శ్రీ మద్భాగవతము - ఏకాదశ (11వ) స్కందము
8 - దత్తాత్రేయ గీత - ఏడుగురు గురువుల వర్ణన
దత్తాత్రేయ మహర్షి యదుమహారాజుతో నిట్లనెను --- ఓ రాజా! ప్రాణులకు ఇంద్రియముల వలన కలిగే సుఖము స్వర్గమునందే కాక, నరకము (పశ్వాది జన్మ) నందు కూడ లభించును; దుఃఖము వలె కోరకుండానే లభించును. కావున, వివేకి అట్టి సుఖమును కోరరాదు.
సాధకుడు ఆహారము విషయములో, తన దగ్గరకు వచ్చిన ప్రాణిని మాత్రమే తినే కొండ చిలువ వలె నుండవలెను. సాధకుడు అనుకోకుండా లభించినదానిని -- అది గొప్ప రుచి గలది కాని, రుచి లేనిది కాని కావచ్చు; సమృద్ధిగా ఉండవచ్చు; చాలీ చాలక పోవచ్చు -- తినవలెను. అంతేగాని, సమృద్ధమైన రుచ్యమైన భోజనము కొరకు ఉద్యమించరాదు.
సాధకుడు తనకు ఏది లభించినా అది ప్రారబ్దమేనని స్వీకరించవలెను. తన వద్దకు ఆహారము రానిచో ఆతడు, కొండచిలువవలె, చాలా రోజులైనా ఆహారము లేకుండా, దాని కొరకు ఉద్యమించకుండా మిన్నకుండవలెను.
ఇంద్రియశక్తి, మనశ్శక్తి, శరీరపొటవము ఉన్నా, సాధకుడు వివిధకర్మలను కట్టి పెట్టవలెను; కాని, నిద్ర పోరాదు. ఆత్మనిష్ఠుడై ఉండవలెను. కర్మేంద్రియములున్నా ఆతడు వివిధకర్మలను చేయరాదు.
నిశ్చలమైన సముద్రము బయటకు ప్రసన్నముగా, తనలో లోతుగా నుండును. సముద్రమును అతిక్రమించుట గాని, దాని లోతును తెలియుట గాని శక్యము కాదు. సముద్రము దేశకాలముల పరిచ్చేదములకు అతీతమా యన్నట్లుండును. సముద్రమును క్షోభిల్లజేయుటయు సంభవము కాదు. మననశీలుడగు సాధకుడు అట్లు ఉండవలెను (ఉండును). ఆతడు ముఖమునందు ప్రసన్నముగా, హృదయములో గంభీరముగా నుండును. ఆతని మనఃస్థితిని అంచనా వేయుట గాని, మనస్సును కల్లోలపరచుట గాని ఎవరికీ శక్యము కాదు. దేశకాలపరిచ్ఛేదములు లేని ఆత్మ స్వరూప మునందు నిలిచి ఉండే ఆతనిని ఉల్లంఘించుటయు శక్యము కాదు.
మననశీలుడైన సాధకునకు నారాయణుడే పరమలక్ష్యము. ఆతడు సముద్రమువంటివాడు. నదులు వచ్చి కలిసినప్పుడు సముద్రము ఉప్పొంగదు; నదులు ఎండిపోయినప్పుడు సముద్రము ఎండిపోదు. అదే విధముగా, సాధకుడు కోరికలు తీరినప్పుడు హర్షద్రేకమును పొందడు; తీరకపోతే దుఃఖించడు.
జితేంద్రియుడు కానివాడు దేవుని మాయయనదగిన యువతి యొక్క హావభావములచే ప్రలోభితుడగును. అట్టివాడు, మిడత నిప్పయందు వలె, అజ్ఞానరూపమైన నరకమునందు పడును.
యువతి, బంగారము, ఆభరణములు, వస్త్రములు, రుచ్యమగు ఆహారము మొదలైన వస్తువులు ఈశ్వరుని మాయాశక్తిచే నిర్మించబడినవి. ఇవి భోగ్యములనే బుద్ధితో వాటియందు ప్రలోభముతో కూడిన మనస్సు గల మూర్ఖుడు వివేకబుద్దిని కోల్పోయి, నిప్పుయొక్క ప్రకాశమునందు ఆకర్షణ గల మిడత వలె, నిశ్చయముగా నశించును.
మననశీలుడగు సాధకుడు దేహమును నిలబెట్టుటకు ఎంత సరిపడునో అంత ఆహారమును మాత్రమే కొంచెము కొంచెము తినవలెను. తేనెటీగ పువ్వులకు ఇబ్బంది కలుగకుండా కొంచెము కొంచెము తేనెను సంగ్రహించినట్లుగా, సాధకుడు గృహస్థులను పీడించకుండా ఆహారమును వేర్వేరు గృహములనుండి కొంచెము కొంచెము సంగ్రహించుకొనవలెను.
తుమ్మెద చిన్న- పెద్ద పువ్వులన్నింటినుండి సారభూతమైన తేనెను గ్రహీంచును. అదే విధముగా, నిపుణుడైన మానవుడు సంగ్రహమైన మరియు విపులమైన శాస్త్రములన్నింటినుండి సారమును గ్రహించవలెను.
తేనెటీగ భవిష్యత్తు కొరకు తేనెను సంగ్రహించి భద్రము చేయును. సాధకుడు అట్లు చేయరాదు. సాధకునకు చేయి, ఉదరము మాత్రమే పాత్రలు కావలెను (అంటే, అవి పట్టినంత ఆహారమును మాత్రమే స్వీకరించవలెను). ఈ భోజనము సాయంకాలానికి, ఇది రేపటికి అంటూ భిక్షాన్నమును ప్రోగు చేయరాదు.
భిక్షాటనము చేసే సన్న్యాసి ఈ భోజనము సాయంకాలానికి, ఇది రేపటికి అంటూ భిక్షాన్నమును ప్రోగు చేయరాదు. తేనెటీగలు వలె ప్రోగు చేయువాడు ఆ ప్రోగు చేసినదానితో సహా వినాశమును పొందును. (తేనె కొరకు జనులు తేనెటీగలను చంపెదరు. అదే విధముగా, సంపదను పోగు చేయువాడు దాని కారణముగా వినాశమును పొందును).
సన్న్యాసి యువతియొక్క చెక్క బొమ్మనైననూ కాలితోనైనా స్పృశించ రాదు. ఆడు యేనుగు బొమ్మను చూచి ఆకర్షించబడి మగ యేనుగు బంధించబడును. యువతిని స్పృశించే సన్న్యాసికి అట్లే యగును.
వివేకి యువతి తనకు మృత్యువు అని తెలియవలెనే గాని, ఆమెయందు ఆసక్తిని కలిగి యుండరాదు. ఏనుగును అధికబలము గల ఇతరములైన యేనుగులు హింసించును. యువతి వెంట బడువాడు అదే విధముగా ఇతరపురుషులచే హింసించబడును.
తేనెటీగలు కష్ట పడి ప్రోగు చేసిన తేనెను వాటి మర్మము తెలిసిన ఆటవికుడు అపహరించి అనుభవించును. అదే విధముగా, లోభులు తాము తినకుండా, ఇతరులకు పెట్టకుండా చాల కష్టపడి ధనమును పోగు చేసెదరు. ఆ ధనముయొక్క మర్మము తెలిసినవాడు దానిని అపహరించును. వానినుండి మరియొకడు అపహరించి అనుభవించును.
తేనెటీగలు కష్టపడి తేనెను ప్రోగు చేయును. కాని, ఆ తేనెను వాటికంటే ముందు తేనెను పట్టువాడు అనుభవించును. అదే విధముగా, గృహస్థులు ఇంటిలో భోగములను కోరి చాల కష్టపడి సంపదను ప్రోగు చేయుదురు. కాని, వారికంటే ముందు రుచ్యములగు ఆహారము మొదలైన ఆ భోగములను సన్న్యాసి అనుభవించును. (గృహస్థుకు అన్నదానము విధి).
ప్రయత్నశీలుడైన సాధకుడు ఏకాంతములో ఆత్మనిష్ఠుడై (వనము) ఉండవలెనే గాని, భోగములకు చెందిన పాటలను వినరాదు. వేటగాడు ఆడు లేడి స్వరముతో మోహ పెట్టి లేడిని బంధించును. ఆ సన్నివేశమునుండి ఈ సందేశమును మనము నేర్చుకొనవలెను.
ఋష్యశృంగుడు లేడి గర్బమునుండి పుట్టిన మహర్షి. యువతులు చేసే భోగవిషయసంబంధి నాట్యములు, వాద్యములు, పాటలను సేవిస్తూ, ఆయన వారికి ఆటబొమ్మ వలె వశుడయ్యెను.
అనిత్యములగు భోగములయందు తగుల్కొన్న బుద్ది గల మానవుని, రుచులను కోరే నాలుక అధికముగా హింస పెట్టి వ్యామోహితుని చేయును. లోహపు కొక్కెమునకు మాంసపు ముక్కను గ్రుచ్చి నీటిలో ఉంచగా, ఆ మాంసమునందలి లోభము చే చేప కొక్కెమునకు తగుల్కొని మరణించును. జిహ్వాచాపల్యము గల వ్యక్తి అటులనే మరణించును.
ధీరులు భోజనమును మానివేయుట ద్వారా, జిహ్వేంద్రియమును మినహాయించి, మిగిలిన ఇంద్రియములను జయించెదరు. భోజనమును మానివేసినచో, రసనేంద్రియము మరింత వృద్ధి జెందును.
మానవుడు రసనేంద్రియమును విడిచి పెట్టి మిగిలిన ఇంద్రియములను జయించినా, జితేంద్రియుడు కానేరడు. రసనేంద్రియమును జయించినప్పుడు మాత్రమే జితేంద్రియుడగును.
యదూ! పూర్వము విదేహ (దేహాభిమానము లేని) పురములో పింగళ యని ప్రసిద్ధి జెందిన వేశ్య ఉండెను (ఇప్పుడు వేశ్య కాదు). నేను ఆమె నుండి ఒక విషయము (వైరాగ్యము) ను నేర్చుకొంటిని. దానిని తెలుసుకో.
యథేచ్చగా తిరిగే ఆ పింగళ గొప్ప రూపసి. ఆమె ఒకనాడు సాయంకాలము ప్రియుని ఏకాంతస్థానమునకు తీసుకువెళ్లగోరి, ఇంటి బయట ద్వారము వద్ద నిలబడెను.
ఓ పురుషశ్రేష్టా! ఆమెకు ధనమునందు ఆశ మెండు. మార్గమునందు వచ్చే పురుషులను చూచి, వారు తనకు మూల్యమును చెల్లించే ధనవంతులైన ప్రియులనియే ఆమె తలచుచుండెను.
ఆమె ఏకాంతములో విటులను కలిసి ధనమును సంపాదించును. వచ్చినవారు వెళ్లిపోగా, మరియొకడు ధనవంతుడు ఎవడైనా తన దగ్గరకు వచ్చి అధిక ధనము నీయగలడని ఆమె తలపోసెను.
ఈ తీరున చెడు తలపులు గల పింగళ నిద్ర చెడగొట్టుకొని, ద్వారము వద్ద వ్రేలాడుతూ, లోపలికి వెళ్లి బైటకు వస్తూ, అర్ధరాత్రి వరకు గడిపెను.
ధనమునందలి ఆశచే ఆమె ముఖము ఎండిపోయి, మనస్సులో దైన్యము నిండెను. అపుడామెకు గొప్ప వైరాగ్యము కలిగెను. వైరాగ్యము మనిషిని ఆత్మవిచారము వైపునకు నడిపి ఆనందమునిచ్చును.
వైరాగ్యముతో నిండిన మనస్సు గల ఆమె ఒక గీతమును గానము చేసెను. దానిని నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పెదను, వినుము. ఎందుకంటే, వైరాగ్యము మనిషి యొక్క కోరికలనే త్రాళ్లకు కత్తివంటిది.
ఓ మహారాజా! వివేకజ్ఞానము లేని మానవుడు మమకారమును విడువలేడు. అదే విధముగా, వైరాగ్యము లేనివాడు దేహాభిమానమనే సంసారబంధమును విడుచుటకు ఇచ్చగించడు.
పింగళ ఇట్లు పలికెను --- అయ్యో! మనోజయము లేని నా మోహముయొక్క విస్తారమును గనుడు. వివేకము లేని నేను అయోగ్యుడగు ప్రియునినుండి భోగమును కోరుచున్నాను.
వినోదమును, ఆనందమును, సంపదలను ఇచ్చే పరమాత్మ హృదయములో దగ్గరగా నున్నాడు. అజ్ఞానురాలనగు నేను అవినాశియగు ఈ పరమాత్మను కాదని, అభీష్టములనిచ్చే శక్తి లేని అయోగ్యుని సేవించుచున్నాను. అయోగ్యుడగు ఈ విటుడు ఇచ్చేవి దుఃఖము, భయము, మనోవ్యాధి, శోకము, వ్యామోహము మాత్రమే.
అయ్యో! పరపురుష సంగమునే బ్రదుకు దెరువుగా చేసుకున్న నా జీవిక సుతరాము ఏవగించుకొనదగినది. దానిచే నా దేహము, మనస్సు వ్యర్థముగా పరితాపమును పొందినవి. స్త్రీలంపటుడు, ధనమునందు తృష్ణ గలవాడు, నిందనీయుడు అగు పురుషుడు నా దేహమును కొనెడివాడు. అట్టి దేహముతో నేను ధనమును, సుఖమును పొందగోరితిని.
ఈ దేహము ఇల్లు వంటిది. దీనికి దూలములు, వాసములు, స్తంభములు ఎముకలే. చర్మము, రోమములు, గోళ్లు దీని పై కప్పు. మలమూత్రములతో నిండియున్న దీని తొమ్మిది ద్వారములనుండి ద్రవము స్రవించుచుండును. నేను తప్ప మరియొకతె ఎవతే దీనిని సేవించును?
ఈ విదేహ (దేహాభిమానము లేని జ్ఞానుల) నగరములో నా ఒక్కతేయొక్క బుద్ధి మాత్రమే మోహితమై యున్నది. ఎందుకంటే, దుష్టురాలనగు నేను తనను ఇచ్చే ఈ (ఆత్మరూపుడైన) శ్రీహరిని కాదని మరియొక భోగ్యమును కోరుచున్నాను.
ఈ శ్రీహరి దేహధారులకు హితకారి, ప్రియతముడు, రక్షకుడు, ఆత్మ కూడా. నేను నన్ను సమర్పించుకొని ఆయనను స్వంతము చేసుకొని, లక్ష్మీదేవి వలె, ఆయనతో మాత్రమే రమించెదను.
కామములు గాని, వాటిని ఇచ్చే మానవులు గాని, దేవతలు గాని ఒక కాలములో ఆరంభమై ఇంకో కాలములో అంతమగును. వారు తమ తమ భార్యలకు ఎంత ప్రియమును చేసిరి? (విషయసుఖములు అల్పములు).
ఏదో ఒక కర్మచే శ్రీహరి భగవానుడు నిశ్చయముగా నా కొరకు ప్రీతి జెందినాడు. ఎందుకంటే, దుష్టమైన తృష్ణ గల నాకు సుఖమునిచ్చే ఈ విరక్తి కలిగినది.
నేను అల్పమగు భాగ్యము గలదాననైనచో, నాకీ విధముగా విరక్తిని కలిగించే కష్టములు కలిగిడివి కావు (కావున, నేను భాగ్యవతినే). మానవుడు విరక్తిచే ఇల్లు మొదలైన బంధములను వీడి శాంతిని పొందును.
ఆ సర్వేశ్వరుడు అనుగ్రహించిన వైరాగ్యమును నేను శిరసా స్వీకరించి, విషయభోగములయందు సంలగ్న మైన దురాశలను విడిచి పెట్టుచున్నాను. నేనా ఈశ్వరుని శరణు పొందుచున్నాను.
ఆమె అనుకోకుండా లభించినదానితోనే సంతోషముగా జీవిస్తూ ఈ ఆత్మతత్త్వమునందు శ్రద్ధ కలిగియుండెను. నేను నిశ్చయముగా ఈ ప్రియ మైన ఆత్మయందు మాత్రమే రమించెదను, అని ఆమె నిశ్చయించెను.
జీవుడు సంసారమనే నూతిలో పడి, కాలమనే కొండచిలువ నోటికి చిక్కినాడు. ఇంద్రియభోగములు వాని వివేకమునపహరించినవి. వానిని రక్షించుటకు (ఈశ్వరుడు తప్ప) మరియొకడు సమర్థుడు ఎవడు గలడు?
ఈ జగత్తు కాలమనే కొండచిలువ నోటికి చిక్కి యున్నదని గుర్తించి, సాధకుడు సావధానుడై సర్వమునుండి విరక్తిని చేందవలెను. అప్పుడాతనికి రక్షకుడు ఆత్మయే (ఆత్మరూపుడగు ఈశ్వరుడే).
దత్తాత్రేయ మహర్షి ఇట్లు చెప్పెను --- ఆమె మనస్సులో ఈ విధముగా నిశ్చయించుకొని, ప్రియునియందలి అభిలాషనుండీ పుట్టిన దురాశను జయించెను. అపుడామె శాంతముగా శయ్య పై పరుండెను.
తృష్ణయే పెద్ద దుఃఖము. వైరాగ్యము గొప్ప సుఖము. పింగళ ప్రియుడగు విటునియందలి తృష్ణను పూర్తిగా విడిచి పెట్టి సుఖముగా నిద్రించెను.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో దత్తాత్రేయగీతలో ఏడుగురు గురువులను వర్ణించే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).
