3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)

Table of Contents

52 - సగరచరిత్రము - యాజ్ఞాశ్వమోచనము

జైమిని రువాచ :-    

జైమిని ఇట్లు చెప్పెను :

ధర్మాత్ముండు ప్రభువునునయిన సగరుఁడు అసమంజసుని బహిష్కరించి, అతని యందలి ప్రేమను ధర్మశీలుఁడు బాలుఁడునయిన  అంశుమంతుని యందు నిక్షేపించెను. తత్సమయముననే సుమతికుమారులు అందరు పరస్పరమనువ్రతులై సంఘశః వృద్ధి పొందిరి. వారు వజ్రశరీరులు : క్రూరులు : నిర్దయులు : లజ్జారహితులు : అధర్మశీలురు : వారందరు ఒకే ధర్మ స్వభావులు. వారేకైకకార్యము నందే అభినిరతులు. వారు క్రోధశీలురు. మూఢచేతస్కులు. వారితరులచేజయింపఁబడ నసాధ్యులు. సర్వభూతములకు, జనములకు నుపద్రవకారకులు. వినయము, ఆచారము, సన్మార్గమును, అపేక్షించరు. పాటింపరు. వారు రాక్షసులవలె వారికిష్టము వచ్చినట్లు ప్రపంచము సంతటిని బాధించిరి. యజ్ఞ సన్మార్గయుతమయిన భువనము విధ్వస్తమయినది. ఉపద్రవము కల్గినది. దేశము స్వాధ్యాయ రహితము, యజ్ఞ హవిస్సులు లేమి నీర్గత వషట్కారము, విశేషముగా ఆర్తిమంతము నయినది. వరదర్పితులయిన సగరపుత్రులచే అంతయు పూర్ణముగా విధ్వస్తము కాగా, దేవతలు అసురులు, మహోరగులు పరమ ప్రక్షోభము నొందిరి. సాగరాక్రాంతమయిన భూమి కదలనిదైనను చలించిపోయెను. తపస్వులకు తపస్సమాధి భంగమయ్యెను. హవ్యములు, కవ్యములు పరిభ్రష్టములయిన త్రిదశులు పితృ దేవతలతోసహా మహాదుఃఖపరీవిష్ణులైరి. బ్రహ్మలోకమున కరిగిరీ. దేవతలందరు యధాన్యాయము ఇంద్రుని పురస్కరించుకొని బ్రహ్మలోకమున కరిగి, ఆ బ్రహ్మకు సాగరుల యొక్క దుశ్చేష్టితముల నెల్లను విన్నవించిరి. వారి పలుకులు పితామహుం డయిన బ్రహ్మ వినెను. క్షణకాలమంతర్మనస్కుండయ్యెను. తరువాత సురసత్తముఁడు దేవతలతో నిట్లు పలికెను. “దేవతలార ! ఆలకింపుఁడు. మీకు మంగళమగు; నేను పలుకు పలుకులను అవహితులై శ్రద్దగా వినుఁడు. సాగరులందరు అచిరకాలమున నాశనము పొందుదురు. అందు సందేహము లేదు. మీరో కొంతకాలము ప్రతీక్షించవలెను. ఓపిక పట్టుడు. తత్కాలమున సర్వము నియమింపఁబడును. మిగిలిన వన్నియు నిమిత్తమాత్రములు. ఆ కాలమే సర్వప్రభువు. అందుచే, ఓ సురోత్తములారా ! మీ హితము కొఱకు నేను చెప్పునట్టిది మీరందరు ఇప్పుడు అతంద్రితులై ఏమరుపాటులేక చేయవలయును.

జైమిని రువాచ :-

దేవా ఊచుః :-

జైమిని రువాచ :-

జయస్వభావులలో శ్రేష్ఠుఁడు భగవంతుఁడునయిన కపిలుడు జగత్తు యొక్క హితము కొఱకు విష్ణుని యొక్క అంశతో పుట్టేను. ఆతఁడు భువిలో యోగీంద్ర ప్రవరుఁడు. అగస్త్య మహర్షిచే త్రాగబడిన సముద్రములో ఎచ్చటనో ఒకచోట ఏకాంతప్రదేశమున ధ్యాన మాచరించు చున్నాఁడు. మీరు నా యాదేశానుసారము ముని పుంగవుఁడయిన కపిలుని కడకు వెళ్లుఁడు. తద్ద్యానావసానము కోరుచు తత్సమీప ప్రదేశమున. కూర్చుండియుండుడు, ఆతఁడు సమాధిని విరమించిన తరువాత, మీరాతనికి నమస్కరీంచి మీయభిప్రాయమును అశేషముగా చెప్పుడు, ఆతం డు మీకు శ్రేయస్సాచరించును. ఓ విబుధోత్తములు లారా ! సాగర సుతులచే నా మహర్షి సమాధికి భంగమెట్లు జరుగగలదో యట్టి ప్రవృత్తి మీరాచరింపుఁడు.”

జైమిని ఇట్లనెను ;

విబుధులివిధముగా చెప్పఁబడిరి. వారు పితామహునకు నమస్కరించి కపిలమహర్షి కడకేగిరి. విబుధ శ్రేష్ఠుఁడయిన యాతనికి దేవతలు కృతాంజలురయి ఇట్లు విన్నవించుకొనిరి.

 దేవతలిట్లనిరి :

ఓ మునిశ్రేష్ఠ ! మాకు ప్రసన్నుఁడవగుము. మేము నిన్ను శరణుపొందితిమి. సాగరకుమారులచే జగత్సర్వము ఉపద్రవమొంది నశించునున్నద.ఇ నీవో ! ఓ మహర్షీ ! విష్ణువు యొక్క యంశమున యోగీంద్ర స్వరూపుడవై భువి యందుంటివి. నీవే యీ ప్రపంచము యొక్క . స్థితిసంహరణ కారణమవు నీవు వట్టి తపస్వులలో శ్రేష్ఠుఁడవే కావు. తాపత్రయార్తిచే బాధపడు ప్రజల యొక్క మూర్తిని కేవలము నాశనము చేయుటకు స్వేచ్చగా నీ దేహమును ధరించితివి. నీవు ఓ మహర్షీ ! మనస్సుచే తలంచు మాత్రము చేతనే, సర్వలోకమును సృష్టించుటకు సంహరించుటకు తిరిగి సృష్టించుటకు ఓ బ్రహ్మర్షీ ! నీవే స్వేచ్ఛయా శక్తుఁడవు సంశయము లేదు. (24) నీవు మాకు ధాతవే కాదు, విధాతవు, గురుఁడవు : మాకు ఆధారభూతుఁడవైన పరాయణుఁడవు, మాకు పరిత్రాతవు. ఆపదను తొలగించుము. విప్రేంద్రుల శ్రేషుఁడవయిన విప్రేంద్ర మాకు శరణ్యుఁడవు కమ్ము. లోకత్రయమున నీవసించు వారలెల్లరు సాగరులచే దహింపబడుచున్నారు. నీవంటి వారిక్రియలు సాత్వికీచేష్టలుగా నుండును. అందుచే మమ్ము రక్షింప అర్జుఁడవు. అందుచే ఓ సువ్రత ! లోకములను మమ్ము రక్షించుము. కానిచో అఖిల జగత్తు ఓ భగవాన్ అచిరకాలములో వినష్టమొందగలదు.

 జైమిని ఇట్లనెను.

సకల దేవతలిట్లు విజ్ఞావింప, మెల్లగా నేత్రములను ఉన్మీలించి కప్పి మహర్షి వారలనుచూచి సూనృతమైన వచస్సునిట్లు పలికెను. సాగరులు స్వకర్మముచే నిర్ధగులై వసించెదరు.

జైమిని రువాచ :-

కాలమాసన్నము కావలెను. మీరంతవరకు ప్రతీక్షించుచుండవలెను. దురాత్ములయిన వారలయొక్క వినాశనమునకు నేనే కారణము కాగలను. ఓ సురశ్రేష్ఠ మీ యొక్క కార్యసిద్ధి కొఱకు నా క్రోధాగ్నిలో దగ్గులయి పాప చేతస్కులయిన సగర సుతులు కాలోపహతబుద్ధులై మరణింతురు. ఆ కారణమున దేవతలకు, లోకములకు బాధలు తొలగును. ఇంక పొరికి భయమెక్కడిది? దురాచారులయిన వారు వెంటనే సంక్షయమును పొందుదురు. అందుచే మీరు నీర్భయులుకండు. మీరు మీ నగరములకు తిరిగి పొండు. కొంతకాలము ఓపికతో ప్రతీక్ష చేయుం డు, అంత మీరభీష్టమును పొందగలరు.” కపీలుఁడిట్లు చెప్పగా దేవతలందరు ఇంద్రునితోసహా, ఆ మహర్షికి నమస్కరించి, సంతోషించి హృదయబాధాగ్ని శమింప స్వర్గమున కరిగిరి. ఈ మధ్య కాలములో పృథివీపతియైన సగరుఁడు, వాజమేధమను మహాయజ్ఞమును ఒనర్చుటకు కోర్కెవహించెను. వసిషానుమతితో సర్వ సంభారములను సమకూర్చి, ఔర్వాది విప్రులతో గూడికొని యథాశాస్త్రము సగరుఁడు దీక్షితుఁడయ్యెను. నృపతి అశ్వమేధ దీక్ష వహించెను, పుత్రులందరను పిలిచి, మహాయశస్వి యశ్వ సంచారజమునకు ఆజ్ఞాపించెను. పృథివీతలము నందంతటను తురగమును యజ్జీయాశ్వమును సంచరింపఁజేసి ఓ పుత్రులారా ! వెంటనే మీరందరు నాకడకు రానర్హులు” అనెను.

జైమిని ఇట్లు పలికెను.

అంత వారు తమ పితురాదేశమున తురంగమును గైకొని సకల క్షితిమండలము నంతటిని పరిచంక్రమణ మొనర్చిరి. వేద వీధి కొఱకు  అశ్వము భూమినంతయు పరివర్తించి తిరిగునట్లుచేయను. అందునకే కానీ, దిగ్విజయార్థము కాదు, కరగ్రహణము (పన్నుకట్టడము)నకు గానీ ఇతర పదార్థముల కొఱకు గాని కాదు. ఏలయన భూమి యంతయు నీంతకు పూర్వమే రాజుచే జయింపఁబడెను. ఆ రాజు ఉదారవీర్యముచే  రాజులందరు సమరములందే కృత కరదానులైరి. అంత రాజతనయులు నీరు లేని లవణాంబుధి యందు భూతలమున ప్రవేశించిరి. తురంగమును పరివర్తించి సంతుష్టులయిరి.

ఇది వాయుప్రోక్తమహాబ్రహ్మాండపురాణము, మధ్యమభాగమున, తృతీయ ఉపోద్ఘాతపాదమున సగరచరిత్రమున యజ్ఞాశ్వమోచనమను ఏబది రెండవ అధ్యాయము.