17 - పృథూపాఖ్యానము - పృథివి శ్రీహరిని స్తుతించుట

మైత్రేయ ఉవాచ

ఏవం స భగవాన్ వైన్యః ఖ్యాపితో గుణకర్మభిః

ఛండయామాస న్ కామైః ప్రతిపూజ్యాభినంద్య చ

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- పూజ్యుడగు ఆ వేనపుత్రు డైన పృథువును స్తోత్రపాఠకులు, ఆయన గుణములను మరియు కర్మలను వర్ణించి స్తుతించిరి. అప్పుడాయన వారిని అభినందించి, వారి కోరికలను తీర్చి, సత్కరించి సంతోష పెట్టెను.

బ్రాహ్మణప్రముఖాన్ వర్ణాన్ భక్త్యామాత్యపురోధసః

 పౌరాన్ జానపదాన్ శ్రేణీః ప్రకృతీస్సమపూజయత్

బ్రాహ్మణులు మొదలగు వర్ణములవారిని, మంత్రులను, పురోహి తులను, నగరవాసులను, పల్లె వాపులను, అంగరక్షకులను, రాజ్యాధికారు లను పృథువు భక్తితో చక్కగా సత్కరించెను.

విదుర ఉవాచ

 కస్మాద్ధధార గోరూపం ధరిత్రీ బహురూపిణీ

యాం దుదోహ పృథుస్తత్ర కో వతో దోహనం చ కిమ్

విదురుడు ఇట్లు పలికెను --- పృథువు గోరూపములోనున్న పృథి విని పితికెను గదా! అనేకరూపములను ధరించగల పృథివి గోరూపమును దాల్చుటకు కారణమేమి? ఆ పితుకుటలో దూడ ఎవరు? పాలను పితికే పాత్ర ఏది?

ప్రకృత్యా విషమా దేవీ కృతా తేన సమా కథమ్

 తస్య మేధ్యం హయం దేవః కప్య హేతోరపాహరత్

భూమి సహజముగా ఎగుడుదిగుడుగా నుండును. అట్టి భూమిని పృథువు సమతలముగా ఎట్లు చేసెను? పృథువుయొక్క పవిత్రమగు యాగాశ్వమును ఇంద్రదేవుడు అపహరించుటకు కారణమేమి?

 సనత్కుమారాద్భగంతో బ్రహ్మన్ బ్రహ్మవిదుత్తమాత్

 లబ్ధ్వ జ్ఞానం సవిజ్ఞానం రాజర్షి కాం గతం గతః

ఓ మహాత్మా! పూజ్యుడు, బ్రహ్మవేత్తలలో ముందుగా ఎన్నదగిన వాడు అగు సనత్కుమారుని వద్ద రాజర్షియగు పృథువు బ్రహ్మజ్ఞానమును, బ్రహ్మసాక్షాత్కారమును పొందెను గదా! ఆతడు ఏ ఫలమును పొంది నాడు?

యచ్చాన్యదపి కృష్ణస్య భవాన్ భగవతః ప్రభో

శ్రవస్సుశ్రవసః పుణ్యం పూర్వదేహకథాశ్రయమ్

 భక్తాయ మేకనురక్తాయ తవ చాధోక్షజస్య చ

 వక్తుమర్హసి యోదుహ్యద్వైన్యరూపేణ గామిమామ్

ఓ ప్రభూ! ఇంద్రియములకు గోచరుడు కాని శ్రీకృష్ణ భగవానుడు పూర్వావతారములో వేనుని పుత్రుడగు పృథువుగా అవతరించి భూమిని పితికినాడు. ఆ పృథువుయొక్క గాథ విషయముగా - గల భగవానుని . పవిత్రకీర్తి ఇంకనూ ఏమైన నేను ప్రస్తావించనిది ఉన్నచో, దానిని కూడ నీవు నాకు చెప్ప దగుదువు. గొప్ప కీర్తి గల భగవానునియందు మరియు నీయందు కూడ నాకు భక్తి, అనురాగము గలవు.

సూత ఉవాచ

చోదితో విదురేగైవం వాసుదేవకథాం ప్రతి

 ప్రశస్య తం ప్రీతమనా. మైత్రేయః ప్రత్యభాషత

సూత మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా విదురుడు వాసు దేవుని గాథను చెప్పమని ప్రేరేపించగా, మైత్రేయ మహర్షి మనస్సులో చాల సంతసమును పొందెను. ఆయన విదురుని కొనియాడి ఇట్లు బదులు చెప్పెను.

 మైత్రేయ ఉవాచ

యదాభిషిక్తః పృథురంగ విరామంత్రితో జనతాయాశ్చ పాలః

ప్రజా నిరన్నే క్షితిపృష్ఠ ఏత్య క్షుత్క్షామదేహాః పతిమభ్యవోచన్

ఓ విదురా! మహర్షులు పృథువును అభిషేకించి ప్రజాపాలకునిగా నియోగించిరి. అప్పుడు సామ్రాజ్యములో ప్రజలకు తిండి లేకుండెను. వారు ఆకలితో కృశించిన దేహములను కలిగియుండిరి. వారు వచ్చి రాజు నకు ఎదురుగా ఇట్లు విన్నవించుకొనిరి.

వయం రాజన్ జాఠరేణాభితప్తా

యథాగ్నినా కోటరస్థేన వృక్షాః

 త్వామధ్య యాతాశ్శరణం శరణ్యం

యస్సాధితో వృత్తికరః పతిర్నః

ఓ రాజా! తొర్రలో నిప్పు ఉన్న చెట్లు వలె, మేము కడుపులలోని ఈ జఠరాగ్నిచే తపింపజేయబడుచున్నాము. అనగా, ఆకలికి మల మల మాడుచున్నాము. ఈనాడు మేము నిన్ను శరణు పొందినాము. నీవు శరణు పొందినవారిని రక్షించువాడవు. నిన్ను మహర్షులు వేనుని శరీరమును మథించి సంపాదించి, మాకు ప్రభువుగా అభిషేకించినారు.

తన్నో భవానీహతు రాతవ్వేన్నం

క్షుధాకర్ధితానాం నరదేవదేవ

 యావన్న నంక్ష్యామహ ఉజ్ఘితోర్జా

వార్తాపతిస్త్వం కీల లోకపాలః

ఓ రాజాధిరాజా! మేము తిండి తిని రోజులు అయినది. మేము ఆకలితో మాడిపోవుచున్నాము. మా ప్రాణములు పోయే లోపులో మాకు అన్నమును పెట్టే వ్యవస్థను నీవు చేయుము. నీవు జనులను పాలించే రాజువు. జనులకు జీవికను కల్పించవలసినది నీవే గదా!

మైత్రేయ ఉవాచ

పృథుః ప్రజానాం కరుణం నిశమ్య పరిదేవితమ్

దీర్ఘం దధ్యో కురుశ్రేష్ఠ నిమిత్తం సోకన్వపద్యత

కురువంశములో ఉత్తముడవగు ఓ విదురా! ప్రజల ఈ జాలిని గొలిపే గోడును విని ఆ పృథువు దీర్ఘముగా ఆలోచించెను. అపుడాతనికి కరువునకు గల కారణము అవగతమయ్యెను.

ఇతి వ్యవసితో బుద్ధ్యా ప్రగృహీతశరాసనః

 సందధే విశిఖం భూమేః క్రుద్దస్త్రీపురహా యథా

ఆతడు తాను చేయవలసిన పనిని బుద్ధిలో నిశ్చయించుకొని, ధన స్సును చేతిలోనికి తీసుకొనెను. ఆయనకు భూదేవిపై చాల కోపము వచ్చేను. అపుడాతడు త్రిపురాసురులను సంహరించిన శివుని వలె బాణమును ఎక్కు పెట్టెను.

ప్రవేపమానా ధరణీ నిశామ్యోదాయుధం చ తమ్

 గౌస్సత్యపాద్రవద్భీతా మృగీవ మృగయుద్రుతా

పృథువు ధనస్సునేక్కు పెట్టుటను గాంచిన భూమి, భయముతో వణికీపోతూ గోరూపమును దాల్చి, వేటగాడు తరుముకొచ్చిన లేడి వలే, పారిపోయెను.

తామన్వధావత్తద్వైన్యః కుపితోకత్యరుణేక్షణః

శరం ధనుషి సంధాయ యత్ర యత్ర పలాయతే

అప్పుడు కోపముతో చాల ఎరుపెక్కిన కన్నులు గల పృథువు ధనస్సునందు బాణమునెక్కు పెట్టి, ఆ గోవు పరుగెత్తిన ప్రదేశములన్నింటికీ దాని వెనుక పరుగెత్తాను.

సా దిశో విదిశో దేవీ రోదసీ చాంతరం తయోః

 ధావంతీ తత్ర తత్రైనం దదర్శానుద్యతాయుధమ్

ఆ భూదేవి దిక్కులలో, విదిక్కులలో, భూలోకములో, స్వర్గలోక ములో, అంతరిక్షములో అంతటా ఎక్కడకు పరుగెత్తినా, అక్కడ ఆమెకు తన వెనుక బాణమునెక్కు పెట్టిన పృథువే కానవచ్చెను.

లోకే నావిందత త్రాణం వైన్యాన్మృత్యోరివ ప్రజాః

త్ర తధా నివవృతే హృదయేన విదూయతా

లోకములో జనులను మృత్యువునుండి రక్షించగలవారు లేరు. అదే విధముగా, భయపడిపోయిన ఆ భూదేవికి లోకములో పృథువునుండి రక్షించేవారు కనబడలేదు. అపుడామె కలత జెందిన మనస్సుతో వెనుకకు తిరిగి వచ్చెను.

ఉవాచ చ మహాభాగం ధర్మజ్ఞాపన్నవత్సల

 త్రాహి మామపి భూతానాం పాలనేవస్థితో భవాన్

ఆ పృథివి మహాత్ముడగు పృథువుతో నిట్లనెను : ధర్మమునెరింగిన ఓ పృథూ! నీవు ఆపదలలోనున్నవారి యెడల ప్రేమ గలవాడవు. నన్ను కూడ రక్షించుము. ప్రాణులను రక్షించుటలో నీకు నిష్ఠ కలదు గదా!

స త్వం జిఘాంససే కస్మాథీనామకృతకిల్బిషామ్

 అహనిష్యత్కథం యోషాం ధర్మజ్ఞ ఇతి యో మతః

అట్టి నీవు దీనురాలనగు నన్ను ఏల చంప గోరుచున్నావు? నేను ఏ పాపమునూ చేయలేదు. నీవు ధర్మజ్ఞుడవని ప్రఖ్యాతి. నీవు స్త్రీని చంపుట ధర్మము ఎట్లు అగును?

ప్రహరంతి న వై స్త్రీషు కృతాగస్స్వపి జంతవః

కిముత త్వద్విధా రాజన్ కరుణా దీనవత్సలాః

ఓ రాజా! మూడజనులు కూడ అపరాధము చేసిననూ స్త్రీలపై ఆయుధమును ప్రయోగించరు. దయామయులు, దీనులయందు ప్రేమ గలవారు అగు నీవంటి వారు స్త్రీలను హింసించరని వేరుగా చెప్పవలయునా?

 మాం విపాట్యాగజరాం నావం యత్ర విశ్వం ప్రతిష్ఠితమ్

 ఆత్మానం చ ప్రజాశ్చేమాః కథమంభసి ధాస్యసి

నేను దృఢమగు నావ వంటి దానను. ఈ జగత్తు అంతో నాయందు నిలిచియున్నది. అట్టి నన్ను పగుల గొట్టినచో, ఈ జనులు నీవు కూడ నిలువ. తావు లేక, నీటిలో మునిగిపోయెదరు. అట్టి పనిని నీవు ఎట్లు చేయగలవు?

పృథురువాచ

 వసుధే త్వాం వధిష్యామి మచ్చాసనపరాజ్ముఖీమ్

భాగం బర్హిషి యా వృంకే న తనోషి చ నో వసు

పృథు మహారాజు ఇట్లు పలికెను --- ఓ భూదేవీ! నీవు నా శాసన మునుల్లంఘించినచో, నేను నిన్ను సంహరించెదను. నీవు యజ్ఞములో హవిర్భాగమును స్వీకరించుచున్నావు. కాని, మాకు సంపదను విస్తరిల్ల జేయుట లేదు.

యవసం జగ్ధ్యనుదినం నైవ దోగ్ధ్యౌధసం పయః

తస్యామేవం హి దుష్టాయాం దండో నాత్ర న శస్యతే

ప్రతిరోజు గడ్డిని తింటూ పాలను ఈయని చెడ్డ ఆవును దండిం చుట యుక్తము కాదని చెప్పువారు ఈ లోకములో లేరు. నీవు అట్టి దానవు గనుక, నీకు దండము యుక్తము కాదనుట సరి కాదు.

త్వం ఖల్వౌషధిబీజాని ప్రాక్ సృష్టాని స్వయంభువా

 న ముంచస్యాత్మరుద్ధాని మామవజ్ఞాయ మందధీః

స్వయంభువుడగు బ్రహ్మగారు సృష్ట్యాదియందు వరి, గోధుమ మొదలగు ఓషధుల బీజములను సృష్టించినాడు. కాని, మందబుద్దివగు నీవు వాటిని నీలో నొక్కి పెట్టి విడిచి పెట్టుట లేదు. ఈ విధముగా నీవు ఈశ్వ రుడనగు నన్ను అవమానించినావు.

అమూషాం క్షుత్పరీతానామార్తానాం పరిదేవితమ్

 శమయిష్యామి మద్బాణైర్బిన్నాయాస్తవ మేదసా

వీరు ఆకలి బాధకు తాళలేక దుఃఖించుచున్నారు. నేను నా బాణ ములతో నిన్ను పగులగొట్టి నీ మాంసముతో వారి గోడును చల్లార్చెదను. .

పుమాన్ యోషిదుత క్లీబ ఆత్మసంభావనోకధమః

 భూతేషు నీరనుక్రోశో నృపాణాం తద్వధోకవధః

పురుషుడు గాని, స్త్రీగాని, నపుంసకుడే గాని ఏ అధముడైతే ప్రాణులయందు దయ లేకుండగా, తన పొట్టను మాత్రమే పోసుకొనునో, అట్టి వానిని రాజు వధించిననూ, అది హింస కాదు.

త్వాం స్తబ్ధం దుర్మదాం నీత్వా మాయాగాం తిలశశ్శరైః

 ఆత్మయోగబలేనేమా ధారయిష్యామ్యహం ప్రజా

నీవు గర్వించి మదోన్మత్తురాలవై యున్నావు. కపటమగు గోరూప మును దాల్చియున్న నిన్ను నేను బాణములతో ముక్క ముక్కలుగా చేసి, నా యోగబలముచే ఈ ప్రజలను రక్షించి పాలించగలను.

ఏవం మన్యుమయీం మూర్తిం కృతాంతమివ బిభ్రతమ్

ప్రణతా ప్రాంజలిః ప్రాహ మహీ సంజాతవేపథుః

ఈ విధముగా కోపముతో నిండియున్న పృథు మహారాజు యమ ధర్మరాజును. పోలియుండెను. ఆయనను చూచి భూదేవి గడ గడ వణికిపో యెను. ఆమె చేతులను జోడించి ఆయనకు నమస్కరించి ఇట్లు పలికెను.

ధరోవాచ

 నమః పరస్మై పురుషాయ మాయయా

విన్యస్తనానాతనవే గుణాత్మనే

 నమస్స్వరూపానుభవేన నిర్ధుత-

ద్రవ్యక్రియాకారకవిభ్రమోర్మయే

భూదేవి ఇట్లు పలికెను --- పరబ్రహ్మ సత్త్వరజస్తమోగుణాత్మక మగు మాయాశక్తిచే అనేకములగు శరీరములను ధరించును. ఈ విధముగా పరమాత్మ గుణాత్మకములగు ఉపాధులయందు ప్రకటమగుచున్నాడు. కాని, పరమాత్మ నిత్యము స్వరూపనిష్టుడై యున్నాడు. కావుననే, శరీరము ఇంద్రియములు వాటి అధిష్టాన దేవతలతో కూడియున్న ఈ ఉపాధుల యందు ఆయనకు నేను, నాది అనే భ్రాంతి ఉండదు. కావుననే, ఆయనకు అట్టి భ్రాంతి వలన కలిగే రాగద్వేషములు, జన్మమరణములు, ఆకలిదప్పి కలు అనే ఆరు ఊర్ములు ఉండవు. అట్టి పురుషోత్తమునకు నేను పలు మార్లు నమస్కరించుచున్నాను.

యేనాహమాత్మాయతనం వినిర్మితా

 ధాత్రా యతోయం గుణసర్గసంగ్రహః

 స ఏవ మాం హంతుముదాయుధస్స్వరాట్

 ఉపస్థితోకన్యం శరణం కమాశ్రయే

 సృష్టికర్తయగు ఆ పరమేశ్వరుడే సకలప్రాణులకు ఆశ్రయముని చ్చుటకై నన్ను సృష్టించినాడు. ఈ త్రిగుణాత్మకమగు జగత్తును నిలబెట్టు నది ఆయనయే. స్వయంప్రకాశ స్వరూపుడు, సర్వస్వతంత్రుడు అగు అట్టి పరమేశ్వరుడే స్వయముగా పృథు చక్రవర్తి రూపములో ఆయుధమును పైకెత్తి నన్ను సంహరింప బూనుకున్నచో, నేను ఇంకెవరిని ఆశ్రయించగ లను? నాకు రక్షకుడు మరియెవరు గలరు?

య ఏతదాదావసృజచ్చరాచరం

స్వమాయయాత్మాశ్రయయావితర్క్యయా

 తయైవ సోయం కీల గోపుముద్యతః

కథం ను మాం ధర్మపరో జిఘాంసతి

ఆ పరమేశ్వరుడు సృష్ట్యాదియందు తనను ఆశ్రయించి ఉండే మాయాశక్తిచే స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తును సృష్టించెను. ఆ మాయాశక్తియొక్క ప్రభావము ఊహకు అందదు. ఆయన ఇప్పుడు ఆ మాయాశక్తి చేతనే పృథురూపుడై ధర్మమునందు నిష్ఠ గలవాడై, ఆ జగ త్తును రక్షించుటకు పూనుకున్నాడు. అట్టి ఆ ప్రభుడు నన్ను సంహరించ గోరుటకు హేతువు ఏమి గలదు?

 నూనం బతేశస్య సమీహితం జనైః

తన్మాయయా దుర్జయయాకకృతాత్మభిః

 న లక్ష్యతే యస్త్వకరోదకారయత్

యోహానేక ఏకః పరతశ్చ ఈశ్వరః

ఆశ్చర్యము! జనులు ఈశ్వరుని మాయచే మోహింప జేయబడి యున్నారు. ఈశ్వరుని మాయను జయించుట దుర్ఘటము. కావుననే, ఇంద్రి యజయమునెరుంగని ఈ జనులకు ఈశ్వరుని చేష్టితము తెలియకున్నది. ఇది నిశ్చయము. ఈశ్వరుడు ముందుగా బ్రహ్మగారిని సృష్టించి, ఆయనచే జగత్తును సృష్టింప జేసెను. ఆ ఈశ్వరుడు రెండవది లేనివాడే అయిననూ,మాయా శక్తిచే అనేకముగా అయినాడు. ఈ జగత్తులో అనేకము భాసించిననూ, పరమార్థములో తత్త్వము ఈశ్వరుడొక్కడు మాత్రమే.

సర్గాది యోకస్యానురుణద్ధి శక్తిభిః

ద్రవ్యక్రియాకారకచేతనాత్మభిః

 తస్మై సమున్నద్ధనిరుద్ధశక్తయే

నమః పరస్మై పురుషాయ వేధసే

పరమేశ్వరుని మాయాశక్తినుండి మహత్తత్త్వము, దానినుండి అహంకారము, దానినుండి సూక్ష్మపంచభూతములు, వాటినుండి ప్రాణుల ఇంద్రియములు, వాటి అధిష్టాన దేవతలు ప్రకటమగుచున్నవి. తన మాయాశక్తియొక్క రూపములైన ఈ తత్త్వములన్నింటి ద్వారా పరమేశ్వరుడు ఈ జగత్తును సృష్టించి పాలించి ఉపసంహరించుచున్నాడు. సృష్టికా లమునందు పరమేశ్వరునినుండి ఉద్బుద్ధములైన ఈ శక్తులు ప్రళయకాల ములో ఆయనయందే విలీనమై యుండును. సర్వాంతర్యామి అగు అట్టి పురుషోత్తమునకు నమస్కారము.

స వైభవానాత్మవినిర్మితం జగత్

భూతేంద్రియాంతఃకరణాత్మకం విభో

సంస్థాపయిష్యన్నజ మాం రసాతలాత్

 అభ్యుజ్జిహారాంభస ఆదిసూకరః

ఓ ప్రభూ! నీకు పుట్టుక లేదు. పంచభూతములు, ఇంద్రియములు, అంతఃకరణముల రూపములోనున్న ఈ జగత్తును నీవే సృష్టించినావు. దీనికి చక్కని స్థితిని కల్పించగోరి, నీవు ఆదివరాహమూర్తిగా అవతరించి, పాతాళములోని నీటినుండి నన్ను పైకి తీసుకు వచ్చితివి..

అపాముపస్థే మయి నావ్యవస్థితాః

ప్రజా భవానద్య రిరక్షిషుః కిల

 స వీరమూర్తిస్సమభూద్ధరాధరో

యో మాం పయస్యుగ్రశరో జిఘాంస

జలములో నావయందు వలె సకలప్రాణులు నాయందు నిలిచి యున్నవి. ఆది వరాహ మూర్తి వై భూమీని నిలబెట్టిన నీవు పృథు మహారా జుగా అవతరించినది ప్రజలను రక్షించుట కొరకే గదా! మూర్తీభవించిన పరాక్రమమే అయిన అట్టి నీవు భయంకరమగు బాణముతో నన్ను పాలను. (ఆహారమును) గురించి సంహరించ గోరుచున్నాను.

నూనం జనైరీహితమీశ్వరాణా-

మస్మద్విరైస్తద్గుణసర్గమాయయా

 న జ్ఞాయతే మోహితచిత్తవర్త్మభిః

తేభ్యో నమో వీరయశస్కరేభ్యః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్ధస్కంధే ధరాకృతశ్రీహరిస్తుతిర్నామ సప్తదశోఽధ్యాయః

ఈశ్వరుని ఈ త్రిగుణాత్మకమగు సృష్టియొక్క మాయచే మావంటి వారల చిత్తములు, వాటి పోకడలు మోహమును పొందియున్నవి మాకు హరిభక్తుల చేష్ఠితములు గాని, నీవంటి అవతారమూర్తుల చేష్టిత ములు గాని తెలియవు. ఇది నిశ్చయము. దయను చూపుట వీరలక్షణము. దాని వలన వారి కీర్తి ఇనుమడించును. అట్టి అవతారమూర్తులకు (అవగా వీకు, లేదా హరిభక్తులకు) నమస్కారము.

శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధమునందు భూదేవి శ్రీహరిని స్తుతించుట అనే పదునేడవ అధ్యాయము ముగిసినది.