడైతే ఈ విధముగా అగ్ని, సూర్యుడు, నీరు, పృథివి మొదలగువాటియందు, అతిథియందు, హృదయమునందు కూడ ఆత్మ రూపుడగు శ్రీహరిని ఆరాధించునో, ఆతడు శీఘ్రముగా విముక్తుడగును.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో మూడవ అధ్యాయము ముగిసినది (3).
