శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము
20 - గుణదోషముల వ్యవస్థ - వేద తాత్పర్యము
విధిని షేధరూపమగు వేదము నీ వాక్కే. గుణదోషములయొక్క భేదదర్శనము లేకుండా ఆ వేదము మానవులకు పురుషార్థసాధనము ఎట్లు కాగల్గును? (గుణదోషదర్శనమే దోషమనే మాట యెట్లు చెల్లును?)
ఈశ్వరా! పితృదేవతలకు, దేవతలకు, మానవులకు ప్రత్యక్షాది ప్రమాణ ములచే తెలియబడని స్వర్గమోక్షాదుల విషయములో మాత్రమే కాకుండా, సాధనసాధ్యములయందు (యజ్ఞము సాధనము, స్వర్గము సాధ్యము) కూడ నీ వాక్కు అగు వేదమే శ్రేష్ఠమైన కన్ను (తెలుసుకొనే ఉపాయము).
ఏ వ్యక్తి కైతే ప్రయత్నము లేకుండానే నా గాథలు, నా పూజలు మొదలగువాటియందు శ్రద్ధ కలిగినదో, వైరాగ్యము లేకున్నా అధికమగు విషయాసక్తి లేదో, అట్టివానికి భక్తియోగము సిద్ధిని కలిగించును.
ఎంతవరకైతే వైరాగ్యము కలుగదో, నా గాథలను వినుట, మననము చేయుట మొదలగువాటిపై శ్రద్ధ కలుగదో, అంతవరకు కర్మలను చేయవలె.
ఓ ఉద్ధవా! ఫలకామన లేకుండా స్వధర్మనిష్ఠుడై నన్ను యజ్ఞములతో ఆరాధించే వ్యక్తి, కామ్య-నిషిద్ధకర్మలను చేయకున్నచో, స్వర్గనరకములను పొందడు.
వివేకవంతుడగు మానవుడు నరకజన్మను వలె స్వర్గ ప్రాప్తిని కూడ కోరరాదు (ఆ కర్మలను చేయరాదు). ఈ భూలోకములో మనుష్యజన్మ నైననూ కోరరాదు. ఎందుకంటే, మనుష్యజన్మలో కూడ దేహమునందలి అభిమానముచే పురుషార్థమునుండి జారిపోవుట సంభవమే.
ఆ వివేకి ఈ విషయము (దేహాభిమానము పతన హేతువు) ను తెలుసుకొని, ఈ దేహము పురుషార్థసిద్ధికి సాధనమే అయినా మరణించే స్వభావము గలదని గుర్తించవలెను. ఆతడు మరణించుటకు ముందే పునర్జన్మ లేని మోక్షము కొరకు ప్రయత్నము చేయవలెను.
ఏలయనగా, లంపటము (ఆసక్తి) లేని పక్షి తాను గూడు కట్టుకొని నివసిస్తున్న చెట్టును యమునివంటి (నిర్దయులైన) ఈ జనులు (అహో రాత్రములనే యమదూతలు) నరుకుచుండగా, దానిని విడిచి పెట్టి క్షేమమును పొందును.
కర్మలయందు నిర్వేదము, కర్మఫలములయందు విరక్తి గల సాధకుడు జితేంద్రియుడై అభ్యాసముచే తన మనస్సును నిశ్చలముగా నిలుపవలెను.
మనస్సును ధారణ చేస్తూ ఉన్నా అది స్థిరము లేనిదై వెంటనే ఇటునటు తిరుగాడును. అప్పుడు సాధకుడు సోమరిదనము లేకుండా, నచ్చజెప్పుట అనే ఉపాయముచే ఆ మనస్సును తన వశము చేసుకొనవలెను.
సంసారమునందు రోత పుట్టి విరక్తు డైన వ్యక్తి గురువు యొక్క ఉపదేశమును గ్రహించును. ఆతడు ఉపదేశించబడిన తత్త్వమును నిరంతరముగా ధ్యానించును. అప్పుడాతని మనస్సు దుష్ట స్వభావము (విషయాసక్తి) ను విడిచి పెట్టును.
యమనియమాదియోగాంగములు, తత్త్వవిచారరూపమగు విద్య, నన్ను పూజించి ధ్యానించుట అనే ఉపాయములలో ఏదో ఒక దానిచే మనస్సు స్థిరమై యోగగమ్యమైన పరమాత్మపై నిలబడును. మనస్సును జయించుటకు ఇంతకు మించి ఉపాయములు లేవు.
నా గాథలయందు శ్రద్ధ కలిగిన భక్తునకు నిర్వేదము కర్మలయందు కలిగి వాటి ఫలములయందు కలుగకపోవచ్చును. ఆతడు భోగ్యవిషయములు దుఃఖమయములని తెలిసినా వాటిని విడిచి పెట్టలేక పోవచ్చును. ఆతడా స్థితియందు కూడ దుఃఖమే ఉత్తరఫలముగా గల ఆ భోగములననుభవిస్తూనే, అవి నింద్యములని దృఢనిశ్చయము చేసుకోవాలి. ఆతడు ప్రసన్నచిత్తుడై మరింత శ్రద్దతో నన్ను భజించవలెను.
పైన చెప్పిన విధముగా భక్తియోగముతో నన్ను నిత్యము భజించే భక్తుని హృదయములో నేను స్థిరముగా నుండెదను. అప్పుడాతని కామనలన్నియు నశించును.
అష్టాంగయోగము, దానధర్మ ములు, ఇతరత్రేయస్సాధనములు (ప్రతాదులు) అనువాటిచే ఏ ఫలము - స్వర్గము, మోక్షము, లేదా నా ధామము - లభించునో,
ఆ సర్వమును నా భక్తుడు నాపై భక్తి అనే సాధనముచేతనే తేలికగా పొందును. నా భక్తుడు దేనినీ కోరడు. ఒకచో ఏదో విధముగా కోరినట్లైతే అలవోకగా పొందును.
ఏలయనగా, నాయందు ఏకాంతమగు నిష్ఠ గల భక్తులు సాధువులు, వివేకవంతులు. వారు దేనినీ కోరరు. పునర్జన్మ లేని మోక్షమును నేను ఇచ్చినా, దానిని కూడ వారు కోరరు.
అపేక్ష లేకుండుట సర్వోత్కృష్టము, పురుషార్థసాధనములలో గొప్పది అని మహాత్ములు చెప్పెదరు. కావున, అపేక్ష, అ పేక్ష వలన పుట్టే కోరికలు లేనివానికి నాయందు పూర్ణభక్తి కలుగును.
